Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ఘటికాస్థానాలు
దాక్షిణాత్య నలందా తక్షశిలలు

దక్షిణదేశములో అథర్వణవేదము సంపూర్ణముగా విస్మృతమై పోయినదని జనసామాన్యమునందేకాక పండితులయందు కూడ ఒక అభిప్రాయము ఉన్నట్లు కనపిస్తుంది. కాని మనము ద్రావిడవాఙ్మయమును తరచి చూస్తే 'తలవకారము' అనే వేదశాఖ ఒకటి ఉండేదని, ఈ తలవకారముతో బాటు అథర్వణవేదమును కూడ దక్షిణదేశములో అధ్యయనము చేసేవారని, ఆ కాలపు మహారాజులు ఈఅధ్యయన వ్యాప్తికి ప్రోత్సాహము, ఆర్థిక సదుపాయము కల్పించేవారని తెలుస్తుంది.

దాదాపు రెండువేలయేండ్లక్రితం, దక్షిణదేశమునందు, మరికొన్ని ఇతర పట్టణములయందు కీర్తియందు, విద్యా వ్యాసంగమునందు ప్రపంచ ప్రఖ్యాతములైన 'తక్షశిల''నలందా' విశ్వవిద్యాలయములకు తీసిపోని విద్యాస్థానాలు ఉండేవని తెలుస్తూ ఉన్నది. ఈమధ్య మద్రాసులోని ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్తులైబ్రెరీవారు 'ఆభోగము' అనే పుస్తకం ఒకటి ప్రచురించారు. ఇది శ్రీలక్ష్మీనరసింహకృతమైన వ్యాఖ్యానము. ఈ వ్యాఖ్యకు మూలము 'కల్పతరువు' కల్పతరువును అమలానందులు రచించారు. అది వాచస్పతిమిశ్రులు రచించిన 'భామతి'కి వ్యాఖ్యానం. ఈ భామతి కూడ వ్యాఖ్యానగ్రంథమే. భామతి శంకరభగవత్పాదులు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యమునకు వివరణ.

బ్రహ్మసూత్రములను(3-4-20) వివరిస్తూ కల్పతరువులో అమలానందులు-

''యే తు శిఖాయజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్యవృత్తిం న మన్యన్తే, తే న పశ్యన్తిప్రత్యక్ష ఘటికాస్థానేషు పఠ్యమాన ఆధర్వణీం శ్రుతిం-సశిఖం వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేద్బుధః''

అనగా సంన్యాసికి శిరోమండనము, యజ్ఞోపవీత త్యాగము కూడదని చెప్పేవారు- ''ఘటికాస్థానాలలో అధ్యయనముచేయబడుతూఉన్న అధర్వణ శ్రుతిని వినలేదన్నమాట!''- అని వ్రాసినారు.

అయితే 'ఘటికాస్థానము' అంటే ఏమిటి? షిమోగా జిల్లాలో శిఖర్‌పూర్‌ తాలూకాలో 'తలగుండ' అనేచోట ప్రణవేశ్వరస్వామి ఆలయములో కకుత్‌ స్థవర్మ కాలమునకు చెందిన శిలాశాసనము ఒకటి ఉన్నది. కకుత్‌ స్థవర్మకుపూర్వికుడైన మయూరవర్మ (క్రీ.శ.305-307) తన గురువైన వీరశర్మతో శాస్త్రములను అన్నిటిని క్షుణ్ణముగా అభ్యసించుటకై కాంతీపురములోని ఘటికాస్థానమునకు వెళ్ళినాడని-

యః ప్రయాయ పల్లవేంద్రపురీం

గురుణా సమం వీరశర్మణా,

అధిజగమిషు ప్రవచం నిఖిలం

''ఘటికాం'' వివేశ సుతారుకుకః.

ఈ శాసనము చెపుతూ ఉన్నది.

ఈ శాసనము వలన, కల్పతరువులోని పై వాక్యమువలన శాస్త్రాభ్యాసము చేయబడే విద్యాస్థానాలే 'ఘటికాస్థానాలు' అని అర్థం అవుతూ ఉన్నది. అప్పటికే కొలదిగనో, గొప్పగనో గురువువద్దచదివిఉన్న మయూరవర్మ ఆగురువుతో బాటు కాంచీపురానికి వెళ్ళినాడంటే- ఆ ఘటికాస్థానము యొక్క ప్రసిద్ధి, అక్కడ చేయబడే విద్యాబోధయొక్క ప్రాశస్త్యము వెల్లడి అవుతుంది.

