Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

శ్రుతి బోధించిన అద్వైతం

అద్వైత సిద్ధాంతమును బోధించే గ్రంథములలో ముఖ్యమైనది. 'ప్రస్థానత్రయం'- అనగా గీతాభాష్యం, ఉపనిషద్భాష్యం, సూత్రభాష్యం, ఈ మూడూ అద్వైత సిద్దాంతానికి అధారం. ఈ మూటిని శంకరభగవత్పాదుల వారు వ్రాశారు. వీనితో బాటు అనేక ప్రకరణ గ్రంథాలు వారు వ్రాశారు. ప్రకరణ గ్రంథాలలో 'వివేకచూడామణి' ఒక ప్రత్యేకస్థానం సంతరించుకొన్నది. ఇవేకాక ఆచార్యపాదులు శివస్తోత్రములు, విష్ణుస్తోత్రములు, దేవిపరములయిన స్తోత్రములు 'ప్రపంచసారము' - అనే మంత్రశాస్త్రము వ్రాశారు.

ఆచార్యుల గ్రంథములలో ముఖ్యమైనది బ్రహ్మ సూత్ర భాష్యము. ఇది వ్యాస భగవానులు దశోపనిషత్తులను సూత్రబద్ధము చేసిన బ్రహ్మసూత్రములకు వాఖ్య. ఆచార్యుల సూత్రభాష్యమునకు కూడా అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. ఆచార్యుల ముఖ్య శిష్యులలో ఒకరయిన పద్మపాదులు 'పంచపాదిక' వ్రాయగా దానికి వివరణాచార్యులు 'తత్త్వదీపనము' అనే మరొక వ్యాఖ్య వ్రాశారు. వాచస్పతిమిశ్ర 'భామతి' వ్రాయగా భామతికి అమలానందులు 'కల్పతరువు' అనే వ్యాఖ్య వ్రాశారు. ఈ కల్పతరువుకు అప్పయదీక్షితులు 'పరిమళము' అనే వ్యాఖ్య వ్రాసినారు. కల్పతరువునకే ' ఆభోగము' అని లక్ష్మీనరసింహవాజపేయుల వ్యాఖ్య ఒకటి ఉన్నది. ఇదొక పరంపర.

భగత్పాదుల సూత్ర భాష్యములకు రామానందులు వ్రాసిన 'రత్నప్రభ' అనే వ్యాఖ్య కూడా ఒకటి ఉన్నది. ఆచార్యుల శిష్యులైన ఆనందగిరి వ్రాసిన 'ఆనందగిరీయము' అనే వ్యాఖ్య, త్ర్యంబక భట్టాచార్యులు వ్రాసిన భాష్యభాను ప్రభ, మహారాష్ట్రీయుడైన రఘునాథసూరి భాష్యములోని ఒక పాదమునకు వ్రాసిన 'శంకరపాదభూషణము'- అనే వ్యాఖ్య- ఇట్లు వ్యాఖ్యలు అనేకములు వెలసినవి.

ఉపనిషత్తులలో బృహదారణ్యక తైత్తరీయములకు - సురేశ్వరాచార్యులు వార్తికములను వ్రాసి వార్తికకారులన్న బిరుదు నందుకొన్నారు. ఆచార్యుల గీతాభాష్యమున కయితే పది వ్యాఖ్యానాలున్నాయి. ఇవ్వన్నీ అద్వైతసిద్ధాంతమును తెలిపే గ్రంథాలు.

