Bharatiya Samskruthi-I    Chapters   

శ్రీః

ఓమ్‌

శ్రీ గురుభ్యో నమః

భారతీయ సంస్కృతి -

సంప్రదాయము

శ్లో|| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుః సాక్షాత్‌ పరం బ్రహ్మ తసై#్మ శ్రీ గురవే నమః ||

'శ్రీ' శబ్దము, మఙ్గలవాచకము. పూజ్యులను నిర్దేశించునపుడు 'శ్రీ' శబ్దమును మొదట, (ప్రామాణికులు) ప్రయోగింతురు. 'గురువు' జ్ఞాన ప్రదాత. మాతాపితరులు శరీరపోషణ, రక్షణ, విద్యా బుద్ధులను ఒసంగువారు. పూజనీయులు. గురుస్థానీయులు. పరమేశ్వరుడు జగద్గురువు.

"మాతృ దేవో భవ, పితృదోవో భవ, ఆచార్యదేవో భవ|"

తల్లిని, తండ్రిని, ఆచార్యుని (గురువును), దేవతాభావముతో ఆరాధించవలయును అని వేదము పేర్కొనుచున్నది. తల్లి వద్దను, తండ్రివద్దను, గురువుల సమీపమునను, శిక్షణను పొందినవాడు శుద్ధిత్రయము కలవాడు, యోగ్యుడు అగునని శ్రుతి, నిర్దేశించు చున్నది.

పాపమును హరించువాడు, రక్షకుడు, పరమాత్మ. ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ, బ్రహ్మ అను పదములను సాధారణముగా, పర్యాయపదములుగా ఉపయోగించుదురు. మనము, ఈశ్వరుడు ఉన్నాడు అని విశ్వసింతుము. ప్రపంచము, గిరి- నదీ- సముద్ర- అరణ్యములతోను, సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర, తారకలతోను, క్రిమి, కీట, పశు, పక్షి, మనష్యాదుల తోను, మిక్కిలి విచిత్రముగా శోభిల్లుచున్నది. శరీరయంత్ర నిర్మాణము విచిత్రము. ప్రకృతియందు గృహ, ప్రాసాదాది నిర్మాణములు, ఇంకను, అద్భుతమైన కట్టడములు జరుగుచున్నవి. ఘటనిర్మాణమునకు కులాలుడు (కుమ్మరి), పటనిర్మాణమునకు తంతువాయి (పద్మశాలి), గృహాదులకు శిల్పి - చేతనులు నిర్మాణ కర్తలుగా కనిపించుచున్నారు.

ఈ జగన్ని ర్మాణమునకు గూడ, చేతనుడు ఒకడు కర్తగా ఉండవలయును. జీవులు అల్పమగు జ్ఞానము, స్వల్పమగు సామర్థ్యము కలవారగుటచే ఈ విశాల ప్రపంచమునకు కర్తలు కానేరరు. లోకోపకారకముగా భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములను సృజించుటకు, సూర్య, చంద్రాదులచే వెలుగును ఇచ్చి, అన్న పానీయములచే సృష్టిలోని ప్రాణులను రక్షించుటకు అధిక జ్ఞానసంపన్నుడు, శక్తిమంతుడు అగు పరమ చేతనుడు ఒకడు ఉండి ఉండవలయును. అతడే, ఈశ్వరుడు, బ్రహ్మ. ఆయనను మనము కృతజ్ఞతాభావముతో ఆరాధించ వలయును. 'ఈశ్వరాయ నమస్కుర్మః' ఈశ్వరునకు నమస్కారములు చేయుదము.

ఆ స్తి క్య ము

"అస్తి ఇతి మతిః యేషాం తే ఆస్తికాః, తేషాం భావః

ఆస్తిక్యమ్‌ |"

ఈశ్వరుడు (దేవుడు) ఉన్నాడు అని అంగీకరించువారు అనేక దేశములలో కలరు. కాని, భారతీయులు పరలోకములు, పునర్జన్మ కలవు అని కూడ, అంగీకరింతురు. మనము చేయు పనులన్నింటికి ఫలమును ఇచ్చటనే, అనుభవించుటలేదు. ఒకప్పుడు, తాము చేసిన మంచి పనులకు గాని, చెడు పనులకు గాని, ఫలమును తమ జీవితకాలములో అనుభవించకనే చనిపోవు వారిని చూచుచున్నాము. కనుక, మన పెద్దలు కాలాంతరమున, ఆ కర్మఫలమును మనము అనుభవింతుము అని చెప్పుదురు. ఆ ఫలానుభవము స్వర్గ, నరకాది లోకములందు గావచ్చును, లేదా, జన్మాంతరము (పునర్జన్మ) నందు కావచ్చును. ఈ విధముగా ఆస్తిక్యము పరలోక, పునర్జన్మలతో ముడిపడియున్నది.

ఇదిగాక, వేదములు, ప్రమాణములు అని అంగీకరించుట ముఖ్యమైన ఆస్తిక్యము. వేదము లనగా, వేదమూలములగు స్మృతి, పురాణతిహాసములను గూడ, గ్రహించవలయును. పరమేశ్వరుడు మనకు అనుగ్రహించిన వేదములు మనము చేయవలసిన ముఖ్యములగు పనులను (విహిత కర్మలను),చేయ గూడని పనులను (నిషిద్ధ కర్మలను), తెలుపుచున్నవి. ఈ ఆస్తిక్యముతో మానవజాతి, పురోభివృద్ధిని, బుద్ధివికాసమును, జీవిత లక్ష్యమును చేరగలుగుచున్నది.

జీవితలక్ష్యము

మానవులకు జీవితలక్ష్యము భగవత్ప్రాప్తి, సుఖశాంతులు అయి ఉన్నవి. సాధారణముగా, జనులు ఐహిక సుఖములకు, ఉపద్రవములను నివారించుకొనుటకు ధనమును ప్రధాన సాధనముగా భావించుచున్నారు. 'ధనమూల మిదం జగత్‌' అను నానుడి (లోకోక్తి) దీని మూలముగానే, ఏర్పడినది. అయినను, కోరుకొనిన విధముగా సుఖ ప్రాప్తి గాని, దుఃఖనివారణముగాని, జరుగుటలేదు. మన ప్రమాణ గ్రంథములగు వేద, శాస్త్ర, పురాణాదులందు పుణ్యము, దేవతానుగ్రహము, జ్ఞానము అనునవి కూడ, సుఖశాంతులకు సాధనములుగా పేర్కొనబడినవి. పూజ, జపము, పరోపకారము, భూతదయ మొదలగునవి పుణ్యకర్మలని శాస్త్రములు పేర్కొనుచున్నవి. దేవతానుగ్రహమునకు ధ్యానము, ఉపాసనము చిత్తఏకాగ్రతకు ఉపయోగించును. జ్ఞానము, వివేకము, వినయము, శమ, దమాది గుణములు ఎంతటి కష్టముల నైనను తేలికగా సహింపజేయును. 'రక్షన్తి పుణ్యాని పురాకృతాని' మనము పూర్వము చేసిన పుణ్యకర్మలు మనలను కాపాడు చుండును. దేవతానుగ్రహము కలవారిని ఉపాస్య దేవత, ఎల్లవేళల, కాపాడుచుండును. లోకజ్ఞాన, శాస్త్రజ్ఞానములతోపాటు, ఆత్మజ్ఞానమును సంపాదించగలిగినచో,మానవుడు కృతార్ధుడగును. ఐహిక సుఖసాధనమగు ధనముకంటె పరలోక, జన్మాంతర సుఖ సాధనమగు పుణ్యము గొప్పది. ఆ పుణ్యముకంటె గూడ, దేవతోపాసనము, అటుపిమ్మట, ఆత్మజ్ఞానము అభిలషణీయములు (కోరదగినవి).

దేవతావిశ్వాసము

"ఓం శం నో మిత్ర శ్శం వరుణః|"

సూర్యుడు , సుఖమును కలిగించుగాక : వరుణుడు, సుఖమును కలిగించు గాక :

"శం నో భవత్వర్యమా | శం న ఇన్ద్రో బృహస్పతిః |

శం నో విష్ణు రురుక్రమః |"

అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు, వాయువు (వాయుదేవత), మనకు సుఖమును కలిగింతురు గాక!

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః |

మనకు శరీరతాపములు, భౌతిక తాపములు, పిడుగుపాటు, భూకంపము మొదలగు దైవికతాపములు - త్రివిధ తాపములు - ఆధ్వాత్మిక, ఆదిభౌతిక, ఆధిదైవిక తాపములు శమించుగాకః

మనుష్యలోకము వలెనే, దేవతలు నివసించు లోకములు కలవు. వారు మనకంటె ఎక్కువ సుకృతము చేసినవారు, సత్త్వ గుణసంపన్నులు, శక్తిసంపన్నులు. వారిని మనము ప్రార్థించినపుడు, అనుగ్రహంచునట్టి స్వభావము కలవారై యున్నారు. కొన్ని పరిస్థితులలో మనుష్యుల వలన, మనకు సాహాయ్యము అందనపుడు, ఆ దేవతలను ఆరాధించువారికి మన ఊహకు అతీతముగా అభీష్టసిద్ధిని కలిగించుచున్నారు. ఈ కారణముచేతనే, దేవతా ప్రార్థన, అవశ్యకర్తవ్యమై ఉన్నది. ఈ సూర్యేంద్ర, వరుణాది దేవతలు, జీవకోటిలోనివారు. ఈశ్వరుని ఆజ్ఞను అనువర్తించువారు.

ఈశ్వరుడు సృష్టి, స్థితి, లయములను, నిగ్రహాసు గ్రహములను చేయువాడు. 'ఏకో దేవః' ఈశ్వరుడు ఒక్కడే. అయినను, స్పష్టికార్యము కొఱకు బ్రహ్మ (విధాత) రూపమును, పాలనము కొఱకు విష్ణురూపమును, సంహారము కొరకు రుద్ర రూపమును - మూర్తిత్రయ (సాకార) రూపమును ధరించు చున్నాడు.

గ్రామ, నగర వాసులమగు మనము, భార్య, పుత్ర, కుటుంబ స్వభావముతో ఉండుటచే మనలను అనుగ్రహించుటకు 'పతిశ్చ పత్నీచ అభవతామ్‌'- ఆ ఈశ్వరుడే, పార్వతీపరమేశ్వర, లక్ష్మీనారాయణ, వాణీ హీరణ్యగర్భ రూపములను ధేరించు చున్నాడు. ఈశ్వరుడు, భార్యాపుత్రాదులతో కూడినవాడుగా పురాణకథలయందు వర్ణింపబడినను, ఈశ్వరుడు అసంసారి; జీవులు అజ్ఞానావరణము కలవారు గనుక, సంసారులు.

పార్వతీపరమేశ్వరులు

శ్లో|| య శ్శి వో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మజ్గలా |

తయోః సంస్మరణాత్‌ నిత్యం సర్వతో జయమజ్గలమ్‌ ||

శివ, సర్వ మజ్గశా నామములతో నొప్పు పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులు, మజ్గళకరులు. శివుడు ఆనందస్వరూపుడు. శబ్దార్థములలో అర్థమునకు అధిష్ఠానదేవత, సర్వాత్మకుడు. సర్వమజ్గళపార్వతి వాగధిష్ఠానదేవత. (శబ్ద ప్రపంచమునకు అధిష్ఠానదేవత.) పార్వతీపరమేశ్వరులను ఆరాధించిన, రమణీయములగు శబ్దార్థములు స్ఫురించును. నిరాకార ఈశ్వరుని సాకార యుగళ మూర్తులుగా లోకానుగ్రహము కొఱకు ఆవిర్భవించినందువలన, వీరు అందరిచే ఆరాధింపదగినవారు. ఆరాధన, పూజ, జపస్తుతి కీర్తనములు, ధ్యానము అని మూడు విధములుగా ఉండును. అందు, పూజ, కాయికము (శరీరముతో చేయునది). జప, స్తుతి, కీర్తనములు వాచికములు (వాక్కుతో చేయునవి) ధ్యానము, మానసము. పూజ, జప, ధ్యానములు ఉత్తరోత్తరము ఉత్కృష్టములు. పార్వతియే, గౌరి. గౌరీపూజ, వివాహాదులందు ప్రసిద్ధము. సతీత్వమును, అన్యోన్యానురాగమును, ఈ పూజ వర్థిల్లజేయును. నామజపము, స్తోత్రపాఠము, నామసంకీర్తనము దురితక్షయమును చేసి, వాక్‌ శుద్ధికి కారణమగును. ధ్యానము, పూజా జపములకంటె శ్రేష్ఠము, అధికఫలదము. ఇవి, మానవులకు ఈశ్వరానుగ్రహమును సిద్ధింపజేయును.

లక్ష్మీనారాయణులు

శ్లో || ప్రాతః స్మరామి భవభీతి భయార్తిశాన్యై

నారాయణం గరుడవాహన మఞ్జనాభమ్‌ |

గ్రాహాభిభూత మదవారణ ముక్తి హేతుం

చక్రాయుధం తరుణ వారిజపత్రనేత్రమ్‌ ||

శ్లో || లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం

దాసీభూత సమస్తదేవవనితాం లోకై కదీపాజ్కురామ్‌ |

శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంధగారామ్‌

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసీజాం వందే ముకుంద ప్రియామ్‌ ||

నారాయణుడు, సకల జనన్నివాసుడు, పరమాత్మ, శ్రీమహావిష్ణువు, వైకుంఠాధిపతి, చతుర్భుజుడు, శంఖ, చక్ర, గదాధరుడు, పీతాంబరధారి.ఆయన భార్యలక్ష్మీదేవి, సకల ఐశ్వర్యప్రదాయిని, సంపత్ప్రదాత్రి. ఈ లక్ష్మీ నారాయణులు, వైకుంఠమున, శ్రీమహావిష్ణువుగాను, శ్రీమహాలక్ష్మిగాను విలసిల్లుచు, జగత్తునకు పరిపాలకులుగా జీవకోటిని అనుగ్రహించుచున్నారు. భక్తానుగ్రహార్థము శ్రీమహావిష్ణువు, దశావతారములు (మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ధ, కల్కిరూపములు) ధరించి ధర్మసంస్థాపనమును చేయు చుండును. కల్కి అవతారము రానున్నది. రామకృష్ణాది అవతారములలో లక్ష్మీదేవి కూడ, సీత, రుక్మిణి రూపములను ధరించి భూలోకమున, తోడుగా ఉండును. అవతారదేహము ధరించక పోయినను, శ్రీమహాలక్ష్మి, నారాయణునితో నిత్య అనపాయినిగా (విడిచిపెట్టక) ఉండును. శ్రియఃపతిని ఆరాధించువారు ఆపదల నుండి విముక్తులై, ఇహలోకమున, సర్వసుఖములను పొంది భగవదనుగ్రహముచే ముక్తిని గూడ, పొందగలుగుచున్నారు.

వాణీహిరణ్యగర్భులు

శ్లో|| చతుర్ముఖముఖాంభోజ వరహంసవధూః మమ |

మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ ||

వాణి అనగా, సరస్వతీదేవి. హిరణ్యగర్భుడు అనగా, బ్రహ్మ. బంగారమువంటి ప్రశస్తమైన జ్ఞానము కలవాడు బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడు. వేదనిధి, సృష్టికర్త. వేదములు ఋక్‌, యజుస్‌, సామ, అథర్వణములు నాలుగు. ఈ వేదములకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు అంగములు. మీమాంస, న్యాయవిస్తరము, పురాణము, ధర్మ శాస్త్రము అనునవి పదునాలుగు విద్యలు, ఉత్తమ వేదవిజ్ఞానమునకు ఉపకరించునవి. బ్రహ్మ, వేదవిజ్ఞానము వలన భూతము లను, భూః, భువః, సువః, మహః, జనః, తపః సత్యమ్‌ అను ఏడు ఊర్ధ్వలోకములను, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళములు అను అధోలోకములను ఏడించిని సృజిచి పశు, పక్షి, మనుష్య, దేవ , గంధర్వాది ప్రాణులను జీవ కర్మానుసారముగా సృజించును. సరస్వతీదేవి, విద్యాప్రదాయిని, వాగ్దేవత, విద్యాస్వరూపిణి.

శ్లో|| "వందేమహి చ తాం వాణీం అమృతాం ఆత్మనః కలామ్‌"|

అమృతస్వరూపిణి, ఆత్మకళ యగు వాణిని నమస్కరించవలయును. సరస్వతీదేవి యొక్క అనుగ్రహమువలన,

శ్లో|| " అశ్రుతో బుధ్యతే గ్రంథః ప్రాయః సారస్వతః కవిః"|

ఇది వఱకు వినని నూతన గ్రంథములు అర్థమగును (బోధపడును), అవశ్యము కవిత లభించును.

ఆదర్శదాంపత్యము

శ్లో|| శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్‌ |

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితాన స్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవ శ్రీకంథరాశ్ర్శేయసే ||

---- నన్నయ

ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారలీలలు కొఱకు మూర్తిత్రయ రూపమును ధరించెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆ త్రిమూర్తులు. వారి భార్యలు సరస్వతి , లక్ష్మి, పార్వతి. బ్రహ్మదేవుని ముఖమున సరస్వతి, విష్ణువు వక్షఃస్థలమున లక్ష్మీదేవి శివుని వామాంగమున, పార్వతి నివసింతురు అని మన పురాణతిహాసములందు వర్ణింపబడినది. లోకమునందు గూడ, భార్యా భర్తలు అన్యోన్యానురాగముచే ఒకే తత్త్వముగా పరిగణింపబడుచున్వారు. వీరు యుగళమూర్తులు. ఇట్లే, సీతారాములు, రాధాకృష్ణులు యుగళమూర్తులుగా ఉపాసింపబడుదురు. సీతారామపంచాయతనమున, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయులతో సీతారాములు ఏకమూర్తిగా (దైవముగా) ఆరాధింపబడుచున్నారు. త్రిమూర్తులు తమ భార్యలకు తమ శరీరమునందు స్థానమును కల్పించుట ఆదరమును, ప్రేమాతిశయమును సూచించును.

శ్లో|| సన్తుష్టో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ |

యస్మిన్నేవ గృహే నిత్యం కళ్యాణం తత్రవై ధ్రువమ్‌ ||

2]

భర్త, భార్యతోను, భార్య భర్తతోను సంతుష్టులగుచు ఏ గృహమున నివసింతురో, అచట, నిశ్చయముగా శుభములు స్థిరముగా నుండును. కనుక, భారతదేశమున, భార్యాభర్తలు ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను సరస్వతీ బ్రహ్మదేవులను ఆదర్శముగా నిడుకొని, అన్యోన్య అనురాగముతోను, పరస్పర సహకారముతోను, గృహకృత్యములను సంసారబాధ్యతలను నిర్వర్తించుకొనుచు, పుత్రపౌత్రాది సంతతి, కుటుంబక్షేమము నరయుచు, అర్థ, కామములనే ప్రధానములుగా చేసికొనక, ధర్మదృష్టి, తత్త్వజిజ్ఞాసాపరులు కావలయును.

ధర్మము

సుఖముగా జీవించుటకు, సమాజములో గౌరవముతో సంచరించుటకు వృత్తము, శీలము ప్రధానములైనవి. కొంతవఱకు చట్టము, న్యాయము (వీనికొఱకు) ఉపకరించును. కాని, ధర్మము యొక్క పరిధి, మరింత విశాలమైనది. చట్టము, న్యాయము ఐహిక జీవనమునకు, కాలమునకు పరిమితము కాగా, ధర్మము దీర్ఘకాలమువఱకు, ఉపయోగించుచు, సుఖము నిచ్చుచున్నది. ధర్మము యొక్క స్వరూపమును నిర్వచించుట అంత సులభము కాదు. ధర్మమును గూర్చి, అనేకులు వేఱు వేఱు నిర్వచనులను ఇచ్చియున్నారు. ప్రకృతమున,

'యతః అభ్యుదయ నిశ్ర్శేయససిద్ధిః స ధర్మః'

అను కణాదమహర్షి నిర్వచనము స్వీకరించుదము. ఐహిక భోగములకు, ఆముష్మిక భోగములకు (సుఖ) సాధనము అభ్యుదయ ధర్మము. నిశ్ర్శేయసము అనగా, మోక్షము, దానికి సాధనమగు ధర్మము మోక్షధర్మము. ఇది కాక, 'చోదనాలక్షణో7ర్థధర్మః' అని జైమిని నిర్వచనము. వేదవాక్యము చేతను, ధర్మశాస్త్రము (స్మృతి) చేతను, మనము అవశ్యము చేయవలసినవిగా, విహిత కర్తవ్యములుగా పేర్కొనబడినవి. స్నాన, సంధ్యా, జప, హోమ, తపో, యజ్ఞ, దానాదులు, సత్కర్మలను చేయుటవలన, వచ్చు పుణ్యము 'ధర్మ' మని కొందఱు వ్యవహరింతురు. శ్రీరాముడు, ధర్మపరతంత్రుడు, పితృవాక్యపరిపాలనారపరుడు. హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు. ఇట్లు, సమాజక్షేమమునకై ధర్మములు అనేక తీరులుగానున్నవి.

ఈ ధర్మము వ్యక్తి వికాసమునకు, జీవిత లక్ష్యమును సాధించుటకు ఉపయోగపడుచున్నది. వ్యక్తులనుబట్టి, సమాజమును బట్టి, ధర్మములు మారుచుండును. కనుక, వానిని గుఱించి మఱియొక పర్యాయము విపులముగా తెలిసికొందము. ధర్మము ఉత్కృష్టమైనది అనునది నిర్వివాదాంశము.

శ్లో|| ద్వేష్యో భవతి అర్థపరో హి లౌకే |

కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా ||

ధనమునే ప్రధానముగా చూచుకొని మెలగువాడు ద్వేషమునకు గురియగును. కామ, భోగ తత్పరతయు ప్రశస్తము కాదు.

ఈశ్వరారాధన

లోకమున, అందఱును క్షేమమును, స్థైర్యమును, విజయమును, ఆయురారోగ్యైశ్వర్యములను, ధన, కనక, వస్తు, వాహనాదులను కోరుకొనుచున్నారు. తాము ఉన్న స్థితికంటె ఉన్నత స్థితిని కోరుకొనుచున్నారు. మన కోరికలు సిద్థించుటకు సాధనములు అన్నియు మన వశమునందు ఉండుటలేదు. మనుష్య సాహాయ్యముకంటె ఈశ్వరసహాయము మనకు ఎక్కువగా తోడ్పడును. ఆపదలు వారించుకొనుటకు గూడ, ఈశ్వరసహాయయ్యము ఆవశ్యకమైనది. కనుక, మనము ప్రతిదినము, కొంత సమయము, ఈశ్వరుని ఆరాదించుటకు వినియోగించవలెను. ప్రార్థన, పూజ, నామసంకీర్తనము, స్తోత్రపాఠము, (మంత్ర) జపము, ధ్యానము మొదలగునవి ఈశ్వరారాధనలోని భాగములు. నిద్ర లేచి, ప్రాతఃస్మరణము, ఇష్టదేవతాప్రార్థనము చేసికొని దినకృత్యములు ప్రారంభించుకొనవచ్చును. స్నానానన్తరము, భోజనమునకు పూర్వము, ఇష్టదేవతాపూజాదులు చేసికొనుట, శ్రేయస్కరము. ఏదియేని పని తలపెట్టినపుడు , 'ఆదౌ పూజ్యో గణాధిపః' అను వచనానుసారము, గణాధిపతి పూజ చేసికొనినచో, నిర్విఘ్నముగా పనులు నెరవేరును. శ్రీరామ, శ్రీకృష్ణ, నృసింహ, వేంకటేశ్వర, శివ, విష్ణ్వాది దేవతలలో ఎవరినైనను, అభీష్టానుసారము పూజించవచ్చును. స్త్రీలు గౌరి, లక్ష్మి, సరస్వతి, లతిత, త్రిపురసుందరి, దుర్గ మొదలగు దేవతామూర్తులను హరిద్రా, కుంకుమాక్షతలతో, పూజించుకొనవలయును.

భగవన్నామము - మహిమ

క్రిమి, కీట, పశు, పక్ష్యాదిజన్మలకంటె మనుష్యజన్మ ఉత్కృష్టమైనది. మనుష్యులలో బుద్ధివికాసము కలదు. ఆలోచనా పూర్వకముగా మహత్తర కార్యములను సాధించవచ్చును. కృషి వాణిజ్య, సేవాది కర్మలను చక్కగా ఆచరించి, ఐహిక సుఖములను బడయవచ్చును. అంతియేకాక, యజ్ఞ, దాన, తపస్సులను, దేవతోపాసనను చేసి, పరలోక సుఖములను, భగవదనుగ్రహముచే మోక్షమును గూడ, సాదించవచ్చును. కాని, కలియుగములో వైదిక కర్మలను యథావిధిగా ఆచరించుట, కష్టసాధ్యముగా నున్నది. ఏకాగ్రతతో బహుకాలము, దేవతోపాసనము చేయుట, మరింత శ్రమతో కూడిన పని. కనుక, కలిసంతరణోపనిషత్తునందు భగవన్నామము - హరి, రామ, కృష్ణ మొదలగు నామములు తరుణోపాయములుగా పేర్కొనబడినది. శివ, శంకర, మహాదేవ, అచ్యుత, అనంత, గోవింద, శ్రీ, గౌరి, సరస్వతి, వాణి, లక్ష్మిమొదలగు నామములు ఉచ్చరించినంతమాత్రము చేతనే, అవి, పాపహరములు, భగవదనుగ్రహ సంపాదకములును అగుచున్నవి. మనము చేయు పనులలో పొరపాటులు జరిగినపుడు, అవి సాద్గుణ్య మును సంపాదించును. (పూర్తి ఫలమును ఇచ్చును). ప్రణవము (ఓంకారము) వలె భగవన్నామములు పరమాత్మ వాచకములు, భగవత్‌ స్వరూపములు, ప్రభావము కలవి. అర్థ విశేషమును, భగవంతుని రూప, గుణ, స్వభావాదులను విశదపరచుచు, మనుజుల చిత్తమును సంస్కరించుచు, భగవత్ర్పాప్తికి సాధనములు అగుచున్నవి.

స్తోత్రపాఠము

భగవన్నామములను ఎచ్చటనైనను, ఏ కాలమునందైనను, స్మరించవచ్చును. ఆ నామములనే సహస్రనామములుగాను, అష్టోత్తరశతముగాను ప్రతిదినము పఠించి, పారాయణము చేయుట, సంప్రదాయము కలదు. ఈ నామములచే స్తుతించుచున్నాము గనుక, అది స్తోత్రపాఠము కూడ కాగలదు. విష్ణు, శివ, లలితా, లక్ష్మీ, రామ, కృష్ణ ఆది నామములు అట్టివి. ఇవిగాక, దక్షిణామూర్తిస్తోత్రము, సౌందర్యలహరి, సరస్వతీ, దుర్గా స్తోత్రములు కూడ, పఠించువారు కలరు. ఈ స్తోత్రములను పఠించినను, దేవతలను పూజించినట్లే అగును. ఆరోగ్యము కొఱకు ఆదిత్యస్తవము (హృదయము), ఐశ్వర్యముకొఱకు కనకధారా స్తవము, పాపనివారణము కొఱకు, విజయమునకు దుర్గాస్తవము ప్రసిద్ధములు. ప్రతిదినము, స్తోత్రపాఠము చేయుటవలన, మనస్సు నిర్మల మగును, శాంతి చేకూరును. భగవంతుని గుణగణములను స్మరించుటవలన, సద్గుణములు అలవడును. క్రోధ మాత్సర్యాది దోషములు దూరముగా తొలగిపోవును. భగవదనుగ్రహము చేకూరును, సకలాభీష్టములు సిద్ధించును.

భక్తి

మాతాపితరులు శరీరమును, గురువు జ్ఞానమును, ఒసంగునటులనే, భగవంతుడు ప్రాణికోటి, సుఖముగా జీవించుటకు అనేక భోగ్య పదార్థములను, వెలుగు నిచ్చుటకు సూర్య చంద్రులను, ప్రసాదించియున్నాడు. ఇదిగాక, ప్రాణులకు కర్మఫల ప్రదాత కూడ, అయి ఉన్నాడు. కనుక, మనము భగవంతునియందు భక్తి భావముతో ప్రవర్తించవలయును. మనము చేయు పూజా, స్తోత్ర, పాఠాదులను గూడ, భక్తితత్పరతతో ఆచరించినపుడు, సంతోషించి, అనుగ్రహించును. భక్తియనగా, పూజ్యులందు, అనురాగము, ప్రీతి, ఆదరము అయి ఉన్నది. మనము ఇచ్చునది పత్ర, పుష్ప, ఫలాదులే అయినను, మన భక్తి భావమునకే ప్రాధాన్యమిచ్చి, మనయందు కృప కలవాడగును. మన యోగ , క్షేమములను వహించును. సంసారక్లేశములనుండి ఉద్దరించును. గజేంద్రునివలె ఆపదలోనున్న వారిని కాపాడును. అచింత్య మహిమ కలవాడగుటచే, ద్రౌపది, పరాభవములో నున్నపుడు, ద్రౌపది భక్తికి ప్రసన్నుడై అసంఖ్యాకములగు వలువలనిచ్చి కాపాడెను. భక్తుల అభీష్టములను విద్య, కుల, పౌరుష, జాతి, గుణాదులతో నిమిత్తము లేకుండ నెరవేర్చును, కనుక, మానవులందఱికి భగవద్భక్తి ఆవశ్యకము.

ఇష్టదేవతామూర్తులు

భగవంతుడు, ఐశ్వర్యము, పరాక్రమము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము కలవాడు. నిరాకారుడు, నిరంజను (అజ్ఞానసంబంధము లేనివాడు). భక్తానుగ్రహము కొఱకు స్వేచ్ఛతో అనేక రూపములను (ఆకారములను)ధరించును. శివ, విష్ణు, గణపతి, దేవి, సూర్య, రామ, కృష్ణ, నృసింహాది రూపములు అట్టివి. వెంకటేశ్వర, ఆంజనేయ, సత్యనారాయణ, దేవతామూర్తులు ఇపుడు విశేషముగా ఆరాధింపబడుచున్నారు. ఋషులు తపో, యోగబలముచే ఈశ్వరుని, దర్శించి ధ్యాన శ్లోకములతో ఆ దేవతామూర్తిని స్తుతించినారు. కనుక, ధ్యాన శ్లోకములు ప్రభావము కలవి. సంస్కృతము దేవభాష అగుటచే ఆ శ్లోకములు సంస్కృతభాషలోనే లభించుచున్నవి.

స్వస్తి శ్రీగణశాయ నమః

శ్లో|| వాగీశాద్యాః సుమనసః సర్వార్థానా ముపక్రమే |

యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననమ్‌ ||

శ్లో || సుముఖ శ్చైకదస్తశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః ||

శ్లో || ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః |

వ్రకతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః ||

శ్లో || షోడశైతాని నామాని యః పఠేత్‌ శృణుయాదపి |

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ||

శ్లో || సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే

శ్రీ గణాధిపతయే నమః

శివాయ నమః

శ్లో || శాన్తం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రమ్‌

శూలం వజ్రం చ ఖడ్గం పరశు మభయదం దక్షభాగే వహన్తమ్‌ |

నాగం పాశం చ ఘంటాం ప్రలయహుతవహం సాంకుశం వామభాగే

నానాలజ్కారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||

విష్ణవేనమః

శ్లో || శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్‌ |

లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకై కనాథమ్‌ ||

దేవ్యైనమః

శ్లో || సర్వమఙ్గల మాంగల్యే శివే సర్వార్థసాధికే |

శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమో7స్తు తే ||

శ్లో || నమశ్శివాభ్యాం నవ¸°వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుః ఫలాభ్యామ్‌ |

నగేంద్రకన్యా వృషవాహనాభ్యాం నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్‌ ||

శ్రియై నమః

శ్లో || కరద్వయేన కమలే ధారయ న్తీం స్వలీలయా |

హార నూపురసంయుక్తాం లక్ష్మీం దేవీం నమామ్యహమ్‌ ||

శ్లో || అరుణ కమలసంస్థా తద్రజఃపుంజవర్ణా

కరకమల ధృతేష్టాభీతి యుగ్మాంబుజాతా |

మణిముకుట విచిత్రాలఙ్కృతిః పద్మమాలా |

భవతు భువనమాతా సస్తతం శ్రీః శ్రియై నః ||

సరస్వత్యై నమః

శ్లో || యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిదేవై స్సదా పూజిచా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

శ్లో || నీహారహార ఘనసార సుధాకరాభామ్‌

కళ్యాణదాం కనకచంపకదామభూషామ్‌ |

ఉత్తుంగ పీన కుచకుంభ మనోహరాఙ్గీం

వాణీం నమామి మనసా వచసాం విభూత్యై ||

శ్రీరామాయ నమః

శ్లో || శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః |

సీతాముఖాంభోరుహచఞ్చరీకః నిరన్తరం మంగల మాతనోతు ||

శ్లో || ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదామ్‌ |

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ||

3]

శ్లో || మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్‌ |

వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||

శ్లో || మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే |

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్‌ ||

శ్లో || బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా |

వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్‌ ||

జయ హనుమన్‌ | జయ జయ హనుమన్‌ ||

కృష్ణాయ నమః

శ్లో || వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనమ్‌ |

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

శ్లో || సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణ |

నమో వేదస్తవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణ ||

లక్ష్మీ నృసింహాయ నమః

శ్లో || శ్రీమత్‌ పయోనిధినికేతన చక్రపాణ

భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |

భోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత

లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్‌ ||

శ్లో || ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం

అన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్‌ |

వామేతరేణ వరదాభయహ స్తముద్రాం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌ ||

శ్రీ వేంకటేశాయ నమః

శ్లో || శ్రీ వేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్‌ |

అభంగురవిభూతి ర్నః తరంగయతు మంగళమ్‌ ||

శ్లో || శ్రియఃకాన్తాయ కళ్యాణనిధయే నిధయే7ర్థినామ్‌ |

శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ||

దుర్గాయై నమః

శ్లో || దుర్గే స్మృతా హరసి భీతి మశేషజన్తోః

స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి |

దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ సదా77ర్ద్రచిత్తా ||

శ్లో || కాత్యాయన్యైచ విద్మహే కన్యకుమారి ధీమహి |

తన్నో దుర్గిః ప్రచోదయాత్‌ ||

రమాసహిత సత్యనారాయణస్వామినే నమః

శ్లో || సత్యవ్రతం సత్యవరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే |

సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా ః ||

భాస్కరాయ నమః

శ్లో || ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌ ధ్యేయః సదా సవితృ మండల

మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసన్ని విష్టః |

కేయూరవాన్‌ మకర కుండలవాన్‌ కిరీటీ

హారీ హిరణ్మయవపుః ధృత శంఖచక్రః ||

శ్లో || నమః సవిత్రే జగదేకచక్షుషే

జగత్ర్పసూతి స్థితి నాశ##హేతవే |

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణ

విరిఞ్చి నారాయణ శంకరాత్మనే ||

మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి అర్క ఆదిత్య సవితృ భాస్కరేభ్యోనమః |

శ్లో || భానో భాస్కర శ్రీసూర్యనారాయణ నమో7స్తు తే |

శ్రియం ప్రజ్ఞావ మారోగ్యం శాన్తిం ముక్తిం చ దేహి మే ||

నవగ్రహస్తోత్రమ్‌

శ్లో || ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

ఈ శ్వ రా వ లం బ న ము

మనము, అభ్యుదయము కొఱకు ప్రయత్నించుచున్నాము. అలసత లేకుండా కృషి, వాణిజ్యము, ఉద్యోగము మొదలగు వృత్తులను ఆశ్రయించి, ఉన్న స్థితికంటె ఉన్నత స్థితిని అందుకొనుటకు ప్రయత్నించుచున్నాము. కాని, నిరంతరము, శరీరేంద్రియవ్యాపారముతో సతమత మగుచున్నాము. విశ్రాంతి తక్కువగా నున్నది. ఒకప్పుడు మనము ఊహించని క్లిష్ట సమస్యలు కూడ, ఎదురగుచున్నవి. మానవసాహాయ్యము కొంత వఱకే ఉపయోగపడుచున్నది. ఒకప్పుడు, మనకు తగిన సూచనలను (సలహాలను) అందజేయునట్టి పెద్దలు కూడ, దుర్లభులు అగుదురు. అపుడు, ఈశ్వరుడే, శరణ్యము అగుచున్నాడు. ప్రతి దినము కొంత సమయము, ఈశ్వరస్మరణతోను, దేవతాప్రార్థన తోను, కాలము గడిపినచో, మన మనస్సునకు బలము చేకూరును. సమస్యాపరిష్కారమునకు తగిన ఆలోచన, ఉపాయము ఈశ్వరుడు ప్రసాదించును. ఆపదలనుండి గట్టెక్కుటకు గాని, భోగభాగ్యము లందు అభివృద్ధి చెందుటకు గాని, ఈశ్వరుడు మనకు కనపడక పోయినను సహాయపడును. భక్తులగు వారు అనేకులు భగవదనుగ్రహముచే కష్టములను అధిగమించి, ఉన్నత పదమును అధిరోహించిరి. భగవత్కథలను చదివినను, వినినను, భగవంతుని అచింత్య మహిమ, వెల్లడి అగును. జీవుల ఊహలకు, హేతువాదమునకు అతీతముగా భగవంతుడు సహాయపడును. 'యోగక్షేమం వహామ్యహమ్‌', ' న మే భ క్తః ప్రణశ్యతి' అని భగవంతుని వచనము. కనుక, మనము, ఈశ్వరావలంబనముతో సుఖముగా జీవయాత్ర సాగింపగలము.

తత్త్వజిజ్ఞాస

దేవుడు కనబడుటలేదు గనుక, కొందఱు, పట్టించుకొనరు. కొందఱు ఆపదలేవైనను వచ్చినపుడు, స్మరించి, గట్టెక్కినతరువాత మామూలు స్థితికి వత్తురు. మఱి కొందఱు, భోగైశ్వర్యముల అభివృద్ధికై భగవంతుని, ఆరాధించుచుందురు. భగవత్తత్త్వమును గుఱించి అంతగా విచారించరు. కాని, వ్యాసభగవానుడు 'జీవస్య తత్త్వ జిజ్ఞాసా' సుఖముగా జీవించువారు తత్త్వవిచారణ చేసికొన వలెను అని నిర్దేశించెను.

శ్లో || తత్త్వం యద్‌ జ్ఞాన మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి

భగవానితి శబ్ద్యతే |

తత్త్వమనగా, అద్వయ జ్ఞానము, దివ్య ప్రకాశము. ఉపనిషత్తులను అధ్యయనము చేయువారు ఆ తత్త్వమును 'బ్రహ్మ' అని పేర్కొందరు. యోగులు, 'పరమాత్మ' అని పిలతురు. భక్తులు, 'భగవంతుడు' అని అందురు. ఒకే తత్త్వమునకు ఈ మూడు నామములు వర్తించుచున్నవి. అయినను, సాధనభేదము కలదు. ఉపనిషదధ్యయనము చేయువారు వివేక, వైరాగ్య, శమ, దమాదులతో శ్రవణ , మనన, నిదిధ్యాసనాది సాధనములచే బ్రహ్మతత్త్వమును తెలిసికొనవలయును అని అందురు. యోగులు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాస, సమాధులతో పరమాత్మ సాక్షాత్కారమును పొంద వలయునని చెప్పుదురు. భక్తులు, శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అను నవవిధ భక్తి సాధనములతో భగవత్సాక్షాత్కారమును బడసి, కృతార్థులు కావలయునని చెప్పుదురు. సకల సాధనములు నస్సుచేతనే చేయదగినవి అయి ఉన్నవి. మనస్సు, సత్త్వగుణము కలది అగుచో, ఈ సాధనములు సుకరములు. మానవులు, సత్త్వగుణ సహాయముతో ఈ తత్త్వవిచారము అవకాశమున్న పుడెల్ల , చేసికొనుచు, కృతార్థులగుటకు ప్రయత్నించవలయును. భగవత్‌ ప్రాప్తియే, జీవితమునకు చరమ లక్ష్యము.

మనస్సు - సత్త్వాదిగుణవృత్తులు

మన శరీర, ఇంద్రియ వ్యాపారములు మనస్సునకు అధీనములుగా ఉన్నవి. మనస్సును అనుసరించియే, చక్షురాదీంద్రియములు, కరచరణాదివ్యాపారము ప్రవర్తిల్లుచున్నది. ఇదిగాక, స్వయముగా మనస్సు, ఆలోచన, నిర్ణయము మొదలగు పనులు చేయును. మనస్సు చేతనే, విద్య, సంస్కారములు అలవడును. లౌకిక కర్మలందు నైపుణ్యము కూడ, మనస్సువలననే , లభించును.ఇట్లే వైదిక కర్మలు, దేవతోపాసనము, తత్త్వజ్ఞానము, మనస్సు శిక్షణముననే, పెద్దలు బడయుచున్నారు. కనుక, శరీరమునందు మనస్సు, ప్రధాన స్థానమును ఆక్రమించుకొనినది. ఈ మనస్సు వలననే, మానవుడు, బంధమును, మోక్షమును గూడ, బడయు చున్నాడు. ప్రకృతిగుణములగు సత్త్వ, రజ, స్తమస్సులు ఈ మనస్సును ప్రేరేపించుచుండును. సత్త్వగుణము జ్ఞానమును, సుఖమును, వివేక, వినయ, భక్తి, శమాదులను లభింపజేయును. కనుక, సత్త్వగుణము శుభకరము.

రజోగుణమువలన, కామ, క్రోధ, లోభాదులు, దంభ, దర్ప, ఈర్ష్యా7సూయాదులు - వీని ప్రవృత్తి కలుగుచుండును. ఇది, విక్షేపకరము.

తమస్సు మోహమును, స్తబ్ధతను, అలసతను, అజ్ఞానమును జడత్వమును కలిగించును. రజోగుణము ప్రవృత్తిహేతువైనను, ఒకప్పుడు, అనర్థదాయక మగును. తమస్సువలన, బుద్ధి, ఏ విషయమునయినను, గ్రహించనేరదు. కనుక, సత్త్వగుణమును ఆశ్రయించి, మనస్సును శుద్ధముగా చేసికొని, సాధకుడు, తన లక్ష్యమును చేరుకొనును.

మానవులు సత్త్వస్వభావమును వృద్ధి చేసికొనుచు, రజ స్తమోదోషములను జయించవలెను. భక్తులు, యోగులు, జ్ఞానులు మంచి మనస్సు కలవారు, సత్త్వమూర్తులు, 'ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధిః' సాత్త్వికాహారము వలన, మనస్సు, శుద్ధ మగును. ఇంద్రియములతో సద్విషయములనే గ్రహించి, చెడు విషయములను విడనాడుటవలన మనస్సు , శుద్ధ మగును.

వేదశాస్త్రములు

వేదశాస్త్రములు ప్రమాణ గ్రంథములు. వేదములు అపౌరుషేయములు, జీవులు రచించినవి కావు. పరమేశ్వర ప్రవర్తితములు. జ్ఞానరాశి. ధర్మము, దేవతలు, తత్త్వము అను విషయములను బోధించును. ఈ వేదముల యొక్క అర్థములను తెలిసికొనుటకు తర్కము, వ్యాకరణము, సాంఖ్యము, యోగము, భగవద్గీత (మహాభారత భీష్మ పర్వాతర్గతము), శాస్త్రములు ఉపకరించును. ఇవి (శాస్త్రములు) పౌరుషేయములు, ఋషులచే రచింపబడినవి. తపోబలముచేతను, యోగశక్తిచేతను ఋషులు అతీంద్రియార్థ దర్శనమును చేసిరి. అనగా ఇంద్రియము లకు గోచరము కాని విషయములను తెలిసికొనిరి. ఈ శాస్త్రములలో కొన్ని స్వతంత్రములుగా ఉన్నట్లు కనపడినను, వేదార్థమును గ్రహించుటకు, అనగా, బ్రహ్మను, ధర్మమును తెలిసికొనుటకు అవి ఉపయోగించుచున్నవి. వేదములు జీవకర్తృకములు (జీవులు రచించినవి) కానందున, భ్రమ, ప్రమాద, విప్రలిప్స (వంచనేచ్ఛ) కరణాపాటవములు (ఇంద్రియములకు పటుత్వము తగ్గుట) అను జీవదోషములకు ఆస్పదములు కావు. కనుక, నిర్దోషములు, మఱియు, స్వతః ప్రమాణములు. మఱియొక ప్రమాణమును అపేక్షించకయే, వేదములు యథార్థజ్ఞానమును కలిగించును. శాస్త్రములు మూల ప్రమాణమగు వేదమును అనుసరించుచు, వేద విజ్ఞానమును వివేచన చేయుచున్నవి. తర్కశాస్త్రము కణాద, గౌతమ మహర్షులచే ప్రవర్తితము. సాంఖ్యము కపిలమహాముని చేతను, యోగము పతంజలి మహామునిచేతను ప్రవర్తితములు. 'భగవద్గీత' విశ్వవిఖ్యాతమైన ప్రమాణ గ్రంథముగా విరాజిల్లు చున్నది. వేదవ్యామునీంద్రునిచే మహాభారతేతిహాసమున, భీష్మపర్వమునందు గ్రథితమైనది. భారతీయులకు తమ ధర్మము లను తెలిసికొనుటకు సంగ్రహముగా ఇది ఉపయోగపడుచున్నది, ఉపనిషత్‌ సారభూతమైనది.

భగవద్గీత

శ్రీకృష్ణభగవానునిచే అర్జునునకు (మానవాళికి అందఱిరికి) ఉపదేశింపబడిన ముఖ్య విషయములతో నిండిన గ్రంథరాజము.

శ్లో || ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశసః శ్రియః |

జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ||

శ్లో || ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానా మాగతిం గతిమ్‌ |

వేత్తి విద్యా మవిద్యాం చ స వాచ్యో భగవానితి ||

సమగ్రమగు ఐశ్వర్యము (నియమనాధికారము, ప్రభుత్వము) , వీర్యము , యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను ఆఱు గుణములు కలవాడు, ప్రాణులయొక్క, జనన, మరణములను, సృష్టి, ప్రళయములను, జీవుల ఇహలోక, పరలోక యాతాయాతములను (గమనాగమనములను), ప్రాణుల విద్యా కర్మలను, తెలిసినవాడు భగవంతుడు.

