Devi Kathalu         Chapters          Last Page

మణి ద్వీపము

తక్షక విషాగ్ని వలన తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతిపై ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించాడు. మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడి పాములూ వచ్చి అగ్నికుండంలో ఆహుతి కాసాగాయి. కొండకోనల్లో, చెట్టుపుట్టల్లో, వాగువంకల్లో తలదాచుకొన్న పాములన్నీ తప్పించుకోలేక యాగాగ్నిలో హుతమై పోవడం ప్రారంభ##మైంది. తన బిడ్డల దురవస్థ చూచి నాగదేవత చలించి పోయింది. మానసాదేవిని ప్రార్థించింది. మానసాదేవి పంపగా , ఆమె కుమారుడైన ఆస్తీకుడు వచ్చి , జనమేజయునకు నచ్చజెప్పి, సర్వయాగం మాన్పించాడు.

ఆ తరువాత జనమేజయునితో అంతర్మథనం ప్రారంభ##మైంది. సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తికోసం, మనశ్శాంతి కోసం తనకు ఏదైనా ఉపాయం చెప్పవలసిందిగా ఆ రాజు వ్యాసమహర్షిని ప్రార్థించాడు.

జనమేజయుని ప్రార్థన విని, వ్యాసుడు-అంబాయజ్ఞము చేయవలసిందిగా అతనికి సూచించాడు. అప్పుడు జనమేజయుడు, "ఆ అంబ ఎవరు? ఆమె నివాస స్థానమేది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమెను దర్శించడాడనికి కర్తవ్యం ఏమిటి?" అని ఆసక్తితో అడిగాడు.

వ్యాసమహర్షి జనమేజయునకు ఇలా వివరింపసాగాడు.

"జనమేజయా! ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్థ్వలోకాలు, ఏడు అధోలోకాలు ఉన్నాయి. భూః , భువః , సువః, మహః, తపః, జనః, సత్యలోకాలు ఊర్థ్వలోకాలు. సత్యలోకాన్నే బ్రహ్మలోకమని అంటారు.ఆ పైన వైకుంఠం ఉన్నది. కుంఠము అంటే అంతరాయం. నిరంతరాయంగా సర్వత్రా ప్రవర్తింపగల విష్ణుమూర్తి నివశించే ప్రదేశం వైకుంఠం. వైకుంఠానికి పైన గోలోకం ఉన్నది. అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు నివసిస్తాడు. అతనికి అర్థభాగంలో రాధా దేవి ఉన్నది. సమస్త వేదాలు , సర్వప్రాణులూ అతని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి. 'గో' శబ్ధానికి వేదం , భూమి, ఆవు, కిరణము, ఇంద్రియము మొదలైన అర్థాలు ఎన్నో వున్నాయి. వాటికి అన్నింటికీ మూలమైనదే గోలోకము అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానం ఉన్నది. ఆ పరమేశ్వరి జగన్మాత ఆమె ఆదిపరాశక్తి . ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ఆమె నివాసస్థానమే "మణిద్వీపము".

నాలుగ ప్రక్కలా ప్రాకాశిస్తున్న మణికాంతుల ప్రవాహలమధ్యలో ఎత్తయిన పీఠం మీద ఆదేవత అధివసించి ఉంటుంది. 'మణిద్వీపమ'నే పేరు ఇందువల్లనే వచ్చింది. ఇది అన్ని లోకాలకు పైన వున్నది. దీనికి పైన మరే లోకమూ లేదు. కనుకనే దీనికి 'సర్వలోకమ'ని కూడా పేరు.

