Maa Swami    Chapters   

9.హిందువుల ధర్మము

మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'హిందూకో హిందూ బన్‌నా చాహియే' ఇదే ఈరోజు అన్నింటికన్న ముఖ్యమైన విషయం. భూలోకంలో అనేక ఖండములున్నవి. అనేకదేశములున్నవి. ఆయాచోట్ల అనేక దేశములలో ఈనాడు హిందువులు నివసిస్తున్నారు. ఆఫ్రికాలో మారిషస్‌ దీవులలో మలయా, సింగపూరు, ఇండోనేషియా, కెనడా మొదలైన ఖండాంతరాలలో, ద్వీపాంతరాలలో హిందువులు వ్యాపించి వున్నారు. విశ్వహిందూ పరిషత్తు అని అన్నపుడు దానిలో ప్రపంచంలోవున్న హిందువులంతా భాగస్వాములవుతారు. వారందరికీ అందులో సభ్యత్వం, ప్రాతినిధ్యం ఉన్నట్లే.

ఇంతకూ ఈ పరిషత్తు లక్ష్యమేమి? ఆదర్శాలేమి? సామాన్యముగా జాతులవారీగా ఏర్పడే ఈలాంటి సంస్థలన్నియు, తమ తమ జాతివార అభ్యుదయానికీ, సుఖ జీవనానికీ కృషి చేస్తూ ఉంటాయి. వారలలో పరస్పర ప్రేమ, సద్భావములు నెలకొనడానికీ, ఆ జాతికిచెందిన వారందరూ ఒకే కుటుంబముగా జీవించడానికి, అనువైన కార్యక్రమములు తలపెట్టి నెరవేర్చు కొంటాయి. ఈనాడు విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మధ్యకూడా ఒక సహకారభావం, సదవగాహన, సహానుభూతీ మొదలైనవి నెలకొనాలి. చీకటి, వెలుగు, రాత్రి, పగలు, కష్టము, సుఖము, ఈ ద్వంద్వములు అందరికీ సహజములు. వీనిని ప్రతి ఒక్కరూ తనతోటి సోదరునితో కలిసి పాలు పంచుకోవాలి. ఒకరి ఇంట్లో వివాహం జరిగితే అతని జాతికి చెదిన వారంతా ఆ సంతోషాన్ని పంచుకోవాలి. అలాగే కష్టము వచ్చినా పొరుగువారు వెళ్ళి అతనిని ఆదుకోవాలి. కష్టాన్నీ, సుఖాన్నీ పంచుకోవటం అంటే ఇదే.

ఒక కుటుంబములోని వారు కష్టసుఖాలను ఎలా సమంగా అనుభవిస్తారో, అలాగే ఒక జాతివారు, ప్రాంతాలవారు, దేశాలవారూ తామందరూ ఒకే కుటుంబమని భావించి పరస్పరసహకారం అలవాటు చేసుకోవాలి. ఒక జాతిలోని వారిలో ఏ కొద్దిమంది మాత్రమో సంపన్నులై మేడలలో, మిద్దెలలో వుంటే చాలదు. వారు తమ జాతికి చెంది కడుపేదస్థితిలో నున్న బహుసంఖ్యాకులకు సహాయపడాలి. అందరూ, అందరికీ ఆర్ధికంగా సహాయపడగల్గిన స్థితిలో లేకపోవచ్చును. ఆయినా 'వాడు మనవాడు. ప్రస్తుతం కష్టంలో ఉన్నాడు. వాని కష్టాలు తీరిపోవాలి' అనే భావమైనా పొరుగు వారిపట్ల మనకు ఉదయించాలి. అటువంటి భావమున్నా చాలు. వస్తురూపంలోనే సహకరించనక్కరలేదు.