అట్టి భగవదవతారమూర్తి శ్రీకృష్ణుడు. మానవులకు శాంతి సౌఖ్యములు చేకూరుటకు, నిష్కామ కర్మ, భక్తి, జ్ఞాన, యోగము లను ఉపదేశించెను. కొందఱు కర్మయోగమే ప్రధానము అనియు, మఱికొందరు భక్తియోగము ప్రధానమనియు , జ్ఞానయోగము ప్రధానమనియు, ఇతరులు భావించుచున్నారు. ఏది ప్రధానము అని విచారించుటకు ముందు, కర్మ, భక్తి, జ్ఞానములు మూడును ఉపదేశింపబడుటచే వానిని వివరించుట ముఖ్యము.

కర్మయోగము

కర్మయోగ మనగా, కర్మ ఫలమును అపేక్షించక, విహిత కర్మలను ఈశ్వరాభిముఖ చిత్తముతో ఆచరించుట. 'నేను కర్తను'

4]

అను కర్తృత్వాభిమానము, అహంకారము వీడుట అయి ఉన్నది.

శ్లో || కర్మణ్యవాధికార స్తే మా ఫలేషు కదాచన |

అలసత లేకుండా తనకు, కుటుంబమునకు, సంఘమునకు ఆవశ్యక మైన కర్మలను గాని, వైదిక కర్మలను గాని, కృషి, వాణిజ్య, సేవాది లౌకిక కర్మలను గాని, ఆచరించవలయును.

భక్తి యోగము

నిష్కామ కర్మలు ఆచరించుచున్నను, ఈశ్వరునందు లక్ష్యము ఉండవలయును. ఈశ్వరుడే, ప్రాణిదేహములందు నివసించుచున్నాడు. కనుక, పరోపకారము, సమాజసేవ, ఈశ్వర ఆరాధనము అయి ఉన్నవి. ఈశ్వరునందు చిత్తము, లగ్నమై నపుడు, మనకు సద్గుణములు అలవడును. దురితము దూరమగును. ఇతరులతో వైరము, మాత్సర్యము, ఈర్ష్య మొదలగు దోషములు నశించును. భక్తి వలన, మనస్సునకు బలము, ఉత్సాహము కలిగించి, కార్యశూరులమై భగవంతునకు సన్నిహితులము అగుదుము. భగవదనుగ్రహముచే ఐహిక జీవితమును ప్రశాంతముగా నడుపుకొనగలము.

జ్ఞానయోగము

నిష్కామ కర్మాచరణచేతను, భగవద్భక్తి చేతను, మనకు భగవత్తత్త్వజ్ఞానము, ఆత్మజ్ఞానము లభించును. అజ్ఞానము తొలగిరపోవును. దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, చిత్తాహంకారముల నుండి ఆత్మస్వరూపము స్పష్టముగా అనుభవగోచర మగును. సృష్టి, స్థితి, లయ, నిగ్రహానుగ్రహ సమర్థుడగు భగవంతునితో జీవాత్మలమగు మనకు గల సంబందము తెలియును. ఈ విధముగా జీవిత పరమలక్ష్యమును జేరి పరిపూర్ణతను పొందుటకు భగవద్గీత ఉపయోగించును.

అష్టాంగయోగము

ఇచట, 'యోగము' అనగా, చిత్తవృత్తినిరోధము. (పూర్వము కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగములు అనుచోట, యోగము అనగా ఉపాయము అని అర్థము). దీనికి అంగములు ఎనిమిది- యమము, నియమము, ఆససము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనునవి. వీనికి 'అష్టాంగయోగము' అని వ్యవహారము కలదు. యమములు అయిదు- అహింస, సత్యము, అస్తేయము (ఇతరుల సొత్తును ఆశించకపోవుట), బ్రహ్మచర్యము, అపరిగ్రహము (ఇతరులు ఇచ్చినను, తీసికొనకపోవుట).

నియమములు అయిదు - శౌచము, సంతోషము, తపస్సు, సద్గ్రంథపఠనము, ఈశ్వర ప్రణిధానము.

ఆసనము అనగా, కదలకుండా నిశ్చలముగా, సుఖముగా కూర్చుండుట. పద్మాసనము మొదలైనవి.

ప్రాణాయామము - పూరక, కుంభక, రేచకములు.

ప్రత్యాహారము - చక్షురాది ఇంద్రియములను (బాహ్యేంద్రియములను - (కన్ను మొదలైనవానిని), శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనుండి మరలించి, మనస్సుతో చేర్చుట. ఈపైన చెప్పిన అయిదును, బహిరంగసాధనములు.

ధారణ - చిత్తమును ఒక దేశమునందు నిలిపి ఉంచుట ('దేశబంధః చిత్తస్య ధారణా').

ధ్యానము - ఇష్టదేవతా స్వరూపమును, ఆకారమును, గుణ గణములను మఱియొక విషయము చిత్తములోనికి రానీయకుండా, చిత్తము ధరించు సజాతీయ చిత్తవృత్తి ప్రవాహము. ఇది ముఖ్యము.

సమాధి - ధ్యానపరిపాకదశ. తాను ధ్యానము చేయు చున్నాను అని కూడ, మరచి చిత్తము కేవలము ధ్యేయాకారమును ధరించు ధ్యేయాకార చిత్తవృత్తి ప్రవాహము.

ఈశ్వరుడు

"క్లేశ కర్మ విపాక ఆశ##యైః అపరామ్భష్టః పురుషవిశేషః ఈశ్వరః |"

మనస్సు, చంచలమగుటచే కష్టములను తెచ్చిపెట్టు కొన్నందున, యోగము అనగా, చిత్తవృత్తినిరోధము ఆచరింపదగినది. 'అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః' చిత్తవృత్తి నిరోధమునకై కొద్ది సమయము అభ్యాసమును చేయవలెను. వైరాగ్యమును అలవరచుకొనవలెను. కాని, మన ప్రయత్నము ఒకటే చాలదు. ఈశ్వరాలంబనము కూడ, తోడ్పడవలసియున్నది. చేతనములగు మనము సాధారణ పురుషులము, అజ్ఞాన, పాపపుణ్య , రాగాదులకు వశులము. ఈశ్వరుడు పురుషవిశేషః = మనకంటె చాల గొప్ప వాడు. అజ్ఞానము (అవిద్యా), సూక్ష్మాకారము, రాగద్వేషములు, మరణమువలన భయము లేనివాడు. అవిద్య అనగా, అనిత్యమును నిత్యమని, అశుచిపదార్థమును శుచి యని, దుఃఖమును సుఖమని, అనాత్మను ఆత్మయని తలంచుటకు హేతువు; అజ్ఞానము. ఈశ్వరునకు అజ్ఞానము లేదు. ఎల్లప్పుడు సుఖమే కావలయునని కోరుకొనుట రాగము. దుఃఖములు రాకూడదు అనుకొనుట ద్వేషము. మరణము రాకూడదు అనుకొనుట అభినివేశము. ఇవి, ఈశ్వరునకు, లేవు. ఈశ్వర ధ్యానమువలన, చాంచల్యము ఉడుగును. 'తస్య వాచకః ప్రణవః' ఓంకారము ఈశ్వరవాచకము. భగవన్నామము లన్నియు ఈశ్వరనామములే. భగవన్నామములను అర్థానుసంధానముతో కీర్తించుట దురిత హరము. ఇది మనోనిరోధమునకు సులభోపాయము.

పురుషార్దములు

ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి నాలుగు పురుషార్థములు. 'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా' లోకవ్యవహారము చక్కగా నడచుటకు ధర్మము ఆవశ్యకమైనది. ధర్మాచరణలో కామ, క్రోధాది దోషములవలన, వ్యత్యయము (అతిక్రమణము) జరిగినపుడు, ధర్మసంస్థాపన కొఱకు భగవంతుడు అవతరించును. ఈ ధర్మము సమాజములో, వారు ఉన్న స్థానమునుబట్టి, భిన్నమైనది. ఈ ధర్మము పరలోక సుఖమునకు, జన్మాంతర సుఖమునకు గూడ , ఉపయోగించును. ముఖ్యముగా, పరమ పురుషార్థమగు మోక్షమునకు సాధనమైనది. (వర్ణా శ్రమధర్మములు అట్టివి).

అర్థము అనగా, ధనము, భోగోపకరణములు, ఐహిక సుఖ సాధనములు. 'ధనమూల మిదం జగత్‌' అను నానుడి ప్రసిద్ధము. అందఱు, తాము ఉన్న స్థాయికంటె ఉన్నత స్థితిని పొందుటకు ధనమును ఆర్జించుచున్నారు. కాని, విషయభోగము ఐహిక సుఖములు అర్థమునకు ఫలము. ఇవి, అనగా, అర్థ, కామములు స్వతంత్రములై పాధించకుండుటకు ధర్మముచే నియంత్రితము లైనవి. కనుక, ధర్మముయొక్క స్థానము నీతి, న్యాయాదుల కంటె వ్యాపకమైనది. మోక్షము, ముక్తి, అపవర్గము, నిః శ్రేయసము, కైవల్యము అనునవి సాధారణముగా పర్యాయపదములు. ఈ మోక్షమే, ఉత్కృష్టమగు పురుషార్థమని అందురు. కొందఱు దుఃఖ నివృత్తియే, మోక్ష మందురు. మఱికొందఱు నిరతిశయ సుఖము మోక్షము అందురు. దుఃఖము రాకూడదనియు, సుఖము కావలయు ననియు, కోరుచున్నారు. కనుక, మోక్షము అందఱకి ఆవశ్యకము.

వర్ణాశ్రమ ధర్మములు

పర్ణములు నాలుగు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. 'వర్ణ్యన్తే ఇతి వర్ణాః' ప్రశస్తజనులు. అనగా, పుట్టుక నుండియు, జాతకర్మాది సంస్కారములతో శుద్ధిని పొందినవారు. భారతభూమియందు పుట్టిన జనులు, శ్రుతి, స్మృతి ప్రమాణానుసారముగా షోడశ (16) సంస్కారములచేతను, మఱియు చత్వాదింశత్‌ (40) సంస్కారములచేతను, ఎనిమిది ఆత్మ గుణములచేతను, సంస్కరింపబడిన జనులు. రజో, వీర్యశుద్ధి కలవారు. చట్టబద్ధమైన పరిపాలనలోని ప్రజలు అరాజకము లేకుండా సుఖజీవనము చేయువిధమున, ఈవైదిక సంస్కారముల వలన, మానవులు శరీరశుద్ధి, చిత్తశుద్ధిని బడసి, ఆత్మ (భగవత్‌) తత్త్వసాక్షాత్కారమునకు అర్హులగుదురు.

ఆ శ్రమములు నాలుగ. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సంన్యాసము. జీవితకాలమున, జీవనపద్థతిని నిర్దేశించును. బ్రహ్మచర్యము, విద్యాభ్యాసము, గార్హస్థ్యము - యథావిధిగా భార్యాపరిగ్రహ మొనర్చి, గృహస్థధర్మములను అనుష్ఠించును, సత్సంతానమును బడసి, అవిచ్ఛిన్నముగా వంశ భివృద్ధిని కలిగించును. సాధారణముగా, విద్యాభ్యాసకాలము, ఇరువదిఅయిదు సంవత్సరములవఱకు, ఏబదియేళ్ల వఱకు సంతానము బడయట. వానప్రస్థము - వనమునందు గాని, తరువాత, కొండచరియలందుగాని, నివసించుచు, కంద మూలాది అపక్వాహారము స్వీకరించి, కాయ (శరీర) శోషణము, ఇంద్రియనిగ్రహము కలిగి, భగవంతుని గూర్చి, తపస్సు చేసి కొనుట. సంన్యాసము - వైరాగ్యము కలిగినపిమ్మట, శమ, దమాది గుణములతో (కుటీచక, బహూదక, హంస, పరమహంస) యథావిధిగా శిఖాయజ్ఞోపవీతపరిత్యాగ మొనరించి, కాషాయాంబరములు ధరించి, దండము పరిగ్రహించి, మహావాక్యోపదేశమును బడసి, నిరన్తరము బ్రహ్మానుచింతనము చేసికొనవలయును.

ఈ వర్ణాశ్రమవ్యనస్థ ధర్మానుష్ఠానము కొఱకు , జీవితలక్ష్యమగు ఆత్మసాక్షాత్కారమును సాధించుటకు ఏర్పడినది (సమాజ సుస్థిరతకు, సుఖశాంతులకు తోడ్పడినది). కాని, శ్రీ శంకరాచార్యుల వారి సమయమునకే కొంతవఱకు శిథిలమైనది. కాలానుగతముగా ఇంకను, కొన్ని మార్పులు వచ్చినను, యథాశక్తిగా ఆ ధర్మము లను పాటించుట శ్రేయస్కరము.

దేవాలయములు - పుణ్యక్షేత్రములు

శ్లో || దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః |

త్యజే దజ్ఞాననిర్మాల్యం 'సో7హం ' భావేన పూజయేత్‌ ||

శరీరమే, ఒక దేవాలయము. అందు ఉన్న జీవుడు పరమాత్మయే. కనుక, అజ్ఞాన మన్న నిర్మాల్యమును త్యజించవలయును. 'సో7హం' నేను ఆ పరమాత్మను అని స్వరూపాను సంధానరూప మగు పూజను చేయవలయును.

భారతభూమి, పుణ్యభూమి. దేవతావాసములగు హిమాలయ, శ్రీశైల, వేంకటాచల, అరుణాచలాది పర్వతములతోను, గంగా, గోదావరీ, కృష్ణా, కావేరీ మొదలగు జీవనదులతోను, కాశీ, రామేశ్వర, శ్రీరంగాది పుణ్యక్షేత్రములతోను విలసిల్లుచున్నది. నదీతీరములందు ఋషులు ఆ శ్రమములను నిర్మించుకొని, తపస్సు స్వాధ్యాయముల నొనర్చుకొనుచు, ఈశ్వరారాధన చేసికొను చుండెడివారు. గ్రామ, నగరవాసులకు పూజాధ్యానాది సౌకర్యమునకై దేవాలయములు వెలసినవి. ఈశ్వరుడు నిరాకారుడయ్యు, భక్తానుగ్రహము కొఱకు వారికి ఇష్టములగు సగుణ, సాకార దేవతా రూపములను ధరించెను. సాధారణ జనులకు ఈశ్వరానుగ్రహము కొరకై దూరదృష్టిని ప్రసరించి, ఆగమోక్త ప్రకారముగా కళావాహన, ప్రతిష్ఠాదులతో, విగ్రహమునందు చిత్కళతో దేవతా సాన్నిధ్యమును లభింపజేసి, మూర్తిపూజను దేవాలయములందు ఋషులు ఏర్పరచిరి. ప్రతి గ్రామమునందును, శివాలయము, విష్ణ్వాలయము తరచుగా వెలయింపజేసిరి. గ్రామ, నగరవాసులు గృహస్థులగుచేత ప్రతి దేవాలయమునందును, అమ్మవారి విగ్రహమును గూడ, ప్రతిష్ఠించి, పూజ చేయువ్యవస్థ చేయబడెను. ఈ పార్వతీపరమేశ్వరులు, శ్రీలక్ష్మీనారాయణులు, సీతారాములు ఆ గ్రామ, నగరవాసులను రక్షించుచుందురు.

పుణ్యక్షేత్రములు

శ్లో|| అయోధ్యా మధురా మాయా కాశీ కా ఞ్చీ అవన్తికా |

పూరీ ద్వారవతీచైవ సపై#్తతే మోక్షదాయాకాః ||

మహర్షులు, తపస్సుచేసి, సిద్ధి పొందిన క్షేత్రములు పుణ్య క్షేత్రములు. వారి తపః ప్రభావము ఆ ప్రదేశములయందు వ్యాపించి యుండుటచే పవిత్రములై పుణ్యక్షేత్రములుగా వరలుచున్నవి. అయోధ్య, మధుర, హరిద్వారము. కాశి, కంచి, ఉజ్జయని, ద్వారక ఇవియే కాక, రామేశ్వరము, శ్రీకాళహస్తి, శ్రీశైలము, భద్రాచలము సింహాచలము, తిరుపతి, పూరి, అన్నవరము, శ్రీరంగము, ఉడిపి, బదరి, అయోధ్య మొదలైన పావన క్షేత్రములు ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రములకు విశేష ప్రాముఖ్యము, చరిత్ర కలదు.

ఋషులు

ఋషులు మంత ద్రష్టలు, తపస్సంపన్నులు, జ్ఞాన సంపన్నులు, సత్ప్రవర్తన, సద్గుణములు కలవారు. విద్య, జన్మ, వంశప్రవర్తకులు. శిష్య ప్రశిష్యులచే విద్యావంశమును, పుత్ర, పౌత్రాదులచే, జన్మవంశమును వర్ధిల్లజేసినవారు. ఐహికాముష్మిక భోగముల కంటె తత్త్వజ్ఞానమునందును, ఈశ్వరోపాసనయందును సత్కర్మలందును నిష్ఠ కలవారు. నిరాడంబరజీవులు. వసిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, గౌతముడు, భృగువు, కౌండిన్యుడు మొదలగువారు గోత్రఋషులు. వీరుగాక, మహర్షులు వ్యాసుడు, వాల్మీకి మొదలగువారు. దేవర్షులు, నారదుడు, అసితుడు, దేవలుడు మొదలగువారు. బ్రహ్మర్షులు, విశ్వామిత్రుడు అగస్త్యుడు, చ్యవనుడు మొదలగువారు. ఆజన్మసిద్ద వైరాగ్య సంపన్నులగు సనక, సనందన, సనాతన సనత్కుమారాదులు యోగఋషులు. వీరి వలన, భారతవిజ్ఞానము, సంస్కృతి వర్థిల్లినవి. పరాశురుడు, వ్యాసుని తండ్రి, వారిచే చెప్పబడిన స్మృతి, కలియుగమున, ప్రవర్తకము.

5]

అధ్యాత్మ విద్య

విద్య, అజ్ఞానమును తొలగించును. అన్ని విద్యలు జ్ఞాన దాయకములై యున్నవి. భౌతిక విద్యలు ఐహిక సుఖములకు ఉపయోగపడుచున్నవి. సమాజములో గౌరవమును, అభ్యున్నతిని కలిగించుచున్నవి. విద్యాప్రయోజనము ధనార్జనమే గాక, వినయాది గుణసంపద, సత్ప్రవర్తన, బుద్ధివికాసము కూడ అయి ఉన్నది. అయితే, కృష్ణభగవానుడు 'అధ్యాత్మవిద్యా విద్యానామ్‌' అని విద్యలలో అధ్యాత్మ విద్య, తన విభూతిగా పేర్కొనివాడు. అధ్యాత్మవిద్య అనగా, ఆత్మను గుఱించి, తెసికికొనుట.'అహమ్‌' (నేను) అని స్ఫురించునది ఆత్మ. 'అహం మనుష్యః' 'నేను మనుష్యుడను' అను వ్యవహారములో మనుష్యత్వధర్మము గల శరీరము ఆత్మగా గోచరించుచున్నది. 'అహం పశ్యామి' నేను చూచుచున్నాను అను వ్యవహారములో చక్షురింద్రియము ఆత్మ. స్వప్నములో తాను, మహారాజుగా కలగని, మఱియొక దేహముతో వ్యవహరించుచున్నాడు. కనుక, ఈ 'అహం' (నేను) అని వ్యవహరించు వస్తువు, శరీరమా? ఇంద్రియములా? లేక, మఱియొకటా ? అను విచారణకు అవకాశ మేర్పడినది. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, పనిచేయకున్నను, 'నేను హాయిగా నిద్రపోయితిని' అని సుషుప్తి సుఖమును అనుభవించుచున్నాడు.

ఈ విధముగా అవస్థాత్రయమునందు విహరించుచు, అవస్థాత్రయాతీతము, అవస్థాత్రయానుస్యూతమును అగు ఆత్మ తత్త్వమును తెలియజేసి, దుఃఖములేని సుఖస్థితిని అధ్యాత్మవిద్య ప్రసాదించును. ప్రతిదినము, ఆత్మస్వరూప విచారణ చేసి కొనుట ధ్యానము (జ్ఞానము) ద్వారా ఆత్మతత్త్వసాక్షాత్కారము పొందుట అధ్యాత్మత త్త్వ విద్యయొక్క లక్ష్యము.

శ్రీ గురుభ్యో నమః

హరిః ఓమ్‌

శ్లో|| స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం

న్యాయేన మార్గేణ మహీం మహీశాః |

గోబ్రాహ్మణభ్యః శుభమస్తు నిత్యం

లోకాః సమస్తాః సుఖినో భవన్తు ||

స్వస్తి ప్రజాభ్యః =ప్రజలకు క్షేమము కలుగుగాక ! మహీ పతులు (రాజులు) న్యాయమార్గముతో భూమిని పాలింతురుగాక ! (సత్పరిపాలనముచేత ప్రజలకు క్షేమము కలుగుగాక ! ) నిత్యము గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగుగాక ! క్షీరము, దధి, ఘృతము మొదలగు హవిర్ద్రవ్యములచేత గోవులును, మంత్రముల చేత బ్రాహ్మణులును (దేవతలను తృప్తినొందింతురుగాక!) సర్వ జనులు సుఖమును బడయుదురుగాక !

అరాజకము లేకుండ సత్పరిపాలనము ఉన్నచో, ధర్మమును అనుష్ఠించుటకు వీలు కలుగును. ధర్మాచరణముచే , జనులు సుఖమును పొందెదరు.

ఓం తత్సత్‌ బ్రహ్మార్పణమస్తు

శ్లో|| ఓం తత్‌ సత్‌ ఇతి నిర్దేశః బ్రహ్మమ స్త్రివిధః స్మృతః |

ఓం , తత్‌ , సత్‌ అనునవి బ్రహ్మనామములు. పరమాత్మను స్మరించి, ఫలమును కోరక, సత్కర్మలను ఆచరించి, పరమేశ్వరునకు అర్పించవలయును.

శుభం భూయాత్‌

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

ఓమ్‌

శ్రీ గురుభ్యో నమః

శ్రీ సూర్యనారాయణ ఆర్యాద్వాదశకస్తోత్రమ్‌

శ్లో|| ఉద్యన్‌ అద్య వివస్వాన్‌ ఆరోహన్‌ ఉత్తరాం దిశం దేవః |

హృద్రోగం మమ సూర్యో హరిమాణం చ ఆశు నాశయతు ||

తాత్పర్యము

ఇపుడు, ఉదయించుచున్న సూర్యభగవానుడు, ఆకాశము యొక్క ఉత్తరభాగమును అధిష్ఠించుచు, అధిక మగుచున్న నా హృదయరోగమును, హరిమా (కామిలా-పచ్చ కామెరల) రోగమును శ్రీఘ్రముగా నశింపజేయుగాక !

శ్లో || నిమిషార్థేనై కేన ద్వే చ శ##తే (ద్వే) సహస్రే ద్వే |

క్రమమాణ యోజనానాం నమో7స్తు తే నలిననాథాయ ||

తాత్పర్యము

ఒక అద్ధనిమిషములో రెండు వేల రెండు వందల యోజనముల దూరము. సంచారము చేయు నళిననాథుడవగు ఓ సూర్య దేవా ! నీకు నమస్కారము.

శ్లో || కర్మ జ్ఞాన ఖ దశకం, మనశ్చ, జీవ ఇతి విశ్వసర్గాయ |

ద్వాదశధా యో విచరతి స ద్వాదశ మూర్తిరస్తు మోదాయ || 3

తాత్పర్యము

ప్రపంచసృష్టి కొఱకు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, జీవుడు అను పండ్రెండు విధములుగ, ఎవరు సంచరించుచుండునో, అట్టి ద్వాదశాదిత్య భగవానుడు సంతోషకరుడు అగుగాక !

శ్లో || త్వం యజు స్సామ ఋక్‌ త్వం,

త్వమాగమ స్త్వం వషట్‌ కారః |

త్వం విశ్వం త్వం హంసః త్వం భానో |

పరమహంసశ్చ ||

తాత్పర్యము

నీవు యజుర్వేదము, నీవు సామవేదము, నీవు ఋగ్వేదము నీవు ఆగమము, నీవు వషట్‌ కారము, నీవు విశ్వము, నీవు హంసవు, నీవు పరమహంసవు.

శ్లో|| శివరూపాత్‌ జ్ఞాన మహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్‌ |

శిఖిరూపాత్‌ ఐశ్వర్యం త్వత్తశ్చ ఆరోగ్య మిచ్ఛామి ||

తాత్పర్యము

ఓ సూర్య భగవానుడా ! శివరూపుడవగు నీ వలన, జ్ఞానమును, జనార్ధనరూపుడవగు నీవలన, మోక్షమును, శిఖి (అగ్ని) రూపుడవగు నీ వలన, ఐశ్వర్యమును, సూర్యుడవగు నీవలన, ఆరోగ్యమును కోరుచున్నాను.

శ్లో || త్వచి దోషాః దృశి దోషాః హృది దోషాః యే అఖిలేంద్రియ దోషాః |

తాన్‌ పూషా హతదోషః కించిత్‌ రోషాగ్నినా దహతు || 6

తాత్పర్యము

చర్మసంబంధమైన దోషములు, దృష్టిసంబంధమైన దోషములు, హృదయసంబంధమైన దోషములు, సకల ఇంద్రియములకు సంబంధించిన దోషములు, ఏవియేవి కలుగగలవో, కలవో, వానిని అన్నిటిని , సర్వదోషనాశకరుడైన పూష (పోషకుడైన ) భగవానుడగు సూర్యుడు, కొద్దిపాటి రోషాగ్నితో దహించుగాక !

శ్లో || ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధాన్‌ ఉగ్రతాపవేగకరాన్‌ |

బందీకృతేంద్రియగణాన్‌ గదాన్‌ విఖండయతు చండాంశుః ||

తాత్పర్యము

ప్రచండ కిరణములు గల సూర్యుడు, ధర్మ, అర్థ, కామ, మోక్షములను నిరోధించగల, ఉగ్రమైన తాపమును శీఘ్రముగా కలిగించునవియు, ఇంద్రియ సమూహమును బంధించునవియు నగు రోగములను హరించుగాక ?

శ్లో || యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరాచరం నిఖిలమ్‌ |

ధృతబోధం తం నలినీభర్తారం హర్తార మాపదా మీడే ||8

తాత్పర్యము

ఏ దేవుని సన్నిధానము లేనిచో, సమస్త చరాచర జగత్తును అంధకారము ఆవరించియుండునో, అట్టి జ్ఞానప్రకాశరూపుడును, ఆపదలను హరించు (నశింపజేయు ) వాడును, నళినీభర్తయును అగు సూర్యభగవానుని స్తుతించుచున్నాను.

శ్లో|| యస్య సహస్రాభీశోః అభీశులేశో హిమాంశుబింబగతః |

భాసయతి నక్తి మఖిలం భేదయతు విపద్గణాన్‌ అరుణః || 9

తాత్పర్యము

సహస్ర (అనంత) కిరణుడై వ ఏ సూర్యుని కిరణలేశము, చంద్రబింబమును జేరి, రాత్రికాలమునంతను, ప్రకాశింపజేయునో, అట్టి సూర్యుదేవుడు సర్వవిధములైన విపత్తులను, సర్వ ఆపదలను నశింపజేయు (భేదించు) గాక !

శ్లో|| తిమిరమివ నేత్రతిమిరం, పటలమివ అశేష రోగపటలం నః |

కాశమివ ఆధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్‌ || 10

తాత్పర్యము

కాలజ్ఞానకరుడగు భాస్కరుడు (సూర్యుడు), చీకటిని హరించునట్లు, మాయొక్క నేత్రరోగములను, అట్లే, సర్వరోగ సమూహములను, కాశ (దగ్గు మొదలగు, శ్వాససంబంధమైన) రోగములను, మానసిక రోగముల నన్నిటిని హరించుగాక !

శ్లో || వాతాశ్మరీ గుదార్శ స్త్వగ్‌ దోష, మహోదర ప్రమేహాం శ్చ |

గ్రహణీ భగంధరాఖ్యా మహాతీ రుజో7పి మే త్వం హంసి || 11

తాత్పర్యము

ఓ భగవానుడా ! నీవు, వాత, అశ్మరీ (మూత్రకోశములో, రాయి ఏర్పడుట) మూలవ్యాధి (Piles), నేత్ర, చర్మరోగములు, మహోదర, జలోదర, ప్రమేహ, గ్రహణీ (రక్తవిరేచనములు), భగంధరము (pistula) మొదలగు మహారోగములను గూడ, నాకు లే (రా) కుండునట్లుగా నశింపజేయుచున్నావు.

శ్లో || త్వం మాతా, త్వం శరణం, త్వం ధాతా, త్వం ధనం త్వ మాచార్యః |

త్వం త్రాతా, త్వం హర్తా విపదాం, అర్క ! ప్రసీద మమ భానో ! || 12

తాత్పర్యము

ఓ అర్కదేవా! నీవే తల్లివి, తండ్రివి, ధాతవు, ధనము ; నీవు ఆచార్యుడవు. రక్షకుడవు. ఆపదలను హరించువాడవు. నాకు ప్రసన్నుడవై ఉండుము.

ఇతి ఆర్యాద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్‌ పతితం పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయశ్య స్యాత్‌ ||

ఇతి శ్రీ సూర్య నారాయణ ఆర్వాద్వాదశకస్తోత్రం సంపూర్ణమ్‌ ||

ఫలశ్రుతి :- ఇట్లు సాంబుని ఎదుట ఆకాశమునుండి పడిన పండ్రెండు ఆర్యావృత్త శ్లోకములు గల ఈ స్తోత్రమును భక్తితో పఠించువారికి సర్వసౌభాగ్యములు సమృద్దిగా కలుగును, సర్వరోగములును నశించును, శాంతి లభించును.

ఓం తత్‌ సత్‌

భగవత్సాక్షాత్కారము

భగవత్సాక్షాత్కారము ఈ జన్మయందే కలుగునా? అని , కొందఱు తరచుగా ప్రశ్నించుచుందురు. ఒక జన్మయందే కావచ్చు, అనేక జన్మలయందైనను, కావచ్చును, దీనికి నియమమేమీ లేదు. కాని, భగవంతుని పట్ల, ప్రగాఢమైన భక్తి కలిగినపుడే, భగవత్సాక్షాత్కారము కలుగును. అనేక జన్మల వరకు భక్తి కలగనిచో, భగవత్ర్పాప్తి సిద్ధించదు. భగవద్భక్తి, తీవ్రమైనపుడు, ఒక జన్మలోనే భగవత్సాక్షాత్కారము కలుగును.

భక్తుడు, భగవత్ర్పాప్తికై అత్యంతమైన ఉత్కంఠతో - ఇచ్ఛతో స్వాధ్యాయ, ధ్యానాదులు చేసినపుడు, భగవంతుడు తప్పక, సాక్షాత్కరించును.

ఆ ప్తకాముడు, పూర్ణకాముడు, ఆత్మారాముడు, పరమ నిష్కాముడును అయిన భగవంతుడు, పరమ స్వతంత్రుడు అయినను, భక్తుని భక్తికి వశీభూతు డగుట భగవంతుని స్వభావము.

"అహో చిత్ర మహో చిత్రం వందే తత్ప్రేమబంధనమ్‌ |

యద్బద్ధం ముక్తిదం ముక్తం బ్రహ్మ క్రీడామృగీకృతమ్‌ ||"

అహో ! ఒకరు నిర్గుణ, నిరాకార, నిర్వికార బ్రహ్మను ఉపాసింతురు, మరొకరు సగుణ, సాకార బ్రహ్మను సేవింతురు. కాని, ఏ ప్రేమబంధుచేత బద్ధుడై, అనంత ప్రాణులకు ముక్తి ప్రదాత, స్వయముగా నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్తస్వభావుడు అయిన ఆ బ్రహ్మ , భక్తులకు ఆటబొమ్మ అగుచున్నాడో, ఆ ప్రేమ (భక్తి) బంధమును భజించుదునని ఒక భక్తుని వచనము.

6]

భక్తుడు, భగవంతునికి దూరముగా ఉండజాలనపుడు. భగవంతుడు గూడా, భక్తునికి దూరముగా ఉండలేడు.

"అజాతపక్షా ఇవ మాతరం ఖగాః,

స్తన్యం యథా వత్సతరా క్షుధార్తాః |

ప్రియం ప్రియేవ వ్యుషితం విషణ్ణా

మనో7రవిందాక్ష దిదృక్షతే త్వామ్‌ ||"

అనగా , రెక్కలు రాని పక్షిసంతాచము తన తల్లిని సమీపించుటకై వ్యాకులపడును. ఆకలిగొన్న గోవత్సములు (లేగదూడలుః మాతృ స్తన్యమును అభిలషించు చుండును. పరదేశమున కేగిన ప్రియున సంపర్కమునకై ప్రియురాలు విషణ్ణురాలై ఎదురుచూచుచుండును. ఆ విధముగానే, హే కమలనయన! నా మనస్సు నీ దర్శనేచ్ఛలో ఉత్కంఠిత మగుచున్నది.

ఈ విధమైన ఉత్కంఠ గల భక్తుని ప్రార్థన వలన, భగవంతుడు, వెంటనే భక్తునితోటి సమాగమమునకై పరుగులిడును.

అవును, భగవత్సమాగమమునకు సంబంధించిన తీవ్రమైన ఉత్కంఠ (తీవ్రమైన కోరిక) అంత సరళము కాదను విషయము సత్యమే. కాని, జన్మ, జన్మాంతరముల పుణ్యపుంజము వలననే, భగవంతునియందు ఉత్కటమైన (తీవ్రమైన) ప్రేమ (భక్తి) జనించును. కావుననే.

"తమేత మాత్మానం బ్రాహ్మణా యజ్ఞేన దానేన

తపసా7నాశ##కేన వివిదిషన్తి"|

అనుచు, ఉపనిషత్తులు బ్రహ్మణాది అధికారులు యజ్ఞ, తపో, దాన, అనశనాది (ఉపవాసాది) సత్కర్మాచరణము చేత పరమ తత్త్వభూతుడైన ఆ భగవంతుని, తెలిసికొనుటకై తీవ్రమైన ఇచ్ఛ కలిగి యుందురని చెప్పుచున్నవి.

ఆ పరమ తత్త్వజిజ్ఞాసను కలుగజేయుటకే, అనేక జన్మలలో ఆచరించిన సత్కర్మలు అపేక్షితములు, ఆవశ్యకములు అగుచున్నవి. ఇటువంటి స్థితిలో ఎవరికి భగవత్సాక్షాత్కారమునందు తీవ్రేచ్ఛ ఉండున, ఎవరికి భగవత్ర్పాప్తి సిద్ధించకపోవుట వలన, మహావ్యాకులత కలుగునో, ఆ వ్యక్తి, ఈ జన్మలో సత్కర్మానుష్ఠానము చేయుటయే గాక, పూర్వజన్మల నుండి భగవత్ర్పాప్తికి సంబంధించిన ప్రయత్నము చేయుచు వచ్చుచున్నాడని తెలియ వలయును. ఈ దృష్టితో ధ్రువుని జన్మాంతరీయ తపస్సులకు సంబంధించిన వచనములు మననము చేయదగియున్నవి.

"బహునాం జన్మనా మన్తే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే"|

ఇత్యాది వచనములు ప్రేమ (భక్తి) ఉత్కటమైనపుడు, వెంటనే భగవద్దర్శనము సిద్ధించును అని చెప్పుచున్నవి. పూవును త్రుంచుట కైనను, విలంబము కావచ్చును గాని, ఆ క్షణమునందు భగవత్‌ ప్రాప్తికి ఈషణ్మాత్రమైనను విలంబము జరుగదు. భగవంతుడు సర్వప్రాణుల అంతరాత్మ, సర్వసాక్షి. ఆ భగవంతుని, జేరుటకు కష్టమేమి ఉండును?

"కో7తి ప్రయాసో7సురబాలకా హరే రూపాసనే

స్వే హృది ఛి ద్రవత్సతః |"

అనెడి ప్రహ్లాద వాక్యములు ఆదరణీయములు. భగపత్ర్పాప్తికి అత్యంత తివ్ర ప్రయత్నము అపేక్షితమని చెప్పుటకై, భగవంతుడు అత్యంత దుర్లభుడని శాస్త్రములు (శ్రుతులు) పేర్కొనినవి. నిరాశను తొలగించి, ఉత్సాహమును పెంపొందించుటకై, భగవంతుడు అత్యంత సుగముడని (తేలికగా పొంద దగినవాడని) కూడా చెప్పినవి -

"దూరాత్సుదూరే అన్తికాత్తదు అన్తికే చ "|

అనగా, భగవంతుడు అతి దూరస్థుడు, అట్లే, అతి సమీపస్థుడునయి ఉన్నాడని భావము.

శ్రీ గణశపఞ్చరత్నమ్‌

శ్లో || ముదా కరాత్తమోదకం సదా ముక్తి సాధకం

కలాధరావతంసకం విలాసి లోకరక్షకమ్‌ |

అనాయకైకనాయకం వినాశితేభ##దైత్యకం

నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్‌ || 1

తాత్పర్యము

శ్రీ మహాగణపతి, ఆనందముతో రెండు హస్తములందు మోదకములను (ఉండ్రాళ్లను) ధరించియున్నవాడు, ఎల్లవేళల, సాధకులకు ముక్తి నొసగువాడు, చంద్రుని, శిరోభూభణముగా ధరించి, విలసిల్లువాడు, సర్వలోకరక్షకుడు, అనాథులకు అందఱికి తానొక్కడే, ఏకైక నాయకు డయినవాడు, గజాసురుని సంహరించినవాడు, వినమ్రులైనవారికి అశుభములను (ఆపదలను) వెంటనే నాశమొందించువాడును అయిన ఆ వినాయకుని, నమస్కరించుదును.

శ్లో || నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం

సమత్సురారినిర్జరం నతాదికాపదుద్ధరమ్‌ |

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్‌ || 2

తాత్పర్యము

శిరస్సు ఒంచి, నమస్కారము చేయని దుర్మాదాంధులకు భయము గొల్పువాడు, అప్పుడే ఉదయించిన భాస్కరుని (సూర్యుని) వలె భాసించునట్టివాడు, సురులు, అసురుల చేత నమస్కరింపబడువాడు, భక్తివినమ్రులైనవారిని ఆపదలనుండి సముద్థరించువాడు, దేవతలకు ప్రభువైనవాడు, నిధులకు అధిపతి అయినవాడు, గజేశ్వరుడు, గణాధిపతి, మహేశ్వరుడు, పరాత్పరుడు (మాయాతీతుడయిన బ్రహ్మ) అయిన ఆ వినాయక దేవుని, నిరంతరము ఆశ్రయింతును.

శ్లో || సమస్తలోకశఙ్కరం నిరస్త దైత్యకుఞ్జరం

దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరమ్‌ |

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌ || 3

తాత్పర్యము

సమస్త లోకములకు మంగళకరుడు, గజాసురసంహర్త. అనల్పమైన ఉదరము కలవాడు (లంబోదరుడు), సర్వ శ్రేష్ఠుడు, గొప్ప గజముఖము కలవాడు, అక్షరుడు (త్రికాలాబాధ్యసత్య స్వరూపుడు) కృప దాల్చువాడు, క్షమాకరుడు, ఆనందము నొసగువాడు (ఆనందమునకు నిలయమైనవాడు) కీర్తి ప్రదాత, ఆత్మ సమర్పణభావముతో మోకరిల్లినవారికి శుభసంకల్పములు చేయునట్టి మంచి మనస్సు నొసగువాడు, నిరంతర ప్రకాశుడును అయిన ఆ గణపతిదేవుని, నమస్కరింతును.

శ్లో || అకిఞ్చనార్తిమార్జనం చిరన్తనోక్తి భాజనం

మురారిపూర్వనన్దనం సురారిగర్వచర్వణమ్‌ |

ప్రపఞ్చ నాశభీషణం ధనఞ్జయాధిభూషణం

కపోలదానవారణం భ##జే పురాణ వారణమ్‌ || 4

తాత్పర్యము

దరిద్రుల ఆర్తిని (దుఃఖమును) తుడిచిపెట్టువాడు అపౌరుషేయ వేదవాక్కులకు పాత్రమైనవాడు (వేదవాక్కులచే స్తుతింపబడినవాడు), త్రిపురసంహారి అయిన ఈశ్వరునియొక్క జ్యేష్ఠపుత్రుడు, సురారి=దేవతలకు శత్రువులైనవారి గర్వమును చూర్ణముగా చేసినవాడు, ప్రళయకాలమున, భయంకరుడు, అగ్ని మొదలగు దేవగణమునకు భూషణమైనవాడు, కపోలములందు జాలువారుచున్న మదజలము గల గజాననుడు అయిన పురాణ వారణం= సృష్టికి పూర్వమునుండి ఉన్న గజమును (బ్రహ్మను) భక్తి నిర్భర హృదయముతో సేవించుదును.

శ్లో || నితాస్తకాస్త దన్తకాన్తి మన్తకాన్త కాత్మజం

అచిస్త్వరూప మన్తహీన మన్తరాయకృన్తనమ్‌ |

హృదస్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం

తమేకదన్తమేవ తం విచిన్తయామి సన్తతమ్‌ || 5

తాత్పర్యము

మిక్కిలి కమనీయమైన దంతకాంతి గలవాడు, కాలకాలుడు (యమునకు గూడ, యముడు) అయిన శివుని పుత్రుడు, అచింత్య రూపుడు (రూపరహితుడు), అంతమనునదిలేనివాడు (అవినాశి), నిఃశ్రేయసమునకు భంగము కలిగించు విఘ్నములను నాశమొందించువాడు (మోక్షప్రదాత) , యోగుల హృదయాంతరమువ, నిరంతరము నివసించువాడు అగు ఆ ఏకదంతునే, సతతము, చక్కగా చింతనము (మననము, ధ్యానము) చేయుదును.

శ్లో || మహాగణశపఞ్చరత్న మాదరేణ యో7న్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్‌ గణశ్వరమ్‌ |

అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయు రష్టభూతి రభ్యుపైతి సో7చిరాత్‌ || 6

శ్రీ గణశపఞ్చరత్నం సంపూర్ణమ్‌ |

తాత్పర్యము

ఫలశ్రుతి:- ఏ భక్తుడు, ప్రాతఃకాలమున, ఆ గణశ్వరుని హృదయపుండరీకమునందు స్మరించి, ప్రతిదినము, ఈ మహాగణశ పఞ్చరత్నస్తోత్రమును ఆదరపూర్వకముగా పఠించునో, అతడు అచిరకాలముననే, ఆరోగ్యమును, దోషరాహిత్యమును, మంచి సాహితీసౌరభమును పొందును, సుపుత్రత్వమును బడయును. దీర్ఘాయుష్మంతుడై, అణిమాది అష్టైశ్వర్యసిద్ధిని బడయును.

శ్రీ శంకరాచార్య కృత శ్రీ గణశపఞ్చరత్నము

సమాప్తము.

శ్రీ మ హా గ ణ ప తి వై భ వ ము

సర్వజగన్నియంతయైన పూర్ణ, పరమ తత్త్వమే , గణపతి తత్త్వము. ఏలయనగా -

"గణానాం పతిః గణపతిః |"

"గణశబ్దః సమూహస్య వాచకః పరికీర్తితః |"

అను వచనముల వలన, 'గణ' శబ్దము సమూహవాచకము. సమూహములను పాలించు పరమాత్మను 'గణపతి' అని అందురు. దేవతలకు ప్రభువై నవానిని గూడా 'గణపతి' అందురు. అథవా,

"మహత్తత్త్వాది తత్త్వగణానాం పతిః గణపతిః |"

"నిర్గుణ సగుణ బ్రహ్మగణానాం పతిః గణపతిః |"

సర్వవిధములైన గణములకు సత్తా, స్ఫూర్తులను ఇచ్చునట్టి పరమాత్మయే, గణపతి. సృష్టి స్థితి, లయత్వములు. జగన్నియంతృత్వ, సర్వపాలకత్వాది గుణములు ఎవరియందు ఉండునో, ఆయనయే , బ్రహ్మ.

"ఓం నమస్తే గణపతయే త్వేమేవ కేవలం కర్తా7సి,

త్వమేవ కేవలం ధర్తా7సి, త్వమేవ కేవలం

హర్తా7సి, త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మాసి |"

మొదలగు వచనముల వలన గణపతి, బ్రహ్మయే అని తెలియుచున్నది.

సమస్త దృశ్యప్రపఞ్చమునకు అధిష్ఠానమే గణపతి. అధిష్ఠానము వలననే కల్పిత వస్తువునకు స్థితి, ప్రవృత్తి కలుగును. కావున, భిన్న భిన్న పురాణములందు శివ, విష్ణు,

7]

సూర్య, శక్తిమున్నగువారందరు బ్రహ్మరూపముగా వివక్షితులైరి. బ్రహ్మతత్త్వము ఏకమే అయినపుడు, ఆతత్త్వముయొక్క నానా రూపములు భిన్న భిన్నములుగా పురాణములు ఎట్లు పేర్కొను చున్నవి ? అని ఆశఙ్క కలుగవచ్చును.

ఒకే పరమ తత్త్వము భిన్న భిన్న ఉపాసకుల భిన్న భిన్న అభిలషితముల సిద్ధికై తన లీలాశక్తిమహిమ చేత భిన్న భిన్న గుణగణసంపన్నమై, నామ, రూపములు గలదై అభివ్యక్తమగుచున్నదనియే, దీనికి సమాధానము. ప్రధానముగా విఘ్న వినాశకత్వాది గుణగణసంపన్నమైన గణపతియొక్క రూపమందు ఆ పరమ తత్త్వమే ఆవిర్భూత మగును.

సమస్త ప్రపంచము బ్రహ్మతత్త్వమే అయినపుడు, గణపతియే, విశేషించి, 'బ్రహ్మ' అని ఏల చెప్పబడవలయును ? అన్నియు బ్రహ్మరూపములని చెప్పవచ్చునుగదా! అయినను, ఆ యా గుణములచేత విరాజిల్లుచున్న బ్రహ్మత్వము, కేవల శాస్త్రము వలననే తెలిసికొనదగును. అనగా, శాస్త్రమే ఏ యే నామ , రూప, గుణములతో గూడిన తత్త్వములను 'బ్రహ్మ'యని చెప్పుచున్నవో, ఆ తత్త్వములే బ్రహ్మవాచ్యము లగును. ఏలన, అతీంద్రియ వస్తుజ్ఞానము కలిగించుటయందు ఒక్క శాస్త్రము మాత్రమే, ప్రమాణము కాగలుగును. శాస్త్రములు, ముఖ్యముగా వేదములు, వేదానుసారులైన స్మృతీతిహాస పురాణాదులే అయి ఉన్నవి. శాస్త్రములు గణపతిని 'పూర్ణబ్రహ్మ' అని చెప్పచున్నవి. శ్రుతి యందు గణపతి -

"త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి"|

అని చెప్పబడెను. దీని అభిప్రాయమ మేమనన, గణపతిస్వరూపమందు నరుడు, గజము- ఈ యిరువురి సామంజస్యమే చూడబడు చున్నది. ఇది, ప్రత్యక్షముగానే పరస్పరవిరుద్ధములుగా ప్రతీయమానమగు 'తత్‌' 'త్వం' పదార్థముల అభేదమును సూచించు చున్నదా? అన్నట్లు ఉన్నది. ఏలన, 'తత్‌' పదార్థము సర్వజగత్కారణుడు, సర్వశక్తిమంతుడును అయిన పరమాత్మ అగును. 'త్వం' పదార్థము అల్పజ్ఞుడు, అల్ప శక్తిమంతుడును అయిన జీవుడు అగును. ఆ యిరువురి ఐక్యము పైకి, విరుద్ధమైనదిగా తోచినను, లక్షణయా, విరుద్ధాంశద్వయమును త్యాగమొనర్చినచో, ఐక్యము సుసంపన్వమగును.