ద్వైతమతానుసారం మధ్వాచార్యులవారు బ్రహ్మ సూత్రములకు ఒక భాష్యము వ్రాశారు. దానికిన్ని అనేక వ్యాఖ్యలున్నాయి. ఇవన్నీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిఘటించే వ్యాఖ్యలు వానిలో 'న్యాయామృతం' ఒకటి న్యాయామృతాన్ని ఎదురుకొంటూ మధుసూదన సరస్వతులు 'అద్వైత సిద్ది' అనే గ్రంథం వ్రాయగా దానిని ప్రతిఘటిస్తూ ద్వైతమతాను సారియైన 'తరంగిణి' అనే పుస్తకం మరియొకటి వెలిసింది. తరంగిణికి వ్యతిరేకంగా గౌడదేశీయులైన బ్రహ్మనందులు 'చంద్రిక' - అనే పుస్తకం వ్రాశారు. దీనినే 'గౌడ బ్రహ్మా నందీయము' అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రంథమును ఆక్షేపిస్తూ వనమాలమిశ్రులు 'వనమాల మిశ్రీయం' అని ద్వైతమత ప్రతిపాదన చేస్తూ ఒక ఖండన వ్రాయగా - దానికి వ్యతిరేకంగా 'భాష్యభానుప్రభ' వ్రాసిన త్ర్యంబకభట్టాచార్యులే 'సిద్ధాంత వై జయన్తి' అనే మరొక ఖండన గ్రంథం వ్రాశారు.

దాదాపు తొంభై ఏళ్ళ క్రితం విశిష్టాద్వైతం పాటించే అనంతాళ్వార్లు అనే ఆయన పైన చెప్పిన గౌడ బ్రహ్మానందీయాన్ని ఆక్షేపిస్తూ 'న్యాయభాస్కరం' అన్న పుస్తకం వ్రాయగా దానిని ఖండిస్తూ అప్పయదీక్షితుల వంశమునకు చెందిన రాజశాస్త్రులు అనే ఆయన 'న్యాయేందు శేఖరము' అనే పుస్తక మొకటి వెలికి తెచ్చారు. ఇట్లు ద్వైతమత ఖండనలో 'సిద్ధాంత వై జయన్తి' విశిష్టాద్వైత ఖండనంలో 'న్యాయేందు శేఖరము' కట్టకడపట వెలసిన గ్రంథాలు. మతంలో ప్రవేశమున్నవారు తమ మత గ్రంథములను చదువుటయే కాక తమ మతమును ఖండిస్తూ ఇతరులు వ్రాసిన ఖండన గ్రంథములను కూడా చదువుట మన దేశములో పరిపాటి. అభిప్రాయభేదాలను అర్ధం చేసుకొంటే కాని మన లోటుపాట్లు తెలియవు కదా! అందుచేత ఈ సంప్రాయదాయము సునిశిత విమర్శకు దోహదకారి కనుక ఆచరణీయమైనది.

ఇట్లు మనకు అద్వైతమత ప్రతిపాదన చేసే పుస్తకాలు ఇన్ని ఉన్నాయి. కాని మనలో చాలా మందికి ఇవి ఉన్న వన్న విషయం కూడా తెలియదు. ఏ పుస్తకము దేనికి ఆధారము? అన్న విషయమూ తెలియదు కనీసం పేళ్ళనైనా గుర్తు పెట్టుకొంటే, వానిని చదవాలన్న కోరిక ఎప్పుడైనా కలుగవచ్చు. శాస్త్రములు చదివిన పండితు లెవరైనా మనకు చెప్పవస్తే వారి మాటలు చెవియొగ్గి వినే అలవాటు మనకు లేదు. ఆశ్రద్ధ ఎక్కువ. మన దేశంలో ప్రపంచంలో ఒక గౌరవ స్థానం గడించుకొన్నదంటే ఎంత మంది మహనీయులో ఈ దేశంలో పుట్టి తత్త్వాన్వేషణపరులై అనుభూతిని తాము సాధించుటయే కాక ఇతరులకు సైతము అభ్యుదయపథమును చూపించుటయే కారణం. అట్టి గౌరవ కారణమైన ఆత్మ విద్యాబోధకమైన శాస్త్రపరిశీలన మనం విస్మరించుట ఎంతో గర్హింపదగిన విషయము.

