Maa Swami    Chapters   

4.జీవితం నేర్పిన పాఠాలు

జీవితం అవిరామంగా క్రొత్త క్రొత్త పాఠాలను నేర్పడానికి యత్నిస్తూనే వున్నది. కాని తీరా చూస్తే నేను నేర్చుకొన్న దేమీ కన్పించదు. వివిధములైన అనుభవాలను విమర్శపూర్వకంగా పరిశీలించే అభ్యాసం లేకపోవటంచేత, అనుభవపాఠం అంతరంలో ఉండిపోయింది. గతచరిత్ర విస్మరిస్తే బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నవి. మొదటిది నాకు ఏ మూడు నాలుగేళ్ళో ఉన్నపుడు జరిగినది. ప్రతిప్రాణికీ ఆశ, మోసమూ, కష్టమూ, నష్టమూ వల్ల కలిగే భయానక పరిణామాన్ని అనుభవం నేర్పింది.

ఒకరాత్రి వీధుల్లో తిరిగే పిల్లి ఒక ఇంటిలోనికి దూరింది. ఉట్టిలో బెల్లంఉన్న రాగిచెంబు ఒకటిఉంటే అందులో తలను దూర్చింది. తలతీయబోతే రాలేదు.చెంబులో తలతగులుకోగా అవస్థపడుతూ అటూ ఇటూ పరుగిడుతూ సందడి చేస్తున్నది. ఇంటివారూ, ఇరుగు పొరుగువారూ, దొంగ ఎవడో జొరబడ్డాడని అనుకొని భయపడ్డారు. గదిలోనుండి ఒకటే సందడి వినవస్తున్నది. కొందరు ధైర్యంచేసి కర్రల్ని చేతబట్టుకొని, దీని అంతు తెలుసుకొందామని, తలుపులు తెరచి లొనికి వెళ్ళారు. దొంగబదులు పిల్లి కనపడింది. దానిని ఒక గుంజకుకట్టి బలవంతంగానూ, నేర్పుగానూ, తలను చెంబులోనుంచి లాగారు. ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకొని ఆ పిల్లి పారిపోయింది. ఏ ప్రాణికిన్నీ ఆశ అనేది ఎంతటి ఆపదను తెచ్చి పెడుతుందో ప్రత్యక్షంగా అపుడు తెలిసింది.

ఇంచుమించు అదేప్రాయంలో ఒంటరిగా ఉన్నాను. ఆ రోజులలో చేతులకు బంగారు మురుగులుండేవి. నా మురుగులుచూచి, నా ఒంటరితనం గమనించి, ఒకడు లోనికివచ్చి చొరవగా నాచేయి పట్టుకొన్నాడు. వాని ఉద్దేశం నాకు అగమ్యంగా ఉన్నది. ''చూడు ఇవి నాకు చాలా వదులుగా ఉన్నాయి. వీనిని తీసుకువెళ్ళి కాస్త బిగించి తీసుకురా. ఏం? త్వరగా రావాలిమరి?'' అని ఆ అపరిచితుణ్ణి అధికార పూర్వకంగా ఆజ్ఞాపించాను. వాడున్నూ ఆజ్ఞను తలదాల్చి మురుగులు తీసుకొని మహావినయంగా సెలవు పుచ్చుకొన్నాడు.

ఆభరణాల మరమ్మత్తును అంతసులభంగా ఏర్పాటుచేసిన నాసంతోషం పట్టలేక లోనికిపోయి ఈ వార్తను చల్లగా చెప్పినాను. వాని పేరుకూడా అడిగి తెలుసుకొన్నాను. పేరు పొన్నుస్వామియట (బంగారయ్య లేక బంగారుసామి), ఇంటివారు ఆదరాబాదరా పరుగిడిరాగా, ఆసరికి బంగారయ్య బంగారంతో మాయమైనాడు.

ఈ అనుభవాలు చాలా చిన్నవయస్సులో జరిగినవి. ఇట్టివే ఇప్పటికీ, ఏదో ఒకరూపంలో మరల మరల దర్శనమిస్తున్నవి. వృద్ధాస్యం దాపురించి వయస్సు డెబ్బదికి చేరుతున్నా సులభంగా నేను మోసపోతున్నాను. ఏదో లాభానికి అడ్డుదారి వేయాలని ఆశపడుతూనే ఉన్నాను.