ఈ రీతిగానే నర, గజస్వరూప సామంజన్యము గణపతిరూప మందు కలదు. 'త్వం' పదార్థము నరస్వరూపము, 'తత్‌' పదార్థము 'గజ'స్వరూపము. 'అసి'పదార్థమందు ఈ 'త్వమ్‌' వదార్థమైన నరరూపమునకు, 'తత్‌' పదార్థమైన గజరూపమునకు రెంటికిని గణపతిరూపమైన 'అని' పదార్థమందు సమన్వయము కుదురును.

శాస్త్రములందు 'నర' పదముచేత ప్రణవాత్మకమైన సోపాధిక బ్రహ్మ, ప్రతిపాదింపబడెను.

"నరా జ్ఞాతాని తత్త్వాని నరాణీతి విదు ర్బుధాః |"

'గజ' శబ్దార్థము శాస్త్రములందు ఇట్లు చెప్పబడెను -

"సమాధినా యోగినో గచ్ఛన్తి యత్ర ఇతి గః ,

యస్మాత్‌ బింబ ప్రతిబింబవత్తయా ప్రణవాత్మకం

జగ జ్జాయతే ఇతి జః ||"

సమాధి వలన, యోగులు ఏ పరమ తత్త్వమును పొందుదురో, అది '' వర్ణప్రతిపాద్యము. బింబమువలన ప్రతిబింబము ఉత్పన్నమైనట్లే, కార్యకారణ స్వరూపము, ప్రణవాత్మకమును అయిన ప్రపంచము దేనివలన ఉత్పన్న మగునో, దానిని '' యందురు.

సోపాధికుడు, 'త్వం' పదార్థస్వరూపుడు అయిన నరుడు, గణశుని పాదాది కంఠపర్యంత దేహము. ఇతి, సోపాదిక మగుటచే నిరుపాధికము కంటె నికృష్టము. నిరుపాధిక, సర్వోత్కృష్ట 'తత్‌' పదార్థమయుడైన గణపతి యొక్క కంఠాది మస్తక పర్యంతము గణపతి దేహము 'అసి' పదార్థమైన అఖండైకరసము.

"ఏక శబ్దాత్మికా మాయా తస్యాః సర్వసముద్బవమ్‌ |

దన్తః సత్తాధర స్తత్ర మాయావాచక ఉచ్యతే||"

ఆ గణశుడు ఏకదంతుడు, 'ఏక' శబ్దము 'మాయా' బోధకము. 'దంత' శబ్దము 'మాయిక' బోధకము. అనగా , గణపతియందు మాయ, మాయిక సంయోగము వలన , గణపతి 'ఏకదంతు'డని వ్యవహరింపబడును.

గణపతి, వక్రతుండము కలవాడు.

"వక్రం ఆత్మరూపం ముఖం యస్య|"

వంకరగా ఉన్నదానిని 'వక్ర'మందురు. ఆత్మస్వరూపము వక్రము. ఏలన, సమస్త ప్రపంచము మనస్సునకు, వాక్కునకు గోచరించును. కాని, ఆత్మతత్త్వము మనోవాక్కులకు విషయము కాదు, అనిర్వచనీయమని భావము. 'వక్ర' పదార్థము కంఠము నుండి వినిర్గతము కాజాలదు. అనిర్వచనీయమని భావము.

"యతో వాచో నివర్తన్తే, అప్రాప్య మనసా సహ|"

అను శ్రుతి, బ్రహ్మ, అనిర్వచనీయ మని చెప్పుచున్నది.

"కంఠాధో మాయయా యుక్తం మస్తకం బ్రహ్మవాచకమ్‌ |

వక్త్రాఖ్యం తేన విఘ్నేశ స్తేనాయం వక్రతుండః ||"

అను వచనమువలన, పైన చెప్పిన విషయము స్పష్ట మగును.

విఘ్నేశ్వరుడు చతుర్భుజుడు గూడ. ఏలన, దేవతలు, నరులు, అసురులు, నాగులు - ఈ నలుగురిని స్థాపించువాడు. అనగా , నియమనము చేయువాడు. చతుర్వర్గ (ధర్మ, అర్థ, కామ, మోక్ష) స్థాపకుడు, ఋగ్యజుస్సామాథర్వాది స్థాపకుడు గూడా అయి ఉన్నాడు.

ఆయన, తన నాలుగు హస్తములందు భక్తులను అనుగ్రహించుటకై పాశ, అంకుశ, వర, అభయ ముద్రలను ధరించును. భక్తుల మోహరూపమైన శత్రువును బంధించుటకై పాశమును ధరించును, సర్వ జగన్నియంత అయిన బ్రహ్మ, అంకుశము చేతను, దుష్టులను నాశమొందించునట్టి బ్రహ్మ, దంతము చేతను సర్వకామనలను పూర్తిచేయు బ్రహ్మ, 'వర' ముద్రచేతను సూచింపబడును.

గణపతిదేవుని వాహనము మూషకము. సర్వాంతర్యామియు సర్వ ప్రాణుల హృదయరూప బిలవాసియు అయి సర్వ జంతువుల (జీవుల) భోగములను అనుభవించునదే మూషకము. అది దొంగ గూడ. ఏలన, జంతువుల (జీవుల) అజ్ఞాన సర్వస్వమును హరించునట్టిది. దానిని ఎవరును, తెలియజాలరు. ఏలన,మాయా రూపముచే నిగూఢమైన అంతర్యామియే, సమస్త భోగములను అనుభవించును. కావుననే "భోక్తారం సర్వ తపసామ్‌ " అని చెప్ప బడినది. 'ముష స్తేయే' అను ధాతువునుండి 'మూషక'శబ్దము నిష్పన్నమయ్యెను. మూషకము ప్రాణుల సమస్త భోగ్య పదార్థములను దొంగిలించియు, పుణ్య, పాప వివర్జితమై ఉండు రీతిగానే, మాయానిగూఢుడైన సర్వాంతర్యామి గూడా సమస్త భోగ్యజాతమును అనుభవించుచు, పుణ్య, పాపవివర్జితుడై ఉండును. సర్వాంతర్యామియైన ఆ ఈశ్వరుడే గణపతిని సేవించుటకై మూషక రూపమును ధరించి, ఆ గణపతిదేవునికి వాహన మయ్యెను.

"మూషకం వాహనాఖ్యం చ పశ్యన్తి వాహనం పరమ్‌ |

తేన మూషకవాహో7యం వేదేషు కథితో7భవత్‌ ||"

ఈశ్వరః సర్వభోక్తా చ చోరవ త్తత్ర సంస్థితః |

స ఏవ మూషకః ప్రోక్తో మనుజానాం ప్రచాలకః ||

ఈ విధముగా, గణపతిదేవుడు'లంబోదరుడు'. ఏలయనగా, ఆ గణపతిదేవుని ఉదరమునందే సమస్త ప్రపంచము ప్రతిష్ఠితమై ఉన్నది. ఆయన, ఎవరి ఉదరమునందును లేడు.

"తస్యోదరా త్సముత్పన్నం నానా విశ్వం న సంశయః |"

అను వచనము వలన, నానా నామరూపాత్మకమైన సమస్త ప్రపంచము పరమేశ్వరుని గణపతి) ఉదరమునుండియే ఉత్పన్న మైనదని తెలియుచున్నది.

గణపతిభగవానుడు 'శూర్పకర్ణుడు' అని యోగీంద్రులచే సంకీర్తింపబడువాడు. ఉత్తమ జిజ్ఞాసువుల వలన, శ్రూయ మాణుడు గాన, హృదయగతుడై, శూర్పము (చేట) వలె, పాప, పుణ్యరూపమైన రజస్సు (రాగాది మాలిన్యమును) దూరము చేసి, బ్రహ్మ ప్రాప్తిని కలుగజేయువాడు గణశ్వరుడు.

"శూర్పకర్ణం సమాశ్రిత్య త్యక్త్వా మలవికారకమ్‌ |

బ్రహ్మైవ నరజాతిస్థో భ##వే త్తేన తథా స్మృతః ||

గణపతి 'జ్యేష్ఠరాజు', 'సర్వజ్యేష్ఠు'లకు అధిపతి. అథవా, సర్వజ్యేష్ఠులైన బ్రహ్మాదుల మధ్య ప్రకాశమానుడై ఉండువాడు. ఆ గణశుడే శివ, పార్వతుల తపస్సువలన ప్రసన్నుడై పార్వతీ తనయుడుగా ఆవిర్భవించెను.

శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, దశరథ, వసుదేవ సుతులుగా ప్రాదురృవించిరి. అయినను, వారికంటె అపకృష్టులు (తక్కువైనవారు) కారు. అట్లే , గణశభగవానుడు శివపార్వతుల వలన జన్మించినను, వారికంటె అపకృష్టుడు కాడు. పార్వతీదేవి తపస్సు వలన, గోలోకనివాసి, పూర్ణ బ్రహ్మయు అయిన శ్రీకృష్ణ పరమాత్మయే, గణపతిరూపముతో ప్రాదుర్భవించెనని 'బ్రహ్మ వైపర్త పురాణము' చెప్పుచున్నది. కావున, గణపతి, శ్రీకృష్ణుడు, శివుడు మొదలగువారు ఏకతత్త్వస్వరూపులు. క్రింద ఉదహరింప బడిన ఋగ్వేదమంత్రము ఈ తత్త్వమునే సూచించుచున్నది.

"గణానాం త్వా గణపతిం హవామహే

కవిం కవీనా ముపమశ్రమస్తమమ్‌ |

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత

ఆనః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్‌ ||"

స్కన్ద, మౌద్గల పురాణములందు వినాయక మహాత్మ్య విషయమునకు సంబంధించిన ఒక గాథ కలదు. 'ఒకానొక సమయమున, 'అభినందను'డను పేరు గల ఒక రాజు, ఇంద్రభాగరహిత మైన (ఇంద్రునకు హవిర్భాగము లేని) ఒక యజ్ఞమును ఆరంభించెను. ఈ విషయము తెలిసి , ఇంద్రుడు కుపితు డయ్యెను. అంత, ఇంద్రుడు కాలపురుషుని, పిలిపించి యజ్ఞభగంము చేయు మని ఆజ్ఞాపించెను. కాలపురుషుడు, యజ్ఞమును భగ్నము చేయుటకై 'విఘ్నాసుర'రూపములో ఆవిర్భవించెను. జన్మ, మృత్యుమయమైన ఈ జత్తు కాలాధీనమై ఉండును, కాల పురుషుడు ముల్లోకములందు సంచరించును. బ్రహ్మజ్ఞానియైన పురుషుడు కాలమును జయించి, అమృతస్వరూపు డగును. వైదిక స్మార్త సత్కర్మానుష్ఠానము బ్రహ్మజ్ఞానసాధనము.

"స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః|"

సత్కర్మానుష్ఠానము వలన విశుద్ధాంతఃకరణుడైన పురుషునికి భగవత్తత్త్వ సాక్షాత్కారము కలుగును. భగవత్సాక్షాత్కారము పొందినవాని వలననే, కాలము పరాజిత మగును. ఈ రహస్యము తెలిసికొని, కాలపురుషుడు సత్కర్మనాశమునకై విఘ్న రూపుడై ప్రాదుర్భవించెను. సత్కర్మానుష్ఠానరహిత ప్రపంచము సదా కాలాధీనమై ఉండును. కావుననే, కాలస్వరూపుడై న విఘ్నాసురుడు 'అభినందను' డను పేరు గల ఆ రాజును చంపి , అచటచట దృశ్య, అదృశ్యరూపముతో సత్కర్మను నాశము చేసెడివాడు. అపుడు, వసిష్ఠాది మహర్షులు విభ్రాంతులై బ్రహ్మను శరణు జొచ్చిరి. బ్రహ్మయొక్క ఆదేశానుసారము వారు గణపతిని స్తుతించిరి. ఏలన, గణపతికి దక్క , ఏ దేవతకును, కాలనాశము చేయగల సామర్థ్యము లేదు. గణపతి అసాధారణ విఘ్న వినాశకత్వ గుణ సంపన్నుడు అని శ్రుతి, స్మృతి, శిష్టాచారములవలన అవగత మగును. శ్రీ గణశుని వలన, విఘ్నాసురుడు పరాజితుడై ఆయన శరణు జొచ్చెను. ఆయన ఆజ్ఞకు బద్ధుడయ్యెను. కావుననే, గణపతికి 'విఘ్న రాజ' నామము గూడా ప్రసిద్ధము.

అప్పటినుండి, గణపతిపూజ, గణపతిస్మరణము లేక, ఏ సత్కర్మ జరిగినను, దానియందు తప్పక, విఘ్నము కలుగు చుండును. ఈ నియమము వలననే, విఘ్నము భగవదాశ్రితమై ఉన్నది. విఘ్నము కూడా కాలరూప మగుట వలన, భగవత్‌ స్వరూపమే అయి ఉన్నది.

" విశేషేణ జగత్సామర్థ్యం హన్తీతి విఘ్నః|"

బ్రహ్మాదులయందు గల జగత్సర్జనాది సామర్థ్యమును గూడా హననము (నాశము) చేయుదానిని 'విఘ్న'మందురు. అనగా, బ్రహ్మాది సమస్త కార్య ప్రపంచము బ్రహ్మవిఘ్నములచే పరాభూత మగుటవలన, గణస్వరానుగ్రహము వలననే విఘ్న రహితులై కార్య నిర్వహణమందు సమర్ధులగుదురు. విఘ్ను, వినాయకుడు - ఈ యిరువురును, భగవత్స్వరూపు లగుటవలన, స్తుతింపదగినవారు. కావుననే -

"భగవన్తౌ విఘ్న వినాయకౌ ప్రీయేతామ్‌ "

అని పుణ్యాహవచనమందు చెప్పబడును. విఘ్నము, గణపతి వశము గాక, మఱి ఎవరి వశమునను లేదు.

ఓంకారమే , సర్వమంగళమయము. వేదోక్తములైన సమస్త కర్మలయందును, ఉపాసనాదులందును ఓంకారమే, స్మరింపబడుచున్నది. కావున, గణశస్మరణము నిరర్థక మని అనినచో, యుక్తము కాదు. ఏలన, ఓంకారము గూడా సగుణ గణశ స్వరూపమే.

మొదటిది 'బ్రహ్మ పురాణము'. ఆ పురాణమమందు నిర్గుణ తత్త్వము , బుద్ధితత్త్వము కంటె అతీతమైన గణశతత్త్వము వర్ణింప బడినది. 'బ్రహ్మాండపురాణము' నందు సగుణ స్వరూపుడైన గణశుని మాహాత్మ్యము ప్రతిపాదింపబడినది. ఏలన, ఆ పురాణము విశేషించి, ప్రణవాత్మకమైన ప్రపంచమును ప్రతిపాదనము చేయు

8]

నట్టిది. ఉప పురాణములో గూడా మొట్ట మొదటిది గణశ పురాణము. ఈ పూరాణము సగుణ, నిర్గుణ గణశుని ఏకత్వమును ప్రతిపాదించుచున్నది. గజమూఖాది మూర్తిధరుడైన గణపతి యొక్క ప్రతిపాదనము గూడా చేయును, ఈ ఉప పురాణముందు యోగమయుడైన గణపతియొక్క మాహాత్మ్యము ప్రతిపాదితము. ఈ విధముగా వేదములు, పురాణములు, ఉప పురాణములు మున్నగు వాని ప్రారంభమున, మధ్యభాగమున, అంతమున, గణశతత్త్వప్రతిపాదనము కన్పడును. ఇంతఏల? బ్రహ్మ, విష్ణ్వాదులు గూడా, గణశుని అంశ లగుటచేతనే శాస్త్ర ప్రతిపాద్యులైరి. కొందరు బుద్ధి గుహయందు గల చిదాత్మరూపు డైన గణపతిని స్మరించి, సత్కర్మలను ఆచరింతురు. మఱికొందరు ప్రణవస్మరణ పూర్వకముగా సత్కర్మానుష్ఠానము చేయుదురు. మఱికొందరు గజవదనాది అవయవములు గల విగ్రహమును ధరించిన గణపతిని స్మరింతురు. మఱికొందరు యోగమయుడైన గణపతిని స్మరింతురు. ఈ విధముగా, సమస్త శుభకార్యముల ఆరంభమునందు ఏదియో ఒక రూపముతో గణశస్మరణము చూడబడుచున్నది.

'గణశపురాణము' నందు త్రిపురసంహార సమయమున గణపతి స్మరణము చేయబడెను.

శ్రద్దాయుక్తుడై నన్ను (గణపతిని) స్మరించి, అవసాన సమయమున, ప్రాణములను వదలినవాడు నా అనుగ్రహము చేత పునరావృత్తి రహితమైన పదమును పొందును అని నుడివెను.

'గణశతాపిని' ఇట్లు చెప్పుచున్నది -

"ఓం గణశం వై బ్రహ్మ, తద్విద్యాత్‌ యదిదం

కించ సర్వం భూతం భవ్యం సర్వ మిత్యాచక్షతే|"

ఈ విధముగా, పూర్ణ పరబ్రహ్మయైన పరమాత్మయే, నిర్గుణత్వ, విఘ్నవినాశకత్వాది గుణగణవిషిష్టుడు, గజవదనాది అవయవ మూర్తిధరుడుశ్రీ గణశుడు అయి ఉన్నాడు.

వస్తుతః , ఎవరు, భగవంతుని అఘటనాటఘన పటీయసియైన మాయయొక్క మహత్త్వమును తెలిసికొనలెరో, వారికి అచింత్య మహామహిమ వైభవశాలియైన భగవంతుని నిర్గుణ, సగుణ లీలలకు సంబంధించిన జ్ఞానము కలుగజాలదు.

ఆస్తికులైనవారు, పూర్వోక్త ప్రమాణములచేత నిర్దారిత మైన గణపతి తత్త్వమును శ్రద్ధాయుక్తులై సమస్త కర్మలయందు ఆరాధించవలయును. పారలౌకికమైన తత్త్వనిర్థారణమందు శాస్త్రము మాత్రమే, ఆదరణీయము. కావుననే, శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతయందు ఇట్లు చెప్పిరి -

"తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితా |

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హ సి ||"

శ్రీ మహాగణపతిః ప్రీణాతు

శివపఞ్చక్షర సోత్రమ్‌

శ్రీ శఙ్కరభగవత్పాదాః

శ్లో || నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తసై#్మ నకారాయ నమశ్శివాయ || 1

శ్లో || మందాకినీసలిల చందనచర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందారముఖ్య బహు పుష్ప సుపూజితాయ

తసై#్మ మకారాయ నమశ్శి వాయ || 2

శ్లో || శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశనాయ|

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తసై#్మ శికారాయ నమశ్శివాయ || 3

శ్లో || వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ |

చంద్రార్క వైశ్వానరలోచనాయ

తసై#్మ వకారాయ నమశ్శివాయ || 4

శ్లో || యక్ష స్వరూపాయ జటాధరాయ

పినాకహస్తాయ సనాతనాయ |

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తసై#్మ యకారాయ నమశ్శివాయ || 5

శ్లో || పంచాక్షర మిదం పుణ్యం యః పఠేత్‌ శివసన్నిధౌ |

శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే ||

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్య విరచితం

శివ పఞ్చక్షర స్తోత్రం సమంపూర్ణమ్‌.

శివాష్టకమ్‌

శ్రీ శఙ్కర భగవత్పాదాః

శ్లో || తసై#్మ నమః పరమ కారణ కారణాయ

దీప్తోజ్జ్వల జ్వలిత పింగల లోచనాయ |

నాగేంద్రహారకృత కుండలభూషణాయ

బ్రహ్మేంద్ర విష్ణువరదాయ నమశ్శివాయ || 1

శ్లో || శ్రీ మత్ర్పసన్న శశి పన్న గభూషణాయ

శైలేంద్రజావదన చుంబిత లోచనాయ |

కైలాస మందర మహేంద్ర నికేతనాయ

లోకత్రయార్తిహరణాయ నమశ్శివాయ || 2

శ్లో || పద్మావదాత మణికుండల గోవృషాయ

కృష్ణాగరుప్రచుర చందనచర్చితాయ|

భస్మానుషక్త వికచోత్పలమల్లికాయ

నీలాబ్జకంఠసదృశాయ నమశ్శివాయ || 3

శ్లో || లంబత్సపింగల జటాముకుటోత్కటాయ

దంష్ట్రాకరాళ వికటోత్కట భైరవాయ |

వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ

త్రైలోక్యనాథనమితాయ నమశ్శివాయ || 4

శ్లో || దక్షప్రజాపతి మహామఖ నాశనాయ

క్షిప్రం మహాత్రిపుర దానవ ఘాతనాయ |

బ్రహ్మోర్జితోర్ధ్వగ కరోటి నికృన్తనాయ

యోగాయ యోగనమితాయ నమశ్శివాయ || 5

శ్లో || సంసార సృష్టిఘటనాపరివర్తనాయ

రక్షఃపిశాచగణ సిద్ధ సమాకులాయ |

సిద్ధోరగ గ్రహ గణంద్రనిషేవితాయే

శార్దూలచర్మవసనాయ నమశ్శివాయ || 6

శ్లో || భస్మాంగ రాగ కృత రూప మనోహరాయ

సౌమ్యావదాత వనమాశ్రిత మాశ్రితాయ |

గౌరీకటాక్ష నయనార్థనిరీక్షణాయ

గోక్షీరధారధవళాయ నమశ్శివాయ || 7

శ్లో || ఆదిత్య సోమ వరుణానిల సేవితాయ

యజ్ఞాగ్నిహోత్ర వరధూమని కేతనాయ |

ఋక్‌ సామవేదమునిభిః స్తుతిసంయుతాయ

గోపాయ గోప నమితాయ నమశ్శివాయ || 8

శ్లో || శివాష్టక మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ |

శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే || 9

శ్రీమచ్ఛఙ్కర భగవత్పాద విరచితం

శివాష్టకం సంపూర్ణమ్‌.

బృహస్పతికృత శివస్తోత్రమ్‌

శ్లో || నమో హరాయ దేవాయ మహామాయాయ శూలినే |

తాపసాయ మహేశాయ తత్త్వజ్ఞాన ప్రదాయినే || 1

శ్లో || నమో మౌంజాయ శుభ్రాయ నమః కారుణ్యమూర్తయే |

నమో దేవాదిదేవాయ నమో వేదా న్తవేదినే || 2

శ్లో || నమః పరాయ రుద్రాయ సుపారాయ నమో నమః |

విశ్వమూర్తే మహేశాయ విశ్వాధారాయ తే నమః || 3

శ్లో || నమో భక్త భవచ్ఛేదకారణాయ అమలాత్మనే |

కాలాయ కాలకాలాయ కాలాతీతాయ తే నమః || 4

శ్లో || జితేంద్రియాయ నిత్యాయ జితక్రోధాయ తే నమః |

నమః పాషండభంగాయ నమః పాపహరాయ తే || 5

శ్లో || నమః పర్వతరాజేంద్రకన్యకాపతయే నమః |

యోగానందాయ యోగాయ యోగినాంపతయే నమః || 6

శ్లో || ప్రాణాయామపరాణాం తు ప్రాణరక్షాయతే నమః |

మూలాధారే ప్రవిష్టాయ మూలాదీపాయ తే నమః || 7

శ్లో || నాభికందే ప్రవిష్టాయ నమో హృద్దేశవర్తినే |

సచ్చిదానందపూర్ణాయ నమః స్సాక్షాత్పరాత్మనే || 8

శ్లో || నమః శివాయాద్భుత విగ్రహాయ తే

నమః శివాయాద్భుత విక్రమాయతే |

నమః శివాయాభిల నాయకాయ తే

నమః శివాయామృత హేతవే నమః || 9

పలశ్రుతి

శ్లో || య ఇదం పఠతే నిత్యం స్తోత్రం భక్త్యా సుసంయతః |

తస్య ముక్తి కరస్థా స్యాత్‌ శంకర ప్రియకారణాత్‌ || 10

శ్లో || విద్యార్థీ లభ##తే విద్యాం వివాహర్థీగృహీ భ##వేత్‌ |

వైరాగ్యకామో లభ##తే వైరాగ్యం భవతారకమ్‌ || 11

శ్లో || తస్మా ద్దినే దినే యూదమిదం స్తోత్రం సమాహితాః |

పఠస్తు భవనాశార్థ మిదం హి భవనాశనమ్‌ || 12

సదాశివః ప్రియతామ్‌

9]

సూత సంహితాయాం

సురాదికృత రుద్ర స్తోత్రమ్‌

శ్లో || నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ||

శ్లో || నమస్తే అస్తు ధన్వ నే కరాభ్యాం తే నమో నమః |

యా తే రుద్ర శివా తనూః శాన్తా తసై#్య నమో నమః ||

శ్లో || నమోస్తు నీల గ్రీవాయ సహ స్రాక్షాయ తే నమః |

సహస్రపాణయే తుభ్యం నమో మీఢుష్టమాయ తే || 3

శ్లో || కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః |

నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే ||

శ్లో || హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః |

నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః ||

శ్లో || పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః |

పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః ||

శ్లో || ఆతతావిస్వరూపాయ వనానాం పతయే నమః |

రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః ||

శ్లో || నమస్తే మంత్రిణ సాక్షాత్కక్షాణాం పతయే నమః |

ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్పరాత్మనే ||

శ్లో || ఉచ్చైర్ఘోషాయ దేవాయ పత్తీనాం పతయే నమః |

సత్త్వానాం పతయే తుభ్యం ధనానాం పతయే నమః ||

శ్లో || సహమానాయ శాన్తాయ శంకరాయ నమో నమః |

ఆధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః || ೧೦

శ్లో || కకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగిణ |

స్తేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః || ೧ ೧

శ్లో || తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణ |

వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమః || ೧೨

శ్లో || నమో నిచేరవే తుభ్య మరణ్యపతయే నమః |

ఉష్ణీషిణ నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే || ೧೩

శ్లో || విస్తృతాయ నమస్తుభ్య మాసీనాయ నమో నమః |

శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః || ೧೪

శ్లో || ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థిరాయ పరమాత్మనే |

సభారూపాయ తే నిత్యం సభాయాః పతయే నమః || ೧೫

శ్లో || నమ శ్శివాయ సాంబాయ బ్రహ్మణ సర్వసాక్షిణ || ೧೯

శ్రీ సాంబశివః ప్రీయయమ్‌

తన్త్రా న్తర్గతం

శ్రీ ద క్షి ణా మూ ర్తి స్తో త్ర మ్‌

శ్లో || నమో రుద్రాయ శర్వాయ దక్షిణామూర్తయే నమః |

శంకరాయ శశాంకాయ శాశ్వతాయ శివాత్మనే ||

శ్లో || నమస్తే పార్వతీశాయ రజతాద్రిసుశోభినే |

శుద్థస్ఫటిక సంకాశరూపాయ పరమేష్ఠినే ||

శ్లో || నమస్తే గణనాథాయ నమః కైలాసవాసినే |

నమస్తే చంద్రశీర్షాయ నమో గంగాధరాయ తే ||

శ్లో || నమస్తే పరమేశాయ పరాత్పరతరాయ తే |

మహాత్మనే మహేశాయ భూతనాథాయ శంభ##వే ||

శ్లో || వాక్సిద్ధిదాయ భక్తానాం విద్యాదాతాయ తే నమః |

నమస్తే జ్ఞానముద్రాయ భక్తానాం పాపనాశినే ||

శ్లో || అరూపాయ సురూపాయ విరూపాయామితాత్మనే |

విరూపాక్షయ దేవాయ సహస్రాక్షాయ తే నమః ||

శ్లో || నమః సహస్రాక్షాయ సర్గ స్థిత్య న్తకారిణ |

ఆదిదేవాయ శర్వాయ భీమరూపాయ తే నమః ||

శ్లో || నమః ప్రమేయరూపాయ నీలకంఠాయ తే నమః |

నమః పాశుపతాస్త్రాయ సుధాహాసాయ తే నమః ||

శ్లో || నమస్తే మృగహస్తాయ అక్షమాలాధరాయ తే |

నమస్తే శూలహస్తాయ సర్పభూషాయ తే నమః ||

శ్లో || ఆది మధ్యా న్తశూన్యాయ నమస్తేమృతమూర్తయే |

నమస్తే వరతంత్రాయ నమో రుద్రాయ శంభ##వే || ೧೦

శ్లో || నమస్తే దశహస్తాయ దశపాదాయ తే నమః |

నమస్తే శతశీర్షాయ సహస్ర శత రూపిణ || ೧ ೧

శ్లో || నమస్తేన న్తరూపాయ సర్వాయుధ ధరాయ తే |

సర్వదేవాధిదేవాయ సర్వేషాం గురవే నమః || ೧೨

శ్లో || నమః పంచాస్యరూపాయ నమస్తే న న్తబాహ వే |

నమః శ్మశానవాసాయ రుద్రాణాం పతయే నమః || ೧೩

శ్లో || నమః కాలాగ్ని రుద్రాయ వహ్నినేత్రాయ తే నమః |

దినేశ చంద్రనేత్రాయ నమసై లోకసాక్షిణ || ೧೪

శ్లో || చిదానంద స్వరూపాయ నమశ్చై తన్యరూపిణ |

నమస్తే వ్యోమకేశాయ నమస్తె న న్తరూపిణ || ೧೫

శ్లో || నమో బ్రహ్మస్వరూపాయ విష్ణురూపాయ తే నమః |

నమస్తే శివరూపాయ పశూనాం పతయే నమః || ೧೯

శ్లో || నమసై#్త్రలోక్యనాథాయ పిత్రే స్కందస్య తే నమః |

నమ ఆద్యాదిదేవాయ నమస్తే శతబాహవే || ೧೭

శ్లో || నమస్తేవాక్యరూపాయ నమో వాగీశ్వరాయ తే |

నమో వేదాస్తవేద్యాయ సాంఖ్యవేదాయ తే నమః || ೧೮

శ్లో || నమస్తే యోగరూపాయ యోగరూఢాయ తే నమః |

కమః కౌమారాయ తుభ్యం నమస్తేస్తకమృత్య వే || ೧೯

శ్లో || నమః ఖేచర సేవ్యాయ నమో దిక్పాలరూపిణ |

నమోణిమాది సేవ్యాయ ఐశ్వర్యాష్టకదాయినే |

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోస్తు తే | ೨೦

శ్రీ దక్షిణామూర్తిః ప్రీయతామ్‌

శ్రీ శి వ త త్త్వ మ హి మ

సమస్తప్రాణుల విశ్రాంతి స్థానమే, శివతత్త్వము. 'శీజ్‌ స్వప్నే' అను ధాతువు నుండి 'శివ' శబ్దము నిష్పన్నమైనది.

"శేరతే ప్రాణినో యత్ర స శివః|"

అనేక పాప, తాపముల వలన ఉద్విగ్నులైన ప్రాణులు విశ్రాంతికై ఎచట శయనింతురో, ఆ సర్వాధిష్ఠానభూతుడు, సర్వా శ్రయుడు 'శివ' శబ్దముచే చెప్పబడును.

"శాన్తం శివం చతుర్థ మద్వైతం మన్య న్తే"

మొదలగు శ్రుతులను అనుసరించి, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులనెడి మూడు అవస్థలకంటె అతీతుడు, సర్వదృశ్యవివర్జితుడు, స్వప్రకాశుడు, సచ్చిదానందఘనుడును, అయిన పరబ్రహ్మయే, శివతత్త్వము. అయినను, ఆ పరమ తత్త్వమే, తన దివ్య శక్తులతో గూడి, అనంత బ్రహ్మాండ సృష్టి, స్థితి, లయములను జేయుచు, బ్రహ్మ, విష్ణు, శివాది నామములను ధరించును. అచటచట బ్రహ్మ 'జీవు' డని చెప్పబడెను.

"సోబిభేత్‌ | ఏకాకీ న రేమే | జాయా మే స్యా దథ కుర్వీయ ||"

ఇత్యాది శ్రుతులను అనుసరించి భయ, అరమణాదులు కల వాడగుటచేత 'హిరణ్యగర్భుడు', 'విరాట్‌' అనియు.'జీవు' డనియు చెప్పబడెను. వాస్తవమునకు, కృషీవలుడే, క్షేత్రములో విత్తనము నాటి, అంకురాది రూపములో ఉత్పాదకుడు (సృష్టికర్త) అగును: అతడే, సించనాదులద్వారా (నీళ్లు పెట్టుట. ఎరువు వేయుట ద్వారా) పాలకుడని వ్యవహరింపబడును. చివరకు అతడే, ఆ పంటను కోయువాడు (సంహారకర్త) అగును. అట్లే అనంత, అచింత్య శక్తి సంపన్నుడైన పరమేశ్వరుడు విశ్వోత్పాదకుడు, పాలకుడు, సంహారకుడు అగును.

"సర్వభూతేషు కౌన్తేయ మూర్తయః సంభవన్తి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా ||"

"సమస్త భూతములయందు ఉత్పన్న ములగు మూర్తులన్నిటికి మహద్‌ బ్రహ్మ (ప్రకృతి), యోని (మాత), బీజ ప్రదానము చేయువాడను నేను" అని గీతలో శ్రీకృష్ణభగవానుడు నుడివెను.

"పితాహ మస్య జగతః "

"నేను ఈ సమస్త జగత్తునకు తండ్రిని, సృష్టికర్తను.

"మమ యోని ర్మహద్‌ బ్రహ్మ తస్మిన్‌ గర్భం దధామ్యహమ్‌ |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ||"

అనగా, ప్రకృతిరూపమైన యోనియందు నేను గర్భమును ఆధానము చేసినపుడు, ఆ ప్రకృతిరూపమునుండి సమస్త విశ్వము సృజింపబడును. ఈ విధముగా బ్రహ్మాండోత్పాదకుడైన బ్రహ్మ సయితము, పరమేశ్వరుడే. కావుననే -

"యతో వా ఇమాల భూతాని జాయ న్తే, యేన జాతాని జీవ న్తి,

యత్ర్పయన్త్యభిసంవిశన్తి ||"

అని తైత్తిరీయ శ్రుతి బ్రహ్మ లక్షణము చెప్పుచున్నది. దీనివలన, సృష్టికర్త, ప్రపంచ పాలకుడు, సంహారకుడు పరమేశ్వరుడని తెలియవలయును. వీరు మువ్వురును భిస్నులు కారు. అట్లైనచో, వీరిలో ఎవరును పరమేశ్వరుడని వ్యవహరింపబడజాలరు. ఏలన, నిరతిశయ ఐశ్వర్య, సర్వజ్ఞత్త్వా దిగుణసంపన్నుడే, పరమేశ్వరుడని చెప్పబడును. ఈ సృష్టి, స్థితి, లయకర్తలు ముగ్గురును కలసి పరస్పర పరామర్శతో కార్యనిర్వహణము చేయుచున్నారా, లేక స్వేచ్ఛతో స్వీయ సంకల్పానుసారముగా చేయుచున్నారా? అను ప్రశ్న ఉదయించును. పరస్పర పరామర్శతో చేయుచున్నారనిన, వీరిలో ఏవరును పరమేశ్వరుడు కానేరడని అంగీకరించవలసి వచ్చును. కాని, ఈ ముగ్గురు కలిసిన పరిషత్తే పరమేశ్వరుడు. ఏలన, ఏ ఒకడును ఒంటరిగా కార్యనిర్వహణమునకు సమర్థుడు కాడు. ముగ్గురి ఇచ్ఛ సమానమే అయి, ముగ్గురి ఇచ్ఛానుసారమే వారి శక్తులు కార్యమునందు ప్రవృత్తము లగుచున్నవో, అపుడు మూర్తిత్రయమును అంగీకరించుటయే వ్యర్థము. అపుడు, ఒక్కరివలన గూడా సృష్టి, స్థితి, లయకర్మలు జరుగవచ్చును. అట్లు కాక, రెండవ పక్షమును అంగీకరించినచో, స్వతంత్రముగానే, ముగ్గురును కార్యనిర్వహణము చేయుదురని అంగీకరించినచో, అపుడు సైతము వీరిలో ఎవరును పరమేశ్వరుడు కాజాలడు. ఏలన, స్వతంత్రముగా సంకల్పము కలిగినచో, ఒకనికి జగత్పాలనమునందు ఆసక్తి కలిగిన సమయముననే, మరొకరికి సంహారకార్యమునందు ఆసక్తి కలుగుట సంభవించవచ్చును. ఇపుడు ఇచట, ఎవరి ఇచ్ఛ సఫల మగునో, ఆయన యొక్క ఐశ్వర్యమే (ఈశ్వరత్వమే) అప్రతిహతమని తలచబడును. ఎవరి మనోరథము విఫల (భగ్న) మగునో, ఆయన యొక్క ఈశ్వరత్వము ఔపచారికమే - గౌణమే అగును. ఒక విషయమునందు విరుద్ధములైన రెండు విరుద్ధ సంకల్పములు సఫల మగుట ఎన్నడును సంభవము కాదు. కావున, ఏకేశ్వరవాదమునే సర్వులును అంగీకరించక తప్పదు. కావుననే, మహానుభావులు ఒకే పరమాత్మయందు అవస్థాభేదముతో ఉత్పాదకత్వ, పాలకత్వ, సంహాకత్వములను అంగీకరించిరి.

"నిఃశ్వసిత మస్య వేదా వీక్షిత మేతస్య పంచ భూతాని |

స్మిత మేతస్య చరాచర మస్య చ సుప్తం మహాప్రలయః ||"

భగవంతుని నిఃశ్వాసము వలననే వేదములు ఆవిర్భవించినవి. వీక్షణము (చూచుట) వలన ఆకాశాది అపఞ్చికృత పఞ్చమహాభూత సృష్టి జరిగినది. స్మితము (మందహాసము) వలన, అనంత బ్రహ్మాండములు ఏర్పడుచున్నవి. సుషుప్తి (గాఢనిద్ర) వలననే సమస్త బ్రహ్మాండములు లయ మగుచున్నవి. ఈ దృష్టితో ఒక బ్రహ్మాండము యొక్క సర్జన, పాలన, సంహారకర్త లయిన బ్రహ్మ, విష్ణు, రుద్రులయందే కాక, సమస్త బ్రహ్మాండోత్పాదకులు, పాలకులు, సంహారకులు అయిన బ్రహ్మ, విష్ణు, శివులయందు కించిన్మాత్రమైనను భేదము లేదు. అనంతము, ఏకము అయిన ఆకాశమునందు గల సూర్యుడు, అనంత ఘటోదకములయందు, తటాకజలములయందు ప్రతిబింబించిన రీతిగానే, ఒకే అఖండ, అనంత, నిర్వికార, చిదానంద పరమాత్మతత్త్వము, అనంత అంతఃకరణములయందు, మాయాభేదములయందు ప్రతి బింబించును, అంతఃకరణ ప్రతిబింబమే జీవుడని వ్యవహరింపబడును. మాయాగత ప్రతిబింబమే ఈశ్వరుడని చెప్పబడును. ఆ పరమాత్మతత్త్వమే శివ, స్కందాది పురాణములయందు శివ రూపముతోను, రామాయణ, భాగవతాది సద్‌ గ్రంథములయందు విష్ణు, రామ, కృష్ణరూపముతోను సంకీర్తింపబడినది.

భక్తుని భావనానుసారముగానే విశుద్ధ సత్త్వసంపన్నమైన దివ్యశ క్తిసంబంధము చేత, ఆ పరమ తత్త్వమున, సుందరమూర్తి గూడా వ్యక్తమగును.

10]

ఈ విధముగా మౌలికముగా శివుడు, విష్ణువు ఒకరే అయినను వారి అపర రూపములో సత్త్వగుణసంపర్కము వలన, విష్ణువు సాత్త్వికుడనియు, తమోగుణ సంయోగముచేత రుద్రుడు తామసుడనియు చెప్పబడును. వస్తుతః, సత్త్వనియంత విష్ణువు, తమోగుణ నియామకుడు రుద్రుడు. తమస్సే మృత్యువు, కాలము. కావున, తన్నియంత మహామృత్యుంజయుడు, మహా కాలేశ్వరుడు, పరమేశ్వరుడు అయిన రుద్రుడు. మరొక దృష్టితో గూడా, తమః ప్రధానమైన సుషుప్తివలననే స్వప్న, జాగ్రద్దశల సృష్టి జరుగును. ఆ రీతిగానే, తమః ప్రధానమైన ప్రళయావస్థ నుండియే, సర్వ ప్రపంచసృష్టి జరుగును.

అనన్య కృష్ణ భక్తి గల భక్తగణము తమస్సును సర్వోత్కృష్టముగా భావింతురు. భక్తినిర్భరమైన ఆ సక్తి , మోహము, మూర్చ, స్వాత్త్వికవివేకము, ప్రకాశముకంటె ఎంతో అధికమహత్త్వ సంపన్నమై ఉండును. వాస్తవమునకు, ఏ కార్యమునందైనను నిరోధము, ప్రకాశము, సంచలనము అపేక్షితము లగును. ఈ మూడింటిలో ఏ ఒకటి లేకపోయినను, ఆ కార్యము నెరవేరదు.

శ్రీమద్భాగవతము నందలి తామసఫల ప్రకరణము అన్నిటికంటె మహత్త్వోపేతమైనది. సాధారణముగా, విశ్రాంతికి తామస సుషుప్తి ఎంత మహిమ కలిగి ఉన్నదనిన, ఇంద్రాది దివ్యభోగ సామగ్రీసంపన్నులైనను, దానిని వదలి, సుషుప్తిని కోరుదురు. చింతన, మననములు సాత్త్వికములైనను, సుషుప్తికి ప్రతిబంధకము లగుటవలన, జీవుడు ఉద్విగ్నుడగును. అపుడు, విశ్రాంతికై సుషుప్తిని ఆశ్రయించుట వానికి అనివార్యమగును. అట్లే, సృష్టికాలమందలి ఉపద్రవముల వలన, జీవుడు వ్యాకులు డైనపుడు, వానికి దీర్ఘ సుషుప్తియందు విశ్రాంతికై భగవంతుడు సర్వసంహార మొనర్చి , ప్రళయావస్థను వ్యక్తము చేయును. ఈ సంహారము గూడా, భగవంతుని కృపయే. దుర్నివార్యములైన పాపతాపములు పెరిగిపోయినపుడు భగవంతుడు, కరుణతోనే విశ్వ సంహారము చేయును.

కార్యావస్థకంటె కారణావస్థయొక్క మహత్త్వము స్పష్టము. తమః ప్రధానావస్థనుండియే, ఉత్పాదనావస్థ, పాలనావస్థ వ్యక్తమగును. అయినను, చివరకు అందరును ప్రళయావస్థలోనికి పోవలసినవారే.

"భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే"|

అనగా , ఈ భూతజాత మంతయు, అనంతకాలమునుండి ఉత్పత్తి చెంది, చెంది, మఱల ప్రళయావస్థను పొందుచున్నదని భావము. కారణము నుండియే సమస్త సృష్టి జరుగును, దానియందే సమస్త విశ్వపాలన, పోషణములు జరుగును. మఱల దానియందే సర్వసంహారము జరుగును. నిస్తబ్ధమైన సాగరము నుండియే తరంగ ములు బయలుదేరును. దానియందే ఆ తరంగములు పోషింపబడును, తుట్టతుదకు ఆ సాగరమునందే ఆ తరంగములు లయము (సంహారము) చెందును. ఉత్పత్తిదశకు (సృష్టి అవస్థకు) నియామకుడు బ్రహ్మ, పాలనావస్థకు నియామకుడు విష్ణువు, సంహారావస్థకు, కారణావస్థకు నియామకుడు శివుడు. ఆరంభ మందును, కారణావస్థ ఉండును, అంతమునందు సైతము కారణావస్థ ఉండును. ఈ విధముగా అద్యంతములందు శివతత్త్వమే శేషించి ఉండును.

"అహమేవాస మేవాగ్రే నాన్యద్‌ యత్సదసత్పరమ్‌ |

పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహమ్‌ ||"

తత్త్వవేత్తలు చరాచర ప్రపంచసృష్టికి పూర్వము ఉన్న దాని యందే ఆత్మభావన చేయుదురు. ఆ పరతతత్త్వమహిమ, వీర్య వత్త్వము ప్రసిద్ధమే. కావున, ముఖ్యము, నిర్విశేషము అయిన ఆ తత్త్వమే ఈశ్వరుడు. లేక మహేశ్వరు డగును.

కావున, శివుడే, కేవల 'ఈశ్వర' శబ్దముచే చెప్పబడును.

"ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర స్సర్యభూతానామ్‌"

"మహేశ్వర స్త్య్రంబక ఏవ నాపరః |"

"ఈశ్వర స్పర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి|"

అనగా, ఈశానుడే సర్వవిద్యలకు, సర్వభూతములకు ఈశ్వరుడు. ఆత్ర్యంబకుడే మహేశ్వరుడు. ఆయనయే. సర్వ ప్రాణుల హృదయదేశమునందు గలడు అని భావము. హృదయమునందే సుషుప్తి కలుగును. అచటనే, కారణావస్థకు అధిపతి ఉండుట సంగతము. ఉపనిషత్తులలో కొన్ని స్థలములందు ఏకాదశ ప్రాణములు 'రుద్ర' నామముతో చెప్పబడినవి. అవి శరీరమును వీడినపుడు, ప్రాణులను రోదింపజేయును గాన, ప్రాణములు 'రుద్ర' శబ్దముచే చెప్పబడును. కావున, పది ఇంద్రియములు (పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు), మనస్సు - ఇవే ఏకాదశ రుద్రులు. కాని, ఇవి ఆధ్యాత్మిక రుద్రులు. ఆధిదైవిక, సర్వోపాధివినిర్ముక్త రుద్రుడు వీనికంటె అతిరిక్తుడు. విష్ణువు, పాదములకు అధిష్ఠానదైవతమైన రీతిగానే, రుద్రుడు అహంకారమునకు అధిష్ఠాన దైవము.