జగన్మాత తన సంకల్ప ప్రభావం చేతనే ఈ మణిద్వీపాన్ని సృష్టించింది. మణి ద్వీప విస్తీర్ణం 'ఇంత' అని చెప్పగలవారు ఎవ్వరూ లేరు. బహుయోజన విస్తీర్ణమై, బహుయోజన గంభీరమై వున్న అమృత సముద్రం మధ్యలో ప్రకాశిస్తోంది మణిద్వీపం. గాలి తాకిడికి రేగిన తరంగ మాలికలు తీరాన్ని చేరి తెల్లని ముత్యాలవలె ప్రకాశస్తూ, తీరమంతటా చల్లదనాన్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి. రాజహంసలు ఆ తీరంలో స్వేచ్ఛవిహారం చేస్తూ ఉంటాయి. తీరం పొడవునా అనేక వృక్షాలు కనిపిస్తాయి.

వృక్షసముదాయాన్ని దాటి కొంచెం ముందుకు సాగితే మణిద్వీపపు మొదటి ప్రాకారం కనిపిస్తుంది. అది లోహప్రాకారం . సప్తయోజన విస్తీర్ణమై ఉన్న ఈ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద పాలకులుగా రక్షకభటులు ఉన్నారు. భువనేశ్వరిని సందర్శించడానికి వచ్చిన దేవతా పరివారము, వారి వాహనములు , వారి విమానములు , గుఱ్ఱాలు గాని, ఏనుగులుకాని, రథాలు కాని, లోహప్రాకారం వద్ద నిలిచిపోవలసిందే.

లోహప్రాకారానికి ఆవలగా రెండవ ప్రాకారం ఉన్నది. అది కాంస్య నిర్మితం . అనగా కంచు ప్రాకారాము. మొదటి దానికంటె నూఱు రెట్లు కాంతి ప్రకాశిస్తుంది రెండవ ప్రాకారం. పుష్పఫల సంభరితమైన వృక్షాలతో , ఉద్యానవన శోభతో ప్రకాశిస్తూఉంటుంది ఈ ప్రాకారం . ఈ ఉద్యానవనాలలో మంచినీటితో నిండిన సరస్సులు ఉన్నాయి. వివిధ కాలాల్లో పుష్పించి , ఫలించే పుష్పఫల సముదాయం ఉండటం వల్ల అన్ని ఋతువులలోని వాతావరణ ధర్మాలూ కలసి తమ అక్కడ ప్రకాశిస్తూ, ఆహ్లాదకరంగా ఉన్నది. ఆ ఉద్యానవనాల చుట్టూ పువులలోని తేనె కాలువలుగా ప్రవహిస్తోంది. నెమళ్ళు పురివిప్పి నాట్యాలు చేస్తూ మనోహరంగా ఉన్నాయి. పరమేశ్వరి సందర్శనార్థమై వచ్చిన దేవతలు, మునులు అక్కడ నిరీక్షిస్తూ ఉంటారు.

కంచు ప్రాకారం దాటిన తర్వాత ఏడు యోజనాల ఎత్తైన రాగిప్రాకారం ఉన్నది. ఇది మూడవది ఇది చతురస్రంగా ఉంటుంది. ఈ ప్రాకారం లోపలి వృక్షాలు పుష్పాలు, బంగారురంగులో ఉంటాయి. ఋతురాజైన వసంతుడు పుష్పసింహాసనంపై ఆసీనుడై ఇక్కడ కన్పిస్తాడు. ఆ వసంతునికి సేవకుడైన ఛత్రధారి అతనికి పూల గొడుగు పట్టి ఉండగా, మధుశ్రీ , మాధవశ్రీ, అనేకాంతలతో కలసి పుష్పమకరంధాన్ని ఆస్వాదిస్తూ పూలగుత్తులను ఆటచెండుగా చేసుకొని క్రీడిస్తూ , వసంతుడు కనిపిస్తాడు. గంధర్వులు ప్రియకాంతలతో అక్కడ గానం చేస్తూ ఉంటారు. ఈ ప్రాకారం వసంతలక్ష్మికి ఆలవాలమై ఉంటుంది.