ఈ ఆశ అనే మానదండంతో ఈప్రపంచం కొలవబోతే ఆ గణన సునిశితంగా ఉండదు. కాని అలాంటి పరీక్షలో తేలేదేమిటంటే, స్వార్ధరహితమైన భావాలుకల జనులు ఉన్నారా అంటే దాదాపు లేనే లేరని చెప్పవలసి వస్తుంది.

ఐతే సంవత్సరాలు గడిచేకొద్దీ లోకాన్ని చూస్తుంటే ఈ భూమిలోకూడా కొంతమంది ధర్మమార్గంలోనూ, నైతిక పథంలోనూ సుస్థిరంగా అడుగులువేస్తూ తమ సౌఖ్యాలను, సాధనానుకూలాలనూ లెక్కచేయకుండా, జీవిత సర్వస్వాన్ని పరార్ధానికీ, లోకకళ్యానికీ అంకితంచేస్తున్నారన్న అభిప్రాయం కూడా కల్గుతున్నది.

1905వ సంవత్సరం తిండివనం క్రిష్టియన్‌ మిషన్‌ స్కూలులో చదువుకొంటున్నాను. తిండివనం దక్షిణ ఆర్కాటులోనిది. ఆ ముందటి ఏడే కామకోటి పీఠాధిపతులు శంకరాచార్యులు ఆ ఊరికి వేంచేసిరి. ఆర్కాటుకు పదిమైళ్ళ దూరంలోనూ, కాంచీపురానికి 25 మైళ్ళ దూరంలోనూ 'కలవై' అనే గ్రామమున్నది. ఆ గ్రామంలో శ్రీవారు సిద్ధిపొందినారన్న వార్త అందింది. అంతేకాదు. మా పెద్దమ్మకొడుకు మఠంలో ఋగ్వేదం అధ్యయంనం చేస్తున్న బ్రహ్మచారని, వారి స్థానంలో అనగా పీఠంమీద ఎక్కించారన్న మరొకవార్త కూడా అందింది.

మా పెద్దమ్మ వితంతువు. ఆమెకు ఏకైకపుత్రుడు. ఆకస్మిక సన్యాసం తీసుకొనేసరికి ఆమెకు ఊరటలేకపోయింది. మాతండ్రి ఆరోజులలో స్కూళ్ళ సూపర్వైజరుగా ఉండేవారు. తిండివనానికి 60 మైళ్ళదూరంలో ఉన్న 'కలవై' గ్రామానికి సకుటుంబముగా వెళ్ళుదామని ఆయన నిశ్చయించినారు. కానీ తిరుచునాపల్లిలో ఏదో విద్యావిషయక సమావేశమొకటి అడ్డుతగిలి ఆయన ప్రయాణం ఆగిపోయింది.

నాతోనూ, చిన్నపిల్లలతోనూ, అక్కగారిని ఊరడించడానికి మాఅమ్మ ప్రయాణం కట్టింది. కంచివరకు రైల్లో ప్రయాణం. కంచిలో మఠంలోనే దిగినాము. 'ప్రాతఃకృత్యాలు కూమారకోష్ఠము'లో పూర్తిచేసుకున్నాను. ఆనాటికి ఆచార్య పరమగురువులు సిద్ధించిన పదోరోజు. మహాపూజకు కావలసిన సామాగ్రులకోసం మఠపు పరివారం కలవైనుండి కంచికి వచ్చి ఉన్నది. వారిలో, పారంపర్యంగా వస్తున్న మేస్త్రీ యొకడు, మా తల్లిగారికీ, పిల్లలకు వేరొకబండి ఏర్పాటుచేసి నన్ను మరొకబండిలో కూర్చోబెట్టి తనవెంట రమ్మని దారితీశాడు.

కలవై గ్రామానికి పోతున్నప్పుడు నేను ఇంటికి మరల తిరిగి వెళ్ళడానికి వీలుండదనీ, జీవితాంతమూ, మఠంలోనే గడపవలసివస్తుందేమోనని మేస్త్రి మెల్లగా సూచించాడు. మా అన్నగారు- పీఠాధిపతులైనందున నన్ను తనతో ఉండగోరుతున్నారేమో అని అనుకున్నాను. నావయస్సు అప్పటికి పదమూడే కనుక, నావల్ల ఆయనకుగానీ మఠానికిగానీ కాగల ప్రయోజనమేమిటా అని అనుకున్నాను.