"ఏకో రుద్రోన ద్వితీయోవతస్థే|"

అనగా, ఒక్క రుద్రుడే తత్త్వము. ద్విత్వసంఖ్యాపూర్తికి మరొక తత్త్వమే లేదు అని భావము. ఈ శ్రుతివచనములచే చెప్పబడిన రుద్రుడు మాత్రము, మహాకారణస్వరూపమైన, లేక కార్యకారణ అతీతమైన శుద్ధ బ్రహ్మయే. ఈయన కూడా, 'రోదనాత్‌ రుద్రః' - రోదింపజేయువాడుగాన, రుద్రుడు; ప్రళయకాలములో అందరిని రోదింపజేయువాడు ఈయనయే.

పరమేశ్వరుడు భక్తులకు. భగవత్ర్పేమికులకు, జ్ఞానులకు నిరతిశయ, నిరుపాధిక పరమ ప్రేమాస్పదుడై ఉండును, పరమానందరనస్వరూపుడై ఉండును. ఆ పరమేశ్వరుడే, భక్తి రహితులకు ప్రచండ మృత్యురూపుడై గోచరించును. అట్టి ఆ భక్తులు (భక్తులు కానివారు) ఆయనవలన భయభీతులగుదురు. సంహారకుని, వలన, అందరికిని భయము కలుగుట స్వాభావికము. కావుననే,

"మహద్భయం వజ్ర ముద్యతమ్‌|"

అని శ్రుతి చెప్పుచున్నది. అనగా, పరమేశ్వరుడు ఉద్యత (పైకి ఎత్తబడిన) వజ్రాయుధముతో సమానముగా మహాభయానక మైనవాడు.

"భీషాస్మాద్వాతః పవతే, భిషోదేతి సూర్యః |

భీషాస్మా దగ్ని శ్చేన్ద్రశ్చ, మృత్యుర్ధావతి పఞ్చమః ||"

ఆ పరమేశ్వరునిభయము వలననే సూర్య, చంద్ర, అగ్ని, వాయు, ఇంద్రులు నియమపూర్వకముగా తమ తమ కార్యముల యందు నిమగ్నులై ఉందురు. ఆ పరమేశ్వరుని భయము వలననే, మృత్యువుసైతము పరుగెత్తుచుండును. ఈయనయే, ప్రచండ కోప రూపుడుగూడ, కోపకార్యము మృత్యువు. మృత్యువునకు సైతము మృత్యువైనవాడు, సర్వసంహాకరుడు, ప్రచండ ఉగ్రశాసకుడు అయిన పరమాత్మయే ఈశ్వరుడు, ఈశానుడు, భీముడు, ఉగ్రుడు, రుద్రుడు, చండుడు, చండిక మున్నగు నామములతో వ్యవహరింపబడును. వేదాంతదృష్టితో అజ్ఞానులు సర్వవిధభేద శూన్యము, స్వప్రకాశము అయిన అద్వైత బ్రహ్మ వలన భయపడుదురు.

"యోగినో బిభ్యన్తి హ్యస్మా దభ##యే భయదర్శినః|"

నిమ్మ (చెట్టుకు పుట్టిన) పురుగు తెల్లని పంచదారవలన ఉద్వేగము చెందునట్లుగానే, ప్రాపంచిక ద్వైతసుఖ కీటకములైన అజ్ఞానులకు నిష్ప్ర పంచ అద్వైతసుఖము వలన భయము కలుగును. ఏలన, వారు, అభిలషించునట్టి వాద్య, నృత్య, గీతాది ద్వైతసుఖము అచట లభించదు. కాని, జ్ఞానులకు మాత్రము అదియే, పరమానంద రసరూపము.

వివేకుల దృష్టిలో ప్రమాదమే, మృత్యువప.

"ప్రమాదం వైమృత్యు మహం బ్రవీమి|"

ఆ ప్రమాదము లన్నింటికి మూలము, మోహము, లేక అజ్ఞానము. దానిని నాశ మొందించునది బ్రహ్మాకార చరమ వృత్తి యందు ఆరూఢమైన శుద్ధ బ్రహ్మయే. ఈ విధముగా మృత్యురూపమైన అజ్ఞానమును నాశ మొందించువాడు అగుటవలన, సర్వ సంహారకుడు, మహామృత్యుంజయుడు, మహాకాలేశ్వరుడు అయిన పరమ తత్త్వము శివుడే. ఆయనే, లీలతో దివ్యమంగళమయ మూర్తిని ధరించును. భక్తులు చేయు ఉపాసనలను శ్రద్ధాపూర్వకమైన ప్రవృత్తిని జూచి, కుతూహలవశముచేత, తానుగూడా భక్తి రసాస్వాదనము చేయుటకై తనను తాను ఉపాస్యుడు, ఉపాసకుడు అను రెండు రూపములలో అభివ్యక్తము చేసికొనును. బాల రామచంద్రరూపముతోను, బాలముకుంద (శ్రీకృష్ణ) రూపముతోను తన హస్తాంబుజముయొక్క బొటన వ్రేలును ముఖారవిందమునందు ఉంచుకొని, చరణారవిందమకరందలుబుద్దులైన (పాదపద్మముల మకరందమునందు ఆసక్తిగల) మనోమిళిందముల (మనస్సు అను తుమ్మెదల ) లోకోత్తర సౌభాగ్యమును తెలిసికొని, తాను గూడా భక్తుడై, శ్రీ శివోపాసన చేయును, శివరూపముతో విష్ణు రూపమును ఉపాసించును. శివుని హృదయములో రాముడు ఉండును, రామహృదయమున, శివుడు ఉండును. సామ్రాజ్య సింహాసనాధిష్ఠితుడైన శ్రీరామచంద్రభగవానుని హృదయకమల మందు అభివ్యక్తుడైన శ్రీ శివుని స్వరూపమును మహర్షులు ప్రత్యక్షముగా దర్శించిరి. ఆ విధముగానే, శివుని హృదయము నందు శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించును. ఈ విధముగా, శివుడు సర్వారాధ్య పరమ దైవతము.

శ్రీకృష్ణుడు ఉపమన్యుమహర్షి వలన దీక్షితుడై శ్రీసాంబశివ భగవానుని ఆరాధించి, దివ్య వరమును పొందెను. యుధిష్ఠురు డైన ధర్మరాజు, శివతత్త్వమును గురించి భీష్ముని ప్రశ్నించగా, భీష్ముడు 'శ్రీకృష్ణుడు శివకృపాపాత్రుడు, శివమహిమ శ్రీకృష్ణునకు మాత్రమే తెలియును, ఆయనయే, శివతత్త్వమును గురించి చెప్ప గల సమర్థుడు' అని తన అశక్తను ప్రకటించెను. అంత యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ప్రశ్నించెను. అపుడు శ్రీకృష్ణుడు శాంత, సమాహితచిత్తుడై 'భగవంతుని మహిమ అనంతము. అయినను, ఆయన కృప వలననే తన్మమహిమను అతి సంక్షేపముగా చెప్పెదను' అని పలికి, అత్యంత శ్రద్ధతో శ్రీకృష్ణుడు శివ మహిమను సంకీర్తనము చేసెను. శ్రీమహావిష్ణువు తన నేత్రకమల ముతో భగవంతుని (శివుని) అర్చించెను. ఆ భక్త్యావేశము వలననే, ఆయనకు సుదర్శనచక్రము లభించెను.

శివ, విష్ణువులకు పరస్పరము దుర్లభ##మైన ఉపాస్య, ఉపాసకసంబంధము కలదు. తమోగుణము నల్లగా ఉండును, సత్త్వగుణము శుక్లవర్ణము కలిగియుండును. ఈ దృష్టితో సత్త్వోపాధికుడైన విష్ణువు శుక్లవర్ణము కలవాడై ఉండవలయును, తమోపాధికుడైన శివుడు కృష్ణ (నల్లని) వర్ణము కలవాడై ఉండ వలయును. బహుశః , వారు ఉన్నది కూడా అట్లే. కాని, పరస్పర ధ్యానము వలన కలిగిన తన్మ యత్వముచేత, ఇరువురి స్వరూప ములలోను పరివర్తనము జరిగినది. అనగా , విష్ణువు కృష్ణవర్ణము కలవాడు, శివుడు ధవళవర్ణము కలవాడును అయ్యెను. మురళీ రూపముతో కృష్ణుని అధరామృతపానము చేయునట్టి అధికారము శివునికే కలిగినది. శ్రీకృష్ణుడు తన అమృతమయమైన ముఖ చంద్రునిపైన సుమధుర స్వాగతము పలికి తన కోమలాంగుళులతో శివుని పాదసంవాహనము చేయుచుండెడివాడు, అధరామృతమును అనుభవిచెడివాడు, కిరీటమును, ఛత్రమును పట్టెడివాడు. కుంతలములతో నీరాజనమిచ్చెడివాడు. శ్రీరాధారూపముతో శువుని అభివ్యక్తి జరిగిన, కృష్ణరూపముతో విష్ణువు అభివ్యక్తు డయ్యెను. కాళీరూపముతో విష్ణురూపము వ్యక్తమయిన, శంకరరూపముతో శివుడు అభివ్యక్తుడగుచుండును. ఈ విధముగా వీరిరువురు ఉభయ ఉభయాత్మలు, ఉభయ భావనాత్మలు.

శ్రీ శివుని సగుణస్వరూపము గూడా, ఎంత అద్బుతము, ఎంత మనోహరము! మోహకము! ఆ రూపమును జూచి అందరను ముగ్ధులగుదురు. భగవంతుడు ఇంతటి మనోహర స్వరూపము కలవాడు. కావుననే, అందరును ఆయనను ఉపాసింతురు. కాలకూటవిషమును, ఆదిశేషువును కంఠమునందు ధరించుటచేత భగవంతుని మృత్యుంజయత్వము స్పష్టముగా విదిత మగుచుండును. ఆయన, జటాజూటమునందు గంగను ధరించి, విశ్వనముక్తి మూలమును స్వాధీనము చేసికొనెను. అగ్ని దీప్తమైన తృతీయ నేత్రసామీవ్యమునందే, చంద్రకళను ధరించి, స్వీయ సంహాకరత్వ, పోకత్వరూపమైన విరుద్ధ ధర్మా శ్రయత్వమును ప్రదర్శించెను. సమస్తలోకాధిపతి అయి గూడా, విభూతినే (భస్మమునే) వ్యాఘ్రచర్మమునే తన ఆభరణముగా, వస్త్రముగా జేసికొని, జగత్తులో అన్నిటికంటె, వైరాగ్యమే శ్రేష్ఠమైనదని చాటెను. ఆ శివుని వాహనము, ఉమాదేవి వాహనము నందీశ్వరుడు, గణపతి వాహనము మూషకము (ఎలుక), కార్తికేయుని (కుమార స్వామియొక్క) వాహనము, మయూరము. త్రిశూలము, భైరవాది గణము రూపుదాల్చి, ఆ శివుని సేవలో సదా సంలగ్నమై ఉండును. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణు, రామ, కృష్ణాదులు సైతము, ఆ మహాదేవుని, ఉపాసింతురు. నర, నాగ, గంధర్వ, కిన్నర, సుర, ఇంద్ర, బృహస్పతి, ప్రజాపతి ప్రభృతులు గూడా, శివోపాసన యందు లగ్నచిత్తులై ఉందురు. ఒకవైపున, అతి తామసులైన అసుర, దైత్య, యక్ష, భూత, ప్రేత, పిశాచాదులలో, వృశ్చిక. సర్పాదులన్నియు, శివసేవలో తత్పరములై ఉండును. వస్తుతః, సమస్త భూత, భౌతిక జాతముచేత పూజింపబడుట ఆయనయొక్క పరమేశ్వర లక్షణము.

పార్వతీకళ్యాణసమయమున, శంకరభగవానుడు ప్రసన్నుడై, స్వీయ సౌందర్య, మాధుర్యసుధామయమైన దివ్య రూపముతో దర్శన మొసగెను. తరలివచ్చిన పెండ్లివారితో మొదట, జనము ఇంద్రుని ఐశ్వర్య , మాధుర్యములను జూచి ముగ్ధులైరి. ఆయనే, శివుడని తలచిరి, ఆయనకు మంగళసూచక మైన హారతి నిచ్చుటలో ప్రవృత్తులైరి.

అపుడు ఇంద్రుడు 'మేము శ్రీశంకరోపాసకులను ఉపాసించు

11]

వారిలో గూడా నిమ్నుతములము' అని చెప్పినపుడు కన్యాపక్షము వారు ప్రజాపతి, బ్రహ్మాదుల అద్భుత ఐశ్వర్యమును జూచి, వారినే పరమేశ్వరుడని భావించిరి. వారు 'మేము భగవదుపాసకులలో అత్యంత నిమ్న శ్రేణికి చెందినవార మని చెప్పిరి. అంత, అచటివారు విష్ణువు వైపునకు ప్రవృత్తులైరి. అద్భుత ఐశ్వర్య, మాధుర్య, సౌందర్యసంపన్నుడైన ఆ శ్రీమహావిష్ణువునే శంకరుడనుకొనిరి. శ్రీమహావిష్ణువుగూడా, తాను శంకరోపాసకుడను అని చెప్పినపుడు వారందరును ఆశ్చర్యసాగములో మునుకలు వేయసాగిరి. వస్తుతః, శ్రీకృష్ణుడు శివతత్త్వమును స్వయముగా ఉపాసించెను. ఆ తత్త్వమును దర్శించి ముగ్ధుడయ్యెను. శ్రీకృష్ణుడు ఏ నిర్గుణ, నిరపేక్ష శివతత్త్వమును ప్రతి క్షణము హృదయమునందు ఉంచుకొనునో, పిల్లన గ్రోవిరూపముతో ఏ శివతత్త్వమును అధరపల్లవములపై ఉంచుకొనునో, ఏ శివస్వరూపమును నిరంతరము ధ్యానించుచుండునో, ఆ శివమహిమను ఎవరు వర్ణించగలరు !

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములందు ఆసక్తిగల ప్రాణుల చిత్తమునందు అశబ్ద, అస్పర్శ, అరూప, అవ్యయ బ్రహ్మ ఆరూఢమగుట కష్టమగును. కావుననే, పరమేశ్వరుడు స్వేచ్ఛతో తనను మధుర, మనోహర, మంగళమయ మూర్తిరూపములో అభివ్యక్తము చేసికొనును. ఆ ముగ్ద మనోహర రూపము యొక్క శబ్ద, స్పర్శాదుల మాధుర్యము అపారము, ఆ రూపలావణ్య , సౌందర్య సౌకుమార్యములు సాటిలేనివి.

పరమేశ్వరుడైన శంకరుడు జిల్లేడు, ఉమ్మేత్త , అక్షతలు బిల్వదళములు, అభిషేకము, ఘంటావాదనము మాత్రము చేతనే, సంతుష్టుడై సమస్తమును ఒసగుటకు ఉద్యుక్తుడగును. శివభక్తుడు ఒక్కమారు ప్రణామము చేయుటవలననే, తాను ముక్తుడైనట్లు భావించును.

"మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినమ్‌ |

వత్సం గౌరివ గౌరీశో ధావన్త మనుధావతి ||

అనగా, పరశివుడు 'మహాదేవ' అని ఉచ్చరించువానివైపునకు వత్సల అయిన గోవు, తన లేగదూడవెంట పరుగిడునట్లు పరుగిడునని భావము.

"మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్‌ |

ఏకేన ముక్తి మాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భ##వేత్‌ ||"

అనగా, ఎవడు, 'మహాదేవ, మహాదేవ, మహాదేవ, ' అని మూడుమార్లు ఉచ్చరించునో, వానికి, ఒక నామమును ఉచ్చరించుట వలన, భగవంతుడు ముక్తి నొసగును. మిగిలిన రెండుమార్లు నామమును ఉచ్చరించుటచేత వానికి శివుడు ఋణపడును అని భావము. ఇది యుక్తమే. వేదాంత సిద్ధాంతానుసారము శబ్దము వలననే తత్త్వసాక్షాత్కార మగును. ఉపనిషత్తులు, మహావాక్యములు, భగవత్స్వరూపబోధకములైన ప్రణవాది నామముల వలన, తత్త్వ సాక్షాత్కారమైనంతనే, కల్పిత ప్రపంచము నష్టమగును. స్వాభావికమైన, పారమార్థికమైన, బ్రహ్మానంద రసామృత రూపమైన ముక్తి లభించును. క్షీరసాగరమునందు క్షార (లవణ) సాగరకల్పన భ్రాంతికల్పితమైనట్లుగానే, పరమానందరసామృతమూర్తి అయిన శివతత్త్వమునందు భవసాగర భ్రాంతి జనించును. అధిష్ఠాన సాక్షాత్కారము అయినంతనే, కల్పిత వస్తువు (ప్రపంచము) నశించును.

'భగవన్నామము భవసాగరమును శుష్కింపజేయును' అను వచనతాత్పర్య మిదియే. 'మహాదేవ' నామోచ్చారణము వలన, ప్రాణులు పాపవిదూరులై, పరమ తత్త్వసాక్షాత్కారమునుపొంది, స్వస్వరూపానుభూతియందు కృతార్థులగుదురు.

శ్రీ శజ్కరాచార్య కృతం

శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రమ్‌

శ్లో || చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం

నిరీహం నిరాకార మోంకారవాచ్యమ్‌ |

గుణాతీత మవ్యక్తం మేకం తురీయం

పరం బ్రహ్మ యం వేద తసై#్మ నమస్తే ||

శ్లో || విశుద్ధం శివం శాన్త మాద్యన్తశూన్యం

జగజ్జీవనం జ్యోతి రానందరూపమ్‌ |

దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం

త్రయీ వక్తి యం వేద తసై#్మ నమస్తే ||

శ్లో || మహాయోగపీఠే పరిభ్రాజమానే

ధరణ్యాది తత్త్వాత్మకే శక్తి యుక్తే |

గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే

సమాసీన మోం కర్ణి కేష్టాక్షరాద్యే || 3

శ్లో || సమానోదితానేక సూర్యేందు కోటి

ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్‌ |

న శీతం న చోష్ణం సువర్ణావదాత ప్రసన్నం

సదా77నన్దసంవిత్స్వరూపమ్‌ ||

శ్లో || సునాసాపుటం సుందర భ్రూలలాటం

కిరీటోచితోదంచిత స్నిగ్ధ కేశమ్‌ |

స్ఫుర త్పుండరీకాభిరామాయతాక్షం

సముత్ఫుల్ల రత్న ప్రసూనావతంసమ్‌ ||

శ్లో || లసత్కుండలామృష్ట గండస్థలాన్తం

జపారాగశోణధరం చారుహాసమ్‌ |

అలివ్యాకులామోది మందారమాలం

మహోస్ఫురత్‌ కౌస్తుభోదారహారమ్‌ ||

శ్లో || సురత్నాంగదై రన్వితం బాహుదండైః

చతుర్భిః చలత్‌ కంకణాలంకృతాంగై ః |

ఉదారోదరాలంకృత పీతవస్త్రం

పదద్వంద్వ నిర్ధూత పద్మాభిరామమ్‌ ||

శ్లో || స్వభ##క్తేషు సందర్శితాకార మేవం

సదా భావయన్‌ సన్నిరుద్ధేంద్రియాశ్వః |

దురాపం నరో యాతి సంసారపారం

పరసై#్మ పరేభ్యో7పి తసై#్మ నమస్తే ||

శ్లో || శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధ పాంక్త్యా

ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా |

కలత్రద్వయేనామునా తోషితాయ

త్రిలోకిగృహస్థాయ నమస్తే విష్ణో ||

శ్లో || శరీరం కలత్రం సుతం బంధువర్గం

వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ |

సమస్తం పరిత్యజ్య హా ! కష్టమేకో

గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్‌ || ೧೦

శ్లో || జరేయం పిశాచీవ హా ! జీవతో మే

వసామత్తి రక్తం చ మాంసం బలం చ |

అహో! దేవ! సీదామి దీనానుకంపిన్‌ !

కిమద్యాపి హస్త! త్వయోదాసితవ్యమ్‌ || 11

శ్లో || కఫ వ్యాహతోష్ణాల్బణ శ్వాసవేగ

వ్యధా విస్ఫురత్‌ సర్వ ముర్మాస్థిబంధామ్‌ |

విచిన్త్యా మన్త్యా మసంఖ్యా మవస్థాం

బిభేమి ప్రభో ! కిం కరోమి ప్రసీద || ೧೨

శ్లో || లసన్నచ్యుతానస్త ! గోవింద ! విష్ణో !

మురారే ! హరే ! నాథ ! నారాయణతి |

యథా7నుస్మరిష్యామి భక్త్యా భవ న్తం

తథా మే దయాశీల ! దేవ! ప్రసీద || ೧೩

శ్లో || భుజంగ ప్రయాతం పఠేద్యస్తు భక్త్యా

సమాధాయ చిత్తే భవన్తం మురారే |

సమోహం విహాయాశు యుష్మత్ప్రసాదాత్‌

సమాశ్రిత్య యోగం వ్రజ త్యచ్యుతత్వమ్‌ || ೧೪

శ్రీ మహావిష్ణుః ప్రీయతామ్‌

సూత సంహితాయాం

బ్రహ్మర్షికృత విష్ణుస్తోత్రమ్‌

శ్లో || నమస్తే దేవదేవానా మాది భూత సనాతన |

పురుషాయ పురాణాయ నమస్తే పరమాత్మనే |

జరామరణ రోగాది విహీనాయ అమలాత్మనే ||

శ్లో || బ్రహ్మణాం పతయే తుభ్యం జగతాం పతయే నమః |

లోకాలోకస్వరూపాయ లోకానాం పతయే నమః ||

శ్లో || శంఖ చక్ర గదా పద్మపాణయే విష్ణవే నమః |

నమో హిరణ్యగర్భాయ శ్రీపతే భూపతే నమః || 3

శ్లో || నమః స్వయంభువే తుభ్యం సూత్రాత్మాదిస్వరూపిణ |

నిరాట్‌ ప్రజాపతే! సాక్షాజ్జనకాయ నమో నమః ||

శ్లో || విశ్వ తైజస రూపాయ ప్రాజ్ఞరూపాయ తే నమః |

జాగ్రత్‌ స్వస్నస్వరూపాయ నమః సుషుప్త్యాత్మనే నమః ||

శ్లో || అవస్థాసాక్షిణ తుభ్యం అవస్థావర్జితాచ్యుత |

తురీయాయ విశుద్ధాయ తుర్యాతీతాయ తే నమః |

శ్లో || ప్రథమాయ సమస్తస్య జగతః పరమాత్మనే |

ఓంకారై కస్వ రూపాయ శివాయ శీవద ప్రభో ||

శ్లో || సర్వ విజ్ఞానసంపన్న ! నమో విజ్ఞానదాయినే |

జగతాం యోనయే తుభ్యం వేధసే విశ్వరూపిణ ||

శ్లో || నిత్య శుద్ధాయ బుద్ధాయ ముక్తాయ సుఖరూపిణ |

నమో వాచామతీతాయ మనో7గమ్యాయ తే నమః ||

శ్లో || అప్రమేయాయ శాన్తాయ స్వయంభానాయ తే నమః |

నమః పుంసే పురాణాయ శ్రేయః ప్రాసై#్త్యక హేతవే ||೧೦

శ్లో || ఆకాశాది ప్రపఞ్చాయ నమ స్తద్రూప శంకర |

మాయారూపాయ మాయాయాః సత్తాహేతో జనార్దన || ೧೧

శ్లో || నమః ప్రద్యుమ్నరూపాయ నమః సంకర్షణాత్మనే |

నమో7నిరుద్ధరూపాయ వాసుదేవాయ తే నమః ೧೨

శ్లో || యోగాయ యోగ గమ్యాయ యోగినా మిష్టసిద్ధిద |

నమస్తే మత్స్య రూపాయ నమస్తే కూర్మ రూపిణ || ೧೩

శ్లో || నమస్తుభ్యం వరాహాయ నారసింహాయ తే నమః |

నమో వామనరూపాయ నమో రామత్రయాత్మనే || ೧೪

శ్లో || నమః కృష్ణాయ సర్వజ్ఞ నమస్తే కల్కిరూపిణ |

కర్మిణాం ఫలరూపాయ కర్మరూపాయ తే నమః || ೧೫

శ్లో || కర్మకర్త్రే నమస్తుభ్యం నమస్తే కర్మసాక్షిణ |

నమో విజ్ఞప్తి రూపాయ నమో వేదా న్తరూపిణ || ೧೬

శ్లో || గుణ త్రయాత్మనే తుభ్యం నమో నిర్గుణరూపిణ |

అద్భుతాయాసురేశాయ శివప్రాపై#్త్యకహేతవే || ೧೭

శ్లో || నమో నక్ష త్రరూపాయ నమస్తే సోమరూపిణ |

నమః సూర్యాత్మనే తుభ్యం నమో వజ్రధరాయ తే || ೧೮

శ్లో || నమస్తే పద్మనాభాయ నమస్తే శార్జపాణయే |

నమస్తుభ్యం విశాలాక్ష నమః శ్రీధర నాయక || ೧೯

శ్లో || నమః సంసారతప్తానాం తాప నాశైకహేతవే |

శ్రౌతస్మార్తైకనిష్ఠానా మచిరాదేవ ముక్తిద || ೨೦

శ్లో || క్షీరోదశాయినే తుభ్యం నమో వైకుంఠవాసినే |

నమో రాగాభిభూతానాం వైరాగ్యప్లవదాయినే || ೨೧

శ్రీ మహావుష్ణుః ప్రీయతామ్‌

దశావతార స్తోత్రమ్‌

రామస్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణ |

రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే ||

శ్లో || వేదోద్దార విచారమతే సోమకదానవ సంహరణ |

మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||రామ||

శ్లో || మంథానాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో |

కూర్మాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||రామ||

శ్లో || భూచోరకహర పుణ్యమతే క్రోడోద్ధృతభూదేవ హరే |

క్రోడాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||రామ||

శ్లో || హిరణ్యకశిపుచ్ఛే దనహేతో ప్రహ్లాదాభయదాయకహేతో |

నరసింహాచ్యుతరూప నమో భక్తం తే పరిపాలయ మామ్‌ || ||రామ||

శ్లో || భవబంధనహర వితతమతే పాదోదకవిహతాఘతతే |

వటుపటువేష మనోజ్ఞ నమో భక్తం తే పారిపాలయ మామ్‌ ||

శ్లో || క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే |

భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||

శ్లో || సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో |

రావణమర్దన రామ నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||

శ్లో || కృష్మాన న్తకృపాజలధే కంసారే కమలేశ హరే |

కాళియమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మామ్‌ || ||రామ||

12]

శ్లో || దానవపతిమానాపహర త్రిపురవిజయమర్దనరూప |

బుద్ధజ్ఞాన చ బౌద్ధ నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||

శ్లో || శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే |

కల్కిరూప పరిపాలయ నమో భక్తం తే పరిపాలయ మామ్‌ ||

సూర్య నమస్కార శ్లోకాః

శ్లో || ధ్యేయః సదా సవితృ మండలమధ్యవర్తీ

నారాయణః ససరసిజాసన సన్ని విష్టః |

కేయూరవాన్‌ మకరకుండలవాన్‌

కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

శ్లో || నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ర్పసూతి స్థితినాశ##హేతవే |

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణ విరించి నారాయణ శంకరాత్మనే ||

భానుర్భాస్కరో మార్తాండరశ్మి ర్దివాకరః |

ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహి మే || 3

మిత్రాయ నమః | రవయే నమః | సూర్యాయ నమః | భానవే నమః | ఖగాయ నమః | పూష్ణే నమః | హిరణ్యగర్భాయ నమః | మరీచయే నమః | ఆదిత్యాయ నమః | సవిత్రే నమః | అర్కాయ నమః | భాస్కరాయ నమః | మిత్రరవిభ్యాం నమః | సూర్యభానుభ్యాం నమః | ఖగపూషభ్యాం నమః | హిరణ్యగర్భమరీచిభ్యాం నమః | ఆదిత్యసవితృభ్యాం నమః | అర్కభాస్కరాభ్యాం నమః | మిత్రరవి సూర్యభానుభ్యో నమః | ఖగపూషహిరణ్యగర్భమరీచిభ్యో నమః | ఆదిత్య సవిత్రర్కభాస్కరేభ్యో నమః | మిత్రరవిసూర్యభానుఖగ పూషభ్యో నమః | మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః | శ్రీ సవిత్రే సూర్యనారాయణాయ నమః |

శ్రీ కృ ష్ణ స్తు తిః

శ్లో || ఓం నమో విశ్వరూపాయ విశ్వస్థిత్య న్తహేతవే |

విశ్వేశ్వరాయ విశ్వాయ గోవిన్దాయ నమో నమః ||

శ్లో || నమో విజ్ఞానరూపాయ పరమానన్దరూపిణ |

కృష్ణాయ గోపీనాథాయ గోవిన్దాయ నమో నమః ||

శ్లో || నమః కమలనేత్రాయ నమః కమలమాలినే |

నమః కమలనాభాయ కమలాపతయే నమః || 3

శ్లో || బర్హాపీడాభిరామాయ రామాయాకుంఠమేధసే |

రామా మానసహంసాయ గోవిన్దాయ నమో నమః ||

శ్లో || కంసవంశవినాశాయ కేశిచాణూరఘాతినే |

వృషభద్వజవన్ద్యాయ పార్థసారథయే నమః ||

శ్లో || వేణునాదవినోదాయ గోపాలాయాహిమర్దినే |

కాలిన్దీకూలలోలాయ లోలకుండలధారిణ ||

శ్లో || వల్లవీ వదనాంభోజమాలినే నృత్తశాలినే |

నమః ప్రణతపాలాయ శ్రీకృష్ణాయ నమో నమః ||

శ్లో || నమః పాప ప్రణాశాయ గోవర్థనధరాయచ |

పూతనాజీవితాన్తాయ తృణావర్తాసుహారిణ ||

శ్లో || నిష్కలాయ విమోహాయ శుద్ధాయాశుద్ధవైరిణ |

అద్వితీయాయ మహతే శ్రీ కృష్ణాయ నమో నమః ||

శ్లో || ప్రసీద పరమానన్ద ప్రసీద పరమేశ్వర|

ఆధివ్యాధిభుజంగేన దష్టం మా ముద్ధర ప్రభో || ೧೦

శ్లో || శ్రీకృష్ణ రుక్మిణీకాన్త గోపీజనమనోహర |

సంసారసాగరే మగ్నం మాముద్ధర జగద్గురో || 11

శ్లో || కేశవ క్లేశహరణ నారాయణ జనార్దన |

గోవిన్ద పరమానన్ద మాం సముద్ధర మాధవ || 12

శ్రీ కృష్ణచంద్రః ప్రీయతామ్‌

శ్రీ వి ష్ణు త త్త్వ ము

వ్యాప్తర్థకమైన 'విష్ల్‌' ధాతువునుండి 'విష్ణు' శబ్దము నిష్పన్న మైనది. వ్యాపక పరబ్రహ్మ, పరమాత్మయే 'విష్ణు' శబ్దముచే వ్యవహరింపబడును.

"యతో వా ఇమాని భూతాని జాయన్తే, యేన

జాతాని జీవన్తి, యత్ర్పయన్త్యభిసంవిశన్తి||"

అను శ్రుతిని అనుసంరిచి, ఈసమస్త జగత్తు, ఎవరివలన సృజింప బడుచున్నదో, ఎవరియందు స్థితి కలిగి యున్నదో, ఎవరి యందు విలీన మగుచున్నదో, ఆయనయే 'బ్రహ్మ' అని తెలియుచున్నది. విశేషించి, అనంతకోటి బ్రహ్మాండములను సృజించు శక్తియందు కార్యోత్పత్తికై ప్రకాశాత్మకమైన సత్త్వము, చలనాత్మకమైన రజస్సు, గూఢాత్మకమైన తమస్సు అవశ్యకము అగును. ఆ యా గుణముల ప్రాధాన్యము వలన బ్రహ్మయే, రజోగుణ సంబంధము చేత, 'చతుర్ముఖ బ్రహ్మ' గాను, తమోగుణసంబంధము వలన, 'రుద్రుడు' గాను, సత్త్వగుణ సంబంధముచేత 'విష్ణు' రూపముగాను అగును.

మరొక విధముగా, ఉత్పాదినీశక్తి విశిష్టమైన బ్రహ్మ తత్త్వము సృష్టికర్త అయిన 'బ్రహ్మ' అనియు, సంహారిణీ శక్తి విశిష్ట బ్రహ్మ 'రుద్రు'డనియు, పాలినీశక్తి విశిష్ట బ్రహ్మ, 'విష్ణు' వనియు, వ్యవహరింపబడును.

అట్లు గాక, మరొక విధముగా, సమష్టి కారణ ప్రపంచాభిమాని యైన అవ్యాకృతము 'రుద్ర' శబ్దవ్యపదేశ్య మనియు, సమష్టి సూక్ష్మ ప్రపంచాభిమానియైన హిరణ్యగర్పుడు 'విష్ణు' శబ్దవాచ్యుడనియు, సమష్టి స్థూల ప్రపంచాభిమానియైన విరాట్‌, సృష్టికర్త యగు'బ్రహ్మ' శబ్దముచే చెప్పబడును. ముఖ్యముగా, అవ్యక్తాది నియామకుడైన అంతర్యామియే, రుద్ర, విష్ణు, బ్రహ్మాది శబ్దములచే చెప్పబడును. ఎచటైనను, ఉపాసనావిశేషము వలన ఏ జీవుడైనను, బ్రహ్మ అగుట వర్ణింపబడినచో, అతడు అంతర్యామి కాక, అభిమాని అనియే తెలియవలయును.

"స ఏకాకి న రేమే |"

" సో 7బిభేత్‌ |"

ఇత్యాది శ్రుతివచనములయందు, హిరణ్యగర్భుని విషయములో భయ, అరమణాదులు వినబడుచుండునో, అచట, హిరణ్యగర్భుని యందు జీవభావము నిర్ణయింపబడెను. ఏలన, పరమేశ్వరుని యందు భయ, అరమణాదులు ఎన్నడును సంభవింపజాలవు. అభిమాని జీవుడే అగును, అంతర్యామి, సర్వత్ర పరమేశ్వరుడే. పురాణములలో బ్రహ్మాండముల అనంతత్వము వర్ణితము. కావుననే, తదనుసారముగా విరాట్‌, హిరణ్యగర్భాదుల అనంత త్వము గూడా తెలియుచున్నది. ఉత్పాదక, పాలక, సంహారక దృష్టితో బ్రహ్మ, విష్ణు, రుద్రుల అనంతత్వమే సిద్ధించుచున్నది. అంతర్యామిస్వరూప లగుటవలన, అందరును పరమేశ్వరులే. ఈ భావనతో ఉపనిషత్తులు వర్ణించిన 'విరాట్‌' పురుషుడు పురాణముల యందలి 'మహావిరాట్‌' స్వరూపము, అనంతకోటి బ్రహ్మాండాత్మక మైన సమష్టి స్థూల ప్రపంచము యొక్క ఏకైక అభిమాని, అంతర్యామి అయిన పురుషుడు ఉపనిషత్తులయందలి విరాట్‌ పురుషుడు. ఈ విషయమునే హిరణ్యగర్భుడు, అవ్యక్తము వీరిని గురించి గూడా తెలియవలయును. సమస్త విశ్వోత్వాదకుడైన బ్రహ్మ, పాలకుడైన విష్ణువు, సంహాకుడైన రుద్రుడు సర్వథా ఒకరే. వారే, మహావిష్ణు. మహారుద్రాది నామములతో అచటచట వ్యవహరింపబడిరి.

గోధుమ మున్నగు సస్యమును పండించు ఒకే రైతు ఉత్పాదకుడు, పాలకుడు, సంహారకుడు గూడ. అట్లు కానిచో సర్వశక్తిమంతుడైన విష్ణు పరమాత్మనే పాలింపబడుచున్న జగత్తుయొక్క సంహారము మరొకడు ఎట్లు చేయగలడు ! సర్వ సంహారకుడైన రుద్రుడే, పరమేశ్వరుడని భావించినచో, సంహరింప బడబోవు విశ్వమునకు రక్షకుడు ఎవరు ఉండును? విష్ణువుకంటె, రుద్రుడు భిన్నుడే అయినచో, సర్వసంహాకరుడైన రుద్రునకు విష్ణువును సైతము సంహరించవలసిన ఆవశ్యకత కలుగును. కావుననే విష్ణు, రుద్రులను ఇరువురిని ఒకే పరమేశ్వరుడని భావించుట సముచితము. ఏ సంహారకుడు గూడా, తన అంతరాత్మను సంహరింపజాలడు. కావుననే, సర్వసంహాకరుడైన శివుని యొక్క ఆత్మయే అగుటవలన, విష్ణువు స్థిరముగా ఉండును.

కావున, జగదుత్పాదకుడు, పాలకుడు, సంహారకుడు ఒకే పరమేశ్వరుడని తెలియనగును. ఏ నామముతో అయినను వ్యవహారము జరుగవచ్చుగాక, కాని, ప్రమాణభూతమైన శాస్త్రమువలన, ఎవరియందు జగత్కారణత్వము, సర్వజ్ఞత్వ, సర్వశక్తి మత్త్వాదులు అవగత మగునో, ఆయనయే, పరమేశ్వరుడని భావింపబడును. విష్ణు, రుద్ర, బ్రహ్మాది నామములు కాక, ఆకాశాది నామములతో గూడా, జగత్కారణత్వాది హేతువులచేతనే పరమేశ్వర జ్ఞానము కలుగును.

సృష్టి, స్థితి, లయకారణము ఒక్కడే అయినను, ఉత్పత్తి కారణత్వాదుల వేఱు వేఱుగా వివక్షవలన, బ్రహ్మ, విష్ణు, రుద్రులని చెప్పబడును. తమః ప్రధాన శక్తి విశిష్టమైన చిత్తునందు ఉపాణానత్వము, విశుద్ధసత్త్వ ప్రధానమైన విద్యాశక్తి విశిష్ట చిద్రూపమునందు నిమిత్తత్వము ఉన్నను, మూల ప్రకృతివిశిష్టమైన ఒక్క బ్రహ్మయే, జగత్తునకు అభిన్న నిమిత్తోపాదాన కారణము. ఆ బ్రహ్మయందు నానాత్ము లేదు. ఉపాదాన కారణముయొక్క కార్యమునకు సదృశత్వము ఉండును. కావున, జడమయమైన కార్యమునకు అనురూపముగానే, తమః ప్రధాన శక్తి విశిష్టమైన చిత్తమునందు జడత్వముయొక్క అనురోధము వలన, ఉపాదానత్వము భావింపబడును. నిమిత్తకారణమునందు కులాలాదులకు వలె కార్యముకంటె విలక్షణత్వము ఉండును. కావున, తదనురూపముగానే, విద్యా విశిష్టమైన చిత్‌ పదార్థమునందు నిమిత్తకారణత్వము అంగీకరింపబడినది. సర్వసంహారకుడే అందరికంటె ప్రబలుడై ఉండును. ఆయనయే, పాలకుడు గూడా కాగలుగును. ఆయనయే, జగత్సృష్టికర్తయు అగును. అనంత బ్రహ్మాండనాయకుడైన పరమేశ్వరుడే విష్ణువు. పద్మపురాణాదుల యందు విష్ణువే , రామాయణ , భారతాదులయందు రామ, కృష్ణాది రూపములో సంకీర్తింపబడినాడు. శివపురాణ, స్కందపురాణాదుల యందు ఆయనయే శివ, రుద్రాది నామములతో వర్ణింపబడెను. శివపరమైన పురాణములయందు కార్యవిష్ణువు వర్ణింపబడెను. అనగా, ఒక్కొక్క బ్రహ్మాండమునకు సంబంధించిన విష్ణువు వర్ణింప బడినాడు. కావుననే, ఆ విష్ణువునందు కొంత అపకర్ష (తక్కువ దనము) గూడా భాసించును. విష్ణుపరమైన పురాణములయందు శివుడు కూడా కార్యకోటిలో చేరినవాడే. సారాంశ మేమన, అనంత బ్రహ్మాండనాయకుడు, పరబ్రహ్మయు అయిన పరమాత్మయే, వేద, రామాయణ, భారత, పురాణాదులయందు నానా నామ, రూపములతో సంకీర్తింపబడినవాడు, ఆ పరమేశ్వరుడే 'విష్ణు' నామముతో ప్రసిద్ధుడు.

ప్రపంచపాలనమునందు సర్వాతిశాయియైన ఐశ్వర్యము (ఈశ్వరత్వము) అపేక్షిత మగును. కావున, విష్ణుభగవానుని

13]

యందు పరమైశ్వర్యము కలదు. సమగ్ర ఐశ్వర్యము, సమగ్ర ధర్మము, సమగ్ర యశస్సు, సమగ్ర సంపద, సమగ్ర జ్ఞానము, సమగ్ర వైరాగ్యము ఎవరియందు ఉండునో, ఆయనయే భగవంతుడు. అథవా, ప్రాణుల ఉత్పత్తి, ప్రళయ, గతి, ఆగతి, విద్య, అవిద్యలను బాగుగా తెలిసివాడే, భగవంతుడు. జగన్మాత్రమును చక్కగా వికసింపజేయుట, ఫలింపజేయుట, అనంత ఐశ్వరయ్ముతో నింపుట పాలకుని కార్యము.

కావుననే, విష్ణువునందు సర్వోత్కృష్టమైన ఐశ్వర్యము దృశ్యమానమగును. మహావిష్ణువు సాక్షాత్తుగా చైతన్యఘనుడే అయినను, ఉపాసనయందు ఆయనకు పాదాది అంగోపాంగముల, గరుడాది వాహనముల, సుదర్శనాది ఆయుధముల, కౌస్తుభాది వేషభూషల కల్పన చేయబడును.

మాయా, సూత్రాత్మ, మహత్తత్త్వము, అహంకారము పంచ తన్మాత్రలు, ఏకాదశేంద్రియములు, పంచమహాభూతములు - ఈ పదనారు వికారములతో కలసి 'మహావిరాట్‌' పురుషుడైన భగవంతుని ఆ సాత్త్వకరూపమునందే త్రిభువనములు ప్రతిభాసించుచున్నవి. ఇదే, పౌరుషసంబంధమైన రూపము, భూలోకమే, ఈ పురుషుని పాదము. ద్యులోకమే శిరస్సు, అంతరిక్షలోకమే నాభి, సూర్యుడు నేత్రము, వాయువు నాసిక, దిక్కులు శ్రోత్రములు, ప్రజాపతి ప్రజననేంద్రియము, మృత్యువు పాయువు, లోకపాలురు బాహువులు, చంద్రుడు మనస్సు, యముడే భగవంతుని భ్రుకుటి.

ఉత్కృష్టత్వ మనెడి అభిప్రాయముతో ద్యులోకము 'శిరస్సు' అని చెప్పబడినది. గాంభీర్యదృష్టితో అంతరిక్షము 'నాభి' అని చెప్పబడినది. ప్రతిష్ఠ అను అభిప్రాయముతో భూలోకము 'పాద' మని చెప్పబడినది. నేత్రానుగ్రాహకుడు, సర్వ ప్రకాశకుడు అగుట చేత సూర్యుడు 'నేత్ర' మని చెప్పబడెను. లజ్జ భగవంతుని ఉత్తరోష్ఠము (లజ్జ వలన, ప్రాణి ఉన్ముఖుడై ఉండక అవనతాననుడై ఉండును. ఆట్లే, ఉత్తరోష్ఠము అవనతమయియే ఉండును). లోభము భగవంతుని అధరోష్ఠము, జ్యోత్స్న (వెన్నెల) దంతము, మాయయే మందహాసము. సమస్త భూరుహములు (వృక్షాదులు) రోమములు. మేఘములు మూర్థజములు (కేశములు). వ్యష్టి పురుషులు సప్తవితస్తియై సార్థ బాహు త్రయము (31/2 బూహు వులు) పొడవు ఉన్న రీతిగానే, సమష్టి పురుషుడు కూడా తన ప్రమాణము (కొలత) తో సప్తవిస్తియై ఉండును.

"సప్తవిత స్తికామః"

అని వచనము. పరమేశ్వరాధిష్ఠితమగుటచేత వైరాజోపాసన చేయబడును. కావుననే, పురుషసూక్తమునందు ఇతర పురాణముల యందును పైన పేర్కొనబడిన సమస్త అంగ ప్రత్యంగభావన పరమేశ్వరుడైన విష్ణువు నందు చేయబడినది. సాధారణముగా పరమేశ్వరుడైన విష్ణువుయొక్క స్వరూపము సచ్చిదానంద స్వరూపమే. అయినను, భక్తులను అనుగ్రహించుటకై పరమేశ్వరుడు విశుద్ధ సత్త్వమయ లీలాశక్తి సంయోగము వలన, చిదానందమయిమూర్తిని గూడా ధరించును. ఆ మూర్తియే అతసీపుష్పసంకాశ##మైన (నల్లని అవిసి పువ్వుతో సమానమైన), నవనీల నీరద (మేఘ) శ్యామలమైన, లేక నీల కమల సదృశ##మైన కాంతి, భగవంతుని సగుణ, సాకార, స్వరూపము. విశుద్ధ సత్త్వమయమైన లీలాశక్తిసంబంధము చేత చిదానంద బ్రహ్మయే సగుణ, సాకార శ్రీవిష్ణురూపములో అభివ్యక్త మగును. నిరాకారము , అతిగంభీరము అయిన ఆకాశము యొక్క శ్యామల రూపమే, తత్త్వరహస్యవేత్తలకు అభిమతము. అట్లే, నిరాకార, నిర్వికార, పరమగంభీర విష్ణుతత్త్వముయొక్క శ్యామలరూపము గూడా శ్రుతిసంమతము. తమస్సుయొక్క ఉపాధిచే ఉపహితుడు, తమోనియామకుడు, పరమేశ్వరుడు అయిన శివుని వర్ణము శ్యామల వర్ణము. ఆ శివధ్యానము చేసి, చేసి విష్ణువు శ్యామలు డయ్యెను. ఆ మహావిష్ణుధ్యానము నిరంతరము చేసి, ఆయనయొక్క స్వాబావికమైన శుక్లరూపము శంకరునియందు ప్రకట మయ్యెను. ఈ యిరువురును పరస్పరానురక్తులు, పరస్పరాత్మ స్వరూపులు. యుగమునకు అనుగుణముగానే, యుగనియామకుడైన భగవంతుని రూపము ఉండును. మనుష్యులను శాసించుటకై భగవంతుడు మనుష్యాను రూపముగానే రూపుదాల్చును. ఆ రీతిగానే, యుగమును శాసించుటకై భగవంతునికి యుగానురూపముగా రూపు దాల్చవలసి వచ్చును. స్వతః , రూపరహితుడైన భగవంతుని యందు ఉపాధిసంసర్గమువలననే, రూపావిర్భావము కలుగును. సత్త్వ ప్రధానమైన కృతయగము, రజోగుణమిశ్రిత సత్త్వ ప్రధానమైన త్రేతాయుగము, రజోగుణప్రధానమైన ద్వాపర యుగము, తమఃప్రధానమైన కలియుగము ఉండును. కావున, కృతయుగమునకు చెందిన పరమేశ్వరుడు శుక్లరూపములో అభివ్యక్తమగును. త్రేతాయుగమునకు అనురూపముగా భగవంతుడు రక్తవర్ణములో ఆవిర్భవించును. ద్వాపరయుగమున కనుగుణముగా పరమేశ్వరుడు పీతవర్ణము కలవాడగును. కలి యుగమునకు అనుగుణముగా కృష్ణవర్ణము కలవాడై అభివ్యక్త మగును.