సీసముతో నిర్మిచబడిన నాలుగవప్రాకారము కూడ ఏడుయోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది. గ్రీష్మర్తురాజు శుచిశ్రీ , శుక్రశ్రీ అనే నాయికలతో ఇక్కడ సై#్వరవిహారం చేస్తూఉంటాడు. సిద్ధులు, దివ్యులు తమ తమ పరివారాలతో ఇక్కడ దేవీ సందర్శనార్థం ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటారు.

ఐదవది ఇత్తడి ప్రాకారము ఇక్కడ హరిచందన వాటికలున్నాయి. మేఘవాహనుడైన వర్షర్తురాజు ఈ ప్రాకారానికి అధిపతి ఇతనికి మేఘమే కవచం . ఇంద్రధనుస్సే విల్లు ఉరుములే శంఖనాదాలు. నతశ్రీ మొదలుగా గల పన్నెండు మంది శక్తులతో కలసి ఈ ఋతురాజు చూడముచ్చటైన సహస్రజలధారలను కురిపిస్తూ ఉంటాడు.

పంచలోహమయ ప్రాకారం ఆఱవది. ఇక్కడ సహస్రాధికంగా మందార వాటికలు ఉన్నాయి. ఇష్టలక్ష్మీ , ఊర్జలక్ష్మీ అనే భార్యలతో విలాసంగా విహరిస్తూ , సిద్ధగణాలచేత పరివేష్ఠింపబడి ఉన్న శరదృతు నాయకుడు ఈ ప్రాకారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు.

దేదీప్యమానంగా శిఖరపంక్తులతో ప్రకాశించే ఏడవ ప్రాకారం వెండితో నిర్మించబడింది. పారిజాత వృక్షసముదాయం ఇక్కడ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. హేమంతర్తు నాయకుడే ఈ ప్రాకారానికి రాజు. ఇతనికి సహశ్రీ, సహస్యశ్రీ అనే వారు నాయికలు. దేవీవ్రత పరాయణులైన సిద్ధులచేత పరివేష్టింపబడిన ఈ రాజు దేవీ విలాస విశేషాలను తెలిసి విహరిస్తూ ఉంటాడు.

వెండి ప్రాకారానికి పైన ఏడు యోజనాలు ఎత్తులో నిర్మింపబడిన సువర్ణమయ ప్రాకారం ఎనిమిదవది. కడిమి పూలగుత్తులతో లేత చిగురు టాకులతో ఆ ప్రకారపు మధ్యభాగం అంతా చూడ ముచ్చటగా ఉంటుంది. తపశ్రీ, తపస్యశ్రీ అనే నాయికలతో విహరించే శిశిరత్తు రాజు సిద్ధగణాలతో సేవింపబడుతూ ఈ ప్రాకారానికి నాయకుడు.