దక్షిణ ఆర్కాటు జిల్లాలో 'అర్కోణం' అనే ఊరికి ఏడుమైళ్ళ దూరములో ఉన్న 'వేలూరుపాళియం' అనే చోట మూడవ 'విజయనందివర్మ' కాలమునకు చెందిన శిలాశాసనం ఒకటి ఉన్నది. అందు-

''స్కంద శిష్య స్తతో 7 భ##వేత్‌ ద్విజానాం

ఘటికాం రాజ్ఞ స్సత్యసేనా జ్జహార యః''.

కాంచీపురాన్ని పాలిస్తూ ఉన్న పల్లవరాజు స్కందశిష్యుడు (కీ.శ. 4 శతాబ్ది మొదట) సత్యసేనరాజుయొక్క అధీనమునందున్న 'ఘటికను' జయించినట్లు వ్రాయబడినది. ఈ సత్యసేనుడూ అశోకుని శాసనాలలో పేర్కొనబడిన సత్యపుత్తుడూ ఒకరే కావచ్చును. అశోకుని శాసనాలు ఆయన సామ్రాజ్యముయొక్క ఎల్లలను పేర్కొంటూ-'సత్యపుత్తము. కేరళపుత్తము'-అనే రెండు ప్రదేశాలను సూచించాయి. ప్రస్తుత కేరళ##దేశ##మే శాసనములోని 'కేరళపుత్తము' అయిఉండాలి, ఇక 'సత్యపుత్తము'- అంటే బహుశః కాంచీపురము రాజధానిగాగల తొండమండలమై ఉండవచ్చునని తోస్తూ ఉన్నది. కాంచీనగరమును'సత్యవ్రతక్షేత్రము'అని అంటారు. కంచిలో 'తిరునేరి కరైక్కాడు' అనే చోటు ఒకటి ఉన్నది. దీనినే స్థలపురాణాలు 'సత్యవ్రతము' అని వ్యవహరిస్తూ ఉన్నాయి. 'నేరి' అనగా సత్యవ్రతము. 'పుగళేంది' అనే అరవకవి- తొండమండలములోని జనులు సమస్త ప్రపంచమును దానముగా ఇచ్చినప్పటికి అసత్యము పలుకరు'- అని వారి నిజాయితిని గురించి ప్రశంసించాడు. తొండమండలమునకు ఉత్తరంగా 'సత్యవేడు'అనే గ్రామం ఉన్నది. అవన్నీ చూస్తే అశోక శాసనములలో పేర్కొనబడిన'సత్యపుత్రము' తొండమండలమే అయి ఉంటుందని తోస్తూ ఉన్నది.

వేలూరిపాళ్యమునకు చెందిన శాసనము-

''తత్పుత్రసూను ర్నరసింహవర్మ

పునర్వ్యధాత్‌ యో ఘటికాం ద్విజానాం|

శిలామయం వేశ్మ శశాంకమౌళేః

కైలాస కల్పం చ మహేంద్ర కల్పః||''

నరసింహవర్మ కాంచీపురములో ఒక ఘటికను స్థాపించి కైలాసనాథాలయమును నిర్మించినాడని తెలుపుతూ ఉన్నది.

ఒకప్పుడు కంచికి రాజు లేకపోగా ఊరి పెద్దలందరు చేరి పల్లవుడైన హిరణ్యవర్మయొక్క ఆస్థానానికి-అతని కుమారుడైన పరమేశ్వరవర్మను కంచికి రాజుగా చేయవలసినదిగా కోరుతూ ఒక రాయబారము పంపినారట. దానికి హిరణ్యవర్మ అంగీకరించగా కంచిలోనివారు పరమేశ్వరవర్మకు 'నందివర్మ పల్లవుడు' అనే బిరుద మిచ్చి పట్టాభిషేకం చేసినారట. ఈ రాయబారమునందు, పట్టాభిషేకోత్సవమునందు కంచిలోని ఘటికాస్థానాలలో ఉన్న ప్రజ పాల్గొన్నారట. కంచిలో వైకుంఠనాథ పెరుమాళ్ళయొక్క ఆలయములోని శాసనం ఈ విషయాన్ని చెపుతూ ఉన్నది. నందివర్మకాలం క్రీ.శ.710 నుండి 755 వరకు అని నిర్ణయింపబడినది.