"శుక్లో రక్త స్తథా పీతః ఇదానీం కృష్ణతాం గతః |"

ఈ దృష్టితో కలినియామకుడు అగుటవలన, భగవంతుడు శ్యామల వర్ణము కలవాడు.

ప్రకృతిరూప సమష్టి కారణదేహాభిమాని అయిన చైతన్యమై 'అవ్యాకృత'మని చెప్పబడును. ఆ అవ్యాకృతమునే 'ఆదిశేషు' వనియు అందురు. కార్యప్రపంచము ప్రళయమునందు విలీన మైనపుడు, శేషించి ఉండువాడే ఆదిశేషుడు. ఆ అనంతశేషరూపమైన అవ్యాకృతమునందే చతుర్భుజమూర్తియైన విష్ణుభగవానుడు విరాజమానుడై ఉండును. ఈ విధముగా గూడా, అవ్యాకృతము పైననే, కార్యకారణాతీతమైన తురీయ తత్త్వము విరాజమానమై ఉండును.

పరమేశ్వరుడు తుర్య, తుర్యాతీతరూపముతో నిర్గుణ, నిష్క్రియ, నిర్మల, నిరవద్య, నిరంజన, నిరాకార, నిరాశ్రయ, నిరతిశయ అద్వైత పరమానందస్వరూపుడు. శుద్థాద్వైత పరమానంద పరబ్రహ్మయందు వైకుంఠ, ప్రాసాద, ప్రాకార, విమానాది అనంత వస్తుభేదములు ఎట్లు కలిగెను? ఇవి అన్నియు ఉండిన నిర్విశేషాద్వైతము ఎట్లు పొసగును ? అను సంశయము జనింప వచ్చును. దీనికి సమాధాన మేమన, నిర్మలమైన సువర్ణమునందు కటక, మకుట, అంగదాది బహు భేదము లున్నట్లు, సాముద్ర జలమునందు స్థూల, సూక్ష్మతరంగములున్నట్లు, సముద్రజలము నందు సూక్ష్మతరంగములు ఫేన (నురుగు), బుద్బుదాది భేదములున్నట్లు భూమియందు, పర్వత, వృక్ష, తృణ, గుల్మ, లతాది అనంత వస్తుభేదము లున్నట్లుగానే, అద్వైత పరమానంద బ్రహ్మ యందు వైకుంఠాది భేదములు ఉపపన్నము లగును. సమస్తము భగవత్స్వరూపమే. పరమాత్మకంటె అతిరిక్తమైనది, ఏదియును అణుమాత్రము గుడా లేదు అని పరమేశ్వరుడు నుడువును.

"మత్స్వరూపమేవ సర్వం మద్‌ వ్యతిరిక్త మణుమాత్రం న విద్యతే ||"

పరమ మోక్షము సర్వత్ర ఒక్కటియే. అయినచో, అనంత వైకుంఠ అనంత ఆనందసముద్రాదులు ఎట్లు సంగతము లగును? ఈ శంకకు సమాధాన మేమనిన, అవిద్యాపాదభాగమునందే అనంత కోటి బ్రహ్మాండములు ఉన్నపుడు, ఒక్కొక్క బ్రహ్మాండమునందు వైకుంఠము, వివిధ విభూతులు ఉండుటలో ఏమి విప్రతిపత్తి ఉండును? ఇక, మూడు పాదములకు సంబంధించిన వైకుంఠముల విషయములో చెప్పునదేమి కలదు ! నిరతిశయమైన ఆనందావిర్భావము మోక్షము. ఇది త్రిపాద్‌ బ్రహ్మ యందు సర్వదా ప్రకటమై ఉండును. ఆ పాదత్రయమే, పరమ వైకుంఠము, పరమ కైవల్యము. కావున, అవిద్య, విద్య, ఆనందము, తుర్యము - ఈ నాలుగు పాదములయందు అనంత వైకుంఠములు, అనంత ఆనంద సముద్రాదులు సంగతమే. ఈ విధముగా ఉపాసకుడు పరమ వైకుంఠమును జేరి, భగవద్ధ్యానము చేసి, నిరతిశయాద్వైత పరసూనందస్వరూపుడై, జాగరూకతతో అద్వైత యోగనిష్ఠుడై , అద్వైత పరమానందమును అనుసంధానము చేసి, స్వయముగా, శుద్ధోబోధానందఘనస్వరూపుడై మహావాక్యము లను స్మరించుచు, స్వాత్మను బ్రహ్మగాను, బ్రహ్మను ఆత్మగాను తెలిసికొనును. తనను బ్రహ్మయందు హోమము చేసికొనును. అనంతరము, 'అహం బ్రహ్మస్మి' అను భావనతో నిస్తరంగా, అద్వైత, అపార, నిరతిశయ, సచ్చిదానంద బ్రహ్మస్వరూపుడగును. ఈ మార్గమున, చక్కగా అభ్యాసము (సాధన) చేయు వాడు తప్పనిసరిగా నారాయణస్వరూపు డగును.

'త్రిపాద్విభూత మహానారాయణోపనిషత్తు'నందు ఈ విషయమునకు సంబంధించిన సుందర వివేచన కలదు. ఇచట, తత్సారాంశము మాత్రమే పొందుపరచబడినది. లోక, లోకాంతరములు భగవద్విగ్రహ విలాసాదులు, ఈ ఉపనిషత్తునందు సాంప్రదాయికులైన వైష్ణవుల, శైవుల ప్రతిపాదనముకంటె అత్యంత సుందరముగా ప్రతిపాదింపబడినది. అద్వైత సిద్ధాన్త పోషణమునందు ఈ ఉపనిషత్తు విశేషదృష్టి ఉంచుట ఒక విశేషము.

శుద్ధ సత్త్వమయమైన శక్తిచే సంస్పృష్టమైన చిదానంద ప్రధాన తత్త్వమునందు అనంతానంత వైకుంఠాదుల సమస్త తారతమ్యములు అత్యన్త మాన్యములు. శక్త్యతీతమైన తత్త్వము సర్వథా నిరాకారము, నిర్వికారము, నిర్విశేషమే. శక్తి యొక్క అనిర్వచనీయతవలన వస్తుతః, శక్తి సంస్పృష్టము గూడా సర్వదా, సర్వథా సర్వాతీతమే. కావున, అది సర్వదా, సర్వథా, సర్వదేశ , కాల , వస్తువులకంటె అతీతమైనది. కావుననే, తదతిరిక్త మైనది ఏదియు ఎచటను లేదు. సమస్తము అదియే. ఈ దృష్టి తోనే పురాణములయందు భగవల్లోకముల, స్వరూపముల వర్ణనము కలదు.

శ్రీమద్భాగవతమునందు శ్రీకృష్ణునిచే ప్రదర్శింపబడిన విభూతులలో బ్రహ్మకు అసంఖ్యాక విష్ణువులు పరిలక్షితులైరి. ఆ విష్ణువు లందరును రూపుదాల్చిన చతుర్వింశతి (24) తత్త్వముల చేత ఉపాసింపబడినట్లు చెప్పబడినది. మఱియు అందరును సత్య జ్ఞానానంతానందైక రసరూపులని చెప్పబడినది.

"సత్యజ్ఞానానన్తానందైకరసమూర్తయః |

అస్పృష్ట భూరి మాహాత్మ్యాపి హ్యుపనిషద్దృశామ్‌ ||"

అనగా, ఆ స్వరూపము లన్నియు సత్య-జ్ఞాన-అనంత -ఆనందైక రసమూర్తులే. శైత్యమువలన, నిర్మల జలమే మంచు అయినట్లు గానే, విశుద్ధసత్త్వము వలన నిర్మల, నిర్వికార, ఏకరసబ్రహ్మయే, ఆ మూర్తులుగా అభివ్యక్తమయ్యెను. ఆ ముర్తులు మహామహిమ వైభవోపేతములు. ఆ మూర్తుల అనేక మహాత్మ్యములను ఇతరులేమి, ఉపనిషద్ద్రష్టలై నవారు సైతము స్పృశింపజాలరు. సత్యమే, భగవంతుని అనంత మాహాత్మ్యములను సంపూర్ణముగా ఎవరును తెలిసికొనజాలరు. అనంతము లగుటవలన, భగవంతుడు గూడా వాని అంతమును (చివరిభాగమును) తెలియజాలడు.

"తే బ్రహ్మ లోకేషు పరాన్తకాలే"

అను శ్రుతియందు 'బ్రహ్మలోకేషు' అని బహువచన ప్రయోగము వలన, సవిశేష బ్రహ్మలోకము ఒక్కటే కాదు, అనేకములని అవగత మగును. సర్వమూర్ధన్య, సర్వోత్కృష్టలోకమే, శైవులకు పరమ శివలోకరూపములోను, కృష్ణభక్తులగు గోలోకధామముగాను, రామ భక్తులకు సాకేతధామముగాను, పరమ శాక్తేయులకు మణిద్వీప రూపముగాను, భాసమాన మగును. సగుణ, సవిశేష బ్రహ్మను ఉపాసించువారలకు వారి ఇష్ట దైవరూపములో భాసించును. అచటనే, నిర్గుణమైన విష్ణుతత్త్వము, జ్ఞానులకు నిర్విశేష పరబ్రహ్మ రూపములో అపరోక్షసాక్షాత్కారము మగును.

శ్రీ మహావిష్ణుః ప్రీయతామ్‌,

గాయత్రీ స్వరూప విచారము

గాయత్రీమంత్రముయొక్క వాస్తవమైన అర్థమేమి ? గాయత్రీమంత్రముద్వారా ఏ స్వరూపముతో ఏ దేవతను ధ్యానింపవలయును ? ఒకరు గోస్వరూపిణి అయిన గాయత్రిని ధ్యానించవలయునని చెప్పిన, మరొకరు ఆదిత్య మండలస్థ, శ్వేత పద్మస్థిత అయిన ఒకానొక దేవిని ధ్యానించవలయునని చెప్పుదురు. మరికొందరు బ్రహ్మాణి, రుద్రాణి, నారాయణి యొక్క ధ్యానము యుక్తమని భావింతురు. ఒక స్థలమున, పంచముఖగాయత్రీ ధ్యానము చెప్పబడిన, మరొక స్థానమున, రాధాకృష్ణధ్యానము సముచితమని భావింపబడెను. ఇట్టి స్థితిలో గాయత్రీ మంత్ర ముఖ్యార్థ మేమి, ధ్యేయ మేమి? అని బుద్ధియందు ప్రశ్న కలుగుట సహజము.

బృహదారణ్యక శ్రుతి గాయత్రీస్వరూపము ఈ విధముగా భావనీయమని చెప్పుచున్నది.

" భూమి రన్తరిక్షం ద్యౌః"

ఈ ఎనిమిది అక్షరములయందు గాయత్రీ ప్రథమపాద భావన చేయవలయును.

"ఋచో యజూగ్‌ంషి సామాని"

ఈ ఎనిమిది అక్షరములు గాయత్రీ ద్వీతయపాదమని చెప్పబడినది.

"ప్రాణో7పావో వ్యానః "

14]

ఈ అష్టాక్షరములు గాయత్రీ తృతీయ పాదమని భావింపబడినది. ఈ విధముగా లోకాత్మ, వేదాత్మ, ప్రాణాత్మ - ఈ మూడే, గాయత్రి యొక్క మూడు పాదములు. పరబ్రహ్మ, పరమాత్మయే గాయత్రీ చతుర్థపాదము.

"భూమి ర న్తరిక్షమ్‌"

ఇత్యాది శ్రుతులను వ్యాఖ్యానించుచు శ్రీ శంకర భగవత్పాదులు ఇట్లు వివరించిరి.

సమస్త ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు ప్రధానము. ఏలన, ఆ ఛందస్సే, ఛందఃప్రయోక్తలగు గయాఖ్య ప్రాణములకు రక్షకము, సమస్త ఛందస్సులకు ఆత్మ, ప్రాణము. ప్రాణమునకు ఆత్మ గాయత్రి. క్షతము (గాయము) నుండి రక్షించునదిగాన, ప్రాణము క్షాత్రము ప్రాణములను రక్షించునది గాయత్రి. ద్విజోత్తముని జన్మకు హేతువు గూడా గాయత్రియే. గాయత్రి యొక్క మూడు పాదములను ఉపాసన చేయువారలకు లోకాత్మ, వేదాత్మ, ప్రాణాత్మల సమస్త విషయముల వశములగును. గాయత్రియొక్క చతుర్థపాదమే 'తురీయ' శబ్దముచేత చెప్పబడును. రజోగుణజాతములైన సమస్త లోకములను ప్రకాశింప జేయువాడు సూర్యమండలాంతర్గతుడైన పురుషుడు. ఆ పురుషుడు సర్వలోకాధిపత్య శ్రీతోను, యశస్సు తోను ప్రగాసించుచున్న రీతిగానే, తురీయ పాదము వైదిక శ్రీతోను, యశస్సుతోను దీప్త మగుచుండును.

గాయత్రి సకల వేదజనని. గాయత్రితత్త్వమే సకల వేదముల అర్థము. విశ్వ, తైజస, ప్రాజ్ఞులు, విరాట్‌, హిరణ్యగర్భ, ఆవ్యాకృతములు, వ్యష్టి, సమష్టి జగత్తులు, వానికి సంబంధించిన జాగ్రత్‌ , స్వప్న, సుషుప్తులు - ఈ అవస్థాత్రయము ప్రణవమునందలి అకార, ఉకార, మకారమాత్రాత్రయమునకు అర్థములని తెలియవలయును. పాలకుడైన పర బ్రహ్మ, ప్రణవముయొక్క వాచ్యార్థము. సర్వాధిష్ఠానము, సర్వప్రకాశము, సగుణము, సర్వశక్తిసంపన్నము, సర్వరహితము అయిన బ్రహ్మ ప్రణవముయొక్క లక్ష్యార్థము. ఉత్పాదక, పాలక, సంహారక రూపుడు, త్రివిధ లోకాత్మస్వరూపుడు అయిన పరమేశ్వరుడు వ్యాహృతి త్రయమునకు అర్థము. అయినను, గాయత్రిద్వారా విశ్వోత్పాదకుడు, స్వయంప్రకాశుడు అయిన పరమాత్మయొక్క రమణీయ, చిన్మయ తేజస్సు ధ్యనింపబడును. ఆ తేజస్సు సమస్త బుద్ధులకు ప్రేరకము, సాక్షి. విశ్వోత్పాదకుడైన పరమాత్మయొక్క వరేణ్యభర్గస్సును (తేజస్సును) బుద్ధి ప్రేకరము, బుద్ధి సాక్షి అని చెప్పుటవలన, జీవాత్మ, పరమాత్మల అభేదము పరిలక్షిత మగును. కావున, సాధన చతుష్టయసంపన్నుడైన ఉత్తమాధికారి, ప్రత్యక్‌ చైతన్యాభిన్నము, నిర్గుణము, నిరాకారము, నిర్వికారము అయిన పరబ్రహ్మ యొక్క చింతనమే, గాయత్రీమంత్రముద్వారా చేయబడును. అనంత కళ్యాణ గుణసంపన్నుడు, సగుణుడు, నిరాకారుడు అయిన పరమేశ్వరుని ఉపాసనము గాయత్రీ మంత్రముద్వారానే సంగతము కాజాలును. సగుణ, సాకార, సచ్చిదానంద పరబ్రహ్మధ్యానము గాయత్రీమంత్రానుష్ఠానము ద్వారా చేయవచ్చును. ప్రాణి ప్రణవార్థకమైన 'సూజ్‌' ధాతువు నుండి 'సవితృ' శబ్దము నిష్పన్నమయ్యెను. ఇచట, ఉత్పత్తిని ఉపలక్షణముగా భావించి ఉత్పత్తి, స్థితి, లయములకు కారణమైన పర బ్రహ్మయే 'సవితృ' శబ్దమునకు అర్థము. ఈ దృష్టితో ఉత్పాదక, పాలక, సంహారకులు, ప్రమాణసిద్ధులు అయిన దేవతలందరును గాయత్రీమంత్రార్థభూతులే. గాయత్రీమంత్రముచేత సృష్టి, స్థితి, లయకర్తలైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల ధ్యానము, తత్స్వరూపభూతమైన శక్తిత్రయధ్యానము చేయబడును.

త్రైలోక్య, త్రైవిద్యా, ప్రాణములు గాయత్రీస్వరూపములు. అట్టి త్రిపదాగాయత్రి 'పరోరజా" ఆదిత్యునియందు ప్రతిష్ఠితయై ఉన్నది. ఏలన, ఆదిత్యుడే మూర్త, అమూర్తములు రెంటియొక్క రసము (పారము). ఈ రసము లేక, సర్వము శుష్కమైపోవును. కావున, త్రిపదాగాయత్రి ఆదిత్యునియందు సుప్రతిష్టితమై ఉండును. ఆదిత్య చక్షుస్సు, స్వరూపసత్తయందు ప్రతిష్ఠితమై ఉన్నది.ఆ సత్త, బలమునందు, అనగా, ప్రాణమునందు ప్రతిష్ఠితము. కావున, సర్వాశ్రయభూతమైన ప్రాణమే, పరమ ఉత్కృష్టమైనది. గాయత్రి, అధ్యాత్మ ప్రాణమునందు ప్రతిష్ఠితయై ఉన్నది. ఏ ప్రాణమునందు సర్వదేవతలు, వేదములు, కర్మ ఫలములు ఏకమగునో , ఆ ప్రాణ స్వరూపిణి అయిన గాయత్రియే, సర్వాత్మరూపిణి.

శబ్దరచన చేయు వాగాది ప్రాణములు 'గయ' శబ్దముచే వ్యవహరింపబడును. ఆ ప్రాణములను రక్షించునది గాయత్రి. ఆచార్యుడు ఎనిమిది సంవత్సరముల వయస్సు గల బాలకుని ఉపనీతుని గావించి గాయత్రిని ఉపదేశించునపుడు, జగదాత్మక మైన ప్రాణమునే వానికి ఒసగును. ఏ మాణవకునికి (వటువునకు) ఆచార్యుడు గాయత్రిని ఉపదేశించునో, అతని ప్రాణములను గాయత్రి రక్షించును. నరకాదిపతనమునుండి రక్షించును. గాయత్రీ పథమపాదమును తెలిసిన యతీశ్వరుడు ధనసంపన్నమయిన లోకత్రయమును దానముగా గ్రహించినను, ఆయనను ఏ దోషము స్పృశింపజాలదు. ద్వితీయ పాదతత్త్వమును తెలిసినవాడు, త్రయీవిద్యాస్వరూపుడయిన సూర్యుడు ఏ యే లోకములను ప్రకాశింపజేయునో, ఆ లోకములను అన్నింటిని పొందును. తృతీయపాదమును తెలిసినవాడు, సమస్త ప్రాణి వర్గమును పొందును. సారాంశ మేమనిన, పాద త్రయముతో సమానమైన దాత, ప్రతిగ్రహీతలు ఉన్నను గాయత్రీవేత్తను ప్రతిగ్రహదోషము స్పృశింపదు. ఇక, చతుర్థపాదవేత్త విషయములో అతని జ్ఞానఫల మని చెప్పదగిన వస్తువేలేదు.

గాయత్రియొక్క ఉపస్థానమంత్రమునందు 'హే గాయత్రి! నీవు త్రైలోక్యపాదముతో, ఏకపదవు, త్రయీవిద్యారూపమైన పాదముతో ద్విపదవు, ప్రాణాది తృతీయపాదముతో త్రిపదవు, చతుర్థ (తురీయ) పాదముతో చతుష్పదవు'. ఈ రీతిగా, పాద చతుష్టయముతో నీ ఉపాసన చేయబడును. దీని తరువాత, స్వీయ నిరుపాధిక ఆత్మస్వరూపముతో 'అపదవు' (పాదరహితము). 'నేతి నేతి' ఇత్యాది నిషేధముల వలన ఆ పాదరహితస్థితి సర్వ నిషేదములకు అవధిరూపముతో బోధితములైన సమస్త వ్యవహార ములకు అగోచరము. కావున, ప్రత్యక్షము, పరోరజము అయిన నీ తురీయ పాదమునకు మేము నమస్కారము చేయుచున్నాము. నిన్ను చేరుటకు విఘ్నకారులు, పాపులు, నిన్ను పొందుటలో విఘ్నసంపాదన లక్షణములు తమ అభీష్టమును పొందకుండుగాక. నేను అభీష్టఫలములు పొందుదును గాక. ఈ విధమైన భావనతో తురీయ పదము లభించును.

అగ్ని, గాయత్రీ దేవి ముఖము. అగ్ని ముఖమును తెలియక పోవుటచేతనే, ఒక గాయత్రీవేత్త గజమై జనకుని వాహనమయ్యెను. అగ్ని యందు ఎన్ని యేని ఇంధనములు (కట్టెలు) దగ్ధమగును. ఆ రీతిగానే, అగ్ని ముఖయైన గాయత్రి యొక్క జ్ఞానము వలన సమస్త పాపములు దూరమగును.

ఈ సమస్త చరాచర భూత ప్రపంచము గాయత్రియే అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. వాక్కే, గాయత్రి, వాక్కే, సమస్త భూతసంకీర్తనము, రక్షణము చేయుచున్నది. 'మా భైషీః' (భయపడవలదు) ఇత్యాది వచనములవలన వాక్కు చేతనే భయ నివృత్తి కలుగుచున్నది. గాయత్రిని పృథ్వీ రూపమని భావించి, ఆ పృథ్వియందు సమస్త భూతస్థితి భావింపబడినది. ఏలన, స్థావర, జంగమాత్మకమైన సమస్త ప్రాణివర్గము పృథ్వియందే ఉండును. ఎవరును (ఏదియును) ఆ భూమిని అతి క్రమింపజాలరు. పృథ్విని శరీరరూపమని భావించి, ఆ భూమియందు సమస్త ప్రాణుల స్థితి భావింపబడినది. శరీరమును హృదయముగా భావించి, దానియందు సమస్త ప్రాణుల ప్రతిష్ఠ చెప్పబడినది. ఈ విధముగా చతుష్పాద, షడక్షరపాద గాయత్రి వాక్‌, భూత, పృథ్వీ, శరీర, హృదయ, ప్రాణరూపయైన షడ్విధ గాయత్రి యొక్క వర్ణనము చెప్పబడినది. సమస్త విశ్వమును ఏకపాద మాత్రమని చెప్పి, చివరికి త్రిపాద బ్రహ్మ వేఱుగా చెప్పబడెను.

ఇంతియే గాక, పూర్వము చెప్పినరీతిగా గాయత్రీమంత్రము ద్వారా, సగుణ, నిర్గుణ, బ్రహ్మలలో ఏ బ్రహ్మనైనను ఉపాసింప వచ్చును. ఉత్పాదినీశక్తి బ్రహ్మాణి, పాలినీశక్తి నారాయణి, సంహారిణీశక్తి రుద్రాణి - వీరి ధ్యానము గాయత్రీమంత్రము ద్వారా తప్పనిసరిగా జరుగును. రామ, కృష్ణ, విష్ణు, శివ, శక్తి, సూర్య, గణశాదులలో ఎవరెవరియందు విశ్వకారణత్వ, సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్త్వములు ప్రమాణసిద్ధములో, వారందరును పరమేశ్వరులు. అందరును గాయత్రీ మంత్రార్థస్వరూపులు.

ఈ దృష్టితో మన ఇష్టదేవతాధ్యానము, గాయత్రీమంత్రము చేత చేయవచ్చును. 'సవితృ' శబ్దము సూర్య సంబంధముగా అధిక ప్రసిద్ధము. కావున, తత్సారభూతశక్తి అయిన సావిత్రిని 'ఆదిత్య మండలస్థ' అని చెప్పిరి. కణ్వ మహర్షి అమృతమయమైన క్షీరము లతో పృథ్విని సంపన్న మొనర్చుచున్న గోరూపముగా గాయత్రి యొక్క అనుభూతిని పొందెను.

" తాం సవితు ర్వరేణ్వస్య చిత్రా మహం వృణ

సుమతిం విశ్వజన్యామ్‌ |

యామస్య కణ్వో అదుహత్‌ ప్రపీనాం సహస్ర ధారో

పయస్త మహీం గామ్‌ ||"

విశ్వమాత, సుమతిరూపిణి, వరేణ్య , సవితృ గర్భస్వరూపిణి అయిన గాయత్రియొక్క వరణము చేయుచున్నాను. ఆమెను కణ్వుడు అనేక సహస్ర పయో (క్షీర) ధారలతో పృథ్విని సుసంపన్నము చేయుచుండగా దర్శించెను. ముత్యము, పగడము, సువర్ణము, నీలము ధవళకాంతి గల పంచముఖములతోను, మూడు నేత్రములతోను గూడిన, ఇందునిబద్ధ రత్నముకుటధారిణి, వరద, అభయ, అంకుశ, కశా, శుభ్ర, కపాల, గుణ, శంఖ, చక్ర, అరవింద యుగళములను రెండువైపుల గల హస్తములయందు గ్రహించియున్న గాయత్రీపరమేశ్వరీధ్యానము చేయవలయును. పంచతత్త్వముల , పంచదేవతల సారభూతమైన మహాశక్తి ఏకత్రితయై పంచముఖి పరమేశ్వరిగా అభివ్యక్త అయినది.

"ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణౖ

ర్యుక్తామిందునిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌ |

గాయత్రీం వరదాభయాంకుశ కశాః శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర మథారవిందయుగళం హసై#్తర్వహన్తీం భ##జే ||"

శ్రీ శంకరభగవత్పాదులు విహిత మొనర్చిన 'పఞ్చాయతన' పూజ, ఈ గాయత్రీ ఉపాసనమునే సూచించుచుండుట గమనార్హము. గాయత్రీధ్యాన శ్లోకము వలన, ఈవిషయము స్పష్టమగును.

గాయత్రీ మంత్రజపము అనియత స్థితి, దేశ, కాలములలో చేయరాదు. గాయత్రీమంత్రజపమునకై పవిత్ర దేశ, కాలములు అపేక్షితములు. అపుడే, ఆ గాయత్రీపరమేశ్వరి ఉపాసకుని, రక్షించును. 'పఞ్చాయతన' పూజావిషయమునందు గూడా, పై నియమము అవశ్యము ఆదరణీయము, ఆచరణీయము.

శ్రీ గాయత్రీపరదేవతా సుప్రీతా భవతు.

యజ్ఞోపవీత తత్త్వము

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్‌|

ఆయుష్య మగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||"

ఇది యజ్ఞోపవీతధారణము చేయునపుడు పఠించవలసిన మంత్రము. 'యజ్ఞోపవీత' శబ్దములో "యజ్ఞ ఉపవీతం" అను రెండు శబ్దములు ఉన్నవి. వీని అర్థము తెలిసికొనిన గాని, యజ్ఞోపవీత తత్త్వము అవగతము కాదు. 'యజ్ఞ' మనగా పూజ అని, సంగతికరణ మని అర్థము. 'సంగతికరణ' మనగా, రెండుగా విభక్తమై యున్నవానిని ఒకటిగా కలుపుట. 'ఉపవీయతే వామస్కంధః అనేనేతి ఉపవీతమ్‌" అనగా, దీనిచే ఎడమ భుజము కప్ప బడుచున్నది గాన, 'ఉపవీత' మనబడును. 'యజ్ఞార్థం ఉపవీతం యజ్ఞోపవీతమ్‌"- యజ్ఞానుష్ఠానము కొఱకైన ఉపవీతము గాన, 'యజ్ఞోపవీత' మనబడను,

యజ్ఞమునందు వేదమంత్రములతో దేవతలకు హవిస్సుల నొసగుదురు. 'యజ్ఞోపవీత్యేవాధీయీత" అనగా యజ్ఞోపవీతము ధరించియే, వేదాధ్యయనము చేయవలయునని శ్రుతి, ఆదేశించుచున్నది. దీనివలన వేదమునకు, యజ్ఞోపవీతమునకు సన్నిహిత సంబంధము ఉన్నట్లు తెలియుచున్నది. ఇంతేగాక, యజ్ఞోపవీతము పరమ పవిత్రమైనది. ప్రజాపతితో గూడా సహజముగా ఆవిర్భవించినది. ఆయుష్ప్రదము, శ్రేష్ఠము (అన్నిటికంటె పూర్వము ఉన్నది) నిర్మలము, బలసామర్థ్యప్రదము. ఇట్టి యజ్ఞోపవీతము

15]

ఉపనయనాధికారము గలవారికే విహితమై యున్నది. భారతీయ మహర్షులు యజ్ఞోపవీత స్వరూప స్వభావములను పలు రీతులుగా చెప్పియున్నారు. ఆపస్తంబ సూత్రానుసారము యజ్ఞోపవీతము ధరించవలయును. కాని, మనమందరము, నేడు అశ్వలాయన సూత్రము ననుసరించి యజ్ఞసూత్రమును ధరించుచున్నాము. ఇది నవతంత్వాత్మకము. ఈ తొమ్మిది తంతువులకు తొమ్మిదిమంది అధిష్ఠాన దైవతములు గలరు 1) ప్రణవము, 2) అగ్ని, 3) భగుడు 4) సోముడు, 5) పితృదేవతలు, 6) ప్రజాపతి, 7) అష్టవసువులు, 8) ధర్మదేవత, 9) విశ్వేదేవతలు. ఈ విధముగా యజ్ఞోపవీత ధారణ చేయుటవలన, ఈ శరీరము సర్వదేవతానిలయమై వైదిక యజ్ఞ యాగాద్యనుష్ఠానమునకు యోగ్యమగును.

ఈ యజ్ఞోపవీతమునందలి దారము 96 బెత్తల పొడవు కలిగి యుండును. అందువలననే, దీనికి వైదిక సంప్రదాయమునందు 'షణ్ణవతి' యను పేరు కలదు. సూర్యుడు మేరుపర్వతముచుట్టూ 96 సారులు తిరుగుటను ఈ 96 బెత్తలు సూచించునని ప్రాచీనుల అభిప్రాయము. యజ్ఞోపవీతము మూడు వరుసలు కలిగియుండుట గాని, గృహస్థు మూడు యజ్ఞోపవీతములు ధరించుటగాని, సత్త్వ, రజస్తమోగుభములను, భూర్భువస్సువ ర్లోకములను, ఋగ్యజుస్సామములను. గార్హపత్య దక్షిణ, ఆహవనీయాగ్నులను సూచించునని శాస్త్రవేత్తల యభిప్రాయము, ఉపనయన సంస్కారమువలన పురుషునకు యజ్ఞోపవీతధారణ యోగ్యత కలుగును. అటులనే, స్త్రీకి వివాహసంస్కారము వలన, మంగళసూత్ర ధారణయోగ్యత సిద్ధించును. ఈ మంగళసూత్రము గూడ, నవతంత్వాత్మకము. మంగళసూత్రము యజ్ఞోపవీతస్థానీయమని గ్రహించవలయును. మంగళసూత్రములేని స్త్రీ, శుభకార్య నిర్వహణయోగ్యత కోల్పోవునట్లుగానే, యజ్ఞోపవీతములేని పురుషుడు, వేదోక్తమైన యజ్ఞాది కర్మానుష్ఠానము చేయునట్టి అధికారము కోల్పోయినవాడగును. ప్రాతః కాలమునుండి సాయంకాలంవరకు పంచమహాయజ్ఞములను నిర్వహించవలసియున్నది. 'ఉపవీతము' యజ్ఞార్థము గనుక, మానవుడు నిరంతరము యజ్ఞోపవీతమును ధరించియే ఉండవలయును.

ఇంతవఱకు అధియజ్ఞపరముగా, అధిదైవతపరముగా యజ్ఞోపవీత తత్త్వము వివరింపబడినది. అధ్యాత్మపరముగా ఋషులు భావనను తెలిసికొనినగాని, యజ్ఞోపవీత స్వరూప స్వభావములు పూర్తిగా తెలియవు.

ఈ శరీరము 'శ్రీపుర'మని, 'బ్రహ్మగిరి'యని, 'శ్రీచక్ర'మని భావన చేయుట ఉపాసనాసంప్రదాయము. శ్రీచక్రము నవచక్రాత్మకము. నవావరణాత్మకము. నవ చక్రాత్మికయై వెలుగొందు చున్న శ్రీలలితా త్రిపురసుందరి, సాక్షాత్తు , కుండలినీ శక్తియే. ఆ పరాభట్టారికను సూచించునట్టి యజ్ఞోపవీతము నవసూత్రాత్మకమై కన్పట్టుచున్నది. ఇంతేకాదు, ప్రాణాయామాది సాధనచే మేల్కొనిన కుండలినీశక్తి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, అజ్ఞాచ క్రముల వఱకు అధిరోహించును. అచటి నుండి బిందు, నాద, కళాది నవకముద్వారా అధిరోహించి " శివేన సహమోదతే" యనినట్లు సచ్చిదానందరూపిణియగును. ఆ బింద్వాది నవకమునకు ప్రతీకయే యజ్ఞ సూత్రము. 'యజ్ఞ' మనగా 'సంగతికరణ' మని మొదట తెలిసికొంటిమి. శివశక్తి సామరస్యమే, మిథునీభావమే, సంగతికరణము. ఎడమభుజముమీదుగా యజ్ఞోపవీతమును ధరించినవాడు వామార్ధాంగదేహధారియగు అర్థనారీశ్వర స్వరూపుడై యని తెలియవలనయును. ఏలన, యజ్ఞోపవీతము, కుండలినీ శక్తి రూపిణియగు 'ఉమ' యే గదా ! యజ్ఞోపవీతమునకు మూడు ముడులు ఉండును. మేరుదండమునందుగూడ బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులని గ్రంథి త్రయము ఉండును. అగ్ని, సూర్య సోమ మండలములని మేరుదండమునందు మూడు మండలములు కలవని యోగిజనానుభవము. యజ్ఞోపవీతమునందలి మూడు ముడులు, ఆ గ్రంథి త్రయమునకు, ఆ మండల త్రయమునకు ప్రతీకలని భావించవలయును.

పరమేశ్వరునికి 'ఉపవీతీ' అని నామము కలదు. 'ఉపవీతినే' యనుచు నమకము పేర్కొనుచున్నది. దీనివలన పరమేశ్వరునకు గూడా, ఉపవీతము కలదని తెలియుచున్నది. పూజాసమయమున, పరమేశ్వరీ పరమేశ్వరులకు యజ్ఞోపవీత సమర్పణము చేయుట సంప్రదాయసిద్ధముగా వచ్చుచున్నది. అయిన, వారికిగల యజ్ఞోపవీత తత్త్వమును తెలిసికొనవలయును. "భుజంగరూపా కుండలినీశక్తి రుపవీతమ్‌" - సర్పాకారములోనున్న కుండలినీశక్తియే 'ఉపవీత మని అర్థము. కుండలినీశక్తి మూలాధారమున సార్ధత్రివలయమై 31/2 చుట్టలుచుట్టుకొని నిద్రించుచున్న 'భుజంగరూపిణి' యగు పరాశక్తియే. పరమేశ్వరునకు 'కుండలీ' యను నామము ప్రసిద్ధము. ఈశ్వరుడు నాగయజ్ఞోపవీతధారి. విష్ణువు శేషశాయి. శక్తి, శక్తి మంతులకభేదము గాన, ఇద్దరును కుండలీ స్వరూపులే. చేతనుడైన పరమేశ్వరుడు చిచ్ఛిక్తినివీడి, యెన్నడు ఉండడు. కనుక, ఆయన, సదా అపార శక్తిమంతుడై యుండును. సర్వజగద్రక్షకుడైన పరమేశ్వరుడే, యజ్ఞోపవీతధారియై యున్నప్పుడు, ఉపనీతులు సదా ఉపవీతులమై యుండవలయుననుటలో అసంగతమైన విషయ మేమున్నది !

పైవిచారణ వలన తేలిన విషయమ మేమనిన, నేడు ధరింప బడుచున్న యజ్ఞోపవీతము, కుండలినీశక్తికి ప్రతీకమని భావన చేయవలయును. కుండలినీశక్తియగు పరమేశ్వరి షణ్ణవతి కళా స్వరూపిణి. ఆ సత్యమును సూచించుట కొరకే మన పెద్దలు యజ్ఞోపవీతమునందలి సూత్రముయొక్క పొడవు 96 బెత్తలు ఉండవలయునని నిర్ణయించిరి. మూడు సూత్రములు, మూడు యజ్ఞోపవీతములు ధరించుట యను సంప్రదాయము గూడా కుండలినీశక్తిని, ఋగ్యజుస్సామరూపిణి యగు పరదేవతను, త్రిపాద్‌ గాయత్రిని సూచించును.

యోగసాధనాభ్యాసము చేత ఆ కుండలినీ శక్తి మేల్కొని, మూలాధారాది సహస్రారాంతము వ్యాపించును. కుండలినీశక్తి యనగా, చిదగ్నియే. ఆమె తేజ స్తంతురూపములో వ్యాపించును. అట్టి కుండలినీశక్తిని జ్ఞాపకము చేయుచు యజ్ఞోపవీతము గూడా సుత్రరూపమున, నిర్మింపబడుచున్ది. మూడు సూత్రములుగల యజ్ఞోపవీతమును ధరించుటయందు గల తాత్పర్యము, తేజో రూపిణి యగు ఆ పరాశక్తి సుషుమ్నా, ఇడా, పింగళానాడుల ద్వారా పయనించునని సూచించుటకొఱకే అని భావించవలయును. మన శరీరము స్థూల, సూక్ష్మ, కారణ శరీరాత్మకముగా నుండును. ఈ మూడు శరీరములే త్రిపురములు. ఆ త్రిపురములయందు విరాజిల్లుచున్న ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపిణి యగు లలితా త్రిపురసుందరియే, కుండలినీశక్తి. కనుకనే, యజ్ఞోపవీతము సూత్రత్రయాత్మకమై యుండును.

ఇట్టి మహత్త్వసంపన్నమైన యజ్ఞోపవీతమును ఎన్నడు వీడరాదు. సదా, ధరించియే బహిర్యాగ, అంతర్యాగములను చేయవలయును. తద్ద్వారా శివశక్తి సామరస్యానుభూతిని పొందవలయును. ఈ విధముగా అద్వయ బ్రహ్మానందమును అను భవించుటకై తీవ్రసాధన చేసి, జీవితమును సార్ధక మొనర్చుకొనుట మన యందఱి కర్తవ్యము. ఈ విధనుగా యజ్ఞోపవీతము అధికారి తారతమ్యముతిబట్టి అధియజ్ఞపరముగా, అధిదైవపరముగా, ఆధ్యాత్మపరముగా రమణీయార్థములను బోధించునట్టి పరావాక్‌ స్వరూపిణియగు వేదమాతయే యనియు, కుండలినీశక్తి శ్రీమహాత్రిసురసుందరియే అనియు, భావించునట్లుగా ఆ పరాశక్తి ధీప్రచోదనము చేయుగాక !

యజ్ఞోపవీతును విసర్జించునపుడు క్రింది శ్లోకమును పఠించుట సంప్రదాయము :

శ్లో || పవిత్రవన్త మతిజీర్ణవన్తం వేదాన్తవేద్యం

పరబ్రహ్మ రూపమ్‌

ఆయుష్య మగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం

యజ్ఞోపవీతం విసృజేత్తు తేజః ||

అని చెప్పుచు భుజములపైనుండి ప్రాత యజ్ఞోపవీతమును విసర్జించవలెను.

ఇ తి శ మ్‌

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్‌

శ్లో || హే స్వామినాథ ! కరుణాకర! దీనబంధో!

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో!

శ్రీశాది దేవగణపూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలమ్బమ్‌ || 1

శ్లో || దేవాధిదేవస్తుత దేవగణాధినాథ

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద |

దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాథ మమ దేహి కరావలమ్బమ్‌ || 2

శ్లో || నిత్యాన్నదాననిరతాఖిల రోగహారిన్‌

భాగ్యప్రదానపరిపూరిత భక్తకామ|

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 3

శ్లో || క్రౌంచాసురేంద్ర పరిఖండనశక్తి శూల

చాపాది శస్త్ర పరిమండిత దివ్యపాణ |

శ్రీ కుండలీధరతుండ శిఖీంద్రవాహ !

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 4

శ్లో || దేవాధిదేవరథ మండల మధ్య వేద్య

దేవేంద్ర పీడనకరం దృఢ చాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 5

శ్లో || హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూరకుండల లసత్కవచాభిరామమ్‌ |

హే వీర ! తారక జయామరబృందవంద్య

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 6

శ్లో || పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిక్త హరియుక్త పరాసనాథ

వల్లీనసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 7

శ్లో || శ్రీ కార్తికేయ! ంరుణామృతపూర్ణదృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం |

సిక్త్వా తు మానస కళాధర కాన్తికాన్త్యా

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్‌ || 8

శ్లో || సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః ||

శ్లో || సుబ్రహ్మణ్యాష్టకం మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |

కోటిజన్మకృతం పాపం తత్షణాదేవ నశ్యతి || 10

శ్రీ సుబ్రహ్మణ్యః ప్రీయతామ్‌.

