Maa Swami    Chapters   

ఓమ్‌

శ్రీ జగద్గురుభ్యోనమః

7.జగద్గురుబోధలు

శంకరభగవత్పాదుల జగద్గురుత్వము

తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆదిశంకరులు మరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవంపోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం చేశారు. వారి సేవకు కృతజ్ఞత చూపేందుకు మనం ఏటేటా వారి జయంతులు జరుపుకొంటున్నాం. ఇది మన కనీసధర్మం. వారి జయంతి వైశాఖశుద్ధ పంచమినాడు వస్తుంది. ఆరోజు శంకరుల ప్రతిమకు అష్టోత్తరశతనామావళితో అర్చనచేసి హోమం చేస్తున్నాం. అష్టోత్తరశతనామావళితో బాటు మరో ఎనిమిది నామాలు, 'భవాయదేవాయనమః' శర్వాయ దేవాయనమః' అన్న నామావళి కలుపుకొని మొత్తం , 116 నామాలతో జగద్గురువులను అర్చిస్తున్నాం. ఆంధ్రదేశంలో నూటపదహార్లతో సన్మానం చేయడం మరి ఆచారమేకదా!

ఆదిశంకరులకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆరువేలమంది ఉండేవారని ప్రతీతి. అందులో నలుగురు ప్రధాన శిష్యులు. వారే పద్మాపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలచార్యులు, ఈ నలుగురినీ నాలుగు ప్రధాన పీఠములలో- శృంగేరి, ద్వారక, పూరి, బదరికాశ్రమం- నియమించారు. వీరిలో తోటకాచార్యులవారికి చిన్నతనంలో అందరికంటే తెలివితక్కువ. భగవత్పాదుల పూజకు కావలసిన సామాగ్రి- బిల్వపత్రం, పూలు, పాలు, పండ్లు- ఏర్పాటు చేసేపని వారిది. ఒకరోజు కార్యవ్యగ్రులై పాఠమునకు ఆలస్యంగా వచ్చారట. పుష్పావచయంలో ఉన్న ఆసక్తి వారికి చదువులో ఉండేది కాదు.

ఎంత ఆలస్యమైనా తోటకాచార్యులు వచ్చేవఱకు ఆచార్యపాదులు పాఠం మొదలుపెట్టేవారు కారు. అట్లాకాచుకొనివుండి చెప్పినా ఆయన మెదడుకు ఎక్కేదికాదు.ఇది చూచి ఇతరశిష్యులు తోటకాచార్యులను చులకనగా చూచేవారు. విషయగ్రహణశక్తియే లేనివానికోసం ఆచార్యులవారు వేచిఉండటం వారికంతగా రుచించేదికాదు. గురువు అంటే తిరస్కారం కాదు, ఒక ఔదాసీన్యం వాళ్ళలో అప్పుడపుడూ ఈ కారణంగా కనిపించేది.

సర్వజ్ఞులైన శంకరులు దీనిని గ్రహించారు. ఒకరోజు బిల్వపత్రంకోస్తూ ఒళ్ళుమరచి నిలుచున్న తోటకాచార్యులలో తమ దివ్యశక్తిని నింపారు. అంతటితో అమాంతంగా బుద్ధివైభవం, వాక్పటుత్వం, కావ్యరచనాశక్తీ తోటకాచార్యులవారికి కలిగింది. ఇతర శిష్యులతోబాటు ఆచార్యులవారు మందమతి అయిన శిష్యునికోసం వేచివున్నారు. ఇంతలో ఆ మొద్దబ్బాయి నెత్తిన పూలబుట్టపెట్టుకుని ఆనందంతో నర్తనంచేస్తూ వచ్చాడట. గురువుగారిని చూడగానే ఆశువుగా, లయబద్ధమైన వృత్తంలో ఒకఅష్టకం చదివాడట. ఈ స్తోత్రంవిన్న ఇతరశిష్యులు, ఆశ్చర్యమగ్నులయ్యారు.