సరి! అద్వైతం అద్వైతం- అని అంటున్నాం కదా! అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే రెండవ వస్తువు లేదు అని అర్ధం. రెండవ వస్తువు లేకపోతే ఈ కనపడేదంతా ఏమిటి? ఇవన్నీ ఉండగా ఇవన్నీ లేవు అనుకొనుటలో మనకు కలిగే లాభం ఏమిటి? లోకంలో మనం దేనిని అర్థించి పాటు పడతామో దానినే మనం సాధిస్తాం కదా! ప్రస్తుతం మనం దేనికోసం పాటు పడుతున్నాం?

జీవితంలో మనలను ఎదురుకొనే కష్టపరంపరకు అంతు లేకుండా ఉంది. అనుక్షణము అగచాట్లే. ఆకలి, అవమానం, వ్యాధి, వ్యవహారం, కష్ఠం, కన్నీరు- ఇట్లు 'లోకం శోక హతం చ సమస్తం' అయి ఉన్నది. ఈ కష్ట నివారణకు ఉపాయాలు వెదుకుతూనే ఉన్నాం. లౌకిక ప్రయత్నాలచేత తాత్కాలికోపశమనమే కలుగుతూ ఉన్నది. వ్యాధి వచ్చినదని మందు పుచ్చుకుంటే దాని స్థానే మరియొక వ్యాధి వచ్చి కూర్చుంటూ ఉన్నది. మరి ఈ మందు వల్ల లాభం ఏమిటి? దుఃఖాన్ని దూరం చేసే మందు ఏదైనా ఉన్నాదా?

'దేహధారులము కాబట్టి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. అని అంటే దేహ ధారణకు కారణం మనం చేసుకొనే పాప పుణ్యాలు. ఆత్మకు అనుభవం లేదు. అది ఒక దేహం ధరిస్తే కాని ఈ పాపపుణ్యాలను అనుభవింప లేదు. పాపపుణ్యాల ఫలితంగా దేవుడు ఒక దేహం మనకు ఇచ్చి, ఆ శరీరముపై తగని వ్యామోహము కలుగజేసి దానినే 'నేను' అని మనచేత భ్రమింప చేసేటట్టు ఉన్నది. మనం చేసే పాపాలకు ఈశ్వరుడు శరీరం ఇస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చి శిక్షిస్తున్నాడు. ఒక పాపం చేయకుంటే శరీరం మళ్లారాదు. పాపం చేయరాదనే స్మృతి మనకు ఎప్పుడూ ఉంటే కాని పాపాచరణనుండి మనం తప్పించుకోలేము.

పాపం చేయకుండా ఉండాలని ఇచ్ఛ ఉన్నా పాపాచరణకే ఎందుకు పూనుకొంటున్నాం? ఇష్టమున్నా చేతకావటం లేదే! ఎందుచేత? చెడ్డపనులను చేయటమే పాపం. చెడ్డపనులను మనం విధిగా చేస్తున్నాం. ఎందుచేత? ఒక వస్తువుపై ప్రీతి గొని తత్ర్పాప్తికై మనం దేనికైనా తెగిస్తున్నాం. ఇట్లు ఆశ పాపకారణం అవుతూ ఉన్నది. ఒక వస్తువు అందంగా ఉన్నది. అందుచేత దానిమీద ఇచ్ఛ. మనోహరములైన వస్తుతతులు మనలోని తృష్ణాజ్వాలను రగిలిస్తున్నది. ఒక వస్తువు మంచిదనే జ్ఞానం ఇచ్ఛను రేకెత్తిస్తూ ఉన్నది. ఇచ్ఛాపూర్తికై కార్యాలు చేస్తున్నాం. ఇంద్రియములు ఒక వస్తువు అందంగా ఉన్నది అని అనుకొనుటచేత ఆశ పుట్టుతూ ఉన్నది. ఈ ఇచ్ఛను ప్రభవింప జేయనూవచ్చు, పరివర్తితమూ చేయవచ్చు. కాని జ్ఞానం అట్లు రాదు. మనం చేసే పాపాలకు ఈ శరీరం ఒక శిక్షగా ఉన్నది గనుక ఆశానివృత్తితో దుఃఖనివృత్తి జరుగుతుంది. ఈ ఆశానివృత్తికి దుఃఖనివృత్తికి మార్గంఏమిటి? ఇతర శాస్త్రాలు ఈ ప్రశ్నకు జవాబు చెప్పక వదిలివేశాయి. వేదాంతం అట్లా వదలక దుఃఖనివృత్తికి మార్గం చూపుతూ ఉన్నది.

