Maa Swami    Chapters   

10. భారతీయ సంస్కృతి

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యయుత్సవః

మామకాః పాండవశ్చైవ కి మకుర్వత సంజయః''

ఈ మాటలు దృతరాష్ట్రుడు సంజయుణ్ణి చూచి చెబుతున్నాడు. సంజయ అనే పేరు బాగా కుదిరింది. ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం. సంజయ అనగా 'సత్‌' గా ఉంది. జయ, జయమును పొందుము లేక పొందగలవు అనేభావము. సత్‌, సన్‌, సంతో, సంతః అను మాటలు మంచి ఉత్తమమైన అనే భవంమీద ఆధారపడి ఉన్నవి. జయ అంటే జయం కలుగుగాక అని గీత ప్రారంభంలో 'సంజయ' అనేపదం సాభిప్రాయంగా వాడబడింది. ఇదివరకు భారతకథలు దేశంలో విరివిగా ఉండేవి. ఈ సదస్సుల భారతమే మనకు జయం. సర్వజయప్రదం. అందులో ఆదర్శపురుషుల స్మరణ మన ప్రజలు చేస్తున్నంతవరకూ మనం తలపెట్టిన అన్ని కార్యాలూ జయప్రదము లవుతుంటవనటంలో సందేహం లేదు.

మనదేశంలో ఆంధ్ర, ఓఢ్ర, మహారాష్ట్ర, కర్ణాటకం, అరవం, ఘార్జరం, హిందూస్తానీ, బెంగాలీ, అస్సాం, రాజస్థాన్‌, మిథిల, నేపాళం మొదలైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.వీటికి పొరుగుననే కాంభోజం (కంబోడియా) శ్యామదేశం (నయాం) లంక (సిలోన్‌) లాంటి దేశాలలో కూడ పూర్వం మన సంస్కృతశాస్త్రాలే వాడుకలో ఉండేవి. ఈనాడు వారు బౌద్ధులుగానూ, మహ్మదీయులుగానూ ఉన్నప్పటికీ, వారి సంస్కృతికి మూలం ఈ భారత రామాయణాలే.

మనదేశంలో ఎన్నిప్రదేశాలు ఉన్నాయో, అన్ని దేశాలు మనసంస్కృతిమీద ఆధారపడినవి. బయట కూడా ఉన్నాయి. లావోస్‌, జావా, సుమిత్ర, బాలి మొదలైన దాదాపు రెండువేల ద్వీపాలు, ఇండోనేషియా పరిసరాల్లో ఉన్నాయి. వానిలో పది, పదిహేనుభాషలు మాట్లాడుతున్నారు. బోర్నియో భాష వేరు, బొలినీస్‌ భాష వేరు. జావాలోనే రెండుమూడు భాషలు ఉన్నాయి. మలేషియా భాషలు వేరు. కానీ వీటన్నిటికీ పునాదులు, రామాయణ, భారతగాథలే. మనదేశంలోని విమాన సర్వీసును, ఏర్‌ ఇండియా సర్వీస్‌ అనీ ఎమేమో అంటారు. అక్కడ జావాలో, ఇండోనేషియావారు నడిపే విమాన సర్వీసుకు 'గరుడ' అని పేరు పెట్టారు. లంకవారు 'హనుమాన్‌' అని పేరుపెట్టారు. పోతే మనమో, భారతదేశంలో 'సెక్యులర్‌'గా పేరుపెట్టాం.

లంకలోనివారు బౌద్ధులు. ఇండోనేషియావారు మహ్మదీయులు. ఈ మధ్య ఒక ఇండోనేషియా విమానం ప్రమాదంలో కూలిపోయిందని పేపర్లలో వచ్చింది. అది గరుడ విమాన సర్వీసుకు చెందినదని పేపర్లు వ్రాయగా ఆ దేశంలో విమానసర్వీసు పేరు 'గరుడ' అని మనకు తెలిసింది. అయితే ఆ దేశంలో స్వాతంత్ర్యం రాగానే గరుడ అని పేరు పెట్టుకున్నారు. అందుచేత వారు మనదేశాన్ని విదేశంగా భావించినా, మనసంస్కృతిని మాత్రం ఇంతవరకూ ద్వేషించలేదు. అసహ్యించుకోలేదు- మనదేశంలో సంస్కృతం ఏదో గొప్పగా వ్యాప్తి చెందినదనే ఉద్దేశంతో ఆ దేశస్తులు కొందరు ఈ దేశానికి రావటం, వచ్చినతర్వాత ఇక్కడ సంస్కృతానికి పట్టిన దుర్దశను చూచి, మీ దేశంకంటే మా దేశ##మే నయమని వెళ్ళపోవడమూ జరుగుతున్నది.

ఈ సదస్సు మొదలుపెట్టినపుడు మొదటి సంవత్సరము సభలో, ఢిల్లీలోని ఎంబసీలోని ఒక వ్యక్తి వారిదేశంలో 'హనుమంతుని నర్తనం' చేసే కళాకారుణ్ణి తెచ్చి, హనుమన్నర్తనం చేయించారు. అది చాలగొప్పగా ఉంది. మనదేశంలో అటువంటి నర్తనంకాని, భావములుకానీ ఎక్కడా మనం చూడలేము. అంతబాగా అభినయించాడు. ఆయన ఒక విషయం చెప్పాడు.