కలవై దగ్గరకొచ్చేకొలది మేస్త్రీ విషయగోపనం విడిచి పెట్టినాడు. పూర్వాశ్రమంలో మా అన్నగారున్నూ, ప్రస్తుత పీఠాధిపతులునూ అయిన శ్రీవారికి జ్వరం తగిలినదట. సన్నిపాతం కల్గినందున తన్ను తిండివనమునకే వెళ్ళి నన్ను తీసికొనిరమ్మన్నారట. కంచిలోనే కలవడము మేలైనదని త్వరత్వరగా తాను తీసుకొనిపోతున్నట్లు మేస్త్రీ చెప్పినాడు. నాకేమీ తోచలేదు. ఈ బండిలోనే మోకరిల్లి 'రామరామ' యని రామనామం చెప్పుకుంటూ, నాకు అప్పటికి తెలిసినిది అదేకనుక- అలాగే కూర్చున్నాను.

మా తల్లిగారూ, పిల్లలూ కొంతసేపయిన పిదపగాని రాలేదు. వచ్చుసరికి అక్కగారిని ఓదార్చుటకు బదులు నేను సన్యాసి అయినందున తన్నే ఇతరులు ఓదార్చవలసిన స్థితి ఏర్పడినది.

ఇంతకూ చెప్పవచ్చిన దేమిటంటే, కాషాయవస్త్రాలు స్వయంగా వైరాగ్యపూర్వకంగా నేను గ్రహించలేదని- వాటంతట అవే వచ్చినవి. పైగా గురుసాన్నిధ్యంలో అంతే వాసిత్వంచేస్తూ, బోధనందే భాగ్యానికి నోచుకోలేకపోయినాను. సన్యాసంతోపాటు మఠాధిపత్యమూ దాని కష్టసుఖాలూ నన్ను వెంటాడినవి.

అయితే నేను సన్యాసం పుచ్చుకొన్నపుడు కలవైలో ఇద్దరున్నారు. వారు తుమ్మలూరు రామకృష్ణయ్య, అడయపాలెం పశుపతి అయ్యరు. నాగురువుగారి గురువుగారి శిష్యులు దక్షిణ ఆర్కాటు జిల్లాకోర్టులో వారి ఉద్యోగం. జీవితాన్ని తీర్చిదిద్దుకొనటంలో, వాళ్ళు నాకు సంపూర్ఱ సహకారం చేయడానికి తీర్మానించినట్లు తర్వాత వ్యక్తమైంది.

రామకృష్ణయ్య నిర్లిప్తుడైనా కుటంబభారమెక్కువ. అందుచే నా భారాన్ని పశుపతియే వహించాల్సి వచ్చింది. ఆయన ముఖ్యంగా తనకాలాన్ని ఐకాంతిక ధ్యానంలోనూ, భగవత్పాదుల ప్రకరణ గ్రంథాలను చదువటంలోనూ గడిపేవారు. నేను పీఠానికి రాగానే తన ఉద్యోగానికి పశుపతి రాజీనామా ఇచ్చి నాతో ఉండటానికే సంకల్పించుకొన్నారు- నా వేషభాషలను సునిశింతంగా చూచేవారు, తన ధ్యానకాలాన్నికూడ తగ్గించుకొని మఠనిర్వహణంలో నిమగ్నులయ్యేవారు.

ఏకాంతంగా కలిసికొని నా వర్తనలో ఆయన గమనించిన దోషాలు నాకుచెప్పి, సంస్కరణకై పాటుపడవలెనని హెచ్చరించేవారు. ఒక్కొక్కప్పుడు కఠినంగానూ మందలించేవారు. ఉన్నతాశ్రమంలో ఉన్న వ్యక్తిపట్ల తాను చేస్తున్నది అపరాధమే అయినప్పటికీ దానికి క్షమాపణ నేను పెద్దపెరిగిన తర్వాత చెప్పుకుంటానని అనేవారు.

అంతేకాదు, ఆయన తన స్నేహితులను కలసినప్పుడుకూడా, జీవిత సంస్కారమునుగూర్చే మాట్లాడేవారు. ''ఐహిక విషయాలకోసం యిన్నేండ్లు ప్రాకులాడినావుకదా! ఇంత కష్టపడి నీవు అర్జించినదేమిటి? దౌర్బల్యం కొంచమయినా తగ్గిందా? వేదాంత బోధనలనూ, ఆచార్యుల ప్రకరణ గ్రంధాలలో సెలవిచ్చిన సూక్తులను ఆచరణలోనికి తెచ్చి చూడరాదా!'' అని అదరికీ బోధచేసేవారు.