ద్వేషం కాని, ఆసక్తి కాని మనకు అన్యమైన విషయాల పైననే కలుగుతూ ఉన్నది. మనపై మనకే ద్వేషముకాని ప్రీతి కాని కలుగుట లేదు.

6-3)

ఇతర వస్తువుల యందే ఆశ కలుగుతూ ఉన్నది. గనుక ఆ ఇతరములనే 'మనము'గా చేసివేస్తే ఆ ఆశ కలుగదు కదా! మనకంటే ఇతరము లేకపోతే అంతా మనమే అయిపోతే ఆశ##లేదు. ఆశ##లేని కారణంగా యత్నమూ లేదు. ప్రయత్నపూర్వకమైన పాపమూ లేదు. పాపము లేనందున దేహము, దేహము లేనందున దుఃఖము లేవు. మనం చేసే ప్రయత్నాలన్నీ దుఃఖం లేకుండా ఉండాలనే కదా!

'రెండవది'- అని ఒకటి ఉంటే అది మనకంటే శక్తి వంతమైతే దానిని చూచి మనకు భీతి కలుగుతూ ఉన్నది. అది అందంగా ఉంటే మనం దానికొరకు అర్రులు చాస్తున్నాం. రెండవ వస్తువు అనేదే లేకుంటే ఆశ##లేదు, ద్వేషమూ లేదు, భయమూ లేదు. రెండవవస్తువు ఉంటేనే భయము అందుచేత రెండవ వస్తువు లేకుండా చేస్తుంది. అద్వైతం. రెండవది అని లేకపోతే భయం పోతూ ఉన్నదని ఉపవిషత్తులు అంటున్నాయి.

'ప్రపంచంలో ఇన్ని వస్తువులను ఇంతమంది జనులను' ఒకటిగా చూచుట ఎట్లు? అంటే ఇన్నివస్తువులను చూస్తున్నావు కదా! ఇదంతా కల్ల, నీవు చూచేదంతా ఈశ్వరస్వరూపం'- అని వేదాంతం చెపుతూ ఉన్నది. కాని మనకు అట్లు తోచుట లేదు అంతా ఈశ్వరస్వరూపం అనుటయే నిజమైతే మనకు తోచినది కల్ల. మనకు తోచునదే నిజమైతే కష్టం రారాదు. కాని కష్టాలు, సుఖాలు, దుఃఖము, సంతోషము కలుగుతూనే ఉన్నాయి కదా. అందువలన వేదాంతం చెప్పేదే నిజం. అదే నిజమైతే చూచేదంతా ఈశ్వరస్వరూపమే అన్న జ్ఞానం మనలో రూఢం కావాలి.

సత్యమైన వస్తువు ఒకటి ఉన్నది కల్ల వస్తువులను మన కన్నులు చూస్తూ ఉన్నాయి. 'లోకమంతాసత్యమైనవస్తువు'- అని అద్వైతం చెప్పుతూ ఉన్నది. మనకు నానా వస్తువులుగా కనబడేది అంతా కల్ల. సత్యమైన వస్తువు ఒక్కటే సత్యం. ఆ సత్యమే ఈశ్వరుడు. అంతా ఈశ్వరుడే అయితే మనము మాత్రము వేరా? మనలను కూడా ఆ ఈశ్వరునిలోనే కలుపుకొనాలి. అప్పుడు రెండవ వస్తువు లేదు. మన దృష్టి ఎప్పడూ వేర్వేరుగా ఉంటూ ఉన్నది అంతా ఈశ్వరమయంగా చిన్మయంగా చూచుటయే సత్యదృష్టి ఈ అద్వైత దృష్టి అలవరుచుకొన్నవాడు మన కందరకు ఆనందమే కలుగుతుంది.