తొమ్మిదవ ప్రాకారం ఎఱ్ఱని పుష్యరాగ మణులతో నిర్మింపబడి ఉంది. ఈ ప్రాకారంలోని భూభాగాలు , ఉద్యానాలు అన్నీ పుష్యరాగ మణికాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. అన్నీ లోకాల అధిపతులైన దిక్పాలురు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. తూర్పున అమరావతీ స్వర్గపురం ఉన్నది. ఐరావతరమనే గజంపై వజ్రాయుధం చేతపట్టి, దేవసేనా సమూహంతో కలసి నూఱు యాగాలు చేసిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు. శచీదేవి దేవతా స్త్రీ పరివారంతో కలసి నందనవనంలో విహరిస్తూ ఉంటుంది. ఆగ్నేయంలో అగ్ని వలె ప్రకాశించే వహ్ని పురం ఉన్నది. అదే అగ్నిదేవుని నివాసస్థానం దక్షిణాన చిత్రగుప్తుడనే ప్రధానితే, ఎందరో కింకరులతో కలసి దండ ధరుడై యమధర్మరాజు నివసిస్తూ ఉంటాడు. నైరృతి దిక్కున రాక్షస సగణ పరివృతుడై ఖడ్గపాణి అయిన నిరృతి నివసిస్తూ ఉంటాడు. పడమటి దిక్కున వారుణి మధువును ఆస్వాదించి, పాశహస్తుడైన వరుణుడు, వాయువ్య దిక్కున వాయుదేవుడు , ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు నివసిస్తూ ఉంటారు. వాయుదేవుడు విశాలాక్షుడు, ధ్వజహస్తుడు, మృగవాహనుడు. కుబేరుడు యక్షలోకాధిపతి నవనిధులకు నాయకుడు. వృద్ధి, బుద్ధి అనే శక్తులు కుబేరును ఆధీనంలో ఉంటాయి. ఈశాన్యాన గల రుద్రలోకంలోని భవనాలన్నీ రత్ననిర్మితాలే. రుద్రుని కన్నులు మండుతున్న అగ్ని గోళాల వలె తేజోవంతమై వుంటాయి. రుద్రుడు ధనుర్భాణాలు, శూలాధ్యాయుధాలు ధరించి ఉంటాడు. అసంఖ్యాకంగా రుద్రగణాలు రుద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అక్కడ పరివారమంతా భయంకరమైన ముఖాలతో త్రినేత్రులుగా, శతహస్తులు గా, ఉగ్రరూపులుగా కనిపిస్తూ ఉంటారు. రుద్రుని సహసచారిణి అయిన రుద్రాణీ దేవిని భద్రకాళి మొదలైన మాతృకాశక్తులు సేవిస్తూ ఉంటారు. కపాలమాలికను ధరించి పులిచర్మం వస్త్రంగా దాల్చి , పాములనే ఆభరణాలుగా అలంకరించుకొని ఒడలు అంతా భస్మం పూసుకొని తమ ప్రమథ గణాలతో పరివ్యేష్ఠితుడై , ఢమరుక ధ్వానంతో దిక్కులు పిక్కటిల్లజేస్తూ ఈశాన్య దిక్కును మహేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు.

ఈ విధంగా ప్రతీ బ్రహ్మాండంలోను ఆయా దిక్కుల అధిపతులు వివిధ మణిమయ విరాజిత మండపాలతో ఒక్కొక్క లోకాన్ని తాముగా కల్పించుకొని వేరు వేరు ప్రాకారాల్లో నివసిస్తూ ఉంటారు.

పుష్యరాగమయమైన ఈ తొమ్మిదవ ప్రాకారంలో పింగళాక్షి , విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధా, స్వాహా, స్వధా, మాయా, వసుంధరా, త్రిలోక ధాత్రి, సావిత్రి, గాయత్రీ, త్రిదశేశ్వరీ, స్వరూపా, బహురూపా, స్కందమాతా, అచ్యుత ప్రియా, అమలా, విమల, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యా, సతీ, హంసీ, మర్డికా, వజ్రికా,దేవమాతా, భగవతీ, దేవకీ, కమలాసనా, త్రిముఖీ, సప్తముఖీ, సురాసుర విమర్డినీ, లంబోష్టీ, ఊర్థ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, రథరేఖా, శశిరేఖా, గగనవేగా, పవనవేగా, భువనపాలా, మదనాతురా, అనంగా , అనంగ మదనా, అనంగ మేఖలా, అనంగ కుసుమా, విశ్వరూపా, సురాదికా, క్షయంకరీ, రక్షోభ్యా, సత్యవాదినీ, శుచివ్రతా, ఉదారా, వాగీశీ మొదలైన అరవై నాలుగు మంది శక్తి స్వరూపిణులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ వుంటారు. ఈ శక్తుల నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడుతూ వుంటాయి. సప్తసముద్రాలనూ ఒకే సారిగా త్రాగేసే ఉధృతితో విజృంభిస్తున్నట్లుగా ఆ అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. నలభై తొమ్మిది మరుద్గణాలతో కూడిన వాయు మండలాన్ని నుగ్గుచేస్తున్నట్లుంటాయి. పదునాలుగు లోకాలనూ ఒక్కసారిగా మ్రింగివేసేటట్లుంటాయి. భయంకరమైన కోరలతో, నూఱు అక్షౌహిణుల వీరనారీ సమూహంతో ప్రతిశక్తీ తన స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క భువనాన్ని అధివసించి ఉంటుంది. ప్రతిశక్తీ లక్షబ్రహ్మాండాలను క్షణ కాలంలో భస్మం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