శ్రీమద్రామాయణ సున్దరకాణ్డ

ఏక త్రింశః నర్గః

శ్లో || ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహాకపిః |

సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ || 1

శ్లో || రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్‌ |

పుణ్యశీలో మహాకీర్తిః ఋజు రాసీ న్మహాయశాః || 2

శ్లో || రాజర్షీణాం గుణ శ్రేష్ఠః తపసా చార్షిభి స్సమః |

చక్రవర్తికులే జాతః పురన్దరసమో బలే || 3

శ్లో || అహింసారతి రక్షద్రో ఘృణీ సత్యపరాక్రమః |

ముఖ్య శ్చేక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్‌ లక్ష్మీ వర్థనః || 4

శ్లో || పార్థివ వ్యఞ్జనైర్యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః |

పృథివ్యాం చతురన్తాయాం విశ్రుత స్సుఖదః సుఖీ || 5

శ్లో || తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిపనిభాననః |

రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్‌ || 6

శ్లో || రక్షితా స్వస్య ధర్మస్య స్వజన్మ స్య చ రక్షితా |

రక్షితా జీవలోకస్య ధర్మ స్య స్వజనస్య పరన్తపః || 7

శ్లో || తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనా త్పితుః |

సభార్యః సహ చ భ్రా త్రా వీరః ప్రవ్రాజితో వనమ్‌ || 8

శ్లో || తేన తత్ర మహారణ్య మృగయాం పరిధావతా |

రాక్షసా నిహతా శ్శూరాః బహవః కామరూపిణః ||9

16]

శ్లో || జనస్థానవధం శ్రుత్వా హచౌ చ ఖరదూషణౌ |

తత స్త్వమర్షాపహృతా జానకీ రావణన తు |

వఞ్చయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా || 10

శ్లో || స మార్గమాణ స్తాం దేవీం రామ స్సీతా మనిన్దితాం |

ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరమ్‌ || 11

శ్లో || తత స్స వాలినం హత్వా రామః పరపురఞ్జయః |

ప్రాయచ్ఛత్‌ కపిరాజం తత్‌ సుగ్రీవాయ మహాబలః ||

శ్లో || సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః |

దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వన్తి సహస్రశః ||13

శ్లో || అహం సంపాతివచనాత్‌ శతయోజన మాయతమ్‌ |

అస్యా హేతో ర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్‌ ప్లుతః || 14

శ్లో || యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితామ్‌ |

అశ్రౌషం రాఘవస్యాహం సేయ మాసాదితా మయా ||15

శ్లో || విరరామైవ ముక్తా7సౌ వాచం వానరపుజ్గవః |

జానకీ చాపి తచ్ఛృత్వా పరం విస్మయ మాగతా || 16

శ్లో || తతః సా వక్రకేశాన్తా సుకేశీ కేశసంవృతం|

ఉన్నమ్య వదనం భీరుః శింశుపావృక్ష మైక్షత || 17

శ్లో || నిశమ్య సీతా వచం కపేశ్చ

దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య |

స్వయం ప్రహర్షం పరమం జగామ

సర్వాత్మనా రామ మనుస్మరన్తీ || 18

శ్లో || సా తిర్య గూర్ధ్వం చ తథా 7ప్యధస్తాత్‌

నిరీక్షమాణా త మచి న్త్యబుద్ధిమ్‌ |

దదర్శ పింగాధిపతే రమాత్యం

వాతాత్మజం సూర్య మివోదయస్థమ్‌ || 19

ఇత్యార్షే శ్రీమద్రామాయణ సుందరకాణ్డ ఏకత్రింశః సర్గః ||

శ్రీః

సూత సంహితాయాం

శ్రీ సూతముని స్రోక్తం

శ్రీ పరాశక్తి స్తోత్రమ్‌

೧. వాగుద్భూతా పరాశక్తిః యా చిద్రూపా పరా7భిధా |

వన్దే తా మనిశం భక్త్యా శ్రీకంఠార్ధశరీరిణీమ్‌ ||

೨. ఇచ్ఛా సంజ్ఞా చ యా శక్తిః పరిపూర్ణశివోదరా |

వన్దే తా మాదరేణౖవ మమేష్టఫలదాయినీమ్‌ ||

೩. శక్తి ర్యా పరమా సాక్షాద్‌ బీజభూతా7ఖిలస్య చ |

వన్దే తా మనిశం భక్త్యా నకులీశ శివాన్వితామ్‌ ||

೪. ఊర్ధ్వరుపా7ప్యధోరూపా తథా7ధస్థా7పి మధ్యగా |

మధ్యరూపా7పి చాన్తఃస్థా యా తాం వన్దే వరప్రదామ్‌ ||

೫. విన్యాసై ర్వర్ణసంక్ల్‌ పై#్తః విశ్వవిద్యాలయాత్మనా |

విద్యోతమానా యా వాచి వన్దే తా మాదరేణ తు ||

೬. ఏకధా చ ద్విధాచైవ తథా షోడశధా స్థితా |

ద్వాత్రింశద్‌ భేదభిన్నా చ యా తాం వన్దే పరాననామ్‌ ||

೭. అకారాది క్షకారాన్తైః వర్ణై రత్యస్తనిర్మలైః |

అశేషశ##బ్దైః యా భాతి తా మానంద ప్రదాం నుమః ||

೮. లక్ష్మీవాగాదిరూపేణ నర్తకీవ విభాతి యా |

తా మాద్యస్తవినిర్మా క్తా మహం వందే వరాననామ్‌ ||

೯. బ్రహ్మాద్యాః స్థావరాన్తాశ్చ యస్యా ఏవ సముద్గతాః |

యస్యామేవ విలీయన్తే తసై#్య నిత్యం నమోనమః ||

೧೦. మహ దాది విశేషాన్తం జగద్యస్యాః సముద్గతమ్‌|

యస్యామేవ లయం యాతి వన్దే తా మంబికా మహమ్‌ ||

೧೧. గురుమూర్తి ధరాం గుహ్యాం గుహ్య విజ్ఞానదాయినీమ్‌ |

గుహ్యభక్తజనప్రీతాం గుహాయాం నిహితాం నుమః ||

೧೨. య ఇదం పఠతే స్తోత్రం సంధ్యయె రుభయోరపి |

సర్వవిద్యాలయో భూత్వా స యాతి పరమాం గతిమ్‌ ||

೧೩. ఇతి జనహిత మేతత్‌ ప్రోచ్య దేవాః ప్రసాదాద్‌

గురుగురు మఖిలేశం భక్తిపూర్వం ప్రణమ్య |

మునిగన మవలోక్య స్వానుభూత్యైవ సూతః

స్వక పరశివరూపే లీనబుద్ధి ర్బభూవ ||

శ్రీ పరాశక్తిః ప్రీయతామ్‌ |

షష్టీదేవీస్తోత్రమ్‌

1. నమో దేవ్యై మహాదేద్యై సిద్ధ్యై శాన్యై నమో నమః ||

2. శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః |

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః ||

3. సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః |

సృష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్ధ్యై చ నమో నమః ||

4. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠ్యై దేవ్యై నమో నమః |

సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః ||

5. బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠి దేవ్యై నమో నమః ||

కల్యాణదాయై కల్యాణ్యౖ ఫలదాయై చ కర్మణామ్‌ ||

6. ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః |

పూజ్యాయై స్కందకాన్తాయై సర్వేషాం సర్వకర్మసు ||

7. దేవరక్షణకారణ్యౖ షష్ఠీదేవ్యై నమో నమః |

శుద్ధ సత్త్వస్వరూపాయై నందితాయై నృణాం సదా ||

8. హింసా క్రోధ వర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః |

ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సర్వేశ్వరి ||

9. మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి |

ధర్మ దేహి యశో దేహి షష్ఠిదేవ్యై నమో నమః ||

10. దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే |

కల్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః ||

ఫల శ్రుతిః

11. షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్‌ య శ్శృణోతి తు వత్సరమ్‌ |

అపుత్రో లభ##తే పుత్రం వరం సుచిరజీవినమ్‌ ||

12. వర్షమేకం చ యో భక్త్యా సంపూజ్యేదం శృణోతి చ |

సర్వపాపా ద్వినిర్ముక్తా మహామన్ధ్యా ప్రసూయతే ||

13. వీరం పుత్రం చ గుణినం విద్యావస్తం యశస్వినమ్‌ |

కాకవన్థ్యా చ యా నారీ మృతవత్సా చ యా భ##వేత్‌ ||

14. వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీదేవీ ప్రసాదతః |

రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్‌ |

మాసేన ముచ్యతే బాలః షష్ఠీదేవీ ప్రసాదతః ||

ఇతి శ్రీదేవి భాగవతే నవమస్కంధే నారద నారాయణ సంవాదే షష్ఠ్యుపాఖ్యానే షట్చత్వారింశోధ్యాయః ||

శ్రీ షష్ఠిదేవీ ప్రీయతామ్‌||

వనదుర్గాస్తోత్రమ్‌

కామేశ్వరీం వారామేది కాదిహాది స్వరూపిణీమ్‌ |

మాతృకావర్ణలిప్తాజ్గీం మహాశ్రీచక్రమధ్యగామ్‌ ||

1. నమోస్తు వనదుర్గాయై మహాశ్వర్యై నమో నమః |

కాత్యాయన్యై నమస్తుభ్యం శర్వాణ్యౖ తే నమో నమః ||

2. అపర్ణాయై నమ స్తుభ్యం నమస్తే సర్వమంగళే |

పార్వత్యై చ నమ స్తుభ్యం మహావిద్యాస్వరూపిణి ||

3. మృడాన్యై చ నమ స్తుభ్య మంబికాయై నమో నమః |

చండికాయై నమ స్తుభ్య మార్యాయై చ నమో నమః ||

4. దాక్షాయణ్యౖ నమ స్తుభ్యం గిరరాజసుతే నమః |

మేనకాతనయే తుభ్యం హైమవత్యై నమో నమః ||

5. మహాకాళి మహాగౌరి నమ స్తుభ్యం సురేశ్వరి |

నమోస్తు పరమేశాన్యై శివామై చ శివప్రదే ||

6. భవాన్యై చ నమ స్తుభ్యం భవబంధ విమోచని |

నమస్తే రుద్రరూపిణ్యౖ రుద్రాణ్యౖ చ నమో నమః ||

7. భద్రకాళి నమ స్తుభ్యం ఖడ్గహస్తే నమో నమః |

నమోస్తు చిత్రవసనే నీలకౌశేయధారిణి ||

8. భక్తశత్రుహరే తుభ్యం పీతాంబరి నమోస్తుతే |

రంభాతరుసమానోరు నమోస్తు విపులద్యుతే ||

9. విశాలజఘనే తుభ్యం మణికాఞ్చీవిరాజితే |

సింహమధ్యే నమ స్తుభ్యం వశిత్రయవిభాసురే ||

10. గంభీరనాభికే తుభ్యం బ్రహ్మండోదర రూపిణి |

కుచనిర్జిత సౌవర్ణ కలశద్వితయే నమః ||

11. కల్పవల్లీ సమభుజే నమః కంచుకశోభితే |

కంబుకంఠి నమ స్తుభ్యం రాజీవాక్షి నమోస్తుతే ||

12. బింబాధరే నమ స్తుభ్యం రత్నతాటంకశోబితే |

నీలాలకే నమస్తుభ్యం దీర్ఘవేణి నమో నమః ||

13. నవరత్నకిరీటేన సంశోభిత శిరోవరే |

కౌసుంభవసనే తుభ్యం ముక్తాహారవిరాజితే ||

14. శుద్ధ జాంబూనదమయ కంఠాభరణభూషితే |

నమః కామారిదయితే రమాపూజిత పాదుకే ||

15. వన్యాలంకృత సర్వాంగి గీర్వాణవనితార్చితే |

సురారాధిత పాదాబ్జే శివభక్తవర ప్రదే||

16. సురనారీపరివృతే నమదూర్వాజ్కుర ప్రభే |

మహిషోపిరసంస్థానే ఖడ్గ చాపధరే శుభే ||

17. ఇందీవరదళశ్యమే కాలమేఘసమప్రభే |

నమోస్తు మౌవనారూఢే నవదుర్గే నమో నమః ||

18. కైరాతక మహేశాన మనోనయన నందిని |

దేవ దానవసంసేవ్యే వనదుర్గి నమోస్తుతే ||

17]

19. కైలాసనిలయే దేవి మహాదైత్యవిమర్దని |

నవరత్నపరిప్రోత నానాభరణభూషితే ||

20. నమ స్తుభ్యం గిరసుతే మహిషాసురమర్దని |

త్రిశూలాఞ్చిత దోర్వల్లీ సమలంకృతవిగ్రహే ||

21. పరాత్పరే నమ స్తుభ్యం హంసిన్యై తే నమో నమః |

శంఖిన్యై చ నమ స్తుభ్యం చక్రిణ్యౖ చ నమో నమః ||

22. గదిన్యై చ నమ స్తుభ్యం త్రిశూలవరధారిణి |

నమః కల్పవనాస్తస్థే కదంబవనవాసిని ||

23. శ్రీచందనవనావాసే పద్వాన్తస్థే నమో నమః |

నమ స్తుభ్యం హిరసుతే మహాదేవమనోహరే ||

24. నమఃషడ్వక్త్రజనని జగన్మంగళ##దేవతే ||

నమ స్తుభ్యం నమ స్తుభ్యం నమ స్తుభ్యం నమో నమః ||

25. సంవిత్స్వరూప బిసకందల కందరూపే |

సంసార సన్తమనబంధ విభాతసంధ్యే |

త్రాయస్వ కుండలిని కుంకుమతామ్రదేహే |

మాత స్త్రికోణమణిమంటపదీపలేఖే ||

26. మహా మరకతప్రఖ్యా మింద్రనీలసమప్రభామ్‌

దూర్వాదళ శ్యామలాఙ్గీం రత్నకుండలశోభితామ్‌ |

సింహస్థితాం మహాదుర్గాం సర్వాలజ్కారభూషితామ్‌ |

సర్వ సిద్ధిమతాం దేవీం వనదుర్గా మహం భ##జే ||

27. జయ సౌభాగ్యదే నౄణాం లోకమోహిని తే నమః |

సర్వై శ్వర్యప్రదే పుంసాం సర్వ విద్యాప్రదే నమః ||

28. సర్వాపదాం నాశకరి సర్వదారిద్ర్యనాశనీ |

నీలాంబరే నమస్తుభ్యం నీలాలకవిరాజితే ||

29. వనదుర్గి నమ స్తుభ్యం కామేశ్వరగృహేశ్వరి |

నమ స్తుభ్యం మహాదేవి భక్తభీష్టప్రదాయిని ||

30. మహావిద్యే మహాదేవి మహాదేవమనఃప్రియే |

మంగళం మే ప్రయచ్ఛాశు మనసా త్వా నమామ్యహమ్‌ ||

శ్రీ కామేశ్వర్యంబా ప్రీయతామ్‌

శ్రీ దుర్గా పఞ్చరత్న స్తోత్రమ్‌

1) తే ధ్యానయోగానుగతా అపశ్యన్‌

త్వామేవ దేవీం స్వగుణౖర్ని గూఢామ్‌|

త్వమేవ శక్తిః పరమేశ్వరస్య

మాంపాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ||

2) దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా

మహర్షి లోకస్య పురఃప్రసన్నా|

గుహాం పరం వ్యోమసతః ప్రతిష్ఠా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ||

3) పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే

శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే |

స్వాభావికీ జ్ఞాన బల క్రియాతే

మా పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ||

4) దేవాత్మశ##బ్దేన శివాత్మభూతా

యాత్కూర్మ వాయవ్య వచోవినృతా |

త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా

మా పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ||

5) త్వం బ్రహ్మ పుచ్ఛా వివిధా మయూరీ

బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా |

జ్ఞానస్వరూపాత్మ తయాఖిలానాం

మా పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ||

శ్రీ జగద్గురు కాఞ్చీకామకోటి పీఠాధీశ్వర

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ విరచితం

శ్రీ దుర్గాస్తోత్రం సంపూర్ణమ్‌|

చండిధ్వజస్తోత్రమ్‌

1) ఐం నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై భూత్యై నమో నమః |

పరమానందరూపిణ్యౖ నిత్యాయై సతతం నమః ||

2) నమస్తేస్తు మహాదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ధనం దేహి సామాజ్ర్యం దేహి మే సదా ||

3) రక్ష మాం శరణ్య దేవి ధనధాన్య ప్రదాయిని |

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

4) నమస్తేస్తు మహాకాళి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

5) నమస్తేస్తు మహాలక్ష్మి పరబ్రహ్మస్వరూపిణి

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

6) మహసరస్వతీదేవి పరబ్రహ్మస్వరూపిణి

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

7) నమో బ్రాహ్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

8) నమో మహేశ్వరీదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

9) నమస్తేస్తు కౌమారి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... .... .... మే సదా ||

10) నమస్తే వైష్ణవీదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ||

11) నమస్తేస్తు వారాహి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

12) నారసింహ నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి |

రాజ్యందేహి ధనందేహి సామ్రాజ్యం దేహి మే సదా||

13)నమో నమస్తే ఇంద్రాణి పరబ్రహ్మస్వరూపిణి|

రాజ్యం దేహి ... ... మే సదా ||

14) నమో నమస్తే చాముండి పరబ్రహ్మస్వరూపినణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

15) నమో నమస్తే నందాయై పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

16) రక్తద్వన్తే నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

17) నమస్తేస్తు మహాదుర్గే పరబ్రహ్మస్వరూపిణీ |

రాజ్యం దేహి ... ... మే సదా ||

18) శాకంభరి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణీ |

రాజ్యం దేహి ... ... మే సదా ||

19) శివదూతి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణీ |

రాజ్యం దేహి ... ... మే సదా ||

20) నమస్తే భ్రామరీదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

21) నమో నవగ్రహేదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యందేహి ధనందేహి సామ్రాజ్యం దేహి మే సదా ||

22) నవకూట మహాదేవి పరబ్రహ్మ స్వరూపిణి |

రాజ్యం దేహి ... .... మే సదా ||

23) స్వర్ణపూర్ణే నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ||

24) శ్రీ సుందరి నమస్తే పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

25) నమో ణగవతీదేవి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

26) దివ్యయోగిని నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

27) నమస్తేస్తు మహాయోగిని పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

28) నమో నమస్తే సావిత్రి పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

29)జయలక్ష్మి నమస్తేస్తు పర బ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

30) మోక్షలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి |

రాజ్యం దేహి ... ... మే సదా ||

31) రక్ష మా శరణ్య దేవి ధనధాన్య ప్రధాయిని |

రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా ||

శ్లో|| చండీధ్వజ మిదం స్తోత్రం సర్వకామఫల ప్రదం|

రాజతే సర్వజన్తూనాం వశీకరణసాధనమ్‌ ||

శ్రీ మార్కండేయ పురాణ పరబ్రహ్మ ప్రోక్తే రాజసంధానే చండీధ్వజస్తోత్రం సంపూర్ణమ్‌|

దుర్గాసప్తశతి - చణ్ణీ పరదేవత

శ్లో|| మాతర్మే మధుకూటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే

హేలానిర్మిత ధూమ్రలోచనవదే మే చణ్డ ముణ్డార్దిని |

నిః శేషికృత రక్తబీజ దనుజే నిత్యే నిశుంభావహే

శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేమ్బికే ||

భగవతి 'పరబ్రహ్మమహిషి' అని చెప్పబడినది.

''త్వమసి పర బ్రహ్మమహిషీ''

ఈ దృష్టితోనే ఆమె నామము 'చండిక',

'చడి కోపే' అను ధాతువునుండి 'చండ' శబ్దము నిష్పన్న మయ్యెను.

''కస్య బిభ్యతి దేవాశ్చ కృతరోషస్య సంయుగే|''

ఎవనికి రోషము కలుగుటవలన, దేవతలకు గూడా సంగ్రామము నందు భయము కలుగునో, ఆయన 'చండ' శబ్దవాచ్యుడు.

''మాహద్భయం వజ్ర ముద్యతమ్‌|''

పైకి ఎత్తబడిన వజ్రాయుధభయము వలన, భృత్యులు తత్పరతతో కార్యనిర్వహనము చేయురీతిగానే, పరమాత్రమ యొక్క భయమువలన , సూర్య, ఇంద్ర, చంద్రులు జాగరూకతతో తమ తమ కార్యములయందు లగ్నచిత్తులై ఉందురు. చండరూపుడైన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపభూతయైన శక్తి, పత్నిచండిక.

వస్తుతః, చండరూపుడైన ఆ పరమాత్మయందే, స్త్రీత్వ, పుంస్త్వములు భక్తుల భావమును అనుసరించి ఉండును. పుంస్త్వ వివక్షచేతర, ఆ పరమాత్మయయే, మహారుద్రాది శబ్దములతోను, స్త్రీత్వ వివక్షచేత ఆయనయే, చండీ, దుర్గాది శబ్దములచేతను వ్యవహరింపబడును.

సవార్ణ మంత్రార్ధము

నవార్ణమంత్రముయొక్క భావము గూడా ఇదియే. 'డామర తంత్రము' నందు ఈ మంత్రార్థము ఈ విధముగా చెప్పబడినది-

''నిర్ధూత నిఖిల ధ్వాన్తే ః నిత్యముక్తే | పరాత్పరే |

అఖండ బ్రహ్మవిద్యాయై చిత్సదానందరూపిణీ ః

అనుసందధ్మహే నిత్యం వయం త్వాం హృదయాంబుజే ||''

అనగా, నిర్దూత నిఖిల ధ్వాన్తేః (సమస్త తమస్సును దూర మొనర్చు ఓ దేవీ! ) హే నిత్యముక్తే! మే పరాత్పరతరే! చిత్సదానందరూపిణి అయిన ఓ తల్లీ! నేను అఖండ బ్రహ్మవిద్యకై నిన్ను నా హృదయ కమలమునందు అనుసంధానము చేయుచున్నాను.

'ఐం' ఈ వాగ్బీజము వలన, చిత్స్వరూపిణి అయిన సరస్వతి బోధింపబడును, ఏలన, జ్ఞానము వలననే అజ్ఞానము నివృత్త మగును. వేదాన్త మహావాక్యజన్యమైన పరబ్రమ్మాకార వృత్తి యందు ప్రతిఫలించి, చిద్రూపిణి అయిన ఆ భగవతియే, అజ్ఞానమును నాశ మొందించును.

'హ్రీం' అను మాయాబీజము వలన, సద్రూపిణి అయిన మహాటక్ష్మి, వివక్షితురాలగును. త్రికాలాబాధ్యయైన వస్తువే నిత్య

18]

మైనది. కల్పితమైన ఆకాశాది ప్రపంచము యొక్క అపవాదము నకు అధిష్ఠాన మగుటవలన, సద్రూపిణి అయిన భగవతియే, నిత్య ముక్తురాలు.

'క్లీం' అను కామరాజబీజము వలన పరమానందస్వరూపిణి అయిన మహాకాళి, వివక్షితురాలగును. సర్వానుభవ సంవేద్యమైన ఆనందమే, పరమ పురుషార్థము.

''ఆత్మనస్తు కామాయ సర్వ ప్రియం భవతి|''

అను శ్రుతి వలన, సమస్తము ఆత్మార్థమే ప్రియ మగునని తెలియుచున్నది. కావున, ఆత్మ స్వరూపమైన ఆనందమే శేషి, తదితర మంతయు శేషము. మానుషానందము మొదలుకొని గంధర్వ, దేవగంధర్వ, ఆజానజదేవి, శ్రౌతదేవ, ఇంద్ర. బృహస్పతి, ప్రజాపతి, బ్రహ్మాన్తము ఉత్తరోత్తర శతగుణిత ఆనందము ఏ ఆనందము యొక్క బిందు మాత్రమో, అది పరమాతిశాయి అయిన బ్రహ్మానందమని చెప్పబడెను. ఆ పరాత్పర ఆనంద రూపమే, మహాకాళీరూపము. 'చాముణ్డాయై' శబ్దముచేత మోక్షకారణ భూతము, నిర్వకల్పము అయిన బ్రహ్మాకారవృత్తి, వివక్షితము. విపదాదిరూపమైన చమువును (సేనను) నాశ మొందించి ఆత్మ రూపముగా జేసికొను 'చాముండయే' బ్రహ్మవిద్య. ఆధి దైవికము లైన మూలాజ్ఞాన, తూలాజ్ఞానరూపులైన చండ, ముండులను తన వశములో ఉంచుకొను భగవతి గూడా, 'చాముండ' అని చెప్పబడును.

''యస్మా చ్ఛణ్డం ముణ్డం చ గృహీత్వా త్వముపాగతా |

చాముణ్డతి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి||''

'విచ్చే' యందు 'విత్‌, చ, ఇ' అనునట్టి మూడు పదములు, క్రమముగా చిత్‌, సత్‌ ఆనందవాచకములు. 'విత్‌' శబ్దమునకు 'జ్ఞాన'మని అర్థము. 'చ' నపుంసకలిఙ్గమైన 'సత్‌'ను బోధించును. 'ఇ' ఆనందబ్రహ్మమహిషీబోధకము. పై విచారణవలన తేలిన సారాంశ మేమన, హే చిత్‌, సత్‌ పరమానన్దరూపే! నిర్దూతాఖిల ధ్వన్తే! నిత్యముక్తే! పరాత్పరే! మహాసరస్వతి! మహాలక్ష్మి! మహాకాళి! మేము నీతత్త్వజ్ఞానప్రాప్తికై మా హృదయకమలము నందు నిన్ను ధ్యానము చేయుచున్నాము.

(ఈ మంత్రమును శ్రీచండి నవార్ణమంత్రమని అందురు. 'అర్ణ' మనగా అక్షరము. ఇది నవాక్షరసంపుటితమైన మహా మంత్రము. ఋషి, చ్ఛండో, దేవతాన్యాసపూర్వకముగా గురు ముఖతః ఉపదేశము నొంది, జపించవలయునే గాని, స్వయముగా కేవల మంత్రజపము, ఫల ప్రాపకము కాకపోవుటయే కాక, అనర్థ హేతువుగూడా అగును. పాఠకులు గమనింప ప్రార్థన)

ప్రథమ చరితము

భగవతీ కృప వలననే సమ్యక్‌ తత్త్వజ్ఞానము లభించునని 'దుర్గాసప్తశతి' యందు చెప్పబడినది. సర్వత్ర జ్ఞానప్రశంస కలదు. జ్ఞానము వలన అజ్ఞాన, మోహాదులు నశించును. జ్ఞాన సంపాదనము కొఱకే శ్రవణాదులు చేయబడును. జప, తప, యజ్ఞాదులన్నింటియొక్క పరమోపయోగము జ్ఞానమునందేకలదు. ఆమెయే, చరాచర ప్రపంచసృష్టికర్త్రి, ఆమయే ప్రసన్నయై ముక్తి ప్రదాత్రి యగును. విద్యారూపిణియై ఆమెయే, ముక్తిప్రదయగును. అవిద్యారూపముతో ఆమెయే సంసారబంధ హేతువగును. ఆమెయే, విష్ణు భగవానుని 'యోగనిద్ర' అని చెప్పబడును. భగవంతుడు కల్సాంతమునందు శేషశాయియై విరాజమానుడై నపుడు, కూర్మపృష్ఠముపైన జలములో విలీనుడగులవలన భూమి నవనీతమువలె కోమల మాయెను. సృష్టికాలమున, ఈ ధరిత్రి ఏ విధముగా ధరింపగలుగునని ఆలోచించి, భగవతి, విష్ణువును స్వీయ యోగనిద్రాశక్తిచే ప్రసుప్తుని గావించి, తన వామభాగము నందలి కనిష్ఠికానఖాగ్రభాగముచేత కర్ణ మలమును తీసి, దానితోనే 'మధు' నామకదైత్యుని, దక్షిణకర్ణమలముచేత 'కైటభ' నామము గల దైత్యుని, సృష్టించెను. ఆ విధముగా సృష్టింపబడిన ఆదైత్యులు ఇరువును. మొదట కీటసదృశులుగా ప్రతీయమాను లయిరి. తదనంతరము మహాబలవంతులైరి. వారకి వరదాన మొసగి, దేవి అంతర్థాన మొందెను.

అంత, విష్ణు నాభికమలమునుండి ఉద్భవించిన బ్రహ్మను ఆ దైత్యులు ఇరువురును చూచిరి. బ్రహ్మను చూచిన ఆ దైత్యులు బ్రహ్మతో ఇట్లనిరి - మేము నిన్ను వధింతుము. నీవు జీవింప దలచిన, విష్ణువును మేల్కొలుపుము. ఆ వచనములు వినిన బ్రహ్మ, జగత్ప్రసవిత్రి (జగన్మాత) అయిన యోగనిద్రను ఈ విధముగా స్తుతించెను-

శ్లో|| ''విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణిమ్‌ |

నిద్రాం భగవతీం విష్ణో రతులాం తేజసః ప్రభుః ||''

తాత్పర్యము

విశ్వేశ్వరి, జగత్‌ సృష్టి, స్థితి, లయకర్త్రి, వైష్ణవీ తేజః

స్వరూపిణి అయిన యోగనిద్రను బ్రహ్మ, ఇట్లు స్తుతించెను.

శ్లో|| ''త్వం స్వాహా త్వం స్వధా త్వం వషట్కారాత్మికా |

సుధా త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థితా ||

శ్లో|| అర్ధమాత్రాస్థితా నిత్యా యానుచ్చార్యావిశేషతః |

త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా ||

శ్లో|| త్వయైన ధార్యతే విశ్వం త్వయైతత్‌ సృజ్యతే జగత్‌ |

త్వయైతత్పాల్యతే దేవీ త్వమత్స్యన్తే చ సర్వదా ||

శ్లో|| విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే |

తథా సంహౄతిరూపాన్తే జగతోస్య జగన్మయే ||

తాత్పర్యము

హే విశ్వేశ్వరి! నీవు అనేక రూపములలో అభివ్యక్తినొంది జగత్తును ధరించుచుందువు. నీవే సృష్టి, స్థితి, లయ కారిణివి. నీవే, యోగనిద్రారూపిణివై జగత్ప్రభువునకు విశ్రాంతి నొసగుదువు.

హే మాతః ! నీవే, 'స్వాహా' రూపముతో దేవతలను, 'స్వధా' రూపముతో పితరులను, 'వషట్కార' రూపముతో శ్రౌతదేతలను సంతుష్టులను జేయుదువు. నీవే, ఉదాత్త, అనుదాత్తాది స్వరూపము తోను, సుధారూపముతోను, హ్రాస్వ, దీర్ఘ, ప్లుతత్వములతోను, అకార, ఉకార, మకార రూపముతోను, అనగా, ప్రణవరూపము తోను విరాజిల్లుచుందువు, హే జనని! నీవు అక్షరరూపిణివైన భగవతివి.

అకార, ఉకార, మకారరూప వర్ణత్రయముతోను, వానియందు వ్యాపించియున్న విశ్వ, తైజస, ప్రాజ్ఞాదిరూపముతోను ఓ జననీ! నీవే, విరాజిల్లుచందువు, వాచ్యవాచకములకు అధిష్ఠానరూపమైన అర్థమాత్రాస్వరూపముతో గూడా నీవే, విరాజమానవై ఉన్నావు. నీవు నిత్యస్వరూపిణివి.

హే జననీ! నీవే, సంధ్యారూపిణివై విరాజిల్లుదువు. హే జగజ్జనని! నీవే, పరాప్రకృతివి. ఓ జననీ! ఈ జగత్తు నీచేతనే ధరింపబడుచున్నది. నీచేతనే సృష్టమగుచున్నది. నీచేతనే పోషించబడుచున్నది. హే దేవి! నీవే, జగత్తును సంహృతము చేయుచున్నావు. హే భగవతి! సృష్టికాలమునందు సృష్టిరూపము తోను, స్థితికాలమునందు స్థితిరూపముతోను, సంహారకాలమునందు సంహృతిరూపముతోను నీవే, అభివ్యక్త మగుదువు.

శ్లో|| మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః |

మహామోహా చ భవతీ మహాదేవీ మహాసురీ||

శ్లో|| ప్రకృతి స్త్వం చ సర్వస్య గుణత్రయవిభావినీ |

కాళరాత్రి ర్మహారాత్రి ర్మోహరాత్రిశ్చ దారుణా ||

శ్లో|| త్వం శ్రీ స్త్వమీశ్వరీ త్వం హ్రీ స్త్వం బుద్ధి ర్బోధలక్షణా |

లజ్జా పుష్టి స్తథా తుష్టి స్త్వం శాంతిః క్షాన్తిరేవ చ ||

శ్లో|| ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |

శంఖినీ చాపినీ బాణ భుశుండీ పరిఘాయుధా ||

తాత్పర్యము

బ్రహ్మ, యోగనిద్రాశక్తిని ఇంకను అనేక విధములుగా స్తుతింపసాగెను. మే జననీ! నీవే, మహావిద్యాస్వరూపిణివై విలసిల్లుదువు. అనగా, తత్త్వమస్యాది మహావాక్యములచే ప్రతిపాదింపబడునట్టి బ్రహ్మవిద్యారూపిణివై వరలుచున్నావు. నీవే, దేహాత్మబుద్ధిరూపిణి అయిన మేధారూపిణివి. నీవే, స్మృతి రూపముతో వెలుగొందుదువు. ఓ తల్లీ! నీ వలననే, అతీత కల్పముల స్మృతి కలుగుట, తదనుకూలమైన సృష్టిరచన జరుగుట సంభవ మగుచున్నది. గ్రామ్యసుఖభోగైషణారూపమైన మహామోహరూపము కూడా నీవే అయి ఉన్నావు. హే భగవతి! నీవు ఇంద్రాది దేవతాశక్తివే కాక, హిరణ్యాక్షాది అసురుల శక్తిరూపిణివి గూడా నీవే, అయి ఉన్నావు.

నీవే, సర్వభూత ప్రకృతివి, సత్త్వ, రజస్తమోరూప గుణత్రయ విభావినివి. నీవే, కాళరాత్రివి, లేక శివరాత్రిరూపిణివి. నీవే, మహారాత్రివి, అనగా, ప్రళయరాత్రిరూపముతో వెలుగొందుదువు. నీవు మోహరాత్రిస్వరూపముతో గూడా శోభిల్లుచుందువు. అనగా, భగవతియే, శ్రీకృష్ణజన్మాష్టమినాడు, అవతరించి, కంసాదులను మోహితులను జేసినది, శ్రీకృష్ణుని, నందగృహము నకు జేర్చుటయందు సాయపడినది నీవే కదా, తల్లీ!

ఓ జగన్మాతా! నీవే 'శ్రీ' శబ్ధవాచ్యవు. నేవీ, మహేశ్వరివి, నీవే లజ్జారూపిణివి, బోధలక్షణము గల బుద్ధివి నీవే అయి ఉన్నావు. నీవే, పుష్టి, తుష్టి, శాంతి, క్షాంతి (క్షమా) రూపముతో వెలుగొందుచుందువు.

ఖడ్గ, శూల, గదా, చక్ర, శంఖ, చాప, భుశుండి (ఆయుధ విశేషము) పరిఘాది ఆయుధములను ధరించిన మహాఘోరరూపిణివి నీవే కదా, జననీ!

శ్లో|| సౌమ్యాసౌమ్యతరాశేష సౌమ్యేభ్య స్త్వతిసున్దరీ|

పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ||

శ్లో|| యచ్చ కిఞ్చిత్‌ క్వచి ద్వస్తు సదసద్వాఖిలాత్మికే |

తస్య సర్వస్య యా శక్తిః సా త్వం స్తూయసే తయా ||

శ్లో|| యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్‌ |

సోపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతు మిహేశ్వరః ||

శ్లో|| విష్ణుః శరీర గ్రహణ మహ మీశాన ఏవ చ |

కారితాస్తే యతోత స్త్వాం కః స్తోతుం శక్తిమాన్‌ భ##వేత్‌ ||

తాత్పర్యము

హే భగవతి! నీవే, పరమ సౌమ్యరూపిణివి, సౌమ్యతర రూపముతో వెలగొందుదువు. ఆశేష సౌమ్యరూపములకంటె అతి సుందరివి. అథవా భక్తులకు సౌమ్యరూపిణివి, దైత్యులకు అత్యంత అసౌమ్య (ఘోర) రూపిణివై ఉందువు. అనగా, అత్యంత క్రూరవు. సమస్త ఆహ్లాదహేతువు అగుటచేత అత్యంత సుందరివి. బ్రహ్మాది సమస్తదేవతలకంటె నీవు పరమోత్కృష్టవు. పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ వాక్కులలో నీవు 'పరావాక్‌' స్వరూపిణివి. వస్తుతః, ప్రపంచములో సదసత్తులు, కార్యకారణములు, చేతనాచేతనములు అయిన పదార్థములలో గల శక్తివి నీవే అయి ఉన్నావు.

ఏ మహాశక్తి ద్వారా పరమేశ్వరుడు ప్రపంచసృష్టి, స్థితి, లయములు చేయనో, ఆయన, స్వయముగా యోగనిద్రారూపిణివైన నీకు వశుడై యోగనిద్రాలీనుడయ్యెను, అట్టి స్థితిలో, ఎవడు నీ గుణములను వర్ణింప సమర్థుడు కాగలడు?

విష్ణువు, ఈశానుడు, సృష్టికర్తను అయిన నేను సైతము ఓ జగజ్జననీ! దేహధాదలు మగుచున్నాము. అట్టితరి, నీ గుణ సంకీర్తనము ఎవడు, చేయజాలును?

శ్లో|| సా త్వమిత్థం ప్రభావైః సై#్వరుదారైర్దేవి సంస్తుతా|

మోహయేతౌ దురాధర్షా వసురౌ మధుకైటభౌ ||

శ్లో|| ప్రబోధం చ జగత్స్వామీ నీయతా మన్యతో లఘు |

బోధశ్చ క్రియతా మస్య హన్తు మేతౌ మహాసురౌ ||

తాత్పర్యము

హే దేవి! నీవు ఈ విధమైన ప్రభాశాలినివి. ఉదార స్వభావము కలదానవు. దురాధర్షులైన మధు, కైటభు లనునట్టి ఆ అసురులను మోహితులను జేయుము. జగత్ప్రభువు, యోగ నిద్రావశుడు అయిన శ్రీమహావిష్ణువును మేల్కొలుపుము. ఈ గొప్ప అసురులను వధించునట్లుగా జ్ఞానోదయమును కలిగించుము అని బ్రహ్మ, యోగనిద్రాస్తవము చేసెను.

అంత, భగవతి ప్రసన్నురాలై అట్లే యని బ్రహ్మకు వరమొసగెను. భగవతి, జగన్మాత, విష్ణుమూర్తిని యోగనిద్రనుండి మేల్కొల్పెను.

మధు, కైటభు లిరువురును విష్ణుమూర్తితో అయిదు వేల సంవత్సరములు భీషణ సమర మొనర్చిరి. మహాప్రమత్తులైన ఆ దైత్యులు మహామాయామోహితులై విష్ణువును వరము కోరుకొను మని చెప్పిరి. అపుడు, విష్ణువు ఈ విధముగా పలికెను-'మీరిరువురును మాకు వధ్యులు, మేము ఆ వరమునే కోరుచున్నాము'. అపుడు, అ దైత్యులిట్లనిరి- 'ఎచట పృథివి, జలముతో వ్యార్తిమైఉండదో, అచట, మమ్ము వధింపుము'. ఆ వచనములను ఆకర్ణించిన విష్ణువు తన జఘన (తొడ) ప్రదేశమునందు వారి శిరస్సులను ఉంచి, చక్రముతో వారిని సంహరించెను.

ఈ విధముగా అనంతానంత శక్తిసంపన్నయు, ఆనంద ప్రధానయు అయిన భగవతి 'మహాకాళీ' రూపముగా 'సప్తశతీ' ప్రథమ చరితమునందు వర్ణించబడినది.

19]

మధ్యమ చరితము

అనంత కాలమునందు ఆమెయే, మహాలక్ష్మీ రూపములో ఆవిర్భూతురాలయ్యెను. ఒకప్పుడు, పూర్తిగా నూరుసంవత్సరముల కాలము దేవతలకు, అసురులకు ఘోర సంగ్రామము జరిగెను. అసురుల ప్రభువు మహిషాసురు, దేవతలకు ప్రభువు ఇంద్రుడు. మహిషాసురుడు దేవతలను జయించి, స్వయముగా ఇంద్రపదవిని అలంకరించెను. దేవతలు పరాజితులై. బ్రహ్మను తోడుగా గొని, శివ, విష్ణువుల సమీపమున కేగిరి. వారు శివ, విష్ణువులతో మహిషాసుర జయమును, దేవతల పరాజయమును విశదముగా వివరించిరి. దేవతల వచనములన ఆకర్ణించి, మధుసూదనుడు, (విష్ణువు) శంకరుడు -ఇరువురును కృద్ధులైరి. వారి ముఖమునుండి ఒక మహాతేజస్సు ఆవిర్భవించెను. బ్రహ్మ ముఖమునుండియు, అట్టి తేజస్సే బహిర్గతమయ్యెను. ఇంద్ర, వరుణాది దేవతల దేహముల నుండి గూడా, దివ్య తేజస్సు ఆవిర్భూత మయ్యెను.

ఈ విధముగా, సర్వదేవతా శరీరములనుండి ఆవిర్భవించిన ఆ మహాతేజస్సే, పర్వతసమానముగా కన్పడసాగెను. ఆ తేజోజ్వాల చేత దిశలు, విదిశలు సర్వము వ్యాప్తములైనవి. అసమానమైన ఆ తేజస్సే, ఒకటిగా ప్రోగై, ఒక స్త్రీరూపముగా పరిణామము చెందెను. ఆ తేజస్సుయొక్క దివ్య దీప్తి, ముల్లోకములు వ్యాపించెను. సమస్తదేవతల తేజస్సు వలన, ఆ దివ్యతేజస్సు నందు భిన్న భిన్న అవయవములు ఇత్పన్నములయ్యెను. సమస్త దేవతల తేజోరాశితో ఆవిర్భవించిన, అద్భుతమైన భగవతిని జూచి వారు ప్రసన్నులైరి. దేవతలందఱు విభిన్న ఆయుధములను, ఆభరణములను ఆమెకు ఒసగిరి. సర్వులు జగన్మాత అయిన భగవతిని సన్మానించిరి.

ఆ తల్లి, ప్రసన్నురాలై సింహనాదము చేయసాగెను. ఆమె చేసిన ఘోరనాదముతో ఆకాశమంతయు నిండిపోయెను. ఆ ప్రతిధ్వని వలన, లోకము లన్నియు వ్యాకులము లయ్యెను, సాగరములు కంపించిపోయెను. దేవతలు ఆనందములో 'జయ జయ' ధ్వానములు చేయసాగిరి. మునిబృందములు స్తోత్రములు చేయసాగిరి.

ఇట్టి స్థితిని జూచి, అసురుల అస్త్ర, శస్త్రములను ధరించి యుద్ధసన్నద్ధులైరి. అనేక అసురులచే సమావృతుడైన మహిషాసురునకు ఇట్లు కన్పడెను - ఆ భగవతి ముల్లోకములను తన మహాతేజస్సుతో వ్యాప్త మొనర్చి, పాదా క్రమణముచేత పృథ్విని కృంగి పోవునట్లు చేయుచున్నది, తన కిరీటముతో నభోమండలమును ఖచిత మొనర్చుచున్నది, ధనుష్టంకారముచేత పాతాళ లోక పర్యంతము వ్యాకుల మొనర్చుచున్నది, అనేక సహస్రభుజములతో దశదిశలను వ్యాప్త మొనర్చుచున్నది. అట్టి శక్తిసంపన్నురాలైన దేవిని మహిషాసురుడు చూచెను.

వెంటనే, అసురుల యుద్ధ మారంభించిరి. భయానకమైన సంగ్రామము జరిగెను. నేలకూలిన గజ, తరుగ, రథ, అసురులచే భూమి అగోచరమయ్యెను. భయానకమైన శోణిత (రక్త) నది ప్రవహింపసాగెను. చివరికి అస్త్ర, శస్త్రములు, శక్త్యాదులు ప్రయోగింపబడినవి. భగవతి అనేకులను అస్త్రములతోను, పెక్కుమందిని హుంకామాత్రముచేతను నాశ మొందించుచుండెను. దేవీవాహన మైన సింహము విచిత్రయుద్ధము చేసి, 'చామర' ప్రభృతి దైత్యులను సంహరించెను.

అనేక దైత్యులు సంహరింపబడగా, స్వయముగా మహిషాసురుడు మహిషరూపముతో అద్భుత పరాక్రమమును ప్రదర్శించెను. చండిక, వానిని పాశముతో బంధించెను. అపుడు అతడు సింహరూపమును ధరించెను. చండిక, సింహశిరస్సును ఖండింప ప్రయత్నము చేయుసరికి, అతడు ఖడ్గపాణియై పురుషుడయ్యెను. అపుడు, అంబ, ఖడ్గపాణియైన ఆ పురుషునిపైన ఖడ్గ ప్రహారము చేయగా, అతడు గజరూపమును ధరించెను. గజమై, దేవయొక్క సింహమును శుండముతో (తుండముతో) లాగసాగెను. దేవి, ఖడ్గముతో గజతుండమును ఖండించెను. అనంతరము అతడు తిరిగి మహిషమై ముల్లోకములను భయభీతము చేయసాగెను. తుట్టతుదకు, భగవతి ఎగిరి, అతనిపైకి దుమికి, వానపై ఆరూఢురాలయ్యెను. వానిని పాదముచే ఆక్రాంతుని జేసి, శూలముతో తాడనమొనర్చెను. ఇంతలో అతడు, మహిషముఖమునుండి అర్ద నిష్క్రాంత (సగము వెలుపలికి వచ్చిన) అసురరూపముతో సమరము చేయ మొదలిడెను. చివరికి, మాత, విశాలఖడ్గముతో వాని శిరస్సును ఖండించెను. అసురసైన్యములో హాహాకారములు బయలుదేరెను. శక్రాదిదేవతలు సంతుష్టాంతరంగులై, అచటనే అత్యంత శ్రద్ధాసక్తులతో వినమిత శిరస్కులై భగవతిని ఈ విధముగా స్తుతించిరి -

శ్లో|| శక్రాదయః సురగణా నిహతేతివీర్యే

తస్మిన్‌ దురాత్మని సురాదిబలే చ దేవ్యాః |

తాం తుష్టువుః వ్రణతినమ్ర శిరోధరాం సా

వాగ్భిః ప్రహర్షపులకోద్గమ చారుదేహః ||

శ్లో|| దేవ్యా యయా తత మిదం జగదాత్మశక్త్యా

నిఃశేష దేవగణశక్తి సమూహమూర్త్యా |

తా మంబికా మఖిలదేవ మహర్షిపూజ్యం

భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః ||

తాత్పర్యము

హే మాతః! నీవు జగదాత్మశక్తివి, నీచేత సమస్త విశ్వము వ్యాప్తమై ఉన్నది. నీవు సమస్త దేవతాశక్తి యొక్క సమష్టి మూర్తివి. నీవు అఖిల దేవ, మహర్షిపూజ్యవు. హే అంబికే! మేము భక్తివినమ్రులమై ప్రణమిల్లుచున్నాము. మాకు శుభములను కలుగ జేయుదువు గాక !

శ్లో|| యస్యాః ప్రభావ మతులం భగవా ననన్తో

బ్రహ్మా హరశ్చ న హి వక్తు మలం బలం చ |

సా చండికాఖిల జగత్పరిపాలనాయ

నాశాయ చాశుభ భయస్య మతిం కరోతు || 3

శ్లో|| యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః

పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః |

శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా

తాం త్వాం నతాః పరిపాలయ దేవి విశ్వమ్‌ ||

తాత్పర్యము

హే చండికే! నీ ప్రభావము, బలము అసమానమైనది. నీ బల ప్రభావములను వర్ణించుటకు చతుర్ముఖ బ్రహ్మ, సర్వైశ్వర్య సంపన్నుడైన విష్ణువు, శివుడు సైతము సమర్థులు కారు. ఓ జననీ! సమస్త జగత్పరిపాలనము కొఱకు, అశుభ నాశము కొఱకు చిత్తమును లగ్నము చేయుదువు గాక.

హే దేవి! నీవు పుణ్యవంతులైన, గృహములయందు లక్ష్మీ రూపముతో విరాజిల్లుచుందువు. కావున, నీవు శ్రీరూపిణివై సుకృతాత్మకమైన విశ్వమును పరిపాలింప వేడుచున్నాము. ఓ తల్లీ! నీవే, పాపాత్ముల గృహములయందు అలక్ష్మీరూపుముతో సర్వదా, వర్తిల్లుదువు, సుకృతుల హృతయముల యందు, అనగా సాధనాభ్యాసముచేత సుసంస్కృతమైన అంతఃకరణము గలవారి హృదయములయందు అధ్యవసాయాత్మిక (నిశ్చయాత్మిక) అయిన బుద్ధిరూపముతో విరాజమానవై ఉందువు. అథవా, నీవు హృదయమునందు స్వర్గ, అపవర్గ (మోక్ష) సాధనభూతమైన జ్ఞానరూముతో ఉందువు. సత్పురుషులయందు, అనగా, వైదిక మార్గినిష్ఠులైనవారి అంతఃకరనములందు ఆగమచోదితమైన (వేద బోధితమైన) 'శ్రద్ధా' రూపముతో విరాజమానవై ఉందువు. ఉత్తమ కులసంజాతులైన ప్రజల హృదయమునందు 'లజ్జా' రూపిణివై నిషిద్ధ కర్మాచరణమునందు ప్రవృత్తిని కలిగించక సదాచారనిష్ఠులను చేయుదువు. అట్టి గుణములతో గూడిన ఓ జగజ్జననీ! మేము నీకు ప్రణమిల్లుచున్నాము. హే దేవి! ఈ విశ్వమును పరిపాలించుము.

శ్లో|| కిం వర్ణయామ తవ రూప మచిస్త్య మేతత్‌

కిఞ్చాతివీర్య మసురక్షయకారి భూరి|

కిఞ్చాహవేషు చరితాని తవాద్భుతాని

సర్వేషు దేవ్యసుర దేవగణాదికేషు ||

శ్లో|| హేతు స్సమస్త జగతాం త్రిగుణాపి దోషై

ర్న జ్ఞాయసే హరి హరాదిభి రవ్యపారా |

సర్వాశ్రయాఖిల మిదం జగదంశభూత

మవ్యాకృతా హి పరమా ప్రకృతి స్త్వమాద్యా ||

తాత్పర్యము

హే దేవి, సకల అసుర, దేవ మనుష్యాదులయందు నీ అద్భుతమైన రూపము అచింత్యమైనది. అనగా, మనస్సుచేత గూడా స్వరించుటకు శక్యము కానిది. అట్టి నీ అద్భుత రూపమును వాక్కుతో ఏమని వర్ణింపగలము? వాచామగోచరవు. హే దేవి! అసురక్షయకారియైన నీ మహాపరాక్రమమును మేము వాక్కుతో ఏమని వర్ణింపగలము? అసుర, దేవగణాది సంగ్రామములయందు అనన్య సామాన్యములైన నీ అద్భుత వీరచరితములు అవాఙ్మానస గోచరములు. మహత్త్వోపేతమైన నీ మహావీర్య, శౌర్యదులను మేము వర్ణింప సమర్థులము కాము.

