Neetikathamala-1 Chapters Last Page
19
దైవస్తుతి
శరచ్చంద్ర బింబాననం చారుహాసం
లసత్కుండలాగ్రాంత గండస్థలాంతమ్
జపారాగ బింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భ##జే పాండురంగమ్.
(పాండురంగాష్టకమ్)
--- --- ---
దాశరథీ
అజునకుC దండ్రి వయ్యు సనకాదులకుం బరతత్త్వ మయ్యు స
ద్ద్విజ మునికోటి కెల్లCబరదేవతవయ్యు దినేశ వంశ భూ
భుజులకు మేటివయ్యుC బరిపూర్ణుCడ వైలుCగందు పక్షిరా
డ్గ్వజ! మిముC బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ.
కరుణా సముద్రుడవైన ఓరామా! నీవు బ్రహ్మకు తండ్రివి. సనకసనందనాది మునులకు పరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముక్తి ప్రదాతవు. సూర్యవంశ రాజులలో శ్రేష్ఠుడవు. పరిపూర్ణుడవు. గరుడుని వాహనముగా గలవాడవు అని నిన్ను స్తుతించెదను.
* * *
సతీ అనసూయ
అనసూయాదేవి అత్రిమహర్షి ధర్మపత్ని. ఆమె నిరంతర పతి పాదసేవా పరాయణురాలైన మహాపతివ్రత. ఆమె తల్లి దేవహూతి. తండ్రి కర్దమ మునీంద్రుడు.
ఒకానొకప్పుడు త్రిమూర్తులు వావానారూఢులై మేరు పర్వతానికి ప్రయాణమై వెళ్ళుచుండగా మార్గమధ్యమునందు తటాలున వారి వాహనములు నిలిచిపోయినవి. ఎన్నివిధముల ప్రయత్నించినను వారి వాహనములు కదలలేదు. కారణ మెరుగక త్రిమూర్తులు దిగ్భ్రాంతితో చూచుచుండగా గరుత్మంతుడు ''దేవా ! ఇది అత్రిమహాముని ఆశ్రమప్రాంతము. ఆ మహర్షి భార్య అయిన అనసూయాదేవి వహాపతివ్రత. అందువల్ల ఈ ఆశ్రమము మీదుగా ఎవరును ప్రయాణించకూడదు'' అని తెలిపెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లాశ్చర్యపడి ఎట్లైనను ఆమె పాతివ్రత్యమును పరీక్షింపవలెనని భావించుచు, మరొక మార్గమున వెడలిపోయిరి.
ఇట్లుండగా ఒక దినమున కలహప్రియుడైన నారదుడు త్రిమూర్తుల భార్యలకడకు వచ్చి ఇనుప గుగ్గిళ్ళను వండి వడ్డించు డనికోరెను. నారదుని విపరీతపు కోరికను విని, వారాశ్చర్యపడి తమ కాకార్యము సాధ్యము కాదని పలికిరి. నారదుడు నవ్వుచు '' ఇంత చిన్నపని కూడ చేయలేరా? ఇదేనా మీ గొప్పతనము? మీకంటె ఆ అనసూయాదేవి వెయిరెట్లు ప్రభావముకలది'' అని పలుకుచు భూలోకమున అత్రిమహర్షి అశ్రమమున కరిగెను. బ్రహ్మ మానసపుత్రుడైన నారదునికి మహర్షి దంపతులు భక్తిపూర్వకముగా స్వాగత మిచ్చిరి. కొంతసేపటికి ''తల్లీ! ఇవిగో -ఈ ఇనుపగుగ్గిళ్లు వండి పెట్టుము'' అని అడిగెను. అనసూయ తన పాతివ్రత్యమును పరీక్షించుటకే అతడు వచ్చెనని నిశ్చయించుకొని, భగవంతుని ప్రార్థించి ఉక్కు సెనగలు తుకతుక ఉడికించి నారదమహర్షికి పెట్టెను. నారదుడు వానిని గైకొని త్రిమూర్తుల పత్నుల కడకు వెళ్ళి ''తల్లులారా! అనసూయాదేవి పాతివ్రత్యమహిమవల్ల నా వాంఛిత మీడేరినది. ఇవిగో! ఉక్కుగుగ్గిళ్ళు. మేమే పతివ్రతల మనుకొను మీ అహంకారము నేటితో మాయమైనది'' అని పరిహసించుచు వెడలిపోయెను.