కంచి కైలాసనాథాలయములో మహామండపానికి పశ్చిమంగాఉన్న స్తంభాలపై ఉన్న శాసనాలు విక్రమాదిత్య సత్యాశ్రయుని కాలానికి చెందినవి. (క్రీ.శ.533-545)వీని వలన ఆ కాలంలో కంచి ఘటికాస్థానాలలోని వారిని 'మహాజనులు' అని గౌరవంగా పిలుస్తూ ఉండేవారని తెలుస్తూ ఉన్నది. ఘటికాస్థానాలను నాశనం చేస్తే మహాజనులను హత్య చేయుటవలన కలిగే పాపం సంభవిస్తుందని ఈ శాసనాలలో వ్రాయబడినది.

6-8)

దక్షిణ ఆర్కాటులో గుడియాత్తం తాలూకా 'తిరువల్ల' అనే గ్రామానికి దగ్గర 'నీవా' నదిలోని శాసనంలో- ఈధర్మాన్ని నాశనం చేసినవారిని 'ఘటిక'లోని ఏడువేలమంది జనంయొక్క హత్యాపాపం చుట్టుకొంటుంది'-అని వ్రాయబడింది. అవన్నీ చూస్తే ఘటికలలో చాలమంది (ఒకానొక ఘటికలో 7000 మంది) చదివేవారని, ఆ కాలపు రాజులకు ఘటికాస్థానాలపై చాల ఆదరాభిమానాలు ఉండేవని వ్యక్తం అవుతూ ఉన్నది. ఇంకా-

''దేవబ్రాహ్మణ సత్కృతాత్మ విభవః

యః క్షాత్ర చూడామణిః,

చాతుర్వేద్య మనీవృధాత్య

ఘటికాం భూదేవతా భక్తితః''

అని ఒక చోట,

''యస్మాత్ర్పభృ త్యల మవర్ధత ధర్మకర్మ

దేవద్విజన్మ విషయం ఘటికా శ్చధాతుః''.

అని వేరొకచోట ఉన్నది.

ఘటికలు కంచియందే కాక ఇతరస్థలాలలో కూడ ఉండేవి. గోదావరిజిల్లా సిక్కుల అగ్రహారంలో 'అటికావాణి' అనే తటాకం త్రవ్వుతూ ఉన్నప్పుడు విష్ణుకుండిన వంశమునకు చేరిన రెండవ విక్రమేంద్రవర్మ (క్రీ. శ. 525) కాలపు తామ్ర శాసనం ఒకటి లభించింది అందు- 'యథావిధి వినిర్వాపిత ఘటికావాప్త పుణ్యసంచయస్య'- అని వ్రాయబడి ఉన్నది. అనగా యథాశాస్త్రముగా ఘటికాస్థాపనచేసి పుణ్యం సంపాదించుకొన్నాడు అని అర్థం. 11, 12 శతాబ్దాల శాసనాలు, ఆ తరువాతి శాసనాలు చూస్తే మైసూరురాష్ట్రంలో కూడ ఆకాలంలో 'ఘటికాస్థానాలు' ఉండేవని ఋజువు అవుతూ ఉన్నది. (క్రీ. శ. 1442)కు చెందిన శిలాశాసనం ఒకటి చెన్న రాయ పట్టణములో దొరికింది. అందులో-

'దుందుభౌ హాయనే భాద్రపదే మాసి శ##భేదినే

ఉత్తంగోక్త్యా సామ వేదే వ్యధత్తఘటికాశ్రమం'.

'దుందుభి సంవత్పర భాద్రపద మాసములో ఉత్తంగుని ఆజ్ఞచేత సామవేదాధ్యయనమునకై ఒక ఘటిక నిర్మంపబడినది'- అని ఉన్నది. ఈ ఘటికలు అన్నీ కాంచీపురంలోని ఘటికాస్థానాలవలెనే పేరొందిన విద్యాలయాలై ఉండాలి.

ఈ శాసనాలలో కొన్ని- ఘటికలలో చదివేవారి సంఖ్యను నిరూపిస్తూ ఉన్నాయి. మైసూరు రాష్ట్రములో 'మాండ్య' తాలూకాకు చేరిన 'హలేకెరే' గ్రామంలో దొరికిన శాసనం వలన 'పృథ్వీకొంకణ మహారాజా శివకుమారుడు'- ఘటికలో అధ్యయనం చేస్తూ ఉన్న వేయిమందిలో ఒకరికి భూమిని దానం చేసినట్లు తెలుస్తూ ఉన్నది.

'ఘటికా సహస్రాయ హరితసగోత్రాయ మాధవ శర్మణ'-అని అందులోని వాక్యం.