స్నేహితులే కాదు, అపరిచితులైనాసరే, దారినిపోయే వారినికూడా అందరి కష్టసుఖాలనూ విచారించి అనునయ వాక్యాలుపలికి వారిని దైవభక్తులుగానూ, వేదాంతులుగానూ శంకరపాదుల సచ్ఛిష్యులుగానూ చేసేవారు.

1926 వరకు పద్ధెనిమిదేండ్లు ఆయన నాతోపాటు శంకరభాష్యం చదువుతూ ఉండిపోయినారు. తర్వాత ఒకప్పుడు నేను యాత్రచేస్తూ కడలూరు గ్రామానికివెళ్ళాను. పశుపతి అయ్యరు దీర్ఘకాలంగా తమ సొంతగ్రామమైన కడలూరులో స్వగృహంలో అస్వస్థతతో ఉన్నారు. వూరేగింపు జరిగినది. వూరేగింపులోని మఠపు ఏనుగు తొండమును పశుపతి అయ్యరు ఆదరపూర్వకంగా నిమురుతూ పరామర్శించారట. ఆ రాత్రియే వారు గతించారన్నవార్త తెలిసింది.

ప్రీతి, భీతి ఏదీ అడ్డురాకుండా ఇతరులను ప్రేమిస్తూ,పరోప జీవనంకోసమే ప్రాణాలను అంకితం చేసినవారు పశుపతులు.

1923లో తిరుచునాపల్లి జిల్లాలో యాత్రచేస్తున్నాను.ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయివయస్సు 12కు మించదు. చిన్నతమ్ముణ్ణి గద్దిస్తున్నది. వాడుచేసిన నేరమేమిటంటే అబద్ధాలాడినాడట. సత్యాన్నే చెప్పాలనీ, బొంకులుబొంకి తమ్ముడు చెడిపోతున్నాడని ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని గద్దించడం చూస్తే మహాత్ముల ప్రబోధాన్ని మించినట్లుంది. ఎన్నో ఏండ్లు గడచినా ఈ దృశ్యం మాత్రం నా స్మృతిపథంలో మెరుస్తూనే ఉంటుంది.

ఇంకొక సన్నివేశం కేరళలో జరిగినది. ఒక సత్రం మాకు విడిదిగా ఇచ్చారు. ఒకగదిలో వయోధికులే, కొందరు నంబూద్రి బ్రాహ్మణులున్నారు. ఇష్టాగోష్టిలో, కొంతసేపయిన తరువాత వారిలో ఒకరు పూజాసమయమైనందున తన దేవతలుండే పెట్టెనుతెరచి విగ్రహాలను వెలికితీసి పూజకుపక్రమించినారు. అంతసేపూ లౌకిక సంభాషణ చేస్తున్నందువల్ల పూజకు అవసరమయిన పవిత్ర మనోభావంగానీ, వాతావరణంగానీ సంకల్పించుకోలేకపోయారు. యత్నం విఫలమైంది. అంతటతో లాభంలేదని లాంఛనంగా పూజ చేయడానికి బదులు స్వస్తి చెప్పడమే మేలని విగ్రహాలను పదిలపరచసాగాడు. ఆరాధనా విషయాలలో బాహ్య వేషంకన్న ఆంతర్యనైర్మల్యం, నిజాయితీ ముఖ్యమని ఇతని ప్రవర్తన చక్కగా చెప్పింది.

1929వ సంవత్సరం ఉత్తర ఆర్కాటుజిల్లా పొలిమేరలో ఒక గ్రామంలో మాతో ఒక సన్యాసి కలిశాడు. ఆయనకు హిందీ మరాటీ తప్ప మరేభాషారాదు.రైల్లో రామేశ్వరందాకా వెళ్ళి తిరిగి వస్తున్నాడట. ఆ ప్రయాణంలో తన దండాన్ని పోగొట్టుకున్నాడు. నేను క్రొత్త దండం ఒకటి ఇప్పించినంతవరకు ఆయన ఉపవాసముండాలి. దండమిచ్చి తన ఆశ్రమం నిలిపినందులకు ఆయన నన్నే గురువుగా పరిగణించపాగాడు. అపుడాయనకు ఎనభైఏళ్ళు. 1945లో సిద్ధిపొందేవరకు నన్ను వదలిపోలేదు.

1929లో మమ్ములను ఆయన కలసికొన్నంతనే చాతుర్మాస్యం వచ్చింది.అపుడు నాకు నలుబది రోజులు మలేరియా జ్వరం వదలక కాచినది. నాటివరకు నన్నెవరు తాకేవారుకారు. జ్వరతీవ్రతకు లేచి నిలబడటానికికూడ శక్తి లేకపోయింది. క్రొత్త కావటంచేతనూ, సన్యాసి అవటంచేతనూ, నాకు ఆ సన్యాసి సహాయపడటానికి సిద్ధమైనాడు.

అయితే ఆయన చాల కోపిష్టి. ఆయన కంఠస్వరం మేఘ గంభీరంగానూ, అధికారయుక్తంగానూ ఉండేది. ఆయన అంటే అందరికీ గడగడ. దేవాస్‌ సంస్థానంలో రెవిన్యూ ఇలాకాలో పనిచేసేవాడట.

ప్రతిరోజున్నూ ఆయన నాకు పాదపూజ చేసేవాడు. ఆయనను తప్పించడానికి ఎవరికీ చేతకాలేదు. పూజ జరుగుతున్నంతసేపు భావోద్రేకంతో ఆయన నేత్రాలు బాష్పాంచితాలై చెక్కిళ్ళవరకు సోనలై జారేవి.

కంచిలో ఉన్నప్పుడు ఆయన బంధువు ఒకడు యాత్రకైవచ్చి ఆయనతో మాట్లాడినపిదప నన్ను కలుసుకొన్నాడు. 'ఈ సన్యాసికి 100 ఏండ్లు కావస్తున్నది. మిమ్ములను గురువుగాను, దైవాధికంగా చూచుకొంటూ అనన్య శరణ్యంగా సహచరిస్తున్నాడుకదా.ఆయనను ఏమీ గమనించక ముభావంగ ఉన్నారే' అని నాతో వాదులాడినాడు. దేనినీ పట్టించుచోని నాస్వభావం అతని మాటలను లెక్క పెట్టలేదు.

ఒకప్పుడు మేము తిరుపతికి వెళ్ళి ఉంటిమి. ఈ స్వాములవారు క్రింది తిరుపతిలోనే ఉండిపోయిరి. బాలాజీ దర్శనార్ధం ఎగువ తిరుపతికి వెళ్ళితిమి. బాలాజీ దర్శనం చేసుకొని క్రిందికి దిగబోతున్నామో లేదో, ఈ శతవృద్ధు ఎగశ్వాసలతో ఏడుకొండలు ఎక్కివచ్చారు.ఆయన వయస్సు, ఆశ్రమము మఠంతో ఆయనకుగల సంబంధమూ గమనించి, ఆలయాధికారులు ప్రత్యేకంగా ఆయనకు దర్శన సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కానీ ఆయన ఏదీ చెవిలో వేసుకోలేదు. నా పాదముల మీదపడి, 'నా బాలాజీ ఇదో ఇక్కడ ఉన్నాడు' అని బాలాజీ దర్శనం చేయకుండానే తిరిగి క్రిందికి దిగి వెళ్ళినారు.

ఈయనకాక మరి ఇరువురతో ఇలాగే ఒక సంబంధమేర్పడింది. ఈయనకూ వీరికీ మధ్యకాలం ముప్పదేళ్ళు. ఒకరి నింకొకరెరుగరు కాని చర్యమాత్రం మువ్వురదీ ఒక్కటే.

వీళ్ళుకూడా నాపాదాలస్మరిస్తూ నన్నుగూర్చి సదా ఆలోచిస్తూ రాత్రింబగళ్ళు ఒకే ఆనందంతో ఉండిపోయేవారట. ఎంతటి దుఃఖాన్నైనా, లౌల్యాన్నైనా వారు సులభంగా ఎదుర్కొనేవారట. కాని వారికి నాలోపాలు, స్వాభావిక అస్థిరత్వం తెలిసేసరికి ఇతరులను సైతం మాన్పేవారు. సదా నాపాదచింతనం చేయడంచేత నాకొక నియతి ఏర్పడుతున్నదని వారు అనుకొన్నారు.

అటు తర్వాత వారున్నూ తమ కుటుంబభారాన్ని నెమ్మదిగా వదులుకొని, పూర్తిగా తమకాలాన్ని ధ్యానపూజాదులలో వినియోగిస్తూ, నా శ్రేయోలాభానికై పాటుపడుతూ ఉండేవారు.

జీవితం నేర్పిన దేమిటంటే, 'దేవుడు కొందరిని పరుల ప్రయోజనంకోసమే సృష్టిస్తూ ఉంటాడు' అని.

Maa Swami    Chapters