నారదుని వాక్యములు విని, త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, పార్వతుల హృదయాలు అనసూయాదేవిపట్ల ఈర్ష్యతో నిండిపోయినవి. ఎన్నటికైన ఆమె నవమానింపనిదే నిద్రపోరాదని నిశ్చయించుకొనిరి. అసూయాగ్రస్తలై వారు మువ్వురు భర్తల కడకేగి, అత్రిమునీంద్రుని భార్యపాతివ్రత్యమును పరీక్షింపుడని కోరిరి. సమయమునకై వేచియున్న త్రిమూర్తులు వెంటనే మాయావేషధారులై అత్రిముని ఆశ్రమమునకు వచ్చిరి. వారి కా మునీశ్వరుడు సగౌరముగా స్వాగతము పలికి ఆతిథ్యమును స్వీకరింపుడని కోరెను. వారు ''మహర్షీ మాకు వస్త్రమున్న ఇల్లాలు వడ్డించిన ఆహారమును భుజింపరాదను నియమము ఉన్నది. అందువల్ల నీ భార్య వివస్త్రయై వడ్డించినగాని మేము నీ ఆతిథ్యము స్వీకరింపజాలము'' అని పలికిరి. వారి వింత కోరికను విని వెరగుపడి మహర్షి మాటాడకుండెను. అనసూయా దేవి భర్తదగ్గరకు వచ్చి ''ప్రాణశ్వరా ! వీరి వాలకము చూడగా వీరు సామాన్యులవలె తోచుటలేదు. పరీక్షార్థమై వచ్చిన దేవతలవలె కనిపించుచున్నారు. మీ రేమియు చింతింపవలదు. ఎట్లైనను వారి కోరిక తీర్చుట మన కర్తవ్యము. మీరు ఆజ్ఞ యొసంగినచో నేనట్లే చేసెదను'' అని పలికెను. అత్రిముని భార్య మహిమ గుర్తించి వారిని భోజనమునకు సిద్ధము కండని కోరెను.
మాయావేషధారులైన త్రిమూర్తులు స్నానాదికములు పూర్తి కావించి వంటయింటిలో పీటలపై కూర్చుండిరి. అనసూయ పతిదేవుని మనమునందు స్మరించి మంత్రాక్షతలతో కలశమునందలి జలమును వారిపై చల్లెను. మరుక్షణములో వారు శిశురూపములు ధరించరి. అంత ఆ మునిపత్ని వివస్త్రయై వడ్డించి తిరిగి, మంత్రాక్షతయు క్తముగా నీటిని చల్లగా శిశువులు పూర్వాకారులై ఇష్టమృష్టాన్నమును సంతృప్తిగా భుజించిరి. అనసూయాదేవికి అతిథుల స్వరూప స్వభావములలో ఏదో వింత గోచరించెను. అయినను వారి రూపములలోని అంతరార్థమును తెలిసికొనదలచి భోజనానంతరరం వారిపై మంత్ర పురస్పరముగా శుభ్రజలమును చల్లెను.
వేద వేదాంత వీథులలో తిరుగాడు దివ్యమూర్తులు పసిపాపలై ఆమె వంటయింటిలో దోగాడసాగిరి. అనసూయ వారిని ప్రత్యేకముగా ఊయెలలో పరుండబెట్టి ఊచసాగెను. అఖిల ప్రపంచములను తమ ఉదరములందు ఉంచుకొనిన జగత్పతులు ఆమె తీయని జోలపాటలలో పులకించిపోయిరి. ఆమె ఊయల తూగులో పదునాల్గు లోకములే నిదురించినవి. వారిని అంకపీఠిపై కూర్చుండబెట్టుకొని గోరుముద్దలు తినిపించుచు ఆమె పెంచసాగింది.
సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురూ తమ భర్తలు ఎంత సేపటికి తిరిగిరాకపోవుట చూచి ఆ పతివ్రత చేతిలో వారికి ఎట్టి ప్రమాదము సంభవించినదో అని తలచి అనసూయాదేవికడకు వచ్చి అమె యింటిలో అటునిటు దోగాడుచున్న బాలురను చూచిరి. విషయము గుర్తించి ''అమ్మా! అనసూయా! నీ మహత్వమును గుర్తింపలేక మేమే, నీ పాతివ్రత్య పరీక్షకై మా భర్తలను ఇక్కడకు పంపితిమి. మాకు పతిభిక్ష పెట్టి మా పసుపు కుంకుమలు నిలుపుము. మా మంగళ సూత్రములను కాపాడు'' మని అమెను ప్రార్థించిరి. అనసూయాదేవి వారి కోరికను మన్నించి శిశురూపులపై తిరిగి మంత్రజలమును చల్లెను. త్రిమూర్తులు నిజరూపములతో సాక్షాత్కరించి ''అమ్మా ! అనసూయా! నీ పాతివ్రత్య మహత్వము అనుపమానమైనది. సూర్య చంద్రులు ఈ లోకమున వెలుగుచున్నంతకాలము నీ కీర్తి వెలయును'' అని పలికి సతీసమేతులై వెడలిపోయిరి. నారదుని ముఖమున నవ్వులు నాట్యమాడినవి.
పాతివ్రత్య మహిమవల్ల అనసూయాదేవి చతురాస్య హరిహరులకే అమ్మ అయినది. వాణీ రమాంబికలకు అత్త అయినది. పాతివ్రత్యము ముందు దైలబలము సైతము తలవంచ వలసినదే.
ప్రశ్నలు
1. త్రిమూర్తులు ఎవరు? వారి భార్యల పేరేమి?
2. మాయారూపములతో వచ్చిన త్రిమూర్తులు ఎట్టి ఆతిథ్యమును కోరిరి?
3. త్రిమూర్తుల వింతకోరికలను అనసూయ ఎట్లు తేర్చెను?