వారినోట వెలువడిన శ్లోకాలకు తోటకాష్టకమని పేరు. ఈ తోటకాష్టకం, గానానికీ అభినయానికీ అనుకూలంగా ఉంటుంది. ఈ స్తోత్రం అర్ధసౌందర్యంతో, శబ్దాలంకారాలతో, సర్వాంగసుందరంగా ఉంటుంది. భగవత్పాదుల మహిమను వర్ణిస్తూ ఈ స్తుతిలో శ్రుతిస్మృతి పురాణాది వాజ్ఞ్మయానికి నెలవైన వారి సర్వతోముఖప్రతిభను పొగడటమేకాక, కరుణావరుణాలయమైన వారి హృదయ సౌందర్యానికి కైమోడ్పునిచ్చారు. రెండుచోట్ల 'భవ ఏవభవాన్‌' అనియూ, 'పుంగవకేతన' అనియూ పదప్రయోగంచేసి ఆదిశంకరులు సాక్షాత్తు శివస్వరూపులని వర్ణించారు. తోటకాచార్యులు వ్రాసిన వృత్తములు ఆనాటినుంచి తోటకావృత్తములని వ్యవహరింపబడినవి.

ఈ ఎనిమిది శ్లోకాలూ శంకరజయంతినాడు పఠించి శిష్యులందరూ ఆచార్యులవారికి ఎనిమిది నమస్కారాలు చేయడం ఆచారమైంది. ఆదిశంకరులను జగద్గురువులని అంటున్నాం. అంటే జగత్తుకంతటికీ గురువులన్నమాట. ఈ బిరుదును ఈనాడు ఆయన స్థాపించిన ప్రతిపీఠాధిపతికీ వ్యవహరిస్తున్నారు. అందరు పీఠాధిపతులూ జగద్గురువులే. ఒక జగత్తుకు ఇంతమంది జగద్గురువులా? ఇదెట్లా సమన్వయమౌతుంది. ఈనాడు ప్రపంచంలో అద్వైతమతమేకాక ఎన్నో మతాలున్నాయి. ఆ మతాల వారంతా వీరిని జగద్గురువులని ఒప్పుకోవాలిగదా! ఒప్పుకోవటంలేదే? మరి జగద్గురువు అన్నమాట వెక్కిరింతగా మారటంలేదా? నిజమే. అలా అనకూడదు. వాస్తవానికి అది దూరం. ఈనాడు దేశములో ద్వైతం, విశిష్టాద్వైతం, వీరశైవం, జైనం, క్రైస్తవం, ఇస్లాం- ఇన్ని మతాలున్నాయి. ప్రతిమతమూ తమ శ్రేష్టత్వం ఉగ్గడిస్తుంది. కొందరు మా మతంలో చేరితే మీరు నేరుగా స్వర్గం వెడతారు, లేకపోతే శాశ్వత నరకమే, (Eternal Hell) అని అంటారు.

అట్లా చెప్పేవారి మతం రెండువేల ఏళ్ళకు ముందు పుట్టింది. మరివారు చెప్పేదే నిజమైతే వీరిమతం పుట్టకముందు ప్రపంచంలో ఉన్న ప్రాణులంతా ఏమైనట్లు? అంతకుముందు ఆ మతం లేదుకనుక స్వర్గనరకాలు లేనట్టేనా? అప్పటి మానవాళి అంతా మరణానంతరం ఏమైనట్లు? శంకరాచార్యుల వారిని జగద్గురువులంటున్నాం. వారికాలంలో అద్వైతమతం ఒక్కటేనా ఉంది? ఇతర మతాలుకూడా ఉన్నాయికదా? వీరి జగద్గురుత్వాన్ని ఇతరమతాలు అంగీకరించాయా? లేదే? మరి వారెలా జగద్గురువులయ్యారు? నేను వారిమతంలోనే ఉంటూ, ఆచార్యులవారి జగద్గురుత్వాన్ని ప్రశ్నిస్తూ పూర్వపక్షం చేస్తున్నాను. అందులోనూ ఆ మహానుభావుని జయంతి సందర్భంలో ఆయన గొప్పతనాన్ని శంకించటం అపచారం కదూ?