పుష్యరాగమయ ప్రాకారనికి ఆవల గోమేధిక మణినిర్మితమైన పదవ ప్రాకారం ఉన్నది. ఇది పదియోజనాల ఎత్తులో ఉంటుంది. ఇందలి సరస్సులు, మేడలు అన్ని గోమేధికమణి కాంతులతో ప్రకాశితో ఉంటాయి. ఈ ప్రాకారంలో పరమేశ్వరికి అతి సన్నిహితంగా మెలగుతూ సేవచేసే ముఫ్పయి రెండు శక్తులు ఒక్కొక్క లోకాన్ని కల్పించుకొని తమ వైభవంతో విహరిస్తూ ఉంటాయి. ఎఱ్ఱని కన్నులు, తీక్షణమైన చూపులు, భయంకరమైన ముఖాలు కలిగి పది అక్షౌహిణుల వీరనారీ సేనా సమూహం అప్రమత్తతో ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది. దేవి అజ్ఞాను సారం విద్యా, హ్రీ, పుష్టి, ప్రజ్ఞా, సినీవాలి, కుహు, రుద్రా, వీర్యా, ప్రభా, నందా, పోషిణీ, బుద్ధిదా, కాళరాత్రి, మహారాత్రి, భధ్రకాళి, కపర్థిని, వికృతి, దండిని, ముండిని, ఇందుఖండా, శిఖండినీ, నిశుంభ, శుంభమథిని, మహిషాసుర మర్దిని, ఇంద్రాణి రుద్రాణి , శంకరార్ద శరీరిణి, నారీ, నారాయణి, శూలిని, పాలిని, అంబికా, ఆహ్లాదిని అనే పేర్లు గల శక్తులు పరమేశ్వరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి.

ఇది దాటితే, పదియోజనాల ఎత్తుగల వజ్రప్రాకారం కనిపిస్తూంది. ఇది పదుకొండవది. గోపురద్వారాలతో, గొలుసులతో, రత్నఖచితమైన మందిరసమూహాలాతో తీర్చిదిద్దిన రాజవీధులతో ఆప్రాకారం రమణీయంగా ఉంటుంది. సహస్రాధిక సంఖ్యలో పరిచారికలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పరిచారికకు లక్షకు పైగా దాసీజనం . వీరందరూ శృంగార సంబంధమైన సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారు. వీవనలు వీచడం, పానపాత్రలు సిద్ధంచేయడం , ఛత్ర చామరాలతో సేవలుఅందిస్తూ ఉండడం, దేవీ పాదాలకు లత్తుకను , పారాణిని అలంకరించడం కాటుక దిద్దడం. సింధూరపు బరిణలు సిద్ధంచేయడం వీరి కార్యక్రమాలు. దేవి పాదాలు ఒత్తుతూ , పుష్పమాలలను సవరిస్తూ , కేశపాశాన్ని అలంకరిస్తూ, ఆభరణాలనూ తొడుగుతూ , ఆమెను సేవిస్తూ ఉంటారు. అనంగ రూప , అనంగ మదన, సుందరీ, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అంగనవేదన, అనంగ మేఖల అనేవారు మెఱుపు తీగలవలె ఆ ప్రాంతంలో సంచరిస్తూ, దేవి కార్య తత్పరలై , ఆమె కన్నుసన్నలలో మెలగుతూ ఉంటారు.