ఉత్తరార్కాటు జిల్లాలో 'చెయ్యూరు' తాలూకాలో 'బ్రహ్మదేశం' అని ఒక గ్రామము ఉన్నది. అక్కడ చంద్రమౌళీశ్వరాలయంలోని ఉత్తరభాగంలో- గోడపై ద్రావిడభాషలో- 'త్రైరాజ్య ఘటికా మద్యస్థ మూవాయిరవర్‌'-అని మూడు వేలమంది ఘటికలో ఉన్నట్లు వ్రాయబడింది. మరికొన్ని చోట్ల 'ఘటికై ఏళా ఇరవర్‌'- ఘటికాసహస్రము అని ఉన్నది. అరవములో 'ఆయిరం' అనగా వేయి అని అర్థం. ఇలా ఒక్కొక్క ఘటికయందు వేలకొలది జనం అధ్యయనం చేస్తూ ఉండేవారని తెలుస్తూ ఉన్నది. ఇది కేవలం సాంప్రదాయంగా చెప్పుకొనే మాటకాదు. వేదపురీశ్వరాలయంలోని రాజేంద్రచోళుని కాలపు శాసనము వలన (క్రీ. శ. 1021) తంజావూరులో వెప్పత్తూరు అనేచోట- 'సోమయాజులు, భట్టరులు' అచ్చటి ఘటికలో అధ్యయనం చేసేవారని తెలుస్తూ ఉన్నది.

అయితే ఈ విద్యాస్థానాలను 'ఘటికలు' అని ఎందులకు పేర్కొన్నారో పరిశీలించవలసి ఉన్నది.

పూర్వమీమాంసకు కుమారిలభట్టు వ్రాసిన తంత్ర వార్తికములో- 'అనయోగేషు వేదానాం ఘటికామాత్రవృత్తిషు, న కల్ససూత్రహీనానాం లభ్యతే కృత్స్న వేదతా' (1-3-6) దీనిని వివరిస్తూ భట్టసోమేశ్వరులు ఈ క్రింది విధంగా వ్రాశారు.

''వేదకౌశల జిజ్ఞాసార్థం తత్తద్‌ వేదభాగ చిహ్నలేఖాయాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తద్వేదభాగ పరీక్షాకాలే తాన్యాకృష్య ఆకృష్టలేఖాచిహ్నితం వేదపాఠం పఠ ఇత్యధ్యేతారః అనుయుజ్యన్తే ఇతి ఘటికామార్గవర్తినో అనుయోగః.''

అనగా- ''వేదంలో ఒక్కొక్క భాగము నుండి ఒక్కొక్క పదమో వాక్యమో ఒక కాగితము మీద వ్రాసి అట్టి కాగితములను ఆ వేదమునకై నిర్ణయించిన ఘటికలలో- కుంభములలో పడవైచి, విద్యార్థుల అధ్యయన ప్రావీణ్యతను పరీక్షించుటకై ఆ కాగితములలో ఒకదానిని తీసి అందలి పదవాక్యము లాధారముగా ఆ వేదభాగము తడుముకొనకుండ అప్పగించుమని ఆదేశించేవారట!''

ఇందువలన 'ఘటము' లేక 'ఘటికల'లో పడవేసిన వేదభాగ చిహ్నితములైన లేఖలద్వారా విద్యార్థులను పరీక్షించే విద్యాస్థానములను 'ఘటికాస్థానములు' అని పిలిచేవారని తెలియుచున్నది. శాసనాలలో కనిపించే 'ఘటిక' అనే పదమును తంత్రవార్తికములోని 'ఘటికాస్థానము' అనే పదమును జోడిస్తే కాని వీని వివరం తెలియలేదు. 'సశిఖం వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేద్బుధః' అన్నది అథర్వవేదములో ఉన్నది. అందులకే కల్పసూత్రకారుడు ఘటికాస్థానాలలో అధ్యయనము చేయబడే ఆధర్వణంలో ఈవిషయం ఉన్నది. మీరు వినలేదా? అని ప్రశ్నిస్తూ ఉన్నాడు.