''ఒకసారి రవీంద్రనాథ్‌ టాకూరు మాదేశం వచ్చారు. (వెనుకవారిది నయాం దేశం. దానికి ఈనాడు తాయిలెండు అని పేరు పెట్టుకొన్నారు.) ఆయన మాదేశంలోని సాంస్కృతిక వ్యవహారాలు చూచి- Your Country is more Indian than India- అని ఎంతో సంతోషంగా ప్రసంగించారు. మా దేశంలో ప్రతివిషయమూ సంస్కృతం ప్రాతిపదికగా, పేరూ, పారిభాషక పదాలూ, అన్నీ తయారు చేసుకున్నాం. ఈ విషయంలో మీ దేశంకంటే మేమే మెరుగు''.

జావాలో ఒకరిపేరు సుహృతొ- మరొకరిపేరు సుకర్ణుడు. వారు మహ్మదీయులైనా, పేర్లు భారత రామాయణ గాథలకు సంబంధించినవే. పాపం ఈ విదేశీయులంతా మనదేశానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంస్కృతం మాట్లాడే వాళ్ళే అని అనుకొని వస్తున్నారు. మనస్థితి ఎలా ఉందంటే, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, సంస్కృతం మాకురాదు అంటే మాకురాదు అని పోటీపడేవాళ్ళే వాళ్ళకు కనిపిస్తున్నారు. అదిచూచి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఇండియాలో ఉన్నవాళ్ళంతా ఋషులేమో, సంస్కృతజ్ఞానం కలవారేమో అని ఇక్కడకువచ్చి విసుగెత్తి వెళ్ళిపోతున్నారు. మనవాళ్ళు కొందరు, సంస్కృతం అభిమానించే జర్మనీలాంటి దేశాలకు రాజదూతలుగా వెళ్ళినపుడు ఆ దేశంవాళ్ళు వీళ్ళెంత సంస్కృత విద్వాంసులో అని సంబరపడుతారు. జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశాలలో యూనివర్సటీలలో సంస్కృతాధ్యయనానికి ఉన్నన్ని ఫీఠాలు (Chairs) మనదేశంలోనే లేవు. చివరకు మనవాళ్ళు అక్కడకుపోయి మాకు సంస్కృతం రాదంటే మీ కులమేమిటి? అని వారడుగుతారు. కొందరు బ్రాహ్మణులమని అంటారు. అయితే బ్రహ్మణులై ఉండి మీకు సంస్కృతం రాదా? అని ఆశ్చర్యపడతారు. ఆ దేశాల్లో సంస్కృతాధ్యయనానికి తమ జీవితాలు అర్పణచేసిన వారెందరో ఉన్నారు. వారు మనదేశానికి వచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. ఇక్కడ సంస్కృతానికిగల స్థానాన్ని చూచి వారు ఏవగించుకొని పోతున్నారు.

ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏమంటే మనదేశంలో ఎన్ని ప్రాంతాలుఉన్నవో, అన్నిదేశాలు ఈ ఇండియాకు బయట ఉన్నవని ఈ దేశాలను అన్నిటిని కలిపి లావోన్‌వరకూ చరిత్రకారులు గ్రేటర్‌ ఇండియా అని అంటున్నారు. పూర్వం గాంధారమని చెలామణి అయినచోట నేడు ఉన్న పుష్టోభాషలో సంస్కృత ప్రభావం ఎక్కువ అని అంటున్నారు. ఇవిగాక మధ్యాసియా, సైబీరియా మొదలైనచోట్ల కొన్ని ప్రాచీన వర్ణనలకు నకళ్ళు చిత్రాల రూపంలో కనిపిస్తాయి. బాబిలోనియాలో క్రీ.పూ. 1400 సం. ప్రాంతమున ఇద్దరు రాజులు పరస్పరం ఒడంబడిక చేసుకొన్నట్లు, ఆ సంధి షరతులకూ, ఒడంబడికకూ, సాక్షులుగా మిత్రావరుణులను సాక్షులుగా పెట్టుకొన్నట్లూ ఆనాటి ఇటికరాళ్ళపై వ్రాసినది కనిపిస్తున్నది. ఆనాటి లిపి గుర్తించే లిపి గుర్తించే నిపుణులు, వైదిక దేవతలయిన మిత్రావరుణులనే సాక్షులుగా వాళ్ళు పెట్టుకొన్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

పూర్వకాలంలో మనదేశ సాహిత్యంలో, వచనరచనలు చాల తక్కువగా ఉండేవి. తెలుగు, మహారాష్ట్రం, అరవం మొదలైన భాషల్లో వచనరచన విరివిగా ప్రారంభ##మైనదని విన్నాను. ఆంధ్రంలో వీరేశలింగంపంతులుగారు వచనరచనకు ప్రోద్భలం ఇచ్చారని విన్నాను. ఇలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరూ ఇంగ్లీషులోని వచనసాహిత్య ప్రభావంవల్ల ఈ పరిణామం ఏర్పడి ఉంటుంది. కాని పూర్వం చదువంతా పద్యాలు, శ్లోకాల రూపంలో ఉండేది. వచనకావ్యాలు ఆనాడులేవు. ఒకటీ అరా వ్యాకరణాలేవైనా ఉండేవేమో? వానిలోనూ లక్షణాలు పద్యరూపంలో ఉండేవి. వివరణ మాత్రం వచనరూపంలో ఉండేది. ఆనాడు ఉత్తరాలూ పద్యాలలో వ్రాసుకొనేవారు.