పన్నెండవది వైడూర్య ప్రాకారం. ఇది వజ్రప్రాకారానికి పైన పదియోజనాల ఎత్తున నిర్మింపబడి ఉంది. మణిమయ గృహాలతో, వాపీకూప, తటాకాలతో మనోహరంగా ఉంటుంది. అష్టమాతృకలకు ఇది నివాసస్థానం. బ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి, వైష్ణవి, మహాలక్ష్మి అనే ఈ దేవతలు కోట్లాది రథాలతో, ఆకాశాన్ని తాకే పతాకాలతో, హంస, గరుడ, సింహ, వృషభాది వాహనాలతో, గజాశ్వాలతో పరమేశ్వరీ సేవలో మునిగి ఉంటారు.

ఇంద్రనీలమణి ప్రాకారం పదమూడవది. పదియోజనాల పొడవైన రాజవీధులు, సుందరమైన మందిరాలు, ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంటూంది. షోడశదళ పద్మాకారంలో ఉంటుంది. కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, దుర్గ, ఉష, లక్ష్మీ,శృతి,

స్మృతి, ధృతి, శ్రద్ధ, మేథా, మతి, కాంతి, మొదలైన పదహారు శక్తులు నీలమేఘశ్యామల దేహాలతో ప్రకాశిస్తూ ఖడ్గాలను ధరించి, దేవిని సేవిస్తూ ఉంటారు.

ఆపై వున్న పదునాల్గవ ప్రాకారం మౌక్తిక ప్రాకారం. ఇక్కడి భవనాలన్ని ముత్యాలతో నిర్మింపబడి ఉంటాయి. పది యోజనాల ఎత్తు కలిగి అష్టదళ పద్మాకారంలో ఉంటుంది ఈ ప్రాకారం. ఇక్కడ ఎనిమిది మంది మంత్రిణులు ఖడ్గపాణలై నిలచి , గూఢచారుల ద్వారా సకల బ్రహ్మాండముల వార్తలనూ సేకరించి , శ్రీమాతకు నివేదిస్తూ ఉంటారు. ఇంగిత జ్ఞానము కార్యసాధన నైపుణ్యము, వాక్చాతుర్యము కలిగి ఆ మంత్రిణులు క్షణకాలంలో దేవి ఆజ్ఞలను అమలు చేసూ ఉంటారు. వీరి పేర్లు అనంగకుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువన పాల, గగనవేగా, శశిరేఖ, గగనరేఖ. వీరంతా ఎఱ్ఱని రంగుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలను చేతపట్టి విశ్వసంబంధమైన వార్తలను దేవి కి చేరవేస్తూ ఉంటారు.

ఆ పైగల ప్రాకారం మరకత నిర్మితం . ఇదిషట్కోణాకారంతో పదియోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది. సలక సౌభాగ్యాలతో అలరారే ఈ ప్రాకారం పదిహేనవది. ఈ ప్రాకారపు తూర్పుకోణంలో గాయత్రీ సహితుడైన బ్రహ్మ దర్శనమిస్తాడు. కుండికా , అక్షసూత్రిక ధరించి, వరహస్త, దండహస్తాలతో ఉంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి. వాయవ్య కోణంలో పరశువును , అక్షమాలను చేత దాల్చిన మహారుద్రుడు, రక్షోకోణంలో శంఖచక్రాలను ధరించిన సావిత్రి , అగ్నికోణంలో ధననాయకుడైన కుబేరుడు, వరుణకోణంలో రతీసహితుడైన మన్మథుడు ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నకారకుడు, విజయకారకుడైన గణపతి ఉంటాడు.

పదహారవది ప్రవాళ ప్రాకారం . ఇది పగడాలతో నిర్మింపబడి ఉంది. నూఱుయోజనాల ఎత్తులో ఉన్నది. సృష్టికి ఆధారమైన పంచభూతాలు , వాటిశక్తులు ఇక్కడే దేవిఅనుజ్ఞకోసం నిరీక్షిస్తూ ఉంటాయి. నవరత్న నిర్మితాలైన అమ్నాయ దేవతల గృహాలు ఎన్నో ఈ ప్రాకారంలో ఉంటాయి.ఇవిఅన్నీ మహావిద్యామూర్తి రూపాలే . సప్తకోటి మహామంత్రాలకు అధిష్టాన దేవతలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు.