జాగ్రత్‌ - స్వప్న- సుషుప్తులను అవస్థాత్రయం అని అంటారు. జాగృతిలో అనేక కార్యాలను చేస్తున్నాం. ఈ కార్యాలు శ్రమ కలిగిస్తూన్నాయి. శ్రమ నివారణకొరకు నిదురపోతూ ఉన్నాం. అదే సుషుప్తి. ఈ రెంటికీ మధ్య స్వప్నావస్థ ఒకటి ఉన్నది. ఈ స్వప్నావస్థ ఎందుకు? ఈశ్వరుడు అద్వైతబ్రహ్మగా ఉంటున్నాడు. అంతా ఆత్మస్వరుపమే అని నిరూపించుటకే ఈశ్వరుడు స్వప్నమును కల్పించినట్లు తోస్తుంది. స్వప్నంలో ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాము. ఆ స్వప్నం చెదిరిపోతే ఏదీ మిగులుట లేదు. కడకు స్వాప్నికశరీరము కూడా మిగులుట లేదు. 'కల కన్నాను'- అని చెప్పుటకు తగిన ఒక ఎరుకమాత్రము మిగులుతూ ఉన్నది. ఈ ప్రపంచంస్వప్నం నుండి మనం మేలుకొన్ననాడు మనకు మిగిలేది ఆ ఎరుక ఒక్కటే. అదే అద్వైతం. నూర్ల కొలది, వేల కొలది, అసంఖ్యాకంగా చూచే దృష్టి ద్వైతం. 'చూస్తున్నాము' అని చెప్పుట కూడా ద్వైతమే. మన మందరము ద్వైతులమే. ద్వైతానుభవం మనకు అనుదిన అనుభవముగా ఉన్నది. అద్వైతంలో మనకు నమ్మకమే కాని అనుభవములో ద్వైత స్వప్నాలను కంటున్నాం. ద్వైతం కంటితో చూచేది. శాస్త్ర మూలంగా తెలుపుకొనేది అద్వైతం.

'ద్వైతము- అద్వైతము' అనే శబ్దాలు రెండూ ఉపనిషత్తులలో వస్తూ ఉన్నాయి. ప్రణవమును వర్ణిస్తూ మాండూక్యము - 'శాంతం శివమద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా విజ్ఞేయః' అని చెపుతూ ఉన్నది. బృహదారణ్యకములో -'యత్ర హి ద్వైత మివ భవతి తదితర ఇతరం పశ్యతి యత్ర త్వస్య సర్వమాత్మై వా7భూత్‌ తత్‌ కేన కం పశ్యత్‌? 'అని ఉన్నది.

ఎప్పుడైతే సర్వము ఆత్మయే అయినచో అప్పుడు అద్వైతమనియు, వేర్వేరుగా కనబడినప్పుడు 'ద్వైతమివ' ద్వైతమువలె ఉన్నదనియు ఉపనిషత్తు చెప్పుచున్నది. 'వాడు రానుమునివలె ఉన్నాడు.'- అంటే వాడు రాముడు కాడని అర్ధం. 'ద్వైతమివ'- అని అనుటలో అంతరార్ధము ఇదే. ద్వైతం సత్యం కాదు. ఇవన్నీ ద్వైతమువలె కనబడుతూ ఉన్నాయి కాని నిజమునకు అద్వైతమే సత్యం అదేసిద్ధాంతం. సర్వమూ ఆత్మ అనుటయే యథార్థం.