ఆదిశంకరులకు పూర్వం మరెవరైనా జగద్గురువులని కీర్తింపబడ్డారా?

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణంవందే జగద్గురుం

అన్నశ్లోకం శ్రీకృష్ణపరమాత్మకూడ జగద్గురువని తెలుపుతున్నది. శ్రీకృష్ణుని కాలంలో వైదిక మతం కాక మరేమిలేవా? మత సంఘర్షణ అప్పుడు లేదా? త్రయీ, సాంఖ్య, యోగం, మొదలైన మతాలుండినట్లున్నదే? మరి శ్రీకృష్ణుడు వీనినంతా ప్రచారం చేశాడా? ఏదో ఒక మతాన్ని నమ్మి ప్రచారంచేసే జగద్గురువు ఇన్ని మతాలను ఎలా అభిమానిస్తాడు? కాగా ఇన్ని మతాలున్నపుడు ఒక్క మతానికి చెందినవాడు జగద్గురువని ఎలా అనిపించుకోగలడు? మత గురువుగా ఆయన వేదాలకూ, వేదాంతానికీ ఏమి భాష్యాలు వ్రాశారు? ఏదో కౌరవపాండవ యుద్ధానికి సారధ్యం నడిపిన కృష్ణుడు జగద్గురువేమిటి? ఆచార్యుల గురుత్వమే సందేహంలో ఉన్నపుడు, ఇప్పుడు కృష్ణుల జగద్గురుత్వమూ సంశయములోని కొచ్చింది. ఏమిదారి?

శ్రీకృష్ణునికాలంలో యోగం, సాంఖ్య, పాశుపతం అనే మతాలున్నాయి. అసలు మన పురాణాలలోనే బృహస్పతి అనే మహామేధావి ఒక నాస్తికమతాన్ని బార్హస్పత్యమని సృష్టించి ప్రచారం చేసినాడు. ఈనాటి మెటీరియలిజం- ఆనాటి బార్హస్పత్యమే. అందులో మేటర్‌కే ప్రధానం. ఇట్లా కృష్ణునినాడు కూడా అనేక మతాలున్నాయి. శ్రీకృష్ణుడు ఆ మతాలను ప్రచారం చేయలేదు. మరి ఆయన జగద్గురువు ఎలా అయ్యాడు? ఇందుకు గీతలో చక్కని సమాధానాలు కనిపిస్తవి.

భగవద్గీత వేదోపనిషత్సారం. కఠ, ముండకో=పనిషత్తులలోని వాక్యాలనే గీతలో శ్రీకృష్ణుడు నిబద్ధించాడు. ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చును. కాగా మత గ్రంథకర్తగా కూడా ఆయనను పేర్కొనవచ్చును. గీత, వేద, వేదాంత ఆగమశాస్త్ర పురాణాదులు తరచి వడగట్టినసారమే.

అందులోనే పరమాత్మ ఏయేమతాలను ఎవరెవరు అనుసరిస్తున్నారో, వారికి ఆయామతాలలో శ్రద్ధాసక్తులనూ, విశ్వాసాన్నీ వృద్ధి పొందిస్తున్నానని కంఠోక్తి గావించారు. అసలు మతమన్నదానికి పునాదిరాయి విశ్వాసం. మతమనే మాటకు అర్ధమే అది. అలాంటి శ్రద్ధనూ, విశ్వాసాన్ని ఆయామతస్థులకు శ్రీకృష్ణుడు కలిగించాడంటే, ఆయన జగద్గురువుకాకుండా ఎట్లా ఉంటాడు?

మరి శంకరభగవత్పాదులమాట ఏమి? వారి జగద్గురుత్వం తర్కానికి నిలబడుతుందా? నేనూ ఆకోవకు చెందిన వాడిని కనుక, వారి జయంతి జరుపుకొంటున్నాముకనుక, ఎలాగో కష్టపడి దానిని సమర్థించాలి?