హే జగన్మాతః ! నీవు త్రిగుథాత్మికవు. అయినను, నీవు సమస్త జగత్తునకు మూలప్రకృతివి. నీవు సత్త్వగుణాత్మికవైన వైష్ణవీశక్తివై జగత్పాలనము చేయుదువు. రజోగుణాత్మికవైన నీవు, బ్రాహ్మీశక్తివై జగత్సర్జనము (సృష్టి) చేయుచున్నావు. తమోగుణాత్మికవైన నీవు, మహేశ్వరీశక్తివై జగత్సంహారము చేయుదువు. హే దేవి! నీవు మాయారూపిణివి. హరిహరాది దేవతలు గూడా, నిన్ను తెలియజాలరు. ఏలన, నీవు పారము (అంతము) లేనిదానవు. అనగా, అనంతస్వరూపిణివి. నీవు సర్వాశ్రయవు. ఈ సమస్తవిశ్వము నీ అంశభూతమే. నీవు అవ్యాకృతస్వరూపిణివి. నీవు స్వయంప్రకాశవు, పరప్రకాశ్యవు కావు. కావున, నీవు పరబ్రహ్మస్వరూపిణివి. నీవు అద్యయైన పరా ప్రకృతివి. హే దేవి! వినమ్రులమై మేము ప్రణామములు చేయుచున్నాము. కరుణార్ద్రవై జగత్పరిపాలనము చేయుము తల్లీ!

శ్లో|| యస్యాం సమస్త సురతా ముదీరణన

తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషు దేవి |

స్వాహానవై పితృగణస్య చ తృప్తిహేతు

రుచ్చార్యసే త్వ మత ఏప జనైః స్వధా చ ||

యా ముక్తీ హేతు రవిచిస్త్వ మహావ్రతా చ

అభ్యస్యసే సునియతేంద్రియ తత్త్వసారైః |

మోక్షార్థిభి ర్మునిభి రస్తసమస్తదోషై

ర్విద్యాసి సా భగవతీ పరమా హి దేవీ ||

తాత్పర్యము

హే జనని! నీవు 'స్వాహా' రూపిణివి, సమస్త యజ్ఞముల యందు, ఇంద్రాది దేవతల స్వాహాకారోచ్చారణము చేత నీవు తృప్తిని పొందుచున్నావు. హే దేవి! నీవే, 'స్వధా' రూపిణివై విరాజిల్లుచుందువు. కావుననే, పితృయజ్ఞములయందు పితృ శ్రాద్ధము చేయు వ్యక్తులచేత పితృగణమునకు తృప్తి హేతువైన 'స్వధా' రూపమైన, మంత్రాత్మవైన నీవే, అర్చింపబడుదువు. ఓ తల్లీ! ఈ విధముగా నీవు సమస్త దేవగణ, పితృ గణముల తృప్తికి కారణభూతవై వెలగొందుచున్నావు.

హే భగవతి! నీవు విద్యాస్వరూపిణివి. ఆ విద్య, ముక్తి హేతువు. ఆ బ్రహ్మవిద్య, అచింత్య మహావ్రతరూపము కలది, ఆ విద్య, అజ్ఞానమును పోగొట్టునట్టి పరావిద్య. వేదాంత మహావాక్యజన్యమైన బ్రహ్మతత్త్వావగతిసాక్షాత్కారమే, లక్షణముగా గల బ్రహ్మవిద్యాస్వరూపిణివి నీవు. మోక్షార్థులు, నిరస్తసమస్త రాగ, క్రోధాది దోషులు నియతేంద్రియ తత్త్వసారులు అయిన, నిరంతరము శ్రవణ, మననాదుల ద్వారా సాధన చేయబడు దానవు నీవే. అయి ఉన్నావు. సర్వోత్కృష్టమైన బ్రహ్మవిద్యా రూపిణివి నీవే తల్లీ!

శ్లో|| శబ్ధాత్మికా సువిమలర్గ్యజుషాం నిధాన

ముద్గీథి రమ్యపదపాఠవతాం చ సామ్నామ్‌ |

దేవి త్రయీ భగవతీ భవభావనాయ

వార్తా చ సర్వజగతాం వరమార్తిహన్త్రీ ||

మేధాసి దేవి విదిదాఖిల శస్త్రసారా

దుర్గాసి దుర్గభవసాగర నౌ రసఙ్గా |

శ్రీః కైటబారిహృదయైక కృతాధివాసా

గౌరి త్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా || ೧೦

తాత్పర్యము

హే దేవి! నీవు నాదబ్రహ్మరూపిణివి. దోషరహితములైన ఋగ్వేద, యజుర్వేదములకు, రమ్య పతపాఠము గల సామవేద మునకు ఆశ్రయభూతవు. హే దేవీ! నీవు త్రయీరూపిణివి. నీవు సర్వైశ్వర్యసంపన్నవు. సంసారస్థితికి ఆవశ్యకమగు కృష్యాది రూపముతో వర్ధిల్లుచుందువు. ఓ తల్లీ! నీవే, సమస్త లోకముల ఆపదలను నివారించుదానవు. నీకు మా నమస్కారము.

హే మాతః నీవు, మేధాస్వరూపిణివి. కావుననే, నీవు నిఖిల శాస్త్రసారమును తెలిసినదానవు. ఓ దేవీ! నీవు దుర్గాస్వరూపిణివి. నీవు సంగరహితవై దుస్తరమైన భవసాగరమును తరింపజేయునట్టి నౌకవంటిదానవు. విష్ణు వక్షఃస్థల నివాసినియైన లక్ష్మీదేవి నీవే, అయి ఉన్నావు. హే దేవి! చంద్రశేఖరుని వామభాగమున,

20]

ప్రతిష్ఠితయై ఉన్న గౌరివి నీవే అయి ఉన్నావు. అనగా, నీవు బ్రహ్మవిద్యారూపిణి అయిన ఉమాదేవివై వెలగొందుచుందువు.

శ్లో|| ఈషత్సహాస మమలం పరిపూర్ణచంద్ర

బింబానుకారి కనకోత్తమ కాన్తికాస్తమ్‌ |

అత్యద్భుతం ప్రహృత మాత్తరుషా తథాపి

వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ ||

శ్లో|| దృష్ట్వా తు దేవి కుపితం భ్రుకిటీకరాళ

ముద్యచ్ఛ శాంక సదృశచ్ఛవి యన్న సద్యః |

ప్రాణాన్ముమోచ మహిషస్తదతీవ చిత్రం

కైర్జీవ్యతే హి కుపితాన్తకదర్శనేన || ೧೨

తాత్పర్యము

హే దేవి! మందస్మిత యుక్తము, రుచిరము, పూర్ణ చంద్రబింబ సదృశము, ఉత్తమ సువర్ణకాంతి శోభాఢ్యము జగన్మోహనమైన నీ ముఖారవిందమును జూచిన పురుషుడు పరమానందమును పొందును. కాని, అట్టి నీ జగన్మోహన వక్త్రమును (ముఖమును) చూచినంతనే, మహిషాసురుడు కోపావిష్టుడయ్యెను. ఆశ్చర్యము:

హే జనని! క్రోధావిష్టము, భ్రుకుటీకరాళము, క్రోధ తామ్రము, ఉదయించుచున్న చంద్రకాంతిసదృశము, సంగ్రా మోన్ముఖము అయిన నీ ముఖమును చూచినంతనే, మహిషాసురుడు ప్రాణములను వీడకపోవుట అనునది అత్యంత ఆశ్చర్యకరము. కుపితుడైన యముని, దర్శించినవాడు ఎవడు జీవింపగలడు?

శ్లో|| దేవి ప్రసీద పరమా భవతీ భవాయ

సద్యో వినాశయసి కోపవతీ కులాని |

విజ్ఞాత మేత దధునైవ యదస్త మేత

న్నీతం బలం సువిపులం మహిషాసురష్య || ೧೩

శ్లో|| తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం

తేషాం యశాంసి న చ సీదతి బంధువర్గః |

ధన్యా స్త ఏవ నిభృతాత్మజ భృత్యదారా

యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా || ೧೪

తాత్పర్యము

ఓ జననీ! నీవు పరమ కరుణామయివి. నీవు మాపట్ల ప్రసన్నురాలవు కాగోరుదుము. నీవు పరమైన - ఉత్కృష్టమైన బుద్ధిరూపిణివి. అనగా, లక్ష్మీరూపిణివి. నీవు ప్రసన్నురాల వైనచో, సమస్తలోకములు లక్ష్మీసంపన్నములగును. నీవు కృద్ధురాలవైన, సమస్తలోక వంశములు వినాశమొందును అను విషయము ఇపుడే, మాకు విదితమైనది. విపుల సేనాసహితుడై సమరమున కేతెంచిన మహిషాసురుని బలము సమూలముగా నాశమయ్యెననిన, నీ క్రోధము ఎంత దుర్నివారమో ( నివారించుటకు శక్యము కానిదో) మాకు అవగతమయ్యెను.

హే భగవతీ! నీవు అభ్యుదయ ప్రదవు. అట్టి నీవు ఎవరియందు ప్రసన్నురాలవు అగుదువో, వారి లోకములయందు, జనపదముల యందు, వారు లబ్ధప్రతిష్ఠులగుదురు, హే దేవి! ఎవరి యందు ప్రసన్నవు అగుదువో, వారు ధనసంపన్నులగుదురు, కీర్తిమంతులగుదురు. వారి ధర్మ, అర్థ, కామ, మోక్షరూప పురుషార్థములు ఎన్నడును క్షయము నొందవు. వారు ధన్యజీవులగుదురు. నీవు ఎవరియందు ప్రసన్నురాలవు అగుదువో, వారు వినీతులైన దారా పుత్రులు కలవారై విరాజిల్లుదురు. వారందరును ధన్యులగుదురు. ఈ విధముగా ప్రసన్నవైన నీవు సర్వదా అభ్యుదయ ప్రదవై వెలుగొందుదువు తల్లీ!

శ్లో|| ధర్మ్యాణి దేవి సకలాని సదైవ కర్మా

ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీ కరోతి |

స్వర్గం ప్రయాతి చ తతో భవతీ ప్రసాదా

ల్లోక త్రయేపి ఫలదా నను దేవి తేన || ೧೫

శ్లో|| దుర్గే స్మృతా హరిసి భీతి మశేష జన్తోః

స్వస్థైఃస్మృతా మతి మతీవ శుభాం దదాసి |

దారిద్య్రదుఃఖ భయహారిణి కాత్వదన్యా

సర్వోపకారకారణాయ దయా೭೭ర్ద్రచిత్తా || ೧೬

తాత్పర్యము

హే దేవి! నీ అనుగ్రహమువలన, సంభావితుడైన పురుషుడు సుశృతి యగును. అతడు అత్యాదరముతో స్వశాఖోక్త ధర్మము వలన, ప్రాప్తములైన కర్మలను ఆచరించును. శ్రౌత, స్మార్త, కర్మలను అనుష్టించి, స్వర్గలోకమును పొందును. ఇదంతయు, నీ అనుగ్రహఫలమే కదా! ఈ విధముగా నీవు భూలోక, ద్యులోక ములయందు ఫలప్రదవు అగుచున్నావు కదా!

హే దేవి! హే దుర్గే! భయబీతులైన సకల ప్రాణులచేత స్మరింపబడినదానవై. వారి భయమును హరించుదువు. హే జనని! భయరహితులు, స్వర్థులు అయిన ప్రాణులచేత స్మరింపబడిన దానవై, వారికి అత్యంత శుభ ప్రదము, ధర్మ, అర్థాది చతుర్వర్గ ఫలసాధనభూతము అయిన బుద్ధి నొసగుదువు. అనగా, హేదేవి! మంత్ర, ధ్యాన, భజనపరమైన బుద్ధిని ప్రసాదించుదువు. ఓ తల్లీ! నీవు, సర్వ దారిద్య్రదుఃఖ హరిణివి, భయార్తులకు సమస్త ఉపకారములను కలుగజేయుటయందు సర్వదా ఆర్ద్రమైనచిత్తము గల దేవత నీకంటె మరొకరు ఎవరును లేరు. హే దుర్గే! హే దారిద్య్రదుఃఖభయహారిణి! నీవు భక్తులకుగాని, అభక్తులకుగాని, ఉదాసీనులకుగాని శత్రువులకుగాని, ఉపకార మొనర్చుటల నీవే, ఏకమాత్ర సమర్థురాలవు.

శ్లో|| ఏభిర్హతైర్జగదుపైతి సుఖం తథైతే

కర్వన్తు నామ నరకాయ చిరాయ పాపమ్‌ |

సంగ్రామ మృత్యు మధిగమ్య దిపం ప్రయాస్తు

మత్వేతి నూన మహితాన్‌ వినిహంసి దేవి || ೧೭

దృష్ట్వైవ కిం న భవతీ ప్రకరోతి భస్మ

సర్వాసురా సరిషు ప్రహిణోషి శస్త్రమ్‌ |

లోకాన్‌ ప్రయాన్తు రిపవోపి హి శస్త్రపూతా

ఇత్థం మతిర్భవతి తేష్వపి తేతిసాధ్వీ || ೧೮

తాత్పర్యము

హే దేవి! జగజ్జనని! సర్వ ప్రాణిహితమును చేయుట యందు నీవు, దయార్ద్రచిత్తవై ఉందువను సర్వథా సత్యము. జగత్పీడాకరులైన ఈ మహిషాసురాదులు నీచేత వధింపబడినవారు అగుటవలన, ఈ విశ్వమును పీడించునట్టి అసురులు లేకోపోవుటంజేసి సుఖమును పొందునుగాక, అహితకరులైన మహిషాసురాది దైత్యులు చిరకాలము నరకప్రాప్తికి తగినట్లుగా పాపమును చేయుదురుగాక! కాని, సంగ్రామమునందు మృత్యుగ్రస్తులై స్వర్గమును పొందురుగాక అని భావించి అను గ్రహబుద్ధిచేతనే సమస్త లోకవిద్రోహులైన మహిషాసురాది దైత్యులను వధించెదవు, అస్యదైత్యులను గూడా వధించెదవు, హే జనని! నీ దయార్ద్రచిత్తమును ఎంతయని స్తుతింపగలము?

హే దేవి! నీవు సమస్త అసురలను క్రోధదృష్టితో చూచినంత మాత్రముననే, భస్మము చేయగల సమర్థురాలవు, అయినను, హే జనని! శత్రువులపై శస్త్ర ప్రహారము చేయుటయందు గల నీ అభిప్రాయము అన్యమైనదే, నీ శత్రువులు సైతము శస్త్రపూతులై-శస్త్రహతులై, సర్వపాపవినిర్ముక్తులై అభీష్ట స్వర్గాదిలోకములను పొందవలయుననెడి అనుగ్రహబుద్ధితో నీవు ఉందువు తల్లీ! అట్టితరి, స్వధర్మనిరతులైన సాధు పురుషులయందు అనుగ్రహబుద్ధికలదానివై ఉందువని అధికముగా చెప్పనేల?

శ్లో|| ఖడ్గప్రభానికర విస్ఫురణౖ స్తథోగ్రైః

శూలాగ్రకాన్తినివహేన దృశోసురాణామ్‌ |

యన్నాగతా విలయ మంశుమదిందుఖండ

యోగ్యాననం తవ విలోకయతాం తదేతత్‌ || ೧೯

శ్లో|| దుర్వృత్త వృత్తశమనం తవ దేవి శీలం

రూపం తథైవ దవిచిన్త్య మతుల్య మన్యైః |

వీర్యం చ హస్తృ హృతదేవపరా క్రమాణాం

వైరిష్యపి ప్రకటితైవ దయా త్వయేత్థమ్‌ || ೨೦

తాత్పర్యము

హే దేవి! సమరాంగణమునందు నీవు ఉగ్రములైన ఖడ్గ ప్రభానికర ప్రసారములచేతను, ఉగ్రమైన శూలాగ్ర కాంతి సమూహముచేతను, అసురులకు దృష్టినాశము కలుగకపోవుట ఆశ్చర్యకరమైన విషయము, ఏలన, సుధాంశుఖండ యుక్తమైన (అర్ధచంద్రయుక్తమైన) నీ పక్త్రమును అసురులు విలోకించవలయును నీవు తలంచితివి. కావుననే, వారి దృష్టినాశము కాలేదు. అమ్మా! శత్రుసంహారము చేయుచున్న సమయమునందు సైతము నీ హృదయము ఎంత అనుగ్రహప్రదము తల్లీ !

ఓ జననీ! దేవీ! నీ శీలము- సద్వృత్తము దుర్వృత్తమును దూరాపాస్త మొనర్చునట్టిది. హే దేవి! సర్వసౌభాగ్య, సౌందర్య భాజనమైన నీ రూపము మనస్సు చేత గూడా అంచిత్యమైనది. నీ రూపమునకు సాటి అయినది ఈ లోకమున, మరొకటి లేదు. హే దేవి! నీ వీర్యము సైతము దేవ పరాక్రమాపహరమైనది. ఓ దేవీ! ఏతాతృశ##మైన నీచేత, వైరులయందును నీ దయ ప్రకటితమై ప్రకాశించుచునే ఉండును.

శ్లో|| కేనోపమా భవతు తేస్య పరాక్రమస్య

రూపం చ శ శత్రుభయకార్యతిహారి కుత్ర |

చిత్తే కృపాసమరనిష్ఠురతా చ దృష్ట్వా

త్వయ్యేవ దేవి వరదే భువనత్రయేపి || ೨೧

శ్లో|| త్రైలోక్య మేతదఖిలం రిపునాశ##నేన

త్రాతుం త్వయా సమరమూర్ధని తేపి హత్వా|

నీతా దివం రిపుగణాభయ మప్యపాస్త

ముస్మాక మున్నదసురారిభయం నమస్తే || ೨೨

తాత్పర్యము

హే దేవి! వరదే! నీ పరాక్రమమునకు సాటియైనది ఈ భువన త్రయమునందు ఏదియు లేదు. హే భగవతి! నీ రూపము నీ శత్రువులకు భయోత్పాదకముగా ఉండును. ఇతరులకు - భక్తులకు ఆ నీ ముఖమే అతిమనోహరియై వర్తిలుచుండును. హే దేవి! చిత్తమునందు కృప, సమరనిష్ఠురత్వము నీయందే చూడబడు చున్నదిగాని, మరొకరియందు కప్పడదు. నీ స్వరూపము అన్యతో విలక్షణమైనది.

హే దేవి! వరదే! నీచేత శత్రునాశనము చేయబడురీతిగానే, ఈ నిఖిల లోకత్రయము రక్షింపబడుచున్నది గూడ. హే దేవి! సమరభూమియందు శత్రుగణములు నిహతులై స్వర్గలోకమునకు పంపబడుదురు. హే భగవతి! నీవలన, దేవతలమైన మాకు అసురభయము దూరాపాస్తమైనది. హే నమస్త లోకజనని! నీకు నమస్కారము.

శ్లో|| శూలేన పాహి నో దేవి | పాహి ఖడ్గేన చాంబికే |

ఘంటాస్వనేన పాహి చాపజ్యానిఃస్వనేన చ || ೨೩

శ్లో|| ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణ |

భ్రామణనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి || ೨೪

తాత్పర్యము

హే అంబికే! నీవు శూలాయుధముచేత మమ్ము శత్రువుల నుండి రక్షించుము. హే జనని! నీవు ఘంటాస్వనముచేత మమ్ము రక్షించుము. హే దీవి! నీవు ధనుస్సుపైన ఎక్కుబెట్టిన అల్లెత్రాటి నాదముచేత పాపాత్ములైన శత్రువులనుండి మమ్ము కాపాడుము.

హే ఈశానపత్ని! హే జగద్వ్యాపిని! దేవి! హే చండికే ! నీవు నీ శూలాయుధ చంక్రమణముచేత ప్రాచీదిశయందు దేవతల మైన మమ్ము శత్రువులనుండి పరిరక్షింపుము. ఆ రీతిగానే. ప్రతీచీదిశయందు, దక్షిణ, ఉత్తరదిశలయందును నీ శూలాయుధ మును మండలాకారముగా పరిభ్రమింపజేసి, మమ్ము రక్షింపుము తల్లీ! ఏ దిక్కునుండియు, మాకు శత్రుబాధ కలుగకుండునట్లు రక్షింపుము జననీ!

శ్లో|| సామ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరన్తితే |

యాని చాత్యర్థఘోరాణి తై రక్షాస్మాం స్తథా భువమ్‌ ||

శ్లో|| ఖడ్గ శూల గదాదీని యాని చాస్త్రాణి తేంభికే |

కరవల్ల వసఙ్గీని తైరస్మాన్‌ రక్ష సర్వతః || ೨೫

తాత్పర్యము

హే దేవి! త్రిలోకములయందు నీ ఏ యే సౌమ్యరూపములు, అనగా సుందర ప్రసన్నరూపములు గలవో, అత్యంత ఘోరములు భయంకరములు అయిన ఏ యే రూపములు సంచరించుచున్నవో ఆ యా రూపములచేత ఉపలక్షితములగు కరణములచేత (సాధన ములచేత) దేవతలమైన మమ్ము సంరక్షింపుము. ఆ రీతిగానే, నీ ద్వివిధ-సౌమ్య, ఘోర రూపములచేత పృథ్వీ, పాతాళ లోకము లను దయతో రక్షింపుము.

హే అంబికే! నీ కరపల్లవములందు గల ఖడ్గ, శూల, గదాది ఆయుధములచేతను, అస్త్రములచేతను, త్వదేకశరణుల మైన మమ్ము, సర్వతః రక్షింపుము. దుఃఖమునుండి, పాపము నుండి, శత్రువుల నుండియు దేవతలమైన మమ్ము, దయార్ద్ర చిత్తవై రక్షించుము జననీ!

శ్లో|| ఏవం స్తుతాసురై ర్దివ్యైః కుసుమై ర్నందనోద్భవైః |

అర్చితా జగతాం ధాత్రీ తథా గంధానులేపనైః || ೨೬

శ్లో|| భక్త్యా సమసై#్త స్త్రిదశైర్దివైర్ధూపై స్సుపూజితా |

ప్రాహ ప్రసాదనుముఖీ సమస్తాన్‌ ప్రణతాన్‌ సురాన్‌ ||

శ్లో|| వ్రియతాం త్రిదాశాః సర్వే యదస్మత్తోభివాంఛితమ్‌ ||

21]

తాత్పర్యము

ఈ విధముగా, జగత్పోషణకర్త్రియైన దేవి, దేవతలచేత స్తుతింపబడినదై నందనవనోద్భవము లయిన కసుమముల చేతను, దివ్యగంధానులేపనములచేతను అర్చింపబడెను.

సకల దేవతలచేత భక్తిపురఃసరముగా దివ్య గంధ, ధూపాదులచేత సుపూజితయై, వినమ్రులై నమస్కరించుచున్న దేవతలతో ప్రసన్నముఖియై ఇట్లు పలికెను-ఓ సమస్త దేవతలారా! మీరు భక్తివినమ్రులై చేసిన స్తోత్ర, పూజాదులచేత నేను ప్రసన్నురాలనైతిని, మీరు నానుండి అభిలషించు విషయమును కోరుకొనుడు, నేను మీకు ప్రేమతో నొసగెదను, కోరుకొనుడు.

శ్లో|| భగవత్యా కృతం సర్వం న కిఞ్చి దవశిష్యతే|

యదయం నిహత శ్శత్రు రస్మాకం మహిషాసురః || ೩೦

శ్లో|| యదివాపి వరో దేయ స్త్వ యాస్మాకం మహేశ్వరి |

సంస్మృతా సంస్కృతా త్వం నో హింసేథాః పరమాపధః ||

శ్లో|| యశ్చమర్త్యః స్తవై రేఖి స్త్వాం స్తోష్య త్యమలాననే |

తస్య విత్తర్థి విభ##వై ర్ధనదారాది సంపదామ్‌ |

వృద్ధయేస్మత్‌ ప్రసన్నా త్వం భ##వేధాఃసర్వదాంబికే ||

తాత్పర్యము

అంత, దేవతలు ఇట్లు పలికిరి- హే దేవి! నీవు చేయవలసిన దంతయు చేసితివి. నీవు, చేయవలసినది ఇంకను ఏమియు శేషించి ఉన్నది లేదు. మాకు శత్రువైన ఈ మహిషాసురుడు నీచేత నిహతుడయ్యెను. నీ అనుగ్రహజీవనులమైన, మాకు వర మొసగ దలచినచో, పరమ ఆపత్సమయములయందు మాచే నిరంతరము స్మరింపబడినదానవై, విపత్కరులైన మాశత్రువులను హింసించుము. అట్లు హింసించి వారినుండి మమ్ము రక్షింపుము. మేము ఇంతకంటె కోరదగినది ఏమి ఉండును? హే ప్రసన్న వదనే! నీవు మాచే స్తుతింపబడి ప్రసన్నురాలవై వర ప్రదాత్రివి అగుచున్నావు. కావున, ఈ స్తోత్రములచే నిన్ను భక్తితో స్తుతించిన మానవులు ధన, ధాన్యాది సంపన్నులై, దారావుత్రాది వైభవముతో పరిఢవిల్లునట్లు అనుగ్రహింతువుగాక. వారు ఆత్మ భావసంపన్నులై వర్ధిల్లుదురు గాక! హే అంబికే! నీవు సర్వదా మాయందు ప్రసన్నవై అనుగ్రహింతువుగాక, తల్లీ!

శ్లో|| ఇతి ప్రసాదితా దేవైర్జగతోర్థే తథా೭೭త్మనః |

తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాన్తర్హితా ||

తాత్పర్యము

ఈ విధముగా త్రైలోక్యసంరక్షణము కొఱకు, ఆత్మసంరక్షణ నిమిత్తము దేవతలచేత ప్రసన్నురాలుగా నొనర్పబడిన భద్రకాళి (సర్వమంగళ అయిన రుద్రపత్ని) ఓ దేవతలారా! మీ అభీష్టము సిద్ధించుగాక, అని పలికి అంతర్థాన మొందెను.

ఉత్తర చరిత్రము

అనంతరము ఈ రీతిగానే, శుంభ, నింశుభులు అతిపరా క్రమముతో ఇంద్రునినుండి త్రైలోక్యమును అపహరించిరి. యజ్ఞ భాగమును గూడా తామే గ్రహింపసాగిరి. సూర్య, చంద్ర, కుబేర, వరుణ పదములను హస్తగతము చేసికొనిరి. నిఖిల దేవతలు పరాజితులై 'అపరాజిత' అయిన భగవతిని ధ్యానింపసాగిరి. అంత, ఆ జగజ్జనని ఆపదలలో మీరు నన్ను స్మరించినపుడు వెంటనే మీ విపత్తులను దూరీకృతము చేయుదునని వరమిచ్చియుండెను. అపుడు దేవతలంఱును ఈ వివయమును పర్యాలోచన చేసిరి. వారు హిమగిరి శిఖరముపైకి ఏగి వైష్ణవీమాయను ఈ విధముగా స్తుతింపసాగిరి.

శ్లో|| నమో దేవ్యై మహాదేవ్యై శివయై సతతం నమః |

నమః ప్రకృత్యైభద్రాయై నియతాః ప్రణతాస్మ తామ్‌ |

శ్లో|| రౌద్రాయై నమో నిత్యయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |

జ్యోత్స్నాయై చేందురూపిణ్యౖ సుధాయై సతతం నమః ||

శ్లో|| కళ్యాణ్యౖ ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |

నైరృత్యై భూభృతాం లక్ష్మై శర్వాణ్యౖ తే నమో నమః ||

శ్లో|| దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారణ్యౖ |

ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః ||

శ్లో|| అతిసౌమ్యాతిరౌద్రాయై నమస్తసై#్య నమో నమః |

నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యైకృత్యైనమో నమః ||

తాత్పర్యము

ప్రకాశనశీలవైన హే దేవి! మహాదేవుని (శివుని) పత్నివైన ఓ మహాదేవీ, సర్వమంగళ##హేతువైన హే శివే! నిరంతరము నీకు నమస్కరింతుము. ఓ మహాదేవీ! నీవు ప్రకృతిస్వరూపిణివి. అనగా, జగత్కారణభూతురాలవు. సత్త్వ. రజ ప్తమోగుణ సామ్యావస్థారూపిణివైన ప్రకృతివి అని భావము. మూల మంత్రాత్మిక అయిన దేవత 'ప్రకృతి' అనబడును.

శ్లో|| పకృతిః పార్వతీ సాక్షాత్ప్రత్యయస్తు మహేశ్వరః ||

అను వచనానుసారము 'ప్రకృతి' అనగా పార్వతి, 'ప్రత్యయ' మనగా మహేశ్వరుడని తెలియుచున్నది. నీవు భద్రరూపిణివైన సర్వమంగళవు. అట్టి భద్రరూపిణివైన నీకు జితేంద్రియులమై ప్రణతు లొనర్చుచున్నాము.

హే మాతః! రౌద్రీశక్తివైన నీకు నమస్కారము. కాల పరిచ్ఛేదము లేని నిత్యరూపిణివి. అట్టి నీకు నమస్కారము. పార్వతీ రూపిణివైన హే మహాదేవి! నీకు నమస్కారము. ధాత్రీ రూపిణివైన నీకు నమస్కారము. హే దేవి! ఆహ్లాదకారిణి, జ్యోత్స్నారూపిణివైన నీకు నమస్కారము. చంద్రరపిణివైన ఓ దేవీ! నీకు నమస్కారము. సుఖకారిణివైన ఓ దేవీ! నీకు నిరంతరము నమస్కారము చేయుదుము.

ఓ జననీ! కళ్యాణస్వరూపిణివైన నీకు నమస్కారము. జగత్తుల చేత సిద్ధికొరకు నమస్కారింపబడుచున్న జగజ్జననివైన నీకు నమస్కారము. భూభార సముద్ధరణ సామర్థ్యము గల కూర్మ శక్తిశ్వరూపిణివైన నీకు నమస్కారము చేయుచున్నాము. నిరృతి అనగా అలక్ష్మి. అలక్ష్మీరూపిణివైన నీకు. శంభుపత్నివైన నీకు నమస్కారము. అథవా, ''నిశ్చితా ఋతిః సత్యతా యేన నః నిరృతః'' అను వ్యుత్పత్తిన అనుసరించి నిరృతి దిక్పాలకునకు సంబంధించిన దేవత 'నైరృతి' అనబడును. అట్టి నిరృతిని సముపార్జించిన ఏ లక్ష్మి గలదో, అట్టి లక్ష్మీరూపిణివి నీవే అయి ఉన్నావు. లక్ష్మీ స్వరూపిణివైన నీకు నమస్కారము. కూర్మ, ఆది నాగ, ఆదికులపర్వతాది మను ప్రభృతి రాజుల లక్ష్మీస్వరూపిణి వైన నీకు నమస్కారము. శంభుపత్నీ, శర్వాణీస్వరూపిణివైన నీకు నమస్కారము.

సర్వ కారణస్వరూపవైన హే దేవి! నీవు దుర్గాస్వరూపిణివి. నీకు నమస్కారము. దేవి. మహామాయాఖ్య సింధువునకు పార స్వరూపిణియై ఉన్నది. అట్టి పరాదేవికి 'దుర్గాపారా' అని నామ ధేయము. అట్టి దుర్గాపారాస్వరూపిణివైన నీకు నమస్కారము. సంసారసారభూతవు, సర్వకారిణివి అయిన నీకు నమస్కారము. 'ఖ్యాతి' స్వరూపిణివైన నీకు నమస్కారము. కృష్టవర్ణము గల కాలరాత్రిరూపిణివైన నీకు నమస్కారము. హే సర్వకారిణీ దేవి! ధూవ్రవర్ణము గల నీకు నమస్కారము చేయుచున్నాను.

హే దేవి! నీవు అతిసౌమ్యస్వరూపిణివి. అనగా, సోమ దేవతాకమైన మనోహర రూపము కలదానవు. నీవు రుద్రదేవతాకమైన రౌద్రస్వరూపిణివి. అట్టి అతిసౌమ్య, అతిరౌద్రరూపిణివైన నీకు వినమ్రులమై పునఃపునః నమస్కరించుచున్నాము. నీవు శక్తి త్రయాత్వికవు. అట్టి నీకు నమస్కారము. ప్రాణధారులైన సర్వ ప్రాణులకు ఆధారశక్తిరూపిణివి. అట్టి జగత్ప్రతిష్ఠారూపిణివైన నీకు నిరంతరము నమస్కారము చేయుదుము. ప్రాణధారణమునకు ఆధారమైన ఏ స్థానము కలదో, ఆ స్థానమును 'మూలాధార'మని అందురు. అట్టి మూలాధారమునందు నీవు ప్రతిష్ఠితవై ఉందువు. అట్టి నీకు నమస్కారము. నీవు నిరంతర ప్రకాశనశీలవు. స్వయం ప్రకాశరూపిణివైన నీకు నమస్కారము. సృష్టి, స్థితి, సంహారరూపమైన ప్రయత్వము గలదానవు. ఇందు పరమేశ్వరి యొక్క జతత్ప్రతిష్ఠాత్వము, దేవశక్తి, కృతి-ఈ మూడు స్వరూపములు కలదిగా పరమేశ్వరి స్తుతింపబడినది.

శ్లో|| యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |

నమస్తసై#్య నమస్తసై#్య నమస్తసై#్య నమో నమః ||

శ్లో || యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |

సమస్తసై#్య నమస్తసై#్య నమస్తసై#్య నమో నమః || ೧೦

శ్లో || యా దేవీ సర్వ భూతేషు బుద్ది రూపేణ సంస్థితా |

నమస్తసై#్య .... ..... నమో నమః ||

శ్లో || యా దేవీ సర్వ భూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తసై#్య .... ..... నమో నమః ||

శ్లో || యా దేవీ సర్వ భూతేషు నిద్రారూపేణ సంస్థితా |

నమస్తసై#్య ..... ..... నమో నమః ||

శ్లో || యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తసై#్య ..... ..... నమో నమః || ೧೧

శ్లో || యా దేవీ సర్వ భూతేషు ఛాయారూపేణ సంస్థితా |

సమస్తసై#్య .... ..... నమో నమః || ೧೨

తాత్పర్యము

హే భగవతి ! నీవు విష్ణుమాయారూపిణివి, నీవు వాక్‌ (సరస్వతీ), మా (లక్ష్మీ), ఉమా (పార్వతీ) సర్వరూపిణివై కాలత్రయాత్మి కవై విరాజిల్లుచుందువు. నీవు భూతాత్మికవు. అనాత్మయందు ఆత్మబుద్ధిని, ఆత్మయందు అనాత్మబుద్ధిని కలిగించుచు అహంకార, మమకారవశులై సర్వ ప్రాణులను జనింపజేయుచున్న విష్ణుమాయాస్వరూపిణివి. నీవు సత్త్వ. రజ స్తమోగుణాత్మికవై మనసా, వాచా, కర్మణా ఏకరూపిణివి. తాదృశ మహిమాన్వితవైన నీకు నిరంతరము నమస్కారము చేయుచున్నాము.

హే దేవి ! నీవు సర్వ భూతములయందు చేతనారూపిణివని చెప్పబడుదువు. చిత్తవిశేషవృత్తియొక్క నామమే చేతన. బుద్ధి, ప్రకాశజ్ఞానస్వభావము కలది. కొందఱు నిర్వికల్పకజ్ఞానమును 'చేతన' అనియు సవికల్పక జ్ఞానమును 'బుద్ధి' అనియు చెప్పుదురు. ఈ విధముగా సవికల్పక నిర్వికల్పక, జ్ఞానస్వరూపిణివైన నీకు నమస్కారము.

సర్వ భూతములయందు నీవు బుద్ధిరూపముతో విరాజిల్లు చుందువు. అట్టి నీకు పునః పునః నమస్కరించుచున్నాము.

హే దేవి ! నీవు సర్వభూతములయందు నిద్రారూపిణివై వెలుగొందుచుందువు. మానవుడు భుజించిన అన్నాది పరిపాక హేతువైన నిరింద్రియ ప్రదేశమునందు మనసు ఉండుట 'నిద్ర' అనబడును. సర్వేంద్రియ వ్యాపారములు విరమించిన సమయమున, సుఖము నొందుట 'నిద్ర' అని కొందఱు చెప్పుదురు. ఓ జననీ ! తాదృశ నిద్రాస్వరూపిణివైన నీకు పౌనఃపున్యముగా నమస్కారము చేయుచున్నాము.

హే దేవి ! నీవు సర్వభూతములయందు క్షుధా (ఆకలి) రూపముతో వర్తిల్లుచుందువు. భుజించవలయునను ఇచ్ఛ కలిగించు నట్టి జఠరాగ్ని వికారమే 'క్షుధ' అనబడును. అట్టి క్షుధ లేక శరీర ధారులకు సుఖము లేదు. హే క్షుధాస్వరూపిణి ! నీకు శతశః నమస్కారములు.

హే జగజ్జనని ! నీవు సర్వభూతములయందు ఛాయా రూపిణివై అనగా, ప్రతిబింబరూపిణివై వెలుగొందుచుందువు. సంతాపమును ఛేదించునదిగాన, 'ఛాయ' అనబడును. సర్వ ప్రాణి సంతాపహారిణియైన హే దేవి ! నీకు వినమ్రులమై నమస్కరించుచున్నాము.

శ్లో || యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా |

నమస్తసై#్య నమస్తసై#్య నమస్తసై#్య నమో నమః ||೧೩

శ్లో || యా దేవీ సర్వ భూతేషు తృష్ణారూపేణ నంస్థితా |

నమస్తసై#్య .... ... నమో నమః || ೧೪

శ్లో || యా దేవీ సర్వ భూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య .... .... నమో నమ || ೧೫

శ్లో || యా దేవీ సర్వ భూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |

సమస్తసై#్య ..... ..... నమో నమః || ೧೯

తాత్పర్యము

హే దేవి ! నీవే సర్వభూతములయందు ఆధార, ఆధేయ భావానువాదరూపమైన శక్తి రూపముతో అనగా, సామర్థ్యరూపముతో విరాజిల్లుచుందువు. అట్టి శక్తి స్వరూపిణివైన నీకు నమస్కారము.

హే దేవి ! పంచభూతాత్మకములైన అనాత్మ రూప దేహాదుల యందు 'తృష్ణా' రూపముతో విద్యమానవై ఉందువు. 'తృష్ణ' అనగా, అనాత్మ పదార్థములను అనుభవించవలయును అను కోరిక తృష్ణ అనబడును. ఓ జననీ ! ప్రాణులయందు గల తృష్ణయు నీ రూపమే అయి ఉన్నది. అట్టి అనాత్మవిషయక తృష్ణను తొలగించుటకై నిన్ను మరల మరల వేడుచున్నాము.

హే భగవతి ! నీవు 'క్షాంతి' రూపిణివి. 'క్షాంతి' అనగా, అపకారు లగు గూడా ఉపకారము చేయవలయును అనెడి అభిలాష. ఈ క్షాంతి, తృష్ణకు వ్యతిరేకమైనది. ఇతరులు చేసిన అపకారమును ఉపేక్షించుటయే 'క్షాంతి' అనబడును. ప్రతికూలవేదనముపట్లగూడా

22]

ఉపేక్షాభావమును వహించుట 'క్షాంతి' శబ్దముచే చెప్పబడును. క్షాంతి స్వరూపిణివైన ఓ దేవీ ! మేము నీకు వినమ్రులమై నమస్కరించుచున్నాము.

హే లోకజనని ! నీవు ఈ ప్రపంచమునందు జాతి రూపముతో విలసిల్లుచుందువు. మనుష్యులయందు మనుష్యత్వజాతితోను, గోవులయందు 'గోత్వ' మను జాతితోను, వృక్షములయందు 'వృక్షత్వ' మను జాతితోను ఉండెడిదానవు నీవే కదా తల్లీ! జాతి రూపిణివైన ఓ అమ్మా ! నీకు మా నమస్కారములు.

శ్లో || యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |

నమస్తసై#్య నమస్తసై#్త్య నమస్తసై#్త్య నమో నమః || ೧೩

శ్లో || యా దేవీ సర్వ భూతేషు శాంతిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య ..... .... నమో నమః || ೧೮

శ్లో || యా దేవీ సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థితా |

నమస్తసై#్య ..... ..... నమో నమః || ೧೯

శ్లో || యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య ...... ..... నమో నమః || ೨೦

తాత్పర్యము

శ్లో || హే భగవతి ! నీవు సర్వభూతములయందు 'లజ్జా' రూపముతో విరాజిల్లుచుందువు. 'లజ్జ' అనగా, చేయబోవు పని యందు లోకభయము. అథవా, కర్తవ్యమైన కార్యమును చేయక పోవుట, అకర్తవ్యమైన కార్యమును చేయుట అను విషయమున ఇతరులవలనగాని, తనకు తనవలనగాని, మానవుల చిత్తముల యందు కలుగు సంకోచము 'లజ్జ' అనబడును. ఓ తల్లీ ! తాదృశ లజ్జారూపిణివై సమస్త ప్రాణులను కర్తవ్యనిర్వహణమునందు ప్రవర్తింపజేయునట్టి శాసకురాలవు. నీకు ఇవే మా సహస్ర ప్రణామములు.

హే మాతః ! నీవు సర్వ భూతములయందు 'శాంతి' రూపముతో వెలుగొందుచుందువు. కామ, క్రోధములు లేకపోవుటయే 'శాంతి' అని కొందఱు చెప్పుదురు. వికారమునకు లోనైన ఇంద్రియములను నివర్తింపజేయుటయే 'శాంతి' అని మరికొందఱు అందురు. విషయముల నుండి మరలిన ఆత్మ (అంతఃకరణము) కలిగియుండుటయే, 'శాంతి' మఱికొందఱు అందురు. ఓ జననీ ! నీవు కరుణార్ద్రచిత్తముతో సర్వ ప్రాణుములయందు 'శాంతి' రూపముతో వెలుగొందుచు, వారిని ఆత్మగుణ సంపన్నులనుగా చేయుచున్నావు. ఓ తల్లీ! నీకు మా అనేక వందనములు.

హే పరమేశ్వరి ! నీవు సర్వ ప్రాణులయందు 'శ్రద్ధా' రూపముతో ఉందువు. 'శద్ధ' అనగా, అతిశయభక్తి. శాస్త్రోక్త విషయములయందు విపరీతబుద్ధి లేకపోవుట 'శ్రద్ధ' అనబడును. శాస్త్రోక్త విషయములను ఆదరముతో అనుసరించుట 'భక్తి' అనబడును. తాదృశ శ్రద్ధాస్వరూపిణివైన నీకు మాసప్రశ్రయ ప్రణామములు.

హే దేవి ! నీవు సర్వ ప్రాణులయందు 'కాంతి' రూపముతో విరాజిల్లుచుందువు. 'కాంతి' అనగా శోభ, కమనీయత, స్వస్వరూపమునందు ప్రజ్వలించుట (ప్రకాశించుట) అని కొందరి మతము. ఓ తల్లీ! నీవు 'కాంతి' స్వరూపిణివై సర్వ ప్రాణులకు శోభను, కమనీయతను, ఓ జస్సును, తేజస్సును మహానుగ్రహముతో ప్రసాదించుచుందువు. నీకు ఇవే మా నమస్కారములు.

శ్లో || యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |

నమస్తసై#్య నమస్తసై#్య నమస్తసై#్య నమో నమః || 21

శ్లో || యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య ...... ....... నమో నమః || 22

శ్లో || యా దేవీ సర్వ భూతేషు స్మృతిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య ...... ....... నమో నమః || 23

శ్లో || యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |

నమస్తసై#్య ... .... నమో నమ || 24

తాత్పర్యము

హే జనని ! నీవు సర్వ ప్రాణులయందు 'లక్ష్మీ' రూపిణివై విరాజిల్లుచుందువు. అట్టి నీకు మా నమస్కారములు.

ఓ దేవీ ! నీవు సర్వ భూతములయందు 'వృత్తి' రూపముతో ఉందువు. 'వృత్తి' అనగా జీవిక. లేక ప్రవృత్తి అని అర్థము. సమస్త జీవుల జీవికాస్వ రూపిణివైన ఓ తల్లీ ! నీకు మేము నిరంతరము నమస్కరింతుము.

ఓ జననీ ! నీవు సర్వభూతకోటియందు 'స్మృతి' రూపముతో విరాజిల్లుచుందువు. 'స్మృతి' రూపిణివైన నీవలననే ఈ ప్రపంచము నందలి ప్రాణులు సువ్యవస్థితముగా తమ తమ కార్యములను నిర్వహింపగలుగుచున్నారు. భావనాఖ్య సంస్కారమునకు హేతువైన జ్ఞానవిశేషమే 'స్మృతి' అనబడును. అనుభూత విషయ జ్ఞానమే స్మృతి. ఓ తల్లి ! తాదృశ స్మృతిరూపిణివైన నీకు సప్రశ్రయముగా నమస్కారములు అర్పించుచున్నాము.

హే కరుణార్ద్రచిత్తే ! నీవు సర్వ ప్రాణులయందు 'దయా' రూపముతో వెలుగొందుచుందువు. 'దయ' అనగా , పరుల దుఃఖమును తొలగించవలయు ననెడి ఇచ్ఛ. తాదృశ దయారూపిణివై సర్వ ప్రాణుల హృదయాంతర్వర్తివై, లోకదుఃఖమును దూరీకృత మొనర్చునట్టి దయార్ద్ర శీలవైన నీకు మా నమసాకురములు.

శ్లో || యా దేవీ సర్వ భూతేషు తుష్టి రూపేణ సంస్థితా |

నమస్తసై#్య ..... ..... నమో నమః || 25

శ్లో || యా దేవీ సర్వ భూతేషు మాతృరూణ సంస్థితా |

నమస్తసై#్య .... .... నమో నమః || 29

శ్లో || యా దేవీ సర్వ భూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా |

నమస్తసై#్య .... ... నమో నమః || 27

శ్లో || ఇంద్రియాణా మధిష్ఠాత్రీ భూతానా మఖిలేషు యా |

భూతేషు సతతం తసై#్య వ్యాపై#్త్య దేవ్యై నమో నమః ||

తాత్పర్యము

ఓ దేవి ! నీవు సర్వ భూతములయందు ' తుష్టి' రూపముతో, అనగా, ఆనందరూపముతో విరాజమానవై ఉందువు. 'తుష్టి' అనగా, సర్వపదార్థములయందు అభిలాష లేకపోవుట. సమస్త విషయ భోగములను అనుభవించి, ఆనుభవించి పరమ సుఖమును పొందుట 'తుష్టి' అనబడును. తాదృశ 'తుష్టి' రూపిణివైన ఓ దేవి ! నీకు మా నమస్కారములు.

హే అంబికే ! నీవు సర్వప్రాణికోటియందు మాతృ రూపముతో ఉందువు. పూర్వకర్మ ఫలానుసారముగా శరీరధారణము చేయబోవు జీవులకు మాతృరూపిణివై జన్మ హేతువు అగుచున్నావు. అనగా, సర్వ ప్రాథులయందు కారణరూపముతోను, ప్రకృతి రూపముతో విరాజిల్లుచుందువు. జగత్కారణభూతవు, మాతృ రూపిణివి అయిన నీకు మా నమస్కారములు.