తోటివాని క్షేమాన్ని ఆకాంక్షించే ఈ భావాన్ని ప్రేమ అని చెప్పవచ్చును. ఒకనిమీద ప్రేమ వుంటేకానీ, అతని క్షేమమును మనస్ఫూర్తిగా కోరలేము. కనుక హిందువులమైన మనకు ఈ పరస్పర ప్రేమభావం అంకురించాలి. మారిషస్‌లో హిందువులున్నారని అనుకోండి వారికి ఏదో కష్టం కలిగింది. వారికష్టం తీర్చడానికి మనవద్ద డబ్బులేకపోవచ్చు. అన్నానికే బాధ పడుతున్న మనం వారికి ఆహారసహాయం చేయలేకపోవచ్చును. అయినప్పటికీ, వారి కష్టం తొలగిపోవాలి అని మనం భగవంతుని ప్రార్ధించవచ్చును. ఆ విధంగా పరోక్షంగానేనా వారికి మనశ్శాంతిని కలిగించవచ్చు.

ఈలాంటి పరస్పర ప్రేమ ప్రపంచంలో ఉన్న హిందువులందరిలోనూ కలుగచేయడమే విశ్వహిందూ పరిషత్తుయొక్క లక్ష్యం. మరొక విషయంకూడా వున్నది. వెనుకటి రోజులలోనేకాక, ఈనాడు కూడ కారణాంతరాలచేత ఎంతోమంది హిందువులు మనమతంవదలి అన్యమతాన్ని స్వీకరిస్తున్నారు. వారు ఏ కారణంచేత, ఏ ఆకర్షణచేత ఇతర మతాలకు వెళ్ళుతున్నారో గమనించాలి. వాళ్ళకు ఏ కష్టాలు కలిగి, ఏ విషయాలు నచ్చక, మనమతం వదలిపెట్టి పోతున్నారో గమనించి, వీలైనంతవరకు ఆ కారణాలు తొలగించి వారిని మనమతంలో నిలుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మన మతస్థులను మతేతరములకు వెళ్ళనీయక ఆపటం, ఆ మతాలతో సంఘర్షణ పడటం కాదు. ఇతర మతాలనూ, మతస్థులనూ ద్వేషించమనీ కాదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోవటం. పరాయివారిని ద్వేషించికాదు. ఇందుకు ప్రధానం హిందువులయిన వారు తమ ధర్మాచరణను పట్టుదలతో చేయటమే.

ఈనాడు హిందువులలో నాస్తిక్యము, ధర్మవిరోధ ప్రవృత్తీ ప్రవేశించినవి. వాటిని మనం అరికట్టాలి. విదేశాలలో రెండుకోట్లమంది హిందువులున్నారు. ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాలక్రింద వారు వలస వెళ్ళారు. వాళ్ళలో చాలమంది తమ ఆచార వ్యవహారాలనూ, ధర్మవిహితమైన సంస్కారలనూ, మరచిపోయారు. హిందువులము అన్న భావం ఒకటి మాత్రం వారిలో నిలిచివుంది. అలాంటి వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ సంస్కారాలు, ఆచారాలు నేర్పాలి. ఇది విశ్వపరిషత్తు చేయవలసిన ముఖ్యకార్యములలో ఒకటి.

బయటి దేశాలలో వుండే హిందువుల యోగక్షేమాలతో బాటు మనదేశంలో మారుమూలలలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి నగరంలోనూ వుండే హిందువుల కష్టసుఖములు తెలుసుకొని వారి శాంతి సాధనములు అన్వేషించాలి. ఈ సంస్థ అందుకు పాటుపడాలి. ఈనాడు గిరిజనులున్నారు. మురికి గూడెములలో ఉండే వారున్నారు. వారందరి క్షేమములూ తెలుసుకోవాలి. ఇటీవల అస్సాంలో నాగాలు, మిజోలు అనే గిరిజనులు చాలమంది మతం మార్చుకొన్నారని విన్నాము. వారి మాదిరి కాకుండా మతం మార్చుకోని వాళ్ళున్నారు. వాళ్ళకు సంబంధించి జనాభా లెక్కలు వగైరా తెలుసుకుని కనీసం వారినైనా రక్షించే యత్నం చేయాలి. నేఫా ప్రాతంలో పరశురామకుండమని ఉన్నది. అక్కడ శివరాత్రికి ప్రతి సంవత్సరమూ వేలాది జనం స్నానానికీ, దేవదర్శనానికీ సమావేశమౌతారట. ఆ పుష్కరిణికి జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టి పూర్తిచేయాలి. అలాగే కన్యాకుమారివద్ద ఇతర మతంనుంచి హిందువులుగా మారి, తమకు ఆలయంలేదనీ అది కావాలనీ అడిగారట. ఆలయాలు ఉన్నచోట హిందువులు అక్కడకు వెళ్ళటం మానివేశారు పాపం. అధీవరులు, తమచుట్టుపట్ల ఉన్న అన్యమత ప్రభావానికి లోనుకాకుండా ఉండి తమకు ప్రార్ధనాదికాలకు దేవాలయం కావాలంటున్నారు. అది వారి కనీసపు కోరిక. దానిని తీర్చవలెను.

మనదేశంలో వుండేవాళ్ళను, క్రైస్తవమతంలోకి త్రిప్పుకునేందుకు ఎన్నో మిషన్లు పనిచేస్తున్నవి. దానిలో ప్రతి సంస్థ ఏడాదికి ఒకమారు తాముచేసిన ప్రయత్నాలుగురించి ఒక రిపోర్టు ఇంగ్లండులో ఉన్న తమ ప్రధానకార్యాలయానికి పంపాల్సివున్నది. దానిలో ఒక సంస్థ మిషనరీ తనరిపోర్టులో ఇలావ్రాశాడట.

''భారతీయులను క్రైస్తవులుగా చేయడం రెండు మార్గాలలో జరగవలసి వున్నది. మొదట భారతీయులకు తమ మతంపట్ల అభిమానం నశించేటట్లు చేయడం, ఇందువల్ల నూటికి యాభైపాళ్ళు మనలక్ష్యం నెరవేరినట్లే. రెండవదశ, ప్రత్యక్షంగా వారిని మతాంతరులుగా చేయడం. ఈ కార్యక్షేత్రంలో మొదటిమార్గంలో యాభైపాళ్ళు విజయం సాధించాను. ఇంక మతాంతరీకరణం లాంఛనప్రాయంగా జరగవలసిన విషయం. దానితో పూర్తి విజయం సాధించినట్లే.''

ఈ మిషనరీ చెప్పినది నిజమే! ఒకనికి తన మతంలో విశ్వాసమూ, భావమూ లేనపుడు వాడు మతంలో లేనివాడే ఔతున్నాడు. ఇతరమతాల వారికంటే, మతంలోనే ఉంటూ విశ్వాసం లేకుండా ప్రవర్తించేవాడు మతానికి చేసే గొప్ప హాని.

ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. 1937లో మద్రాసులో, కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రధానమంత్రి రాజాజీ. ఆ రోజులలో ఈ విషయం జరిగింది. మనలో 18 ఏండ్ల లోపలున్న పసిపిల్లలు నేరాలుచేస్తే వాళ్ళను పట్టుకొని స్కూళ్ళలాంటి జైళ్ళలో పెడతారు. వయస్సులో చిన్నవాళ్ళు కనుక, పెద్దవాళ్ళయిన ఖయిదీల మాదిరికాక, వాళ్ళలో మానసిక పరివర్తన తెచ్చుటకు నీతివిషయాలు బోధిస్తూ వుంటారు. అది మొదటినుంచీ వస్తున్న విషయమే. కానీ అంతవరకు ఇంగ్లీషువాళ్ళ పాలన వుండేది కనుక, ఈ నీతులను బోధించేవారు క్రైస్తవమిషనరీలు, ఆ రోజులలో మనం ఏమీ అనేందుకు వీలు ఉండేదికాదు. ఇక కాంగ్రెసు అధికారంలోకి రాగానే మనకు కొన్ని అధికారాలు లభించాయి.

రాజాజీ ఆ బాలనేరస్థులకు నీతిబోధచేసే విషయంగూర్చి బాగా ఆలోచించారు. సామాన్యంగా మనదేశంలో హిందువులు హెచ్చుకనుక, బాలనేరస్థులలోనూ హిందువులసంఖ్య హెచ్చుగా వుండేది. అందరికీ క్రైస్తవకథలూ, నీతులూ ఉపదేశించడానికి బదులు, ఏమతం వాళ్ళకు ఆ మతానికి చెందినవారిచేత నీతిబోధ చేయిస్తే మంచిదని, వారానికి ఒకరోజు ఆ బాలనేరస్థులకు, నీతిబోదకై సెలవుఇచ్చే ఏర్పాటు చేశారు. మహ్మదీయబాలురు తమకు శుక్రవారం ముఖ్యం కనుక ఆరోజు సెలవు ఇవ్వవలసినదని కోరారు. ఆరోజు మసీదుకు వెళ్ళి నేర్చుకొంటామన్నారు. క్రైస్తవులు తమకు చర్చికి వెళ్లడానికి ఆదివారం సులువుగా వుంటుందని ఆరోజు సెలవు కోరారు, హిందువులను అడిగితే వారికి ఏరోజు చెప్పడానికీ తోచక, మాకూ ఆదివారమే ఇవ్వండి అని అడిగారు. సరే ముగ్గురునీ వదిలారు. మహమ్మదీయ మౌల్వీవచ్చి, వాళ్ళను మసీదుకు తీసుకొని వెళ్ళాడు. క్రైస్తవులేమో చర్చికి వెళ్ళారు. హిందూబాలురను తీసుకొని పోయిన పెద్దమనిషి వారితోబాటు సినిమాకు వెళ్ళాడట! ఇది చాల దయనీయమైన స్థితి.

దీనినుంచీ మనం బయటపడాలి. ఇప్పుడిప్పుడు కొన్నిచోట్ల జైళ్ళలో ప్రార్థనలూ, భజనలూ జరగడం ప్రసాదం పంచిపెట్టడం లాంటి పనులు ప్రారంభమవుతున్నాయి. హిందువులకు తమ మతంగురించి జ్ఞానం లేకపోవటం అటుంచి దానిపై ప్రేమభావంకూడా లేనందున, ఆ ఫాదిరీ తన రిపోర్టులో ఆ విధంగా వ్రాశాడు. ఈ పరిస్థితి పోవాలి. అంటే మనం మొదట హిందువులమని గుర్తించాలి. ఇతర మతాలవారిని మన మతంలోనికి మార్చుకోవలసిన అవసరం లేదు. హిందువులు హిందువులుగా మారితే చాలు. అందుకు మనమేమి చేయాలి?

విశ్వహిందూపరిషత్తు యొక్క పేరు, విశ్వధర్మంగా వెలసిన హిందూమత ప్రాభవానికి అనుగుణంగానే వుంది. అయితే ఈనాడు అది చాలభాగం మాసిపోయింది. దానిని మనం బాగు చేసుకోవాలి. మనలోని లోపాలను ఆత్మపరీక్ష చేసుకొని పోగొట్టుకోవాలి. ఇది ఎట్లా సాధ్యం?

మన ధర్మశాస్త్రాలలో విశేషధర్మాలనీ, సామాన్య ధర్మాలనీ రెండు రకములున్నవి. వర్ణాశ్రమ వ్యవస్థను పాటించే వారికి విశేషధర్మాలున్నాయి. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలి. అధ్యయనం చేయాలి. ఇవి విశేషధర్మాలు. వర్ణాశ్రమ వివక్షతలేక, మానవమాత్రులందరూ అనుష్ఠించదగినవి సామాన్యధర్మాలు. ఇవి హిందువులకే కాక, మానవులందరికీ అనుష్ఠేయాలు. 'ఏతాన్‌ ధర్మాన్‌ సమాసేన' అంటూ సామూహికంగా వానిని జీవితంలో అనుష్ఠించవలసిన ఆవశ్యకత సూచింపబడినది. అవి మనం ముఖ్యంగా, హిందువులు అనుష్ఠించాలి. భారతదేశంలోనే వీనిని మనం అనుష్ఠించకపోతే హిందూతత్వం అంటూ ఇక్కడ ఉన్నదని చెప్పుకోలేము. అపుడు ఇతరదేశములలో ఉన్న హిందువులకు ఏవిధంగానైనా మనము సహాయపడలేము. విశ్వహిందూ పరిషత్తు లక్ష్యమే దెబ్బతింటుంది కనుక, ఈ సామాన్యధర్మాలను మనం విధిగా అనుష్ఠించాలి.

ఈ సామాన్య ధర్మాలేవి? ప్రతిరోజూ ధ్యానం చేయాలి. కనీసం మూడునిముషాలైనా ఏకాగ్రతతో తమకు ఇష్టమైన దైవాన్ని గురించి ధ్యానం చేయాలి. ధ్యానం చిత్తశుద్ధికి తోడ్పడుతుంది. దానివలన మనస్సు నిర్మలమౌతుంది. మనస్సుకు చీకుచింతా అంటూ వుండదు. ఒకవేళ సమస్యలు ఉన్నా అవి మనలను అంతగా కలవరపెట్టవు. ఇక రెండవ విషయం దానం. దానం చేయటం హిందువులయిన వానికెల్లా సామాన్యధర్మం. దానస్వరూపం అనేక విధాలుగా వుంటుంది. శరీరంతో, ధనంతో, బుద్ధివైభవంతో ఇతరులకు మనం సహాయపడవచ్చు.

అది అంతా దానమే ఔతుంది. దానం మానవుల కందరికీ సామాన్య ధర్మం. అది చేయడానికి తగిన యోగ్యత సంపాదించుకోవాలి. ఒక స్త్రీమీద అత్యాచారం జరుగుతుందని అనుకోండి. అపుడు చూస్తూ ఊరుకోరాదు. అత్యాచారం చేసే దుర్మార్గులను ఎదుర్కొని పోరాడి స్త్రీని రక్షించాలి. ఇది ఒక విధమైన దానం. శరీరబలం ఇక్కడ వినియోగమౌతున్నది. మనకు బలసాహసాలున్నపుడే ఇతరులకు తోడ్పడగలం. అందుచేత చక్కగా వ్యాయామం చేసి శరీరబలం పెంచుకోవాలి. ధ్యానం చేత మనోబలం, ఆత్మబలం పెంచుకోవాలి. కేవలం ధనబలమే చాలదు. ఉపయోగించదు. అత్యాచారం జరుగుతున్నపుడు శరీరబలం సహాయపడుతుందికానీ, ధనం వుంటే ఏమి చేయగలదు? కనుక మొదట ధ్యానం, తరువాత దానం. ఈ రెండూ చేయకలిగితే చాలు. ఇందుకోసం మనం అన్ని శక్తులనూ పెంచుకోవాలి. బుద్ధీ, బలమూ, ధైర్యమూ సంపాదించుకోవాలి.

ఇందులకు మనకు ఆదర్శ పురుషుడు ఆంజనేయస్వామి. ఆయనను తలచుకొని, ఆయనను ఆదర్శంగా వుంచుకొని, ఆయనలాగు సర్వాంగ సుందరంగా జీవితాన్ని, సుందరకాండ చేసుకోవాలి. ఆయన జీవితమంతా ఇతరులకు సహాయం చేయటంలోనే గడిచిపోయింది. ఆయన్ను స్మరిస్తే మనకన్నీ సమకూరుతవి.

బుద్ధి ర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా!

అజాడ్యం వాక్పటుత్వం చ హనూమ త్స్మరణా ద్భవేత్‌

బుద్ధిబలం, శరీరబలం, కీర్తి, సాహసం, ధైర్యం ఆరోగ్యము, నిర్భయత్వం, చురుకుదనం, వచన చాతుర్యం- ఇలాంటి సద్గుణములకు నెలవు ఆ మహావీరుడు. ఆయననే ఆదర్శంగా పెట్టుకొని ఆయనను ధ్యానం చేస్తూ వచ్చామంటే ఆ గుణాలు అలవడుతాయి. అపుడు మనం ఎంతమందికైనా సాయపడవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా నడచుకుంటే సామూహికంగా హిందుత్వం వృద్ధి పొందుతుంది.

ఈ సందర్భంలో ఒక సందేహం రావచ్చు. అందరూ ధనికులుగా ఉండరు. అందులో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్న ఈ రోజులలో ఎంతడబ్బు సంపాదించినా చాలటంలేదు. కాబట్టి ఇతరులకు శక్తి కొలది సహాయపడదామనే సత్సంకల్పం కలిగి వున్నప్పటికీ, అలా సహాయపడలేక పోతున్నారు. నిజమే, ఇందుకు మాకొక సమాధానం తోచింది. దానినే మేము మాట్లాడే ప్రతిచోటా ఆస్తికులయిన వారికి చెబుతున్నాం. మనకు ఉన్నదానిలోనే మనం ఇతరులకు మనకంటే దైన్యం అనుభవిస్తున్న వారలకు సహాయపడగలం. ఈ సహాయం ధనరూపంలోనే వుండనక్కరలేదు. మనలో ప్రతి ఇంటిలోనూ ప్రతిగృహిణీ అన్నం వండేటందుకు ముందు ఒక పిడికెడు బియ్యం తీసి భగవదర్పణముగా పసుపుదారంకట్టిన ఒక చిన్న పాత్రలో వేయాలి. వీలయితే దానితోబాటు ఒక పైసాకూడ అందులోనే వేయవచ్చు. అది 'అన్నపూర్ణపాత్ర' 'ధాన్యలక్ష్మిపాత్ర'. ఇలా వారంరోజులలో పోగయిన బియ్యాన్ని అందుకు పాత్రుడు అని మనకు తోచిన బీదవానికి ఇచ్చివేయాలి. దగ్గరలో దేవాలయం ఏదైనావుంటే ఇలా సమకూడిన బియ్యం పైసలూ అక్కడ ఇచ్చి సద్వినియోగానికి ఏర్పాటుచేయాలి. ఆలయం లేనిచోట తమకు తామే నిజంగా కష్టపడుతున్న పేదవారికి ఇవ్వాలి.

ఈ పరోపకారం క్రొత్తకాదు. మన మతంలో అనాదినుంచీ వున్నది. అంతేకాదు. ఈ పనితోటి మానవుల క్షేమంకోసమేకాక, ప్రతి ప్రాణికీ సహాయపడేటట్లు మన ధర్మశాస్త్రాలు విధిస్తున్నవి. ఇప్పటికీ కొందరు పూర్వాచారాలు అనుష్ఠిస్తున్న బ్రాహ్మణ కుటుంబీకులు వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసేముందు బలిహారణం అని వేస్తారు. దాని ఆంతర్యం చాలగొప్పది. ఈ విశ్వాంతారాళంలో ఎన్నో లోకాలు క్రిందాపైనా వున్నాయి. దానిలో ఎన్నో కోట్ల జీవరాసులు. వీనికన్నిటికీ తృప్తి కలగాలన్న సద్భావంతో వైశ్వదేవ బలిహరణాదులు ఇవ్వబడుతున్నవి. ఈ విధమైన భూత తృప్తి భోజనాత్పూర్వమే కాక భోజనానంతరం కూడా ఉత్తరాపోశన పట్టునపుడు ఇతర ప్రాణులను ఉద్దేశించి చేయబడుతున్నది.

ఆ ప్రాణులు రౌరవాది నరకాలలో ఉన్న వాళ్ళైనాసరే, పుణ్యలోకాలలో ఉండే వారైనాసరే కోట్లు, అర్బుదాల సంఖ్యలో వుండేవారందరూ కూడ భోజనానంతరం మనం తృప్తిపడినట్లు, ఈ ఉదకంతో తృప్తిపడాలనే జీవకళ్యాణభావం, జీవకారుణ్యభావం ఆ మంత్రలో ఇమిడివుంది. వారందరూ అమృతపానం చేసినట్లు ఆనందించాలి.

అమృతాపిథాన మసి రౌరవే

పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం

అర్ధినాం ఉదకం దత్తం

అక్షయ్య ముపతిష్ఠతు

ఇలాంటి మంత్రాలు భావాలూ ఈనాడు లోపించినవి. కనుకనే, నేటి హిందువు ప్రపంచానికీ తనకూ పనికిరానివాడై పోతున్నాడు. అందుచేత హిందువు హిందువుగా రూపొందితే కానీ మనకు కృతకృత్యత లేదు. హిందూమతం అంటే ఒక్క భారతదేశానికేకాదు సంబంధించినది. అది విశ్వమతము.

నేటి పురాతత్వవేత్తలు క్రీ.పూ. 1400 సంవత్సరములలో నేడు యూరపు అని పిలువబడే భూభాగంలో మిత్రసంస్కృతి (Mitra Cult) అని ఒకటి ఉండేదని అంటున్నారు. అదేదో క్రొత్త సంస్కృతికాదు. అది మన ప్రాచీన హిందూ సంస్కృతియే. మిత్రావరుణులు ప్రాచీనకాలంలో దేవతలుగా పూజింపబడ్డారు. ''శంనో మిత్రఃశం వరుణః'' అని ఉపనిషత్తులు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈనాడుకూడా 'సప్తద్వీపా వసుంధరా' అని ఆనాడు హిందూమతం వ్యాపించివున్న భూగోళమంతా పేర్కొనబడినది. ఈనాడు మనమేదో భూగోళం చదువుతున్నాం. ఇదేమీ క్రొత్తకాదు. భాగవత పురాణంలో ఎన్నో ఏళ్ళక్రితం ఉన్న విశ్వభూగోళం ఇవ్వడియున్నది. అయితే జ్యోతిశ్చక్రంలో కలిగిన మార్పులవల్ల ద్వీపాలలో భిన్నత్వం వచ్చింది. మార్పులు వచ్చాయి. కాలం ఎప్పుడూ ఒకే తీరున వుండదు. ఎగుడు దిగుడులు, ఒడుదుడుకులు, ప్రగతికి చిహ్నములు. దేశకాలపరిస్థితులనుబట్టి మానసిక శరీరానికి వలెనే, ధర్మపురుష శరీరానికీ, రోగాలు వస్తూవుంటాయి.

అటువంటి అపుడు శారీరక రోగాలకు వలెనే, మత సంబంధమయిన రోగాలకు ఉపప్లవాలకు కూడ చికిత్సలు, మందుమాకులు ఇవ్వటం జరుగుతూనే వుంటుంది. ఆర్యసమాజం, బ్రహ్మసమాజం లాంటి ఉద్యమాలు ఈలాంటి చికిత్సలే. అయితే రోగం నయమైన పిదప ఔషధం అక్కరలేనట్లు, మత సంబంధములైన ఒడుదుడుకులు అంతరించగానే ఈ ఉద్యమాలూ ఉపయోగించవు. వీని అవసరమూ తాత్కాలికమే.

వీనికి ముందు, శంకరులు, రామానుజులు మొదలైన ఆచార్యపురుషుల ఆవిర్భావమూ, ఆయా యుగపరిస్థితులను చక్కబెట్టుటకే జరిగింది. జ్ఞానతత్త్వం లోపించినపుడు శంకరులూ, భక్తిభావం లోపించినపుడు రామానుజులూ వచ్చి వానిని పునఃప్రతిష్ఠ చేశారు. కనుక ధ్యాన, దాన, పరోపకారా లనే సామాన్యసూత్రాలమీద ఆధారపడిన హిందూమత నవనిర్మాణం నేడు జరగాలి. అపుడు అది విశ్వధర్మమే అవుతుంది.

నిజమైన హిందువు భీరువుగా వుండటానికి వీలులేదు. 'ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం' అన్నట్లు అధ్యాత్మబలాన్నీ, శరీరబలాన్నీ హిందువులు వృద్ధిపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ మనమతానికి 'క్షతి' - గాయం తగలకుండా దానిని రక్షించుటకు క్షత్రియులం కావాలి. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇది క్షత్రియః' - అన్నది క్షత్రియ నిర్వచనం. సర్వమానవులకూ ప్రాణులకూ తోడ్పడేందుకు సిద్ధంగా వుండాలి. దానికి వలసిన సాధన సంపత్తి, ధ్యానబలం, శరీరబలం పరోపకారభావం అలవరచుకోవాలి. అపుడే మనం నిజమైన హిందువులం కాగలం. అపుడే ఇతర దేశములలో వున్న మన సోదరులకు సహాయం చేయగలం. విశ్వహిందూ పరిషత్తు యొక్క లక్ష్యమూ ఇదియే.

Maa Swami    Chapters