ఆచార్యులవారి కాలంలో అనేకమతాలున్నాయి. వారు ప్రచారంచేసింది అద్వైతం.అదికాక ఆనాడు పూర్వమీమాంస, బౌద్ధం, జైనం, చార్వాకం (బార్హస్పత్యం) పాశుపతం, శాక్తం, కాపాలికం మొదలైన వైదిక, అవైదిక మతాలుండేవి. అయినా వారు జగద్గురువులే. ఆదిశంకరులకు షణ్మతస్థాపనాచార్య అనె బిరుదుకలదు. వారుచేసిన చమత్కారం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు మతాంతరాల ఉనికిని ప్రత్యేకంగా అంగీకరిస్తూ తాను వానికంతటికీ మూలమని నిరూపించుకొన్నారు. కాగా మన ఆచార్యులు ఒకమెట్టు పైకి వెళ్ళి, ఇతరమతములకూ, తమ వైదిక అద్వైతానికీ చక్కని సమన్వయం సాధించారు. చార్వాకం, విజ్ఞానవాదం మొదలైనవానిలో ప్రతిదానిలోనూ అంతోఇంతో అర్ధంలేకపోలేదు. ఏ మతానికి తగిన తర్కపాటవం, ఆ మతానికి ఉండనే వుంటుంది. తర్కం అంటే బుద్ధికి ఒరిపిడి. అది త్యాజ్యం కాదు. ఒక ఆలోచన, చింతన చర్చజరిగేందుకు కొంతప్రయత్నం పట్టుదల, బుద్ధివైభవం అంటూ ఉండకతప్పదు. దాని పర్యవసానం ఎలావున్నా, ఆ ప్రయత్నం, వారిబలం. దానిలోని మంచీ- పరిమితమైనాసరే- సోమరితనంకంటే మేలేకదా? దానిని మనం ఎందుకు తిరస్కరించాలి? గర్హించాలి? అంతవరకూ దానిని స్వీకరించవలసినదేకదా?

ఇట్టి వాస్తవికదృక్పథంతో ఆదిశంకరులు, ఇతర మతాలనన్నిటినీ, ఒక నిశ్శ్రేణి (నిచ్చెన) గా గ్రహించి, క్రింద మెట్లు ఎక్కితే కానీ పై మెట్టు చేరుకోలేమనీ, భౌతిక విజ్ఞానవాదం చేసే మతాలన్నీ అద్వైతస్థితికి తీసుకొనిపోయే సోపానాలనీ, వివిధ ఉన్నతోన్నత దశలనీ,సిద్ధాంతీకరించి షణ్మతస్థాపనాచార్యులయ్యారు. వారి మతానికి, శ్రుతిస్మృతి పురాణాదులు ఆధారం. దాన్నే స్మార్తం అనీ శంకరమతానుయాయులను స్మార్తులనీ అంటాం. ఇందులో సంకుచితత్వానికి తావేలేదు. ఈనాడు స్మార్తులలో నిలువుబొట్టువారు, అడ్డబొట్టువారు, విభూతిధారులూ, అంగారతిలక ధారులూ ఉండేందుకు వీలుంది. శివకేశవులు, సూర్యుడు, శక్తి, గణపతి వీరంతా స్మార్తులకు వందనీయులు. భగవత్పాదులవారు నిర్గుణోపాసనగూర్చి దర్శన గ్రంథముల వ్రాయుటేకాక, సగుణోపాసనకు ఉపయుక్తములయ్యే చక్కని స్తోత్రరత్నా లెన్నో వ్రాశారు. ఇట్లా అన్ని మతాలనూ అంతర్లీనం చేసుకొని అద్భుత ప్రాణశక్తితో వెలుగొందే విశ్వమానవమతాన్ని స్థాపించిన ఆచార్యులు జగద్గురువులగుటలో ఏవిధమైన సందేహమూ లేదు. అందుచేత శంకరభగవత్పాదుల జగద్గురుత్వం తిరుగులేనిది.

Maa Swami    Chapters