ఇక్కడ 'ఆత్మ' అని కదా ఉన్నది. పరమాత్మ అని ఉండవలదా? అని ప్రశ్న వేయవచ్చును. పరమాత్మ అని ఒకటి ఉంటే అల్పాత్మ అని మరియొకటి ఉండాలి. అవేవీ లేవు. ఉండేది ఒక్కటే ఆత్మ. జీవాత్మ పరమాత్మల యొక్క ఉనికి ద్వైతములో, అద్వైతములో ఉండేది ఆత్మ ఒక్కటే. 'ద్వితీయాద్‌ వై భయం భవతి'- ద్వైతం వల్ల భయం ఏర్పడుతుంది. కాని ఆభయదాయకమైనది అద్వైతం.

మనకు సన్నిహితులు, సహచరులు, ప్రియమైనవారు, రక్తం పంచుకొన్నవారు కాలగతి చెందితే ఎక్కడ లేని దుఃఖము కలుగుతూ ఉన్నది. ఎదుటివారు చనిపోతే దుఃఖం కాని మనమే పోతే దుఃఖం ఉండదని అనుకొంటాం. ఈ దృశ్యమైన దంతా మనమే అనుకొంటే దుఃఖ మెక్కడ? భేదబుద్ధి ఉన్నంతవరకు దుఃఖం ఉంటున్నది. రెండవ వస్తువు ఉన్నదని అనుకోనుటలో ప్రీతి, వస్తు ప్రాప్తిలో సుఖము, వస్తు వియోగములో దుఃఖము కలుగుతూ ఉన్నాయి. అన్నీ మనమే అయితే గ్రహించుట దేనిని? విడచుట దేనిని? 'కిం గృహ్ణామి, కిం విసృజామి?' అన్నిటిని ఆత్మగా చూచుటయే అద్వైతము, అదే జ్ఞానము.

ఆచార్యులవారు ఆ పరంజ్యోతివంటి అద్వైతజ్యోతిని వెలిగించి, ద్వైతాంధకారములో చిక్కుకొన్న మనకు వెలుగు చూపుతూ ఉన్నారు. వారు వ్రాసిన భాష్యమునకు 'భాష్యదీపము'-అని ఒక పేరు ఉన్నది. ఏదో 'ద్వైతం' అన్న పదం శ్రుతిలో ఉన్నది. కనుక ద్వైతమే నిజమనుట 'న సురాంపిబేత్‌' అన్న నిషేధ వాక్యము శ్రుతిలో ఉన్నది కనుక-'శ్రుతి సురాపానమును విధిస్తూ ఉన్నది.' అనుట వంటిది. మనం ప్రస్తుతం స్వప్నంలో ఉన్నాం. ఈ స్వప్నం నుండి బయటపడితే అది అద్వైతం.

అద్వైతస్థితి- 'యతో వాంచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ' వాక్కుకు మనస్సుకూడా అప్రాప్యమైన స్థితి పరమాత్మను తెలుసుకొనుట అంటే- తెలుసుకొనేవారు ఒకరు, తెలియబడే పరమాత్మ వేరొకటి - ఇలా రెండు ఏర్పడుతున్నాయి. అందులకే కేనోపనిషత్తు- 'యన్మనసా మనుతే యేవాహుర్మనో మతమ్‌'- 'నాకు తెలియును.' అనేవానికి అది తెలియుట లేదు. 'తెలియదు'- అనే వానిచే అది తెలియబడుతూ ఉన్నది'- అని చెప్పుచున్నది. 'తెలియుట లేదు' - అని అంటే అది తెలియబడే వస్తువు కాదు అని అర్ధం. ఒక దీపమును చూపుటకై మరియొక దీపము నర్థించుటలో అర్ధము లేదు. జ్ఞానం స్వప్రకాశకమైనది. ఆ జ్ఞానము రూపొందితే అదే ఈశ్వరస్వరూపము.

మనస్సు యొక్క సాయంతో దానిని చూడలేము, దాని సాయంతోనే మనస్సు చూస్తూ ఉన్నది, కనుక- 'మనస్సు ఆలోచిస్తూ ఉన్నది, అనుటవలన- దేనిసాయముతో మనస్సు ఆలోచిస్తూ ఉన్నదో అదే సత్యం'.

యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః.

-కేనోపనిషత్తు

స్వప్నంలో చూచేదంతా కల్ల. కలకంటూ ఉన్నాము- అన్న ఎరుక ఉన్నదే! అదే సత్యం. కల మరుగైపోతే అన్నీ మరుగైపోయి ఎరుకమాత్రముమిగులుతూ ఉన్నది. చూడబడు వస్తువు, తెలిసికొనవస్తువు అని ఉంటే అది ద్వైతమేకాని అద్వైతం కాదు. ఈవిషయమునే ఉపనిషత్తులు నేనుముందు ఏకరువు పెట్టిన గ్రంథావళి చెబుతున్నాయి.

ఉపనిషత్తులు వేద వృక్షము నందు కుసుమించిన సుమములు, ఈ ఉపనిషత్సుమములను వ్యాస భగవానులు 'బ్రహ్మసూత్రములు' అని సూత్రబద్ధం చేశారు. ఈ విషయమై ఆచార్యులవారు ప్రశంసా పూర్వకముగా' - 'వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్‌ సూత్రాణం'- అని ఒక చోట వ్రాశారు. ఈ పుష్పమాలకు తమ భాష్యసౌరభమును జోడు చేసి ఆచార్యులవారు మనకు అందిస్తున్నారు గనుక, ఆ మాల వాడిపోకుండా మన కంఠసీమలో అనవరతం మనం అలంకరించుకొనాలి.

మనము ఇంత సేపూ చర్చించి తెలిసికొన్న దేమంటే 'సత్య మొక్కటే ఉన్నదని' అది ఈశ్వరస్వరూపము వాననా బలముచేత దానిని వేర్వేరుగా చూస్తూన్నాము అందుచేత అన్నిటిని ఏకము చేసి ఈ 'నేను' అనేదానిని కూడా ఆ ఏకము నందే ఐక్యం చెయ్యాలి. దానికి సాధనములైన శాస్త్రపరిచయము, మనన నిధిధ్యాసనములు అలవరచుకొనాలి. శ్రుతి-స్మృతి-పురాణపఠనములు, ఆలయదర్శనము, ఉపాసన ఇవన్నీ దానికి తోడుపడే సాధనాంగాలు, లోకంలో మనము ఎన్నో వస్తువులను త్యాగము చేస్తున్నాము స్థిరమైన ఆనందము కలుగ వలెనంటే త్యాగము అత్యవసరముజనకుడు-

'విదేహం దదామి మాం చాపి సహదాస్యాయ'

'విదేహ రాజ్యమేకాదు, దానితో కాదు, దానితో బాటు నన్ను కూడా ఇచ్చుకొన్నాను.' అని చెప్పుట ఇదే. అట్టి అద్వైత సిద్ధిని సులభముగా సాధించుట ఎట్లు?

అప్పయదీక్షితులు శివతత్త్వ విలాసములో ఇలా వ్రాశారు.

ఈశ్వరానుగ్రహదేవ పుంసా మద్వైత వాసవా,

మహాభయకృత త్రాణాత్‌ ద్విత్రాణా ముపజాయతే.

ఈశ్వరానుగ్రహము ఉంటేనే కాని అద్వైతవాసన రాదు. అందుచేత ఆ ఈశ్వరునే- ఆ చంద్రమౌళీశ్వరుని పాదాబ్జములనే మనము అద్వైతసిద్ధి కొరకు నమ్ముకోవాలి.

'చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం.'


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page