పదిహేడవ ప్రాకారం చింతామణి గృహం. సూర్యకాంత , చంద్రకాంత, విద్యుత్కాంత, మణులు దేదీప్యమానంగా ఇక్కడ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. మణిమయ కాంతులతో ప్రకాశించే ఈ ప్రదేశం మధ్యలో శ్రీమాతా సదనం వున్నది.

శ్రీమాత నివాస గృహానికి నాలుగువైపులా శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మంటపాలు ఉన్నాయి. ఒక్కొక్క మంటపం వేయి స్తంభాలతో నిర్మింపబడి ఉంది. ప్రతిమంటపమూ కాశ్మీర, మల్లికా, కుంద, కస్తూరి, మొదలైన సువాసనలతో, రత్నసోపాన సహిత పద్మవనాలతో, సుధారస ప్రపూర్ణాలైన వాపీకూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది. శృంగార మంటపంలో దేవకాంతల గానాలు వినిపిస్తూ ఉంటాయి. తమ సాధనల ద్వారా మోక్షార్హులైన వారు ముక్తి మంటపాన్ని చేరుకోగలుగుతారు. ఉపాసనల ద్వారా దేవి కృపకు పాత్రులై జ్ఞాన సముపార్డనార్హులైన భక్తులు జ్ఞానమంటపంలో ఉంటారు. అలా జ్ఞాన మోక్షాలకు అర్హులైన సాధకులకు శ్రీమాత ఆయా మంటపాలలో దర్శనమిచ్చి ,జ్ఞాన మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శృంగార మంటపం మధ్యలో ఆమె ఆసీనురాలై, దేవకాంతల గానం విని, వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక ఏకాంత మంటపంలో దేవి మాత్రమే నివసిస్తుంది. అక్కడ మరెవ్వరూ నిలిచే అవకాశ##మే లేదు.

ఇలా నాలుగు మంటపాల మధ్యలో చింతామణి గృహం ఉన్నది. ఆ గృహంలో ఒక శయ్య ఉన్నది. ఆ శయ్య (మంచ) కు పదిమెట్లున్నాయి. మూల ప్రకృతులైన శక్తి తత్త్వాలే ఆ శయ్యకు సోపానాలు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, ఆ శయ్యకు కోళ్ళుగా ఉన్నారు. శయ్యపై ఫలకం సదాశివుడే. ఆఫలకం పై భువనేశ్వరీదేవి దర్శన మిస్తుంది. గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన దక్షిణ భాగం నుండి విలాసార్థం సృష్టించుకున్న రూపమే సదాశివుడు. దక్షిణార్థం సదాశివుడు . వామభాగం సదాశివ. ఈ విధమైన శివభక్తి తత్త్వం లోకకల్యాణార్థమై, చింతామణి గృహంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడి పరమేశ్వరునకు సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనే ఐదు ముఖాలు. సూర్య చంద్రాగ్నులే అతనికి త్రినేత్రాలు. అతడు కోటిసూర్య ప్రభతో, కోటి చంద్రుల చలువతో పదహారేళ్ళ నవయువకునివలె శుద్ధస్ఫటిక శరీరకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మహాదేవుని వామాంకాన భువనేశ్వరి ఆసీన అయి ఉంటుంది. నవరత్నరాశియే ఆమెకు మొలనూలు. వైడూర్యాలు పొదగిన సువర్ణాభరణాలతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఫాలబాగంలో అర్థచంద్రుడు వెలుగులు వెదజల్లుతూ ఉంటాడు. ఆమె పెదవి దొండపండు కంటె ఎఱ్ఱగా ప్రకాశిస్తోంది. ఆమె తన నుదుట కస్తూరి తిలకాన్ని అలంకరించుకొన్నది . సూర్యచంద్రులే ఆమెకు చెవి క్మమలు. ఆమె కంఠం శంఖం వలె ఉన్నది. ఆమె మెడలో ముత్యాల సరాలు ఉన్నాయి. జవ్వాది ,పునుగు, కస్తూరి, పచ్చకర్పూరము ,కుంకుమపువ్వు మొదలైన సువాసనలతో మంచిగంధపు పూతలతో ఆమె దివ్యదేహం అలరారుతున్నది. ఆమె పలువరుస దానిమ్మగింజలవలె ప్రకాశిస్తోంది. లోకాతిశయమైన దివ్యసౌందర్య రాశిగా భువనేశ్వరీ దేవి ప్రకాశిస్తోంది.