సంస్కృతంలో మాత్రం 1500 ఏళ్ళ ముందు ఒక నాలుగైదు వచన రచనలున్నా, అవీ ఛందోబంధాలు మాత్రములేక, తక్కిన విషయాలలో, శ్లేషాలంకారాలు, అనుప్రాసలు, విరోధాభాసాలు లాంటి పద్యకావ్యములలో కనిపించే లక్షణాలతో ఉండేవి. దశకుమారచరితం, అవంతీసుందరికథ, కాదంబరి, హర్షచరిత, బాణభట్టు రచనలు మొదలైనవి. నిజానికి వచనకావ్యం అని మనం ఏదైనా చెప్పుకోగలిగితే ఒక్కటే- విక్రమార్కచరితం. అందులో వచనరూపం మనకు కనిపిస్తుంది.

ఇలా పూర్వకాలంలో కేవలం పద్యరచనలు చేసినందువల్ల కలిగిన లాభ##మేమంటే, మనం అన్ని విషయాలనూ కంఠస్థం చేయవచ్చు. అందరూ వల్లించేదానికి వీలుగా ఆనాడు వాళ్ళు రచనలు చేశారు. చివరకు నిఘంటువులుకూడా పద్యాలలో, శ్లోకాలలో వాళ్ళు వ్రాశారు. అమరకోశం, మేదినీ మొదలైనవన్నీ పద్యాలలో ఉన్నాయి. ఏదన్నా ఒక విషయం వివరణ కావలసి, నిఘంటువు చూడవలసివస్తే ఆ పుస్తకంకోసం పరుగోత్తకుండా నోటితో వెంటనే శ్లోకాలలో ఒప్పచెప్పేవారు. వేదాంత దర్శనశాస్త్రాలన్నీ పద్యాలలోనే ఉన్నాయి. యోగ వాసిష్ఠం, పంచదశీ పద్యాలలోనే ఉన్నాయి. వైద్యం, ఆయుర్వేదం పూర్తిగా శ్లోకమయం. లెక్కలు (అరిథ్‌మెటిక్‌), పద్యం, జామెంట్రీ పద్యం, అరిథ్‌మెటిక్‌ లీలావతి అనే పేరుతో భాస్కరాచార్యులు వ్రాశారు.

పద్యాలలో అంకెలను చెప్పవలసి వస్తుందికదా! వాటిని నిబద్ధించడం ఎలా? అందుకు ఒకపద్ధతి ఏర్పాటు చేశారు. దానిని కటపయాది సంకేతం అని అంటారు. అంటే ఫలానా అక్షరం ఫలాని సంఖ్యను సూచిస్తుందని పెట్టుకున్నారు. 'క' మొదలు కాదినవ, టాదినవ, పాదిపంచ, యద్యష్టా అని సంకేతాలు. క ఖ గ ఘ ఙ చ ఛజ ఝ- ఇవి 'క' మొదలు 'ఝ' వరకు తొమ్మిది- ఇవి ఒకటి మొదలు తొమ్మిదివరకుగల సంఖ్యలను సూచిస్తాయి. ఇలాగే టాదినవ- 'ట ఠ డ ఢ ణ త థ ద ధ' వరకూ తొమ్మిది. పాదిపంచ- ప ఫ బ భ మ ఇవి 5 అంకెలను గుర్తించేందుకు ఉపయోగపడుతవి. యాద్యష్టా- 'య' మొదలు 'హ' వరకు ఎనిమిది అక్షరాలు య ర ల వ శ స ష హ. పద్యంలో అన్వయం కాకుండా మధ్యలో ఏదైనా ఒక పదం అక్షరం ఉంటే అది లీలావతి అరిథ్‌మెటికొలో గానీ, ఆల్‌జీబ్రా బీజగణితంలో గానీ వచ్చినట్లైతే, దానికి ఫలానా అంకాన్ని గుర్తించే పదం ఇది అని అనుకొని ఆ అక్షరం ఏ అంకెను సూచిస్తుందో తెలుసుకొని నిర్ణయించమంటారు. 'అంకానాం వామతోగతిః' అని ఇది మరొక రహస్య సంకేతం. అంటే అంకాలను గుర్తించే అక్షకాలన్నిటినీ తల్లక్రిందులుగా గ్రహించాలి. అక్షరాలు 18 సూచిస్తే దానిని 18గా గ్రహించాలి. ఇందులకు ఒక ఉదాహరణ చెబుతాను. ఆదిశంకరులు సిద్ధిపొందినపుడు వారి వయస్సెంత? దీనికి ఒకశ్లోకం చెబుతారు.