ఇంతేకాక 'ఘటికలు' అనేపేరు లేకపోయినా అథర్వణ వేదము అధ్యయనము చేయబడే ఇతర విద్యాస్థానాలుకూడ దక్షిణదేశంలో ఉండేవి. కడలూరుకు పుదుచ్చేరికి మధ్య'బాహూరు' అనేచోట క్రీ. శ. 868 దాపున అట్టి విద్యాస్థానం ఒకటి ఉండేదని, విజయనృపతుంగుని మంత్రి ఈబాహూరుతో మూడుగ్రామాలు ఆవిద్యాస్థానానికి దానం ఇచ్చినాడని శాసనం వల్ల తెలుస్తూఉన్నది. ఈ విద్యాస్థానానంలో చతుర్దశవిద్యలు అనగా వేదములునాలుగు, వేదాంగములారు, పురాణము, మీమాంస, న్యాయధర్మ శాస్త్రములు'' నేర్పేవారట.

తిండివనమునకు విల్లుపురమునకు మధ్య 'రాజరాజచతుర్వేది మంగళం' (ఎన్నాయిరం) అనేచోట 340 మంది విద్యార్థులు 14 మంది అధ్యాపకులు, ఉండేవారు. క్రింది తరగతిలో 270 మంది విద్యార్థులు, పై తరగతిలో 70 మంది విద్యార్థులు చదువుతూ ఉండేవారు. వీరిలో క్రింది తరగతిలోని వారిలో 75 మంది ఋగ్వేదము, 75 మంది యజుద్వేదము. 20 మంది ఛాందోగ్యసామము, 20 మంది తలవకారసామము, 20 మంది వాజసనేయము, 10 మంది అథర్వము, 10 మంది బోధాయన గృహ్యకల్పము, 40 మంది రూపావతారము (వ్యాకరణము) చదివేవారట. పై తరగతిలో 25 మందివ్యాకరణము, 35 మంది ప్రభాకర మీమాంస, వేదాంతము 10 మంది అభ్యసించేవారట. ఈ ఎన్నాయిరమునకు చేరిన మరియొక శాసనములో 506 మంది బ్రాహ్మణులకు భోజనవసతులు కల్పించినట్లు, వారిలో వైదికులు, శ్రీ వైష్ణవులు, ఇతరులు ఉన్నట్లు తెలుస్తూఉన్నది.

బాహూరుకు సమాపంలోనే 'త్రిభువనం' అనేచోట వేరొక విద్యాస్థానం ఉండేది. ఈ విషయం వరదరాజపెరుమాళ్ళ ఆలయశాసనాలద్వారా తెలుస్తూ ఉంది. ఈ శాసనాల కాలం క్రీ.శ. 1048 అని తేల్చినారు. (రాజాధిరాజు. క్రీ.శ.1018-1050) ఈ శాసనాల మూలముగా ఋగ్వేదమునకు ముగ్గురు, యజుర్వేదమునకు ముగ్గురు, 'ఛాందోగ్యసామము, తలవకారసామము, ఆపూర్వము, వాజసనేయము, బోధాయనము, సత్యాషాఢము వీనికి ఒక్కొక్కరు, మొత్తము పండ్రెండుగురు అధ్యాపకులు ఉండేవారట. వీరితో బాటు ప్రత్యేకము. ''వేదాంతము, వ్యాకరణము, మహాభారతము, రామాయణము, మనుధర్మశాస్త్రము వైఖానసము'' వీనిని చెప్పుటకు ఒక్కొక్క అధ్యాపకుడు ఉండేవారట. ఋగ్వేదము చదువు విద్యార్థులు 60 మంది, యజుర్వేదము చదువువారు 60 మంది, ఛాందోగ్యసామము చదువువారు 20 మంది, ఇతర శాస్త్రములు చదువువారు 50 మంది, మొత్తము 190 మంది విద్యార్థులు ఉండేవారట. 70 మంది వేదాంతము, వ్యాకరణము-రూపావతారము చదివేవారట. ఈ విద్యస్థానములలో విద్యార్థులకుగాని, అధ్యాపకులకుగాని విద్యతప్ప ఇతర వ్యాసంగము ఏదీ ఉండరాదని ఒక (గమనించదగిన) నియమం ఉండేది.

పదకొండవ శతాబ్దానికి చెందిన వీరరాజేంద్రదేవుని కాలపు శిలాశాసనం (క్రీ. శ. 1067) పాలార్‌ నదీతీరంలో తిరుముక్కూడల్‌ అనేగ్రామములోని విష్ణ్వాలయంలోఉన్నది. ఈ ఆలయానికి వచ్చే ఆదాయముద్వారా ఒక చికిత్సాలయము, ఒక విద్యాస్థానము నడుపబడేవి. ఈ విద్యాస్థానంలో ఋగ్వేదము, యజుర్వేదము, వ్యాకరణము, రూపావతారము బోధించేవారు. అరవై మందిలో పదిమంది ఋగ్వేదము పదిమంది యజుర్వేదము, ఇరవై మంది వ్యాకరణము, పదిమంది 'సహాపంచరాత్రము' చదువుకొనేవారు. వీరితోబాటు ముగ్గురు శైవబ్రాహ్మణులు, ఏడుగురువైఖానస బ్రాహ్మణులు, ఇతరులు ఇద్దరు ఉండేవారట.