ఆ దేవికి సహస్రదాసీ జనము , సర్వదేవతా వర్గము , ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు సేవలు చేస్తున్నారు. లజ్జ, తుష్ఠి, పుష్ఠిమొదలైన పీఠశక్తులు, శంఖపద్మాది నిధులు , అమృతసముద్రంలో లీనమయ్యే సమస్తరత్న సముదాయము తన్ను పరివేష్ఠించి ఉండగా భువనేశ్వరీ మాత ఆశ్రిత కల్పవృక్షమై అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది.

ఈ విధంగా జనమేజయునకు వ్యాస మహర్షి దేవీ స్వరూపాన్ని వివరిస్తూ, ఇంకా ఇలా చెప్పసాగాడు. జనమేజేయా ఆ చింతామణి గృహం యొక్క ప్రమాణం నాలుగవైపులా సహస్రయోజనాల పరిమితి . అది ఏ ఆదేరములేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తూఉంటుంది. పద్మం వలె సంకోచ వికాసాలతో చూడముట్టదా వుంటుంది. దివ్యులు, నాగులు, నరులు, ఎందరో దేవీ ఉపాసకులు ఆమె పాదసన్నిధిలో ధ్యాననిమగ్నులై ఉంటారు. ఆదేవి క్షేత్రంలో నివసించేవారు తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారు. దీనికి అన్ని దిక్కుల ఘృత , క్షీర, దధి, మధురస ప్రవాహలు ఉన్నాయి. కామధేనువు , కల్పవృక్షం, చింతామణి కోరికలను తీరుస్తూవుంటాయి. అక్కడ రోగాలు , జరామరణాలు, కామక్రోధాలు లేవు అక్కడవారందఱూ ముపై#్ఫసంవత్సరాల యువతీ యువకులే వయోభేదానికి సంబంధించిన వికారాలు వారికి లేవు. వారంతా సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడి వారంతా ఇహలోకసుఖాలతో పాటు బ్రహ్మానందం వరకు అన్నీ విధాలైన ఆనందాలనూ అనుభవించి , దేవిసన్నిదికి చేరుకుంటారు.

భువనేశ్వరీ దేవికి నిలయమైన ఈ మణిద్వీపాన్ని వర్ణించడం వేయి నాలుకలు గల ఆదిశేషునకు కూడా సాధ్యంకాదు.

జనమేజయా నిరంతరా మణిద్వీపాన్ని స్మరించే వారికి సకలదుఃఖ నివృత్తి కలుగుతుంది. అలా స్మరించడం అభ్యాసమై , ఆఅభ్యాస బలం చేత మణిద్వీపాన్ని స్మరిస్తూ ప్రాణం వదలిన సాధకులు దేవీ సామ్రాజ్యాన్ని పొందుతారు. అని వివరించాడు.

ఈ మణిద్వీప వర్ణన చదివిన , విన్నా ఎంతో పుణ్యఫలం లభించి, సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతినికూడా అనుగ్రహించాడు వ్యాసమహర్షి.

Devi Kathalu         Chapters          Last Page