హే భగవతి ! నీవు సర్వ భూతములయందు ' భ్రాంతి' రూపముతో వెలుగొందుచుందువు. 'అతస్మిం స్తద్బుద్ధిః' ఏది ఆ వస్తువు కాదో, ఆ వస్తువునందు ఆ వస్తువునందు ఆ వస్తువు అను జ్ఞానము భ్రాంతి అనబడును (అతస్మిం స్తదితి జ్ఞానంభ్రాన్తిః). రజ్జువును చూచి సర్పము అను జ్ఞానము భ్రాంతి. మాయా స్వరూపిణివైన నీవలననే, లోకమున, భ్రాంతి జనించును. కావున, భ్రాంతిరూపముతో వెలుగొందుచున్న నీకు మా నమస్కారములు.

హే పరమేశ్వరి ! నీవు పృథివ్యాది పంచభూతములకు అధిష్ఠాత్రివి, సర్వవ్యాపకమైన స్వామినివి. నీవు ఇతర సమస్త ప్రాణుల యందు గల కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములకు ఆధార శక్తివై విలసిల్లుచుందువు. ఓ తల్లీ ! 'వ్యాప్తి' రూపిణివైన నీకు మా శత, సహస్రప్రణామములు.

శ్లో || చితిరూపేణ యా కృత్స్న మేతద్వ్యాప్య స్థితా జగత్‌ |

సమస్తసై#్య నమస్తసై#్య నమస్త సై#్య నమో నమః || 29

శ్లో || స్తుతా సురైః పూర్వ మభీష్టసంశ్రయా

తథా సురంద్రేణ దినేషు సేవితా |

కరోతు సా నః శుభ##హేతు రీశ్వరీ

శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః || 30

శ్లో || యా సాంప్రతం చోద్ధత దైత్యతాపితై

రస్మాభి రీశా చ సురై ర్న మస్యతే |

యా చ స్మృతా తత్షణమేవ హన్తి

నః సర్వపదో భక్తి వినమ్రమూర్తిభిః || 31

తాత్పర్యము

హే మాతః ! నీవు 'చితి ' రూపిణివై, అనగా, వికారరహితమైన కూటస్థరూపముతో, అథవా, సంజ్ఞానరూపముతో సకల విశ్వము నందు వ్యాపించి అవిచలరూపముతో విలసిల్లుచుందువు. 'చితి' అనగా, 'జీవచైతన్య' మని అర్థము, తాదృశ స్వరూపిణివైన నీకు మా వినమ్ర ప్రణామములు. 'నమస్తసై#్య' అసుచు పునః పునః 'తత్‌' శబ్ద ప్రయోగము వలన, బ్రహ్మ శక్తి, గుణాతీత అయిన 'మూల ప్రకృతి' అని తెలియనగును.

పూర్వకల్పమునందు మహిషాసుర వధ సమయమున, అభిమత లాభమువలన, ప్రతిదినము సురేంద్రుడైన ఇంద్రునిచే స్తుతింపబడినదై, మీకు 'భద్రమగుగాక' అని పలికిన, సర్వశుభ ప్రదమైన ఆ ఈశ్వరపత్ని, దేవతలమైన మాకు శుభములు నొసగు గాక. శత్రువులవలన కలుగునట్టి ఆపదలను నాశమొందించుగాక.

ఏ దేవి, ఇపుడు ఉద్దత దైత్యులైన శుంభ, నిశుంభాదులచేత సంతప్తుల మైన మా దేవతాబృందముచే సేవింపబడుచున్నదో, ఏ పరమేశ్వరి, భక్తి వినమ్రమూర్తుల మైన మాచే స్తుతింపబడినదో, ఆ దేవి, వెంటనే మాయొక్క సమస్త విపత్తులను నాశమొందించుగాక! సర్వపదలకు కారణభూతులైన మాశత్రువులను నాశ మొందించుగాక !

ఈ విధముగా దేవతలు పరమేశ్వరియొక్క వివిధ స్వరూపములను వర్ణించుచు, భక్తి వినమ్రులై దేవీ స్తవమును చేసిరి. దేవతల చేత స్తుతింపబడిన భగవతీస్వరూపము ఈ విధముగా భావనీయము. ఆ దేవి మహాదేవి, శివ, ప్రకృతి, భద్ర, రౌద్ర, నిత్య, గౌరి, ధాత్రి, జ్యోత్స్న, ఇంద్రరూపిణి, సుఖ, కళ్యాణ, వృద్ధి, సిద్ధి నైర్‌ ఋతి, శర్వాణి, దుర్గ, దుర్గపారా, సారా, సర్వకారిణి, ఖ్యాతి, కృష్ణ, ధూమ్ర, అతి సౌమ్య, అతిరౌద్ర, జగత్ర్పతిష్ఠ, కృతి, విష్ణుమాయ. చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, శక్తి, తృష్ణ, క్షాంతి, జాతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కాన్తి. లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాత, భ్రాంతి, వ్యాప్తి, చితి రూపముతో ఉన్న భగవతికి నమస్కరించిరి. నిర్గుణ, సగుణ, మఱియు సుగుణమూర్తియందు గూడా, సాత్త్విక, రాజస, తామస భేదములతో సమస్త శక్తులు భగవతియందు అంతర్భూతము లగును.

దేవతలు స్తోత్రము చేయుచునే ఉన్నారు. ఇంతలో హిమగిరి కన్యయైన పార్వతి జాహ్నవీనదిలో స్నానము చేయుట కేతెంచెను. ఆమె, మీరు ఏ దేవతను స్తుతించుచున్నారు ? అని దేవతలను ప్రశ్నించెను. దేవతలు సమాధానము చెప్పబోవునంత, అప్పటికే పార్వతీ శరీరమునుండియే ఆవిర్భూతమైన శివాభగవతి పార్వతితో ఇట్లనెను - "శుంభునిచే నిరాకృతులై వీరందఱును మననే స్తుతించుచున్నారు". పార్వతీ శరీరకోశమునుండి బయల్వెడవలిన అంబిక, లోకమునందు 'కౌశికీ' నామముతో ప్రసిద్ధి చెందెను.

'కౌశికి' ఆవిర్భవించినపుడు, పార్వతి కృష్ణవర్ణము కలదాయెను. నాటినుండి పార్వతి 'కాళికా' నామముతో వ్యవహరింపబడెను. పరమ రూపవతి, 'కౌశికి' అయిన అంబికను ఒక సమయమున, శుంభ, నిశుంభ సైనికులైన చండ, ముండులు చూచిరి. వారు పోయి, తమ ప్రభువులతో ఆమె రూపసౌందర్య ప్రశంస చేసిరి. ఆమెను స్వాధీనురాలను జేసికొనుడని సూచించిరి. శుంభ, నిశుంభులు దూతద్వారా ఇట్లు సందేశము పంపిరి - " మా యాజ్ఞ , సర్వత్ర అప్రతిహతము, ప్రపంచమునందలి సమస్త రత్నములు, ఐరావతము, ఉచ్చైఃశ్రవము మున్న గునవి మాయొద్ద కలవు. నీవు గూడా స్త్రీరత్నానివి, మేము రత్నభుజులము. కావున, నీవు మా యొద్దకు వచ్చుట వలన నీకు పరమైశ్వర్యము లభించును". భగవతి గంభీర మందహాసముతో ఇట్లనెను - "మంచిది, నాదొక ప్రతిజ్ఞ కలదు. ఎవడు నన్ను సంగ్రామము నందు జయించునో, నాదర్పమును ఎవడు దూరముచేయునో, ఎవడు నాతో సమానమైన బలము కలవాడగునో, అతడే, నాభర్త అగుటకు తగినవాడు. కావున, శుంభ, నిశుంభులలో ఎవరైనను వచ్చి, నన్ను జయించి, పాణిగ్రహణము చేసికొనవచ్చును."

శ్లో|| యో మాం జయతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి |

యో మే ప్రతిబలో లోకే స మే భర్తా భవిష్యతి ||

శ్లో || తదాగచ్ఛతు శుంభో7త్ర నిశుంభో వా మహాసురః |

మాం జిత్వా కిం చిరేణాత్ర పాణిం గృహ్ణాతు మే లఘు ||

తాత్పర్యము

దూత, ఎంతయో నచ్చజెప్పెను. కాని, దేవి 'ఏమి చేయను? నా ప్రతిజ్ఞయే ఇది' అని పలికెను. దూత, నిరుత్తరుడైపోయి, జరిగిన విషయమునంతయు తన ప్రభువునకు విన్నవించెను. అంత, ధూమ్రలోచనుడు పంపబడెను. తుముల సంగ్రామము జరిగెను. ఈయుద్ధములో ధూమ్రలోచనుడు వధింపబడెను. తదనంతరము శుంభుడు, చండాసుర, ముండాసురులు సమరమున కేతెంచిరి. భీకర సంగ్రామము జరిగెను. అంబిక, అతికృద్ధురాలయ్యెను. వెంటనే, ఆమె లలాటమునుండి కరాళ

23]

వదన అయిన 'కాళిక' ఆవిర్భవించెను. ఆ కాళికాదేవి అసుర సేనను భక్షింప నారంభించెను. ఆమె, మహాగజములను, తురంగములను, యోధులను నోటిలో వేసికొని నమలసాగెను.

సర్వనాశము జరుగుచుండగా జూచి, చండుడు వచ్చెను. అనేక చక్రములతో కాళికను ఆచ్ఛాదించెను. దేవిముఖమునందు ఆ చక్రములు విలీనమైపోయెను. దేవి, మహాఖడ్గముతో చండుని శిరస్సును ఖండించెను. అనంతరము ముండాసురుడు యుద్ధమునకు వచ్చెను. వానికి గూడా ఆస్థితియే పట్టెను. చండ, ముండాసురులిరువురి శిరస్సులను చేతిలోనికి గైకొనివచ్చి కాళిక, కౌశికకు ఒసంగెను. చండ, ముండాసురుల శిరస్సులను తీసికొనివచ్చిన కారణముచేత 'కౌశికి' కాళికకు 'చాముండ' అని నామకరణము చేసెను.

చండ, ముండులు వధింపబడిరని విని, శుంభుడు, తమ సమస్త సైన్యమునకు ఆజ్ఞ యొనగెను, మహామహావంశజులు, అతి భయంకరులైన దైత్యులు వచ్చిరి. భయంకర యుద్ధము ఆరంభ మయ్యెను. దేవి, ధనుష్టంకారముచేత భూ, నభోమండలములను పూరిత మొనర్చెను. సింహనాదము గూడా, దశదిశలు వ్యాపించెను. మహాకాళి తన వదనమును తెరచి భిషణ నా దము చేసెను. ఆ నాదమును విని, దైత్య సేన, పలుదిక్కుల నుండి దేవిని చుట్టుముట్టిరి. అదే సమయమున, దైత్యుల నాశమునకై, దేవతల అభ్యుదయమునకై బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాది దేవతల శరీరములనుండి వారి వారి శక్తులు ఆయా రూపములలోనే ఆవిర్భవించి, దేవియొక్క సాహాయ్యమునకై ఏతెంచినవి. ఆ శక్తులచే పరివేష్టితుడైన రుద్రభగవానుడు వచ్చెను. 'మా ప్రసన్న తకై శీఘ్రముగా ఈ దైత్యులను సంహరింపుము' అని రుద్రుడు చండికను ఆదేశించెను. రుద్రదేవుని వచనము వినినంతనే, దేవీశరీరమునుండి అతిభీషణమైన ఓక మహాశక్తి ఆవిర్భవించెను. ఆమె, రుద్రునితో ఇట్లనెను - 'మీరు మా దూతగా వెళ్లి, శుంభ, నిశుంభులతో త్రైలోక్యమును ఇంద్రునకొసంగుడు, దేవతలు యజ్ఞహవిర్భోక్తలగుదురు, మీకు జీవితేచ్ఛ ఉండిన, పాతాళలోకమునకు పొండు, బలగర్వముతో యుద్ధము చేయదలచిన, రండు, మీమాంసముతో మా శృగాలములు (నక్కలు) తృప్తి చెందును" అని చెప్పుడు. దేవి, శివుని, దూతగా పంపెను గాన, ఆమె 'శివదూతీ' నామముతో ప్రసిద్ధి గాంచెను.

దైత్యులు శివునిద్వారా దేవీ సందేశమునువిని , కృద్ధులై దేవి ఉన్న ప్రదేశమునకు వచ్చిరి, అస్త్రశస్త్రములతో దేవిని తీవ్రముగా ప్రహరించిరి. దేవి, లీలామాత్రముగా ఆ అస్త్రమ శస్త్రములను అన్నింటిని నాశము చేయుచు, ముందుకు పోవుచుండెను. బ్రహ్మాణీ, మహేశ్వరీ, వైష్ణవీ, కౌమారీ, ఐంద్రీ మొదలగు మాతృ గణములు తమ శస్త్రాస్త్రములతో సహస్రసంఖ్యాకులైన దైత్యులను సంహరించుచుండిరి, అసురసంహారము చేయుచు, నాదముతో దిశలను నింపుచుండిరి. మాతృగణములచే పీడితులై అసురులు పలాయనము చేసిరి.

అపుడు ' రక్త బీజు'డను మహా అసురుడు వచ్చెను. రక్త బీజుని శరీరమునుండి రక్త బిందువులు భూమిపై ఎన్ని పడుచుండునో, అంత సంఖ్యలో అట్టివారే అయిన రక్తబీజులు ఉదయించుచుండిరి. ఆ రక్తబీజుడు గదను గైకొని 'ఐంద్రీశక్తి' తో యుద్ధము చేయసాగెను, అసంఖ్య రక్తబీజులతో ప్రపంచమంతయు వ్యాప్తమయ్యెను. దేవి, తన జిహ్వను భూమిపై వ్యాపింపజేసి, రక్తమునంతయు పానము చేయసాగెను. చివరికి, ఆ దైత్యుడు క్షీణశోణితుడై (రక్తహీనుడై) మృతినొందెను.

మరల, శుంభ, నిశుంభులు దేవితో ఘోరమైన యుద్ధణు సలిపిరి. మహాయుద్ధము జరిగిన పిమ్మట, నిశుంభుడు మరణించెను. అప్పుడు, శుంభుడు వచ్చి దేవిని ధర్షించుచు ఇట్లనెను - "హే దుర్గే! నీవు గర్వింపకుము, నీవు ఇతరుల బలముతో పోరు సలుపు చున్నావు."

అంత, దేవి ఇట్లు పలికెను - " ఈ జగత్తులో నేనొక్కతెనే ఉన్నాను, నాకంటె భిన్నులైన మరొకరు లేరు. చూడు, వీరందఱును నా విభూతులే, ఈ విభూతు లన్నియు నాలో ప్రవేశించుచున్నవి, చూడు."

ఈ విధముగా పలికినంతనే, బ్రహ్మాణీ ప్రముఖ దైవీశక్తులు దేవియందు విలీనములై పోయినవి, దేవి ఒక్కతె. ఏకాకినియై ఉండి పోయెను.

శ్లో || ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా |

పశ్యైతా దుష్ట మయ్యేవ విశన్త్యో మద్విభూతయః ||

శ్లో || తతః సమస్తా స్తా దేవ్యో బ్రహ్మాణీ ప్రముఖాలయమ్‌ |

తస్యా దేవ్యా స్తనౌ జగ్ము రేకైవాసీ త్తదా7బికా ||

తాత్పర్యము

దేవి యిట్లనెను - నేనే, నా విభూతితో అనేక రూపములలో ఉంటిని. ఇపుడు ఆ విభూతులను అన్నింటిని ఉపసంహరించి, ఒంటరిగా, సంగ్రామమున, నిలబడి ఉన్నాను. నీవు సావధానుడవై నిలబడుము." అనంతరము, దేవతల సమక్షములో దేవికి, శుంభునకు మధ్య ఘోరయుద్ధము జరిగెను. దివ్యాతిదివ్యములైన మహాస్త్రశస్త్రములు ప్రయోగింప బడెను. కొంత కాలము నభో మండలమున, మఱికొంతకాలము భూమండలమునందు ఆశ్చర్యకరమైన సమరము జరిగెను. ఆ మహా సంగ్రామము తరువాత, దేవి, విశాలమైన శూలముతో శుంభుని హృదయమును విదీర్ణ మొనర్చి (బ్రద్దలు చేసి), సంహరించి భూమిపై పడవేసెను.

అంత, దేవతలు, ఋషులు , ఆనందనిర్భరచిత్తులై దేవిని ఈ విధముగా స్తోత్రము చేయసాగిరి.

శ్లో || దేవి ప్రసన్నార్తిహరే ! ప్రసీద

ప్రసీద మాత ర్జగతో7ఖిలస్య |

ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం

త్వ మీశ్వరీ దేవి చరాచరస్య ||

శ్లో || ఆధారభూతా జగత స్త్వ మేకా

మహీస్వరూపేణ యతః స్థితా7సి |

అపాం స్వరూపస్థితయా త్వయైత

దాప్యాయతే కృత్స్న మలంఘ్యవీర్యే ||

తాత్పర్యము

అనన్య శరణులు, శరాణార్థులు, భక్తివినమ్రులు అయిన వారి బాధను - ఆర్తిని హరించునట్టి హే దేవి ! నీవు ప్రసన్నురాలవు కమ్ము. హే సమస్త జగజ్జనని! నీవు ప్రసన్నవు కమ్ము. సర్వవ్యాపకమైన హే విశ్వేశ్వరి! నీవు ప్రసన్నవు కమ్ము హేభగవతి ! నీవు లక్ష్మీ రూపముతో ఈ సమస్త విశ్వమును రక్షింపుము. ఈ చరాచర జగత్తునకు నీవు ఈశ్వరివి. విష్ణుమాయాత్మికవై సమస్త ప్రపంచము నందు వ్యాపించియున్నావు. హే జగదీశ్వరి ! నీవు ప్రసన్నవై సమస్త విశ్వమును రక్షింప ప్రార్థించుచున్నాము.

హే దేవి ! నీవు పృథివీరూపముతో విద్యమానవై ఉంటివి. ఆ కారణముచేత నీవే, సమస్త జగత్తునకు ఆధారభూతవు, మఱొకరు కారు. హే అపారశక్తి శాలిని! నీ పరాక్రమము అధిగమింపరానిది. జలస్వరూపముతో ఉన్ననీ చేతనే ఈ సమస్త విశ్వము అభివృద్ధి చెందుచున్నది. హే అప్‌ (జల) స్వరూపిణి ! నీకు వినమ్రులమై మేము నమస్కరించుచున్నాము.

శ్లో || త్వం వైష్ణవీ శక్తి రనన్త వీర్యా

విశ్వస్య బీజం పరమా7సి మయా |

సమ్మోహితం దేవి సమస్త మేతత్‌

త్వం వై ప్రసన్నా భువి ముక్తి హేతుః ||

శ్లో || విద్యాః సమస్తా స్తవ దేవి భేదాః

స్త్రియః సమస్తాః సకలా జగత్సు|

త్వయైకయా పూరిత మంబయైతత్‌

కా తేస్తుతిః స్తవ్య పరాపరోక్తిః ||

తాత్పర్యము

హే భగవతి ! నీవు అనంతవీర్యవు. అనగా, క్షయము నొందని బలప్రభావములు కలదానవు. ఏ శక్తిచేత విష్ణు భగవానుడు సమస్త లోకములను పాలించుచున్నాడో, ఆ విష్ణు సామర్ధ్యరూపమైన వైష్ణవీ శక్తివి నీవే అయి ఉన్నావు. నీవే, నిఖిల విశ్వముకు లోక, వేదప్రసిద్ధమైన కారణభూతవు. సర్వవ్యాపిని యైన ఆ పరమ శక్తివి నీవే అయి ఉన్నావు. నీ కంటె భిన్నమైన జగత్కారణభూతురాలు మఱొకరు లేరని భావము. హే పరమేశ్వరి! మాయాస్వరూపిణివైన నీచేత ఈ సమస్త విశ్వము సమ్మోహితమై అహంకార, మమకారవశ##మై సంసారపాశబద్ధ మొనర్చబడినది. ఓ జగజ్జననీ ! నీవు, జ్ఞాన వైరాగ్య రూపిణివి. ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడు ఆత్మతత్త్వముయొక్క అవగతిస్వభావము కలదానవై ఈ భూమియందు ముక్తిహేతు వగుచున్నావు. అట్టి నీకు నమస్కారము.

హే పరమేశ్వరి ! శ్రుతి, స్మృతి, శాస్త్రాది విద్యలన్నియు నీ అంశ##లే అయి ఉన్నవి. కావున, ఆ విద్యలు నీకంటె భిన్నములు కాకపోవుటచేత నీ స్తుతియందు ఎట్లు ప్రవర్తింపగలవు? స్తుతించుటకు అర్హమైన విషయము నందు పర, అపర భేదము చేత వచనము దేనియందు ఉండునో, అది 'స్తవ్య పరాపరోక్తి' అనబడును. ఆ కారణముచేత నీవు విద్యారూపిణివైన సరస్వతీరూపిణివి. కావున, భిన్నత్వము లేకపోవుటవలన, ఈ స్తుతి సంగతము కాదు. ఇచట, ఏ దేవి, స్తుతింపబడుచున్నదో, ఆ దేవియే, ఈ నిఖిల జగద్రూపముగా విరాజిల్లుచున్నది. ఆ దేవియే, బ్రాహ్మీ, వైష్ణవీ, శర్వాణీ రూపముతోను స్తుతింపబడుచున్నది. కావున, ఆ పరాశక్తిని స్తుతించుట అశక్యము. ఓ జననీ ! అధికముగ చెప్పనేల ? ఈ సమస్త విశ్వము ఆ జగదంబికచేతనే పూరింపబడియున్నది. కావున, హేమాతః ! నిన్ను స్తుతించుట మా శక్తికి మించిన కార్యమై ఉన్నది. కావున, మాపట్ల ప్రసన్నవు కమ్ము. చతుఃషష్టి కళాయుక్తలైన సమస్త స్త్రీలును నీరూపములతో వ్యాపించి ఉన్న నిన్ను స్తుతించుట ఎవరికి శక్యమగును?

శ్లో || సర్వభూతా యదా దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ |

త్వం స్తుతా స్తుతయే కా వా భవన్తు పరమోక్తయః ||

శ్లో || సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |

స్వర్గాపవర్గదే ! దేవి ! నారాయణి ! నమో7స్తు తే ||

తాత్పర్యము

హే దేవి ! నీవు భుక్తి ముక్తి ప్రదాయినివైన సర్వ భూతాత్మవు, అనగా, విశ్వరూపిణివి అని స్తుతింపబడినపుడు స్తుతి కొఱకు ఉత్కృష్టములైన వచనములు, లేక స్తోత్రములు ఏమి ఉండజాలును? హేదేవి ! నీవు భుక్తి ముక్తి ప్రదాయినివి అని స్తుతింప బడుదువు. అట్టి సర్వవ్యాపకమైన సర్వాతిశయరూపము గల నిన్ను స్తుతించుటకు సమర్థమైన వచనములు ఏమి ఉండును ? నీవు వాచామగోచర స్వరూపిణివి. కావున, నీ మహిమాతిశయమును వర్ణించుటకు ఈ వచనములకు సామర్థ్యము లేదు.

హే దేవి ! సర్వ ప్రాణుల హృదయమునందు నీవు బుద్ధి రూపిణివై ఉందువు. నీవు స్వర్గ, అపవర్గ (మోక్ష) ప్రదాత్రివి. హే నారాయణి! నీకు నమస్కారము. 'నారాయణి' అనగా, సర్వ ప్రాణుల హృదయమునందు నివసించు లక్ష్మీస్వరూపిణి. ఆమె నీవే అయి ఉన్నావు. తాదృశ నారాయణీ స్వరూపిణివైన నీకు మా నమస్కారములు.

శ్లో || కాష్ఠా కలాదిరూపేణ పరిణామ ప్రదాయినీ |

విశ్వస్యోపరతౌ శ##క్తే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థసాధికే |

శరణ్య త్ర్యంబకే గౌరి నారాయణి నమో7స్తు తే ||

తాత్పర్యము

పదునెనిమిది నిమేషములు గల కాలము 'కాష్ఠా' అను నామముచే చెప్పబడును. ముప్పది కాష్ఠలు గల కాలము 'కలా' శబ్దముచే చెప్పబడును. కలా, కాష్ఠాది కాలరూపముతో పరిణామమును మును జలిగించునట్టి హే దేవి ! ప్రపంచ సంహార శక్తిస్వరూపిణి ! హే నారాయణి! నీకు నమస్కారము.

ఏ పరమేశ్వరివలన సర్వశుభములు కలుగునో, ఆమె 'సర్వ మంగళ' అనగా ఉమాదేవి, లక్ష్మీ దేవి. అట్టి సర్వమంగళ మాంగల్య రూపిణివి నీవే తల్లీ ! హే శివే ! హే త్ర్యంబకే ! శరణ్య ! హే నారాయణి! హే గౌరి! నీవు సర్వార్థప్రదాత్రివి. అట్టి నారాయణీ శక్తివైన నీకు నమస్కారము చేయుచున్నాము.

శ్లో || సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని |

గుణాశ్రయే గుణమయే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణ |

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమో7స్తు తే ||

తాత్పర్యము

హే భగవతి ! నీవు సృష్టి, స్థితి సంహారములకు హేతువైన బ్రాహ్మీ, వైష్ణవీ, రౌద్రీ శక్తిస్వరూపిణివి. హే సనాతని ! నీవు నిత్యస్వరూపిణివి. నీవు సత్త్వ, రజ, స్తమో గుణములకు ఆశ్రయ భూతవు. అనగా, నీవు గుణములయందు వర్తిలుచుందువు. నీవు గుణమయవు, గుణాశ్రయవు, నారాయణివి అయిన హే భగవతి ! నీకు నమస్కారము.

హే జనని ! శరణాగతులను, దీనార్తులను పరిరక్షించుటయందు అభిలాష గల దయార్ద్రచిత్తవు. సమస్త లోక పీడాపవిహారిణి. హే దేవి ! హే లక్ష్మి ! నీకు నమస్కారము.

24]

శ్లో || హంసయుక్త విమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |

కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమో7స్తు తే ||

శ్లో || త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని |

మహేశ్వరీస్వరూపేణ నారాయణి నమో7స్తు తే ||

తాత్పర్యము

హే దేవి ! నీవు హంసయుక్తమైన విమానమునందు విరాజిల్లు చుందువు. కావున, 'హంసయుక్త విమానస్థా' అను నామముతో సంకీర్తింపబడుచుందువు. 'హంస' శబ్దమునకు సూర్యుడు, యతి శ్రేష్ఠుడు అని కూడా అర్థము కలదు. 'హంసవిమాన' మనగా 'దేవతాయానము' అని అర్థము. యతీంద్రులచేత, సూర్యునిచేత సమాశ్రయింపబడిన ఏ విమానము కలదో, ఆ విమానము విగతాహంకార రూపము (అహంకార రహితము), పరబ్రహ్మ తత్త్వరూపము అయినది. అట్టి పరబ్రహ్మతత్త్వమునందు నిరంతరము ఉందువు గాన, నీవు 'హంసయుక్త విమానస్థవు' . అనగా, పరబ్రహ్మ తత్త్వస్థవై వెలుగొందుచుందువు. నీవు బ్రహ్మాణీ రూపధారిణివి. 'బ్రహ్మాణి' అనగా సరస్వతి. సరస్వతీ రూపమును ధరించిన నీవు బ్రాహ్మీశక్తివి. 'కౌశ' మనగా కమండలువు. కమండలువునందలి ఉదకముచేత నిరంతరము అభిషేకము చేయబడుచుందువు. గాన, 'కౌశాంభఃక్షరికా' అను నామముతో ఒప్పారుచుందువు. హే గౌశాంభఃక్షరికే నారాయణి నీకు నమస్కారము. హేమహేశ్వరి! నీవు త్రిశూలధారిణివి. చంద్రకళా ధారిణివి, సర్వభూషణవు. హే మహావృషభవాహిని ! నీవు మహేశ్వరీ స్వరూపముతో విరాజిల్లుచుందువు. హే నారాయణీ ! నీకు నమస్కారము.

శ్లో || మయూర కుక్కుటవృతే మహాశక్తి ధరే7 న ఘే |

కౌమారీరూపసంస్థానే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || శంఖ చక్ర గదా శార్జ గృహీత పరమాయుధే |

ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || గృహీతో గ్ర మహాచక్త్రే దంష్టోద్ధృత వసుంధరే |

వరాహరూపిణి శివే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || నృసింహరూపేణో గ్రేణ హన్తుం దైత్యాన్‌ కృతోద్యమే |

త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమో7స్తు తే ||

తాత్పర్యము

హే అనఘే ! కౌమారీరూపసంస్థానే ! మయూరకుక్కుటవృతే ! మహాశక్తి ధరే ! హే నారాయణి ! నీకు నమస్కారము. 'అనఘా' అనగా దేవి, పాపరహిత అని అర్థము. కావున, ఆ భగవతి 'అనఘా' అని సంకీర్తింపబడును. షణ్ముఖరూప (కుమారస్వామి రూప) సంస్థానము, అనగా, శరీరావయవసంస్థానము కలది పరాశక్తి. కావున, 'కౌమారీరూపసంస్థానా' అను నామముతో ప్రసిద్ధురాలు. 'మహాశక్తి' అను ఆయుధమును ధరించును గాన, దేవి 'మహాశక్తిధరా' నామముచేత విశ్రుతురాలయ్యెను. సర్పములను హింసిచునట్టి (మీనాత్యహీన్‌ మయూరః) మయూరములచేత, మయూర పింఛములచేత, కుక్కుటములచేత ఈ 'కైమారీదేవి' పరివేష్టితయై ఉండును. తాదృశ కౌమారీశక్తి రూపిణివైన నీకు మా నమో వాకములు తల్లీ !

హే భగవతి! నీవు శంఖ , చక్ర, గదా, శార్జాది (ధనస్సు మొదలగు) ఆయుధములను ధరించి ఉందువు. హే వైష్ణవీ రూపే ! నీవు ప్రసన్ను రాలవు కమ్ము. జగద్రక్షణమునకై విష్ణు శక్తిరూపధారిణివై ప్రాదుర్భవించితివు గాన, నీవు వైష్ణవీ రూప ధారిణివి. హే నారాయణి ! నీకు నమస్కారము. 'నరాణాం అయనీ - నారాయణీ' 'అయనీ' అనగా ముక్తి, నరుల ముక్తి హేతువైన బ్రహ్మవిద్యారూపిణివి నీవే అయి ఉన్నావు. కావున, హే బ్రహ్మ విద్యారూపిణి ! హే నారాయణి ! బ్రహ్మాత్మ జ్ఞాన ప్రదానముచేసి, మమ్ము అనుగ్రహించుము జననీ !

హే మహాలక్ష్మీ ! నీవు మహోగ్రమైన వైష్ణవ చక్రమును (సుదర్శన చక్రమును) ధరించి శత్రునాశము చేసిన రౌద్ర రూపిణివి. దంష్ట్రలచే భూమిని ఉద్దరించిన వారాహీ శక్తి రూపిణివి. శివపత్ని వైన హే శివే ! హే సర్వమంగళే ! హే నారాయణి! నీకు నమస్కారము. 'నార' మనగా ధర్మ, అర్థ, కామరూప త్రివర్గము. ఆ త్రివర్గప్రాప్తిని ఉపదేశించునట్టి జననివి గాన, నీవు నారాయణీ నామముచే స్తోతవ్యవు. హే భగవతి ! హే నారాయణి ! నీకు నమస్కారము.

హే జగత్త్రాణపరాయణ ! నీవు రౌద్రమైన నృసింహ రూపముతో దైత్యవధకై ఉద్యమించిన నారసింహీశక్తివి. నీవు త్రైలోక్యరక్షణము చేయుట వలన పూజితవు. హే నారాయణి ! హే నారసింహి ! మేము నీ చరణాంబుజములకు వినమ్రులమై నమస్కరించుచున్నాము. మానవుడు సాధింపదగిన చతుర్భద్రము లను - ధర్మ, అర్థ, కామ, మోక్షరూపములైన చతుర్విధ పురుషార్థము లను ప్రసాదించునది గాన, పరదేవత, 'నారాయణీ' అని సంకీర్తింపబడును. అట్టి నారాయణివైన ఓ జననీ ! నీకు మా నమస్కారములు.

శ్లో || కిరీటిని ! మహావజ్రే ! సహస్రనయనోజ్జ్వలే !

వృత్ర ప్రాణహరే చైన్ద్రి నారాయణి నమో7స్తు తే ||

శ్లో || శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |

ఘోరరూపే మహారావే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || దంష్ట్రా కరాళవదనే శిరోమాలావిభూషణ |

చాముండే ముండమథనే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే వుష్టి స్వధే ద్రువే !

మహారాత్రి మహామాయే నారాయణి నమో7స్తు తే ||

తాత్పర్యము

హే కిరీటిని ! మహావజ్రాయుధే ! సహస్రనేత్రములతో ప్రకాశించునట్టి ఓ దేవీ ! హే వృత్రాసుర ప్రాణహారిణి ! ఇంద్ర శక్తిసమన్వితవైన ఓ ఐంద్రీశక్తీ ! హే నారామణి ! నీకు నమస్కారము. ఈ పరాశక్తి వలననే శ్రుతులు అవగతములగును. ఈ దేవి శుత్రులకు అధికరణభూతురాలు. ఈ పరాశక్తి, అకారాది క్షకారాస్త మాతృ కాస్వరూపిణి, సర్వమంత్రాత్మిక, హే నారాయణి ! నీకు నమస్కారము. ('నౄనయే. నృణ న్తి విధయః స్వర్గం నయన్తి లంబయన్తి పురుషానేఖిరితి నరాకృతయః | అయ్యన్తే ఈయన్తే వా శ్రుత యో7న యేతికరణల్యుట్‌ | అయనీ శ్రుతిర్వేదత్రయీ')

హే భగవతి ! శ్రీ చండికాదేవి శరీరమునుండి ఆవిర్భవించిన శక్తివైన నీవు 'శివదూతీ' నామముతో విశ్రుతవు. నీవు నీ పతియైన శివుని, వార్తాహరునిగా పంపిన మహాశక్తిస్వరూపిణివి. దైత్యుల మహాపరాక్రమును నాశమోందించిన హే హతదైత్యమహాబలే ! భయానకమైన ఆకారము గల హే ఘోరరూపే ! హే మహారవే ! హే నారాయణి ! నీకు నమస్కారము.

హే దంష్ట్రాకరాలవదనే ! దంష్ట్రలచేత భయంకరమైన వదనముతో అరిభీకరవై కన్పడుదువు. హే శిరోమాలావిభూషితే ! ముండాసురుని, మథించిన, నాశమొందించిన హే ముండమథనే ! హే చాముండే ! హే నారాయణి ! హే కాళి ! నీకు ప్రహ్వీ భావముతో వినతశిరస్కులమై నమస్కరించుచున్నాము. నయవర్తులు, యజ్ఞహవిర్భోక్తలు అయిన దేవతల మనోవాంఛలను దీర్చునట్టి గతి కలదానవు గాన, 'నారాయణీ' నామముతో విరాజిల్లుచుందువు. తాదృశ మహనీయ స్వభావము గల నీ చరణారవిందములకు మా నమస్కారములు.

హే లక్ష్మీ! హే మహాలజ్జాస్వరూపిణి! నీకు నమస్కారము. పరమాత్మ గోచర జ్ఞానరూపవైన హే మహావిద్యే ! నీకు మా నమో వాకములు. ఆస్తిక్యబుద్ధియే స్వభావముగా గల హే శ్రద్ధే ! నీకు నమస్కారము. శరీరాది అవయవవృద్ధిరూపవైన హే పుష్టి స్వరూపిణి ! నీకు మా ప్రణామములు. పితృదేవతాతృప్తి స్వరూపవవైన హే స్వధే ! నీకు నమస్కారము. బ్రహ్మరూపవైన హే ధ్రువే ! నీవు అమావాస్యనాడు కాలపురుషుడైన పరమేశ్వరుని యందు విలీనమై ఉండు షోడశీకలాస్వరూపిణివి. ఈ పదునాఱవ కళ##యే 'ధ్రువా' కళ యని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. ఆ ధ్రువా కళకు ఉపచయాపచయములు (వృద్ధిహానులు) ఉండవు, పరాశక్తి వైన నీవు తాదృశ షోడశీకళాస్వరూపిణివై, ధ్రువాకళ##వై, నిత్యవై విరాజిల్లుచుందువు. నీకు నమస్కారము. హిరణ్యగర్భావసానకాల రూపిణివైన హే మహారాత్రే ! నీకు ప్రణామములు. మాహారాత్రి అనగా, అనల్పమైన తమస్సునకు అధికరణరూప మని, అథవా, సర్వప్రాణి మోహనకరి యని చెప్పికొనవచ్చును. కావుననే , నీవు మహామాయాస్వరూపిణివి. హే మహామాయే ! హే నారాయణి ! నీకు మేము వినమ్రమైన చిత్తముతో వందనములు అర్పించుచున్నాము తల్లీ !

శ్లో || మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |

నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమో7స్తు తే ||

శ్లో || సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే |

భ##యేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమో7స్తు తే ||

శ్లో || ఏత త్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితమ్‌ |

పాతు నః సర్వ భూతేభ్యః కాత్యాయని నమో7స్తు తే ||

శ్లో || జ్వాలాకరాల మత్యుగ్ర మశేషారిసూదనమ్‌ |

త్రిశూలం పాతు నో భీతే ర్భద్రకాళి నమో7స్తు తే ||

తాత్పర్యము

హే భగవతి ! నీవు మేధాస్వరూపిణివి, హే సరస్వతీరూపిణి ! హే వరే- శ్రేష్ఠే ! హే భూతి ! హే ఐశ్వర్యాదిరూపే ! హే నారాయణి ! నీకు నమస్కారము. హే బాభ్రవి ! హే నారాయణి ! నీకు నమస్కారము. 'బిభర్తి ఇతి బభ్రుః విష్ణుః' - సర్వలోకముల ధారణపోషణములు చేయువాడు విష్ణువు. ఆ విష్ణువుయొక్క భగిని (సోదరి) గాన, వైష్ణవీశక్తి అయిన శ్రీచండికా దేవి 'బాభ్రవి' అను నామముచే సంకీర్తింపబడును. హే తామసి ! హే జగత్సంహార కారిణి ! నీకు నమోవాకములు పలుకుచున్నాము. అత్యంత నిశ్చిత దీక్ష గల హే నియతే ! హే నారాయణి ! నీకు నమస్కారము. హే ఈశే ! హే స్వామిని ! నీవు ప్రసన్నవు కమ్ము. హే నారాయణి ! నీకు నమస్కారము.

హే జగదీశ్వరి ! ఈ సమస్త చరాచరజగత్తు నీ స్వరూపమే అయి ఉన్నది. హే సర్వస్వరూపే ! నీకు నమస్కారము. ఓ తల్లీ! నీవు అనంతకోటి బ్రహ్మాండ శాసనకర్త్రియైన సర్వేశరూపిణివి, నీకు మా ప్రణామములు. ఈ విశ్వమునందు గోచరించునట్టి అనంత శక్తులు నీవే అయి ఉన్నవి. హే సర్వశక్తి సమన్వితే నీకు నమస్కారములు. హే దుర్గే ! సమస్త భయములనుండి సర్వశత్రు భయములనుండి - కామక్రోధాదిరూప శత్రుభయమునుండి మమ్ము రక్షించుము. హే దుర్గే ! హే దేవి ! నీకు నమస్కారము.

హే దేవి : హే చండికే ! నీ ఈ ముఖము అతి సుందర మైనది, సౌమ్యమైనది. నీవదనము సోమ, సూర్య, అగ్ని, త్రయాత్మకమైన లోచనత్రయముతో సమలంకృతము తల్లీ ! సర్వ భూతముల నుండి, సర్వభీతులనుండి మా దేవబృందమును రక్షించుదువుగాక. హే కాత్యాయనీదేవి ! లక్ష్మీ, సరస్వతులకు పరమాధిష్ఠానశక్తి రూపిణియే కాత్యాయనీ దేవి అని సంప్రదాయ విదుల మతము. తాదృశ శక్తి సమన్విత అయిన కాత్యాయనీదేవి, ఓషధ్యభావ, అన్నాభావ, యజ్ఞభాగాభావాదిరూప భయములనుండి మమ్ము రక్షించుగాక అని దేవతలు ప్రార్థించుచున్నారు.

హే భద్రకాళి ! హే చండికే ! జ్వాలాకరాళము, అతి రౌద్రము, సకల అసురనిషూదనము అయిన నీ త్రిశూలాయుధము దేవతలమైన మమ్ము భయములనుండి రక్షించుగాక. హే భద్రకాళి ! హే దేవి ! నీకు నమస్కారములు.

శ్లో || హిన స్తిదైత్యతేజాంసి స్వనేనాపూర్వ యా జగత్‌ |

సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ ||

శ్లో || అసురాసృగ్వసాపంకచర్చిత స్తే కరోజ్జ్వలః |

శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయమ్‌ ||

శ్లో || రోగా నశేషా నవహంసి తుష్టా

రుష్టా తు కామన్‌ సకలా నభీష్టాన్‌ |

త్వామాశ్రితానాం న విప న్న రాణాం

త్వా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాన్తి ||

తాత్పర్యము

హే దేవి ! నీవు ఘంటానాదముచేత లోకత్రయమును పూరించి దైత్యులతేజన్సులను నాశనము చేయుము. నీదైన ఆ ఘంట దేవతలమైన మమ్ము పాపములనుండి, దైత్యులనుండి పుత్రులను రక్షించునట్లు రక్షించుగాక. అనగా, తల్లి , తన శిశువులను రక్షించునట్లుగా ఆ ఘంట, మమ్ములను రక్షించుగాక !

హే చండికే ! హే దేవి ! అసురుల రుధిర, మేదోరూపమైన పంకముచేత వ్యాప్తమైన నీ హస్తము మాయొక్క, లోకముల యొక్క శుభము కొఱకు ఉజ్జ్వలమైన ఖడ్గము అగు గాక. హే చండికే ! భగవతివైన నీకు దేవతలమైన మేము ప్రణతులమై ఉందుము. అనగా, త్వదేకశరణులమై నిన్ను సేవించెదము. హే దేవి ! నిన్ను ఆరాధించుటచేత నీవు సంతుష్టురాలవై నిన్ను ఆశ్రయించిన భక్తుల సమస్త రోగములను నాశనము చేయుదువు. హే దేవి ! నీవు నిన్ను ఆరాధించుటచే నీవు సంతుష్టాంతరఙ్గవై నిన్ను ఆశ్రయించిన భక్తుల సమస్తరోగములను నాశనము చేయుదువు. హే దేవి! నీవు నిన్ను ఆరాధించుటచేత సంతుష్టాంతరంగవై నిన్ను ఆశ్రయించిన నరులయొక్క అభీష్టములైన సకల కామనలను, అనగా కామ్యమానములైన అర్థములను ఇచ్చుదువు. హే భగవతి ! నిన్ను ఆశ్రయముగా జేసికొనిన నరులు, ఇతరులకు ఆశ్రయము నొసగువారగుదురు. అనగా, ఇతరులచే సేవింపబడువారగుదురు. హే నారాయణి ! నీకు నమస్కారము.

25]

శ్లో || ఏతత్కృతం యత్కదనం త్వ యా 7ద్య

ధర్మద్విషాం దేవి మహాసురాణామ్‌

రూపై రనేకై ర్బహుధా77త్మమూర్తిం

కృత్వా7బికే తత్ప్రకరోతి కా7న్యా ||

శ్లో || విద్యాసు శాస్త్రేషు వివేకదీపే

ష్వాద్యేషు వాక్యేషు చ కా త్వ దన్యా |

మమత్వగర్తే 7తి మహాంధకారే

విభ్రామయ త్యేత దతీవ విశ్వమ్‌ ||

తాత్పర్యము

హే అంబికే ! హే దేవి ! ఇపుడు నీ స్వీయ శరీరము బ్రహ్మాణీ, లక్ష్మీ, గౌర్యాది అనేక రూపములుగ చేసి యజ్ఞాదికర్మలను ద్వేషించునట్టి శుంభ, నిశుంభాది అసురుల ఏ కదనము - ఏ మరణము కలదో, అది నీకంటె మఱొక ఏ దేవత చేయగలుగును ? ఏ దేవతాస్త్రీ గూడా చేయజాలదని భావము. నీవే, ఇట్టి అసుర నాశము చేయుటకు సమర్థురాలవు. తాదృశశక్తిమతివైన నీకు నమస్కారము.

హే చండికే! వివేకదీపములైన చతుర్దశ విద్యలయందును, జ్ఞానప్రద మంత్రరూపములైన విద్యలయందును, ప్రవృత్తి, నివృత్తిరూప మనుస్మృత్యాది శాస్త్రముల యందును, ఆద్య వాక్యములైన వైదిక వచనములయందును, పురాణములయందును ఆదరభావము లేక, ఈ విశ్వము అతి మహాంధకారముతో గూడిన మమత్వగర్తమునందు పరిభ్రమించుచున్నది. అట్లు ఈ జగత్తును ఘోర తిమిరమునందు పరిభ్రమింపజేయుచున్నది నీవు కాక, మఱొకరు ఏవరు కలరు ? వైష్ణవీ మాయారూపిణివి, వారాహీ మాయా రూపిణివి అయిన నీవు ఈ విశ్వమును అహంకార, మమకారముల యందు పడద్రోసి మోహింపజేయుచున్నావు. హే మహాదేవి ! ఈ జగత్తును మోహాంకారమునందు పరిభ్రమింపజేయువారు నీవు కాక, మరెవ్వరును లేరు, హే మాయామయి ! నీవు మాకు మోహాపనయనము గావించి , అజ్ఞానాంధకారమునుండి మమ్ము రక్షించుము.

శ్లో || రక్షాంసి యత్రోగ్ర విషాశ్చ నాగా

యత్రారయో దస్యుబలాని యత్ర |

దావానలో యత్ర తథా7బ్ధిమధ్యే

తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్‌ ||

శ్లో || విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం

విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్‌ |

విశ్వేశవంద్యా భవతీ భవన్తి

విశ్వాశ్రయా యే త్వయి భక్తి నమ్రాః ||

తాత్పర్యము

హే దేవి ! నీవు ఆ యా ప్రదేశములయందు ఉండి ఈ విశ్వమును రక్షించుచున్నావు. ఏ దేశమున అసురులు, భయంకర విషము గల తక్షకాