Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

స్వామి ఆకం్షణ

ఆర్థర్‌ కోయిస్లర్‌ ప్రఖ్యాత రచయిత. మాజీకమ్యూనిష్టు. దీర్ఘకాలం రాజకీయాలలో చిక్కుకొన్న ఇతనికి ఎందుచేతనో, మతంపై మనసుపోయింది. వివిధమత పరిశీలన చేద్దామనే ఉద్దేశంతో భారతదేశం వచ్చాడు.

కోయిస్లరు సందర్శించినవారిలో ఆచార్యుల వారొకరు. తన అనుభవాలను ఇతడు'దిలోటస్‌ అండ్‌ ది రాబట్‌' అను పుస్తకంలో వ్రాసుకొన్నాడు. ఈక్రింది వ్రాసినది ఆపుస్తకము నుండి సంగృహీతం.

'గుడిప్రక్క శిధిలమైన ఇల్లు. మేము ఇంటిలోనికి వెళ్ళాలి. మా ముందు చీకటి, ఇరుకైనసందు, కొంతదూరంలో మేనా కనపడుతోంది. పంచపాళిని ఆనుకొని ఒక చిన్నగది. అక్కడ వేసిన చాపపై ఆసీనులయ్యాం. మేనాలోనుంచి కుంకుమపువ్వురంగు శాలువతో శ్రీశంకరాచార్యస్వాములు బయటకు వచ్చారు. సన్నగా ఉన్న స్ఫురద్రూపం. మాగదికి వచ్చి ఆసినులై నన్ను పరకాయించి చూచారు. గదిలో ఉన్నవారంతా లేచి సందుదారిలో నిలబడ్డారు. వివేకానందకళాశాలకు చేరిన వేదాంతోపన్యాసకులు మా సంభాషణ తర్జుమాకు పూనుకొన్నారు.

అర్థనిముషం మౌనం వహించారు. అపుడు ఆయన ముఖంలోని అప్రతిమాన తేజస్సును అవలోకించాను. ఆయన వదనం తపశ్చర్యచే వాడివున్నది. కాని నేత్రాలుమాత్రం కాంతిపుంజములగ నున్నవి. పెదవులు మెల్లమెల్లగా కదులుతున్నాయి.

''మీరు ఇండియాకు ఏనిమిత్తం వచ్చారు?''

ఈ దేశాన్నీ ప్రజలనూ చూడటానికి వచ్చారా లేక వారికేదైనా మంచిమార్గం చూపెట్టడానికి వచ్చారా?

''ఈ దేశంలోని వారిని గూర్చి తెలుసుకోడానికే వచ్చాను.''

''ఒక్కొక్కరి సత్సంకల్పానికే పరిస్థితులు మార్చేంతటి శక్తి ఉంటుంది. అపుడు ఆ వ్యక్తి చేయవలసినదంటూ ఏమీ ఉండదు.''

'ఔను, నేనూ అదే అనుకొంటున్నా, మననీడ మనలను వెంటాడుతూనే ఉంటుంది కదా!'

స్వామి ప్రశాంతత, వారి నవ్వూ నన్ను అట్లే ఆకం్షించింది. అట్టి అమాయకమై నవ్వును నా జీవితంలో నేను చూచి ఎరుగను. ఆ నవ్వులో ఏదో సమ్మోహనం, ఏదో ప్రేమశక్తి ఓతప్రోతంగా ఉంది. ఆ ముఖమండలంలో ఒక దైవత్వం ప్రస్ఫురిస్తోంది. అఖండమైన జాలీ, అనురాగమూ ఉట్టిపడే, ఏసుక్రీస్తుముఖాన్ని చిత్రాలలో చూచి ఆశ్చర్యపడ్డానుకానీ, ఈ వశీకరణశక్తిని అక్కడ చూచానా అని సందేహిస్తున్నా.

''హిందూ ఆలయాలలో ప్రశాంతత లేదు. గంటల గణ గణ చెవులు గింగురమనే మేళతాళాలు, మరి ధ్యానానికి ఈ చోట్లలో వీలుంటుందా?''

'నిజమే. హిందువుల ఆలయపద్ధతులకూ ఇతర మతస్థుల పూజావిధానాలకూ చాల వ్యత్యాసం. హిందువుల ఆలయానికి వెళ్ళటం, భగవంతుడికి తమ కృతజ్ఞతను తెలుపుకోడానికి తమ ఋణాన్ని తీర్చుకోడానికి. ధ్యానానికి అందరి ఇళ్ళలోనూ, పూజామందిరా లుంటవి. అక్కడ ప్రశాంతంగా వాళ్ళు ఆరాధిస్తారు.''

''కొందరిని చూచి వీరు ఆత్మజ్ఞానం కలవారు అని చెబుతారుకదా! అటువంటివారిని కనుగొనటం ఏలాగు? దేనినిబట్టి వారు జ్ఞానులని నిర్ణయించడం?''

''వారి వారి మనఃస్థితి ముఖంలోనే తెలిసిపోతుంది. హంతకుడిని చూచి వీడు హంతకుడనీ, కోపిష్టిని చూచి వీడు కోపిష్టి అని చెప్పినట్లే, ఆత్మజ్ఞానులను వారి ముఖాన్నిబట్టే నిర్ణయించవచ్చు.''

ముఖం చూచి ఆత్మజ్ఞానిని నిర్ణయించవచ్చు అని ఈయన అంటున్నారు. ఈ మహాత్ముడు తాను అట్టి ఆత్మజ్ఞాని అని తెలుసుకొన్నారా? కొట్టవచ్చే తేజస్సు ఆయన ముఖంలోనే ప్రకాశిస్తోందని ఆయన ఎరుగునా? అని అనుకొన్నాడు కోయిస్లరు.

ఆర్జెంటీనా నుంచి మిస్‌. యూగినాబోర్లినీ అనే ఒక యువతి స్వాములవారు ఇలయాత్తం గుడిలో ఉన్నపుడు వచ్చింది. 'నేను ప్రపంచంలో పెక్కుదేశాలు చూశాను. అనేకమైన అద్భుతాలు, ఆకాశాన్ని అంటే భవనాలూ చూచాను. కాని ఈ కుగ్రామంలోని సహజ సౌందర్యం, రామణీయకత, ప్రశాంతతా ఎక్కడా చూడలేదు'. అని ఆమె అనింది.

శంకరాచార్యులవారిని గూర్చి- 'ఆయన దర్శనం నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం. ఆయన భూమికి దిగివచ్చిన ఏసుక్రీస్తే. ప్రేమస్వరూపి ఐన స్వామివద్ద నుండి నేను జ్ఞానబోధలనూ, కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలనూ, అవగతం చేసుకొన్నాను.' అని ఆమె చెప్పుకొన్నది.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page