పైన చెప్పిన శాసనాలవలన దక్షిణ దేశంలో అథర్వణ వేదం అధ్యయనం చేయబడుతూ ఉండేదని తేట తెల్లం అవుతూ ఉన్నది. ఎన్నాయిరం అనే ఊరికి సమీపంలో ఉన్న 'సనై యావరం' అనే చోటగల శాసనంవల్ల ఏబదిమంది బ్రాహ్మణులకు, పదిమంది శివయోగులకు అన్న వసతికల్పించి నట్లు తెలుస్తూఉన్నది. బ్రాహ్మణులతో బాటు శ్రీ వైష్ణవులను శివయోగులను ఈ శాసనాలు పేర్కొనుట గమనించదగినది. ఈ రోజులలో విష్ణ్వాలయాలలో ఏదో ప్రసాదం ఇవ్వడంతప్ప శ్రీ వైష్ణవులకు ప్రత్యకమలైన అన్నవసతు లేవీ ఉండుటలేదు. కేరళ దేశంలో ప్రత్యేకంగా 'అగ్రములు' అని బ్రాహ్మణులకు ఉత్సవాలు చేస్తూ వుంటారు. ఈ ఆచారం దక్షిణ దేశం నుండే కేరళ##దేశానకి వెళ్లి వుండాలి. విష్ణ్వాలయాలలో శివాగమాలు, పాంచరాత్రాలయములలో వైఖానసాగమములు చదివే వాడుక వుండేది.

పైన చెప్పినది పరీశీలిస్తే పూర్వం దక్షిణదేశంలో వున్న ఘటికాస్థానాలు, అత్యుత్తమ విశ్వవిద్యాలయాలని, ఆ యా ఘటికలలో వేదాధ్యయనమే కాక-స్మృతి, పురాణ, మీమాంసా, వ్యాకరణశాస్త్రాలు నేర్పేవారని తేలుతుంది. కాని ప్రస్తుతం మనం ఘటికాస్థానం అంటే అర్థం కూడ తెలుసుకొనలేని స్థిలో వున్నాం, ఇవన్నీ కొన్ని శతాబ్దాలకు వెనుకనే విస్మృతం అయినందువల ఘటికాస్థానాలంటేనే దురవగాహమయ్యే స్థతి యేర్పడింది.

ఏడవశతాబ్దమునకు చెందిన శివభక్తుడైన అప్పరు, కంచిని- 'కలనియల్‌ కరై ఇల్లార్‌ కాచ్చి మానాగర్‌' - అని వర్ణించాడు. కాంచీనగరంలో విద్యకు అవధులు లేవట, తొమ్మిదవ శతాబ్దమునకు చెందిన సుందరులు జగన్మాత కంచి కామాకోటి కామాక్షిని - 'కాచ్చి ముదూర్‌ కామకోటిమ్‌' అని ప్రశంసించారు. 1965 ఫబ్రవరి 24 నుంది 29 వరకు మద్రాసులో జరిగిన అఖిలభారత వైదిక సమ్మేళనంలో ఇతరులతో పాటు తలవకారశాఖకు అథర్వణవేదమును అధ్యయనం చేసినవారు కూడా పాల్గొన్నారు. శ్రీ. ఎస్‌. కె.చటర్జీగారు అధ్యక్షత వహించిన సంస్కృత కమీషనుయొక్క సలహాలను భారత ప్రభుత్వం అంగీకరించినది. వేదములలో వుండవలసిన 1131 శాఖలలో పదిమాత్రమే మిగిలి వున్నట్లు తెలుస్తూ వున్నది. ఈ మిగిలిన శాఖలనైనా జారవిడుచుకోక రక్షించుకొనవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మీద, ఆస్తిక వర్గం మీద వున్నది. ఆ కర్తవ్యం విస్మరించక అనుసరిస్తే సనాతని అయి వేదమాత శ్రుతిరూపంలో మానవానీకానికి మార్గదర్శియై మన జాతిని చైతన్యవంతం చేస్తుం దనుటలో సందేహం లేదు.

6-9)


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page