'మహేశాంశాజ్జాతః' వారు ఈశ్వరాంశలో పుట్టారు. 'మధుర ముపదిష్ట అద్వయనయః' అతి కఠినమైన అద్వైత వేదాంత శాస్త్రమును రుచ్యంగా ఉండేటట్లు ఉపదేశించి బోధించిన మహాగురువులు. 'మహామోహాధ్వాంత ప్రశమనరవిః'. మనలను ఆవరించుకొన్న మహామోహాలనే చీకటి తెరలను తొలగించే భాస్కరుడు, ఆయన ఉన్నచోట ఎలాంటి మోహాలూ ఉండటానికి వీలులేదు. 'షణ్మతగురుః' అనేకులు ఆచార్యులు, ఒకే మతాన్ని, ఒకే ఒక దైవాన్ని పెట్టుకొని అదే మార్గమమని బోధించేవారు. శైవులు శివుడే దైవమని బోధించారు. బసవలు, ఆరాధ్యులు, లింగాయతులు మొదలైన వారికి శివుడొక్కడే దేవుడు. అలాగే శ్రీవైష్ణవులు, మాధ్వులు కేవలం విష్ణువునే ఆరాధిస్తారు. 'ఏకో దేవః కేశవో వా శివోహా' (అంటే ఏదో ఒక దేవుడు- కేశవుడో శివుడోతప్ప వేరే దేవుడు మనకు అవసరంలేదు) అనే దృష్టిని బోధించారు ఆ ఆచార్యులంతా. అటువంటిస్థితిలో శ్రీశంకాచార్యులు - పరమాత్మ ఒక్కడే. అతనిని వైష్ణవులు రాముడనీ, నృసింహుడనీ, మత్స్యవరాహస్వాములుగానూ కొలిస్తే, శైవులు శివుడుగా పూజిస్తారు. స్త్రీ రూపంలో సరస్వతిగా కొందరు, ఆ పరమాత్మనే ఆరాధిస్తారు. పార్వతిగా, లక్ష్మిగా అర్చిస్తారు. ఆమె బ్రహ్మవిష్ణుశివాత్మికగా ఉంది. అన్ని స్వరూపాలూ ఒకే ఒక అద్వయతత్త్వమైన పరబ్రహ్మకు చెందినవే అని కంఠోక్తి కావించారు. ఒకే పరమాత్మ నానారూపాలు తాల్చినప్పటికీ, అందులో ఏ రూపాన్ని మనం ఆరాధించినా, పరమాత్మను చేరగలం. వీనిలో ముఖ్యంగా ఆరు రూపాలను ప్రధానంగా భావించి, షణ్మతములను స్థాపించారు. అవి శైవం, వైష్ణవం, శాక్తం, గాణాపత్యం, సౌరం, సుబ్రహ్మణ్యం అనేవి. ఇపుడు మనం గణపతి, శక్తి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు అని ఏఏ మూర్తులను ఉపాసిస్తున్నామో అవన్నీకూడా ఒకే పరమాత్మ అని సమన్వయంచేసి షణ్మత గురువులయ్యారు.

'ఫలే స్వస్మిన్‌ స్వాయుష్యపిచ'

శంకరులకు తన ఆయుస్సుకు తగిన ఫలం లభించింది. అంటే జీవితం చరితార్ధమైంది. ప్రపంచం ఉన్నంతవరకూ అద్వైతం ఏకచ్ఛత్రంగా అధికారం చేయటమే ఆయన జీవిత లతకు ఫలం. ముందుముందు ప్రపంచంలోని ఏ దేశాలలోనైనా ఏ మతాలు తలెత్తినా సరే నిజమైన తత్త్వం తెలుసుకోవాలి అంటే ఆ తత్త్వదర్శనం భారత దేశంలోనే లభ్యమయ్యేటట్లు చేశారు.

పాశ్చాత్య వేదాంతులెందరో తత్త్వస్వరూపం తెలుసుకోవాలని కుతూహలం కలిగినపుడు ఇండియాకు వచ్చి శంకరాచార్యులు తత్త్వాన్ని గూర్చి ఏమి చెప్పారా అని విచారించేవారు. ఆ విధంగా శంకరాద్వైతాన్ని ప్రధానమైన రెఫరెన్సుగా నేడుకూడా విదేశీయులైన తత్త్వాన్వేషకులు ఆశ్రయిచడం మనం చూస్తున్నాం. ఇప్పటికి శంకరులు వెళ్ళిపోయి వెయ్యి రెండువేల సంవత్సరములు అయినా వారు ప్రతిపాదించిన తత్వం నిత్యనూతనంగా ముముక్షువులకు ఉపాదేయంగా నిలిచిపోయింది. ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటుంది. రాజ్యాలు రావచ్చు పోవచ్చు, దేశాలు ఉండవచ్చు ఊడిపోవచ్చు. కాని ఈ అద్వైతతత్త్వంమాత్రం అన్నిరకాల ఉపద్రవాలనూ, ఉపప్లవాలనూ అధిగమించి శాశ్వతంగా ఉండిపోతుంది. సూర్యనిలాగా ప్రకాశవంతంగా నిలిచి ఉంటుంది.

'ఫలేస్వస్మిన్‌' అంటే అవతారఫలం పూర్తి అయింది. ఈ ఫల మేమిటి? స్వస్వరూప జ్ఞాన ప్రాప్తియే. రెండవది అంటూలేకుండా, లోపల నేను నేను, అనే జ్ఞానం ఒకటి ఉన్నది. అన్నీ తెలుసుకొనేది ఆ జ్ఞానమే. అన్నింటికీ ఫలం అదే. అదే సర్వత్రా నిండివున్నది. ఏ శరీరంలో ఉన్న జ్ఞానమైనప్పటికీ, ఒక్కటే. ఇక్కడ మనం చూస్తున్న బల్బులన్నిటిలోనూ ఒకే విద్యుత్తు ఉన్నట్లు స్విచ్చివేస్తే వెలుగుతుంది. స్విచ్చినొక్కితే ఆరిపోతుంది. ఈ బల్బులలో కొన్ని ఎర్రవి, కొన్ని పచ్చనివి, కొన్ని తెల్లనివి- వివిధ రంగులలో ఉన్నాయి. చిన్న బల్బులూ, పెద్ద బల్బులూ ఉన్నాయి. సృష్టిలో ఉండే కోట్లాది శరీరాలూ అట్టివే. వీనిలో పనిచేసేశక్తి మాత్రం ఒక్కటే. ఈ బల్బులు ఒకదానికొకటి కొట్టుకుంటే పగిలిపోతాయి. అట్లే సృష్టిలోని మానవశరీరాలూ పోట్లాటలూ, యుద్ధాలూ వస్తే నశిస్తవి. కానీ లోన ఉన్న తత్త్వం, అసలు వస్తువు ఒకటే.

అవతారాలలో కూడా ఇది సమానమే. బలరాముడూ, కృష్ణుడూ ఘర్షణపడ్డా, రాముడూ పరశురాముడూ పోరాడినా, వారిలో ఉన్నతత్త్వమేమో ఒక్కటే. ఒకే విష్ణువు రెండు రూపాలలో లీల చూపిస్తున్నాడు. అలాగే ఎక్కడచూచినా, ఏ శరీరంలో చూచినా, 'నేనునేను' అనే తత్త్వం ఒకటే. ఇపుడు దీపం ఇన్నది. వెలుగు ఉన్నది. వస్తువులు కనపడుతున్నాయి. వెలుగూ, దీపంవున్నా, కన్నులు లేనివాడు చూడలేడు. కన్ను ఉండి మూర్ఛలోవుంటే మనిషి చూడలేడు. మూర్ఛదశలో కూడా మనసు కావాలి వస్తువులను తెలుసుకోడానికి.

ఆ మనస్సునుకూడా, 'నామనస్సు' అన్నప్పటికీ, 'నేను' అనే 'చిత్‌' ఒకటి ఉంటేనేకాని పని చేయదు. అందుచేత అన్నింటికీ ప్రకాశం, లోపలవుండే 'అహం అహం' అనేది ఒక్కటే. అదెప్పుడు స్ఫురిస్తుందో అప్పుడే దానిని ప్రకాశమని అంటాం. అదే శతృవులోనూ మితృనిలోనూ ఉంటుంది. ఇదే వేదాంతం. ఇదే ఫలం. స్వస్వరూపం పై మెట్టు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పిపీలిక- ఈ నాలుగింటిలోనూ ఉన్న స్ఫూర్తీ వెలుగూ ఒక్కటే.

'ఫలే స్వస్మిన్‌ స్వాయుష్య పిచ' తన (శంకరుల) ఆయుష్యంలోకూడ ఫల మున్నది. అది స్వరూపఫలం. కాగా ఆయుస్సుయొక్క ఫలంకూడా ఉన్నది. ''చర్లా చరాబ్దేపిచ, కలేః, వివిల్యే, రక్తాక్షిణి, అదివృష, సిత, ఏకాదశిపరే-'' అని ఈ సంవత్సరం. ఈ మాసం ఈ పక్షం అని ఈ శ్లోకంలో ఉన్నది. ఇది శంకరులను గురించి పరంపరగా వచ్చిన పుణ్యశ్లోకం. తన ఆయుస్సులో ఫలం అంటే అర్ధంకావడంలేదు. వారి ఆయుర్దాయమెంత? వారిని గురించి తెలిసినవారంతా 32 ఏళ్ళని అంటారు.

'ఫలేస్వసిన్‌'. స్వస్వరూపమైన ఫలంలో 'వివిల్యే' లయాన్ని పొందారు. తన ఆయుస్సులో ఫలంలో లయం పొందారని అర్ధం. తన ఆయుస్సులో ఫలం అంటే? నేను పైన పాదిపంచ అని చెప్పాను. పఫ అంటే రెండు. ఇక్కడ ఆయుస్సు అంటే వయసులెక్క. యాద్యష్టే-యరల-3 అవుతుంది. అటే ఫలే అనగా 23 అని అర్ధం. అంకానాం వామతోగతిః అంకెలు తలక్రిందులుచేస్తే - 32 అవుతుంది. ఫలేస్వస్మిన్‌ స్వాయుష్యసి- అంటే తనవయస్సు 32 అయి ఉండగా 'వివిల్యే', సిద్ధి పొందారని, ఆ పుణ్యశ్లోకానికి అర్ధం. ఇలా శ్లోకంలోనే సంఖ్యలను సంకేతింప చేయడానికి ఇది ఒక ఉదాహరణం. యాద్యష్టే అనే సూత్ర ప్రకారం, ఫలే అనే పదానికి ఇలా అర్ధం చెప్పుకోవాలి.

ఇక ప్రకృతాన్ని అనుసరిద్దాం. మనభారతం ఉన్నంతవరకూ ఎప్పుడూ జయమే మనదేశానికీ, మనకూను. భారతం ఎప్పుడూ ఉంది. ఉంటుంది. దానిని స్మరించుకుంటూ వృద్ధి పరచుకోవాలి. హృదయాలలో చెరగని స్థానం ఇవ్వాలి. అందులోనే అన్ని ఆదర్శాలూ ఉన్నాయి. ధర్మపుత్రుడు, భీష్మాచార్యులు ఆదర్శపురుషులు. దానంలో కర్ణుడు, భక్తిలో పరీక్షిత్తు ఆదర్శపురుషులు. ఆ భారతమే భాగవతమైంది. అభిమన్యుడు భారతంలోని వాడైతే అతని పుత్రుడు భాగవతంలో ప్రముఖుడయ్యాడు. కాగా ఆ భారతం ఉన్నంతవరకూ, భగవద్గీత ఉన్నంతవరకూ మనకు జయం.

నారాయణం సమస్కృత్వా నరంచైవ నరోత్తమం-

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌-

భారతారంభంలోని శ్లోకం ఇది. నారాయణం నమస్కృత్వాం-నరనారాయణు లిద్దరు. నరుడే అర్జునుని స్వరూపం. నరంచైవ నరోత్తమం.

నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేశారట. అసలు నారాయణునికి తపస్సే అక్కరలేదు. అది ప్రజాక్షేమకరం కనుక, దానిని తానేచేసి ఇతరులకు మార్గం చూపాలని ఆయన తపస్సు చేశారు. కృష్ణుడు అర్జునుడిచేత యుద్ధం చేయించినట్లుగానే, తపస్సు చేయించడానికీ ఆదర్శమైనాడు. మామూలుగా ఎవరైనా కఠోరమైన తపస్సుచేస్తే ఇంద్రుడు భయపడుతాడు. తపోబలంవల్ల ఇంద్రపదవిని వాళ్ళు అధిష్ఠిస్తారేమో అని. అలాగే ఇపుడుకూడా నరనారాయణుల తపస్సు భంగం చేయడానికి అప్సరసలను, తన సైన్యాన్ని పంపాడు. వారిని చూచి నరుడికి కోపం వచ్చింది. వారిని భస్మం చేయడానికి సిద్ధపడినాడు. నారాయణుడు నరుణ్ణి శాంతపరచి, చిరునవ్వునవ్వి, తన ఊరువును (తొడను) స్ఫాలనం చేశారట. అపుడు ఆయన తొడలో నుంచి ఒక మహారూపసి వెలువడింది. ఆమె లావణ్యం హావభావ విలాసాన్ని చూచి అప్సరసలు ఆశ్చర్యపోయారు. సిగ్గుతో తలవంచుకున్నారు. ఇలాంటి స్త్రీరత్నాన్ని సృష్టించగలవానిని తాము ఏమి వశపరచుకోగలమని అనుకొన్నారు. నారాయణునకు నమస్కరించి క్షమాపణ కోరుకున్నారు. ఆ స్త్రీ పేరే ఊర్వశి. నారాయణుడు ఆ ఊర్వశినికూడా అప్సరసలకు అప్పగించి, ఈమెనుకూడా మీరు తీసుకొని వెళ్ళండి అని అన్నాడు.

నరనారాయణులు అట్టివారు. వారికి భారతం చెప్పేదానికి ముందు నమస్కరించాలి. ''నారాయణం సమస్కృత్య నరంచైవ నరోత్తమం'' ఆ నరుడే నరోత్తముడైన అర్జునుడుగా జన్మించాడు. ''దేవీంసరస్వతీం వ్యాసం''- తర్వాత 'తతో జయ ముదీరయేత్‌'- అంటే 'జయం' చెప్పు అని అర్ధం. జయం చెప్పడమేమిటి?

కాదినవ అని చెప్పాను క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ 'జ' ఎనిమిదవ అక్షరం యాద్యగష్టములో 'య' మొదటి అక్షరం జయ- అనగా 81 దానిని తిరుగవేస్తే 18- అనగా భారతం. భారతం పద్ధెనిమిది పర్వాల మహాగ్రంథం. భారతయుద్ధం 18 రోజులు నడిచింది. ఆ గ్రంథానికి ప్రాణంలా ఉన్న భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలున్నాయి. కాబట్టి జయ అంటే భారతం చెప్పటం. భగవద్గీతలోకూడా ప్రారంభంలో సంజయ అనే మాటలో ఈ అర్ధమే గర్భితమై ఉంది. 'తతో జయ ముదీరయేత్‌' అని భారతంలో చెప్పితే- ఇక్కడకూడా

'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ

మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ'!

అంటూ గీత ప్రారంభం ఔతుంది.

భారతమే ఒక జయం. అందులో భగవద్గీత మరొక జయం. సంజయ అనేది మంచిపేరు. సన్‌ అంటే మంచి అని అర్ధం. ఇంగ్లీషువాళ్ళు కొడుకును మంచివాడుగా ఉండాలన్న అభిలాషతోనేమో, సన్‌ అంటారు. ఇక చివరశ్లోకం ఎత్తుకుంటే- అది విశేషమైన జయం.

యత్రయోగీశ్వరః కృష్ణో తత్ర పార్ధో ధనుర్ధరః

తత్ర శ్రీ ర్విజయో ర్భూతి ధ్రువానీతి ర్మతి ర్మమ

విజయం విశిష్టమైన జయం. అంటూ వ్యాసులు పూర్తిచేశారు. ఇదంతా సంస్కృతంలో గణితం కూడా శ్లోకాల్లో చెప్పే ఆచారం వుందని చెప్పడానికి చెప్పాను. ఇలా పద్యరూపంలోనే శాసాదులు నిబద్ధింపబడుటవల్ల తెలిసినవారు అడవుల్లో ఉన్నా పుస్తకాల అవసరం లేకుండా వాటి పఠన బోధన జరుపుకోడానికి చక్కని అవకాశం ఉంటుంది. ఆ వీలును మనపూర్వులు బాగా వినియోగించుకొన్నారు. జామెట్రీ అంటే జ్యామితి. అన్నీ నోటితోనే చేసుకొనేవారు. జ్యా అంటే సంస్కృతంలో భూమి అని అర్ధం. మితి అంటే మానం. కొలత, జ్యాగ్రఫీ, జ్యామెట్రీ అనేచోట అల్లా, జ్యా అంటే భూమి అనియే అర్ధం. శ్లోకరూపంలో ఉన్నపుడు శాసాలను జిహ్వాగ్రంలోనూ, గణితాన్ని అంగుళ్యాగ్రంలోనూ ఉంచుకొని పని గడుపుకోవచ్చు.

ఈ పండ్రెండు రోజులుగా నడచిన ఈ సదస్సుకు 'వ్యాసభారత ఆగమశిల్ప జానపద సదస్సు' అని నుదీర్ఘమయిన పేరు పెట్టాం. ఇందులో ముఖ్యం వ్యాసభారతం అనేమాటలు ''దేవీం సరస్వతీం వ్యాసం, తతో జయ మదీరయేత్‌''- అన్నింటికీ మూలము వేదవ్యాసులు. వారిని మరువరాదు. అందుచేత భారతానికి జయమనిపేరు. గీతలో ఆద్యంతాలలో జయ, విజయ అనే మాటలున్నాయి. మనదేశంలో- మనదేశంలోనే కాదు- నిజానికి మనదేశం అనటంకూడా సరికాదేమో- నిజానికి అన్నీ మనదేశాలే. అన్నీ క్షేమంగా ఉండాలి.

మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం

ఈ శ్లోకానికి వేరే అర్ధమేమీ లేదు. స్వదేశో భువనత్రయం- దీనికి మకుటం.

స్వదేశం అంటే భువనత్రయం. ప్రపంచాన్నీ లోకాలనూ గురించి మనకెంతవరకు తెలుసునో అదంతా మనదేశ##మే అన్నమాట. అఖిలాండకోటి బ్రహ్మాండం అంటాం. ఈ విశ్వంలో కోటికోటి అండములున్నవి. జాగ్రఫీలో భూమి చత్రాన్ని- కుక్కుటాండం (కోడిగ్రుడ్డులాగ) లా గీస్తారు. అంత రాళానికి (Space) అంతు అంటూలేదు. అందులో మనభూమి ఒక చిన్న చుక్కలాంటిది. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో? ఎన్ని సూర్యమండలాలున్నాయో? ఎన్ని గ్రహాలు వాటిని చుట్టుతున్నవో చెప్పలేం. ఈ కనిపించే సూర్యుడు, ఇతర సూర్యులను ఎందరిని చుట్టి తురుగుతున్నాడో మనకు తెలియదు- అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడే ఆ ఒక్క పరమాత్మకే తెలుసు. మనం మాత్రం స్వదేశో భువనత్రయం అంటే పైన ఉండే లోకం, మధ్య ఈ మనలోకం, క్రింద ఉండేలోకం- ఈ మూటినీకలిపి మనదేశంగా వ్యవహరించాలి.

పూర్వకాలపు పద్ధతులలో సంస్కృతం చదివిన పండితులను మినహాయిస్తే ఈనాటి చదువులు చదివిన వారూ, రాజకీయనాయకులూ ఉపన్యాసం ఇవ్వడానికి ముందు 'సోదర సోదరీమణులారా'! అని సంబోధిస్తారు. అంటే వినేవాళ్ళంతా అక్కచెల్లండ్రనీ, అన్నదమ్ములనీ భావం. పోతే పండితులు ఏదో స్వస్తిమంత్రాలతో మనకందరకూ సుఖశాంతులు కావాలంటూ ప్రారంభిస్తారు. ఆధునికులు సోదరసోదరీమణులారా అంటూ ప్రజలకుగల కష్టాలను ఏకరువుపెట్టి, వాటిని తొలగిస్తామంటూ, ఏమేమో చెబుతారు. ఇలా అందరూ సోదరి సోదరులుగా భావింపబడితే మరి తల్లిదండ్రులు ఒక్కరే కదా ఉండాలి. ఆ అర్థమే ఈ శ్లోకంలో ఉంది. ''మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః'' అయితే ఈ విషయాన్ని నేటివారు మాత్రం ఒప్పుకోరు. అది ఒప్పుకున్ననాడు ''స్వదేశో భువనత్రయం'' అన్నమాట నిజమవుతుంది.

అందరికీ ఈ భావం కలిగిననాడు పార్టీలు, కక్షలు, పోటీలు, ఒకరినిజయించడం, ఒకరిచేత జయింపబడటం అంటూ ఉండదు. అపుడు జయానికి అవసరమే ఉండదు. అయితే అప్పుడు జయమనేమాటకు అర్ధం? బయట ఎవ్వరూ శత్రువులు లేరనే, స్వదేశో భువనత్రయం అన్న భావం కలిగిన తర్వాత, ఈనాడు కొందరు అంటున్నటువంటి అంతర్జతీయ రాజ్యవ్యవస్థ అంటూ ఏర్పడినపుడు ఈనాడు మనం గొప్పగా అభిమానిస్తున్న దేశాభిమానం- పేట్రియాటిజం నేరమౌతుంది. ఈనాడు ప్రాంతీయత క్రైమ్‌ అయినట్లుగా. అలాంటి ఇంటర్నేషనల్‌ రాజ్యంవచ్చి బాహ్యశత్రువులు అంటూ లేనప్పుడు అంతఃశత్రువులను జయించవలసి ఉంటుంది. ఆ పరిస్థితిలో జయ అనే శబ్దానికి, అంతఃశత్రు విజయమని అర్ధం. 'మామకాః పాండవాశ్చైవ' 'పాండు' అటే శుభ్రం. తెలుపు అని అర్ధం. హంస పక్షులవలె, తెల్లగా శుద్ధసత్త్వంగా ఉండేవారికి 'పాండవాః' అని అర్ధం చెప్పుకోవచ్చు. దీనిని సత్త్వగుణానికీ, దైవీసంపత్తుకు, ప్రతీకగా తీసుకోవచ్చును. ఇలాగే మన హృదయంలో నాకు కావాలి. నాకు అనుమానం కలిగించాడు, నాతో పోట్లాడుతున్నాడు, నేను, నాది 'మామకాః' అనే భావం ఎక్కువగా కలుగుతూ వుంటుంది. ఇది అసురసంపద. దీని పాలు హెచ్చు. మరి కౌరవులసంఖ్య నూరుకదా! ఈ రెంటికీ, దేవాసుర సంపదలకు కలిగే పోరాటంలో జయంకావాలి అని అర్ధం ఇందులోను పాండవులకు జయంకావాలి అని అర్ధం. ఇవే హృదయంలో ఉండే దేవాసుర వృత్తులు. 'కిమకుర్వత' అంటే ప్రపంచాన్ని ఏమోచేశారు అని అర్ధం. సంజయ అనే సంబోధనం, నీవు సత్పురుషుడువిగా ఉండి, 'జయ' భువనత్రయాన్నీ నీదిగా భావించి, జయించు అని అర్ధం. 'ప్రపంచంలో శాంతి స్థాపించేందుకు నీవొక సాధనంగా కావలసినది' అని ప్రతి ఒక్కరికీ ఆదేశం ఇస్తున్నది. భారతయుద్ధం లోకకంటకులను జయించేందుకు తటస్థపడితే ధర్మాధర్మముల మధ్య పోట్లాట అయితే శరీరంలో జరిగే ఈ భారతయుద్ధం ''సిద్ధ్యః సిదౌ నమో భూత్వా''- అనే సమబుద్ధిని అలవరచుకోవటం, మంచిచెడ్డ రెంటిపట్ల సమత్వం కలిగి ఉండటం బోధిస్తున్నది. ఈ దేహాన్ని ధర్మక్షేత్రం చేసి. అందులో సమత్వమనే యోగసిద్ధిని సాధించవలెనని తెలుపుతున్నది. అదే భారతసంస్కృతి. భారతీయ సంస్కృతియూ అదే.

Maa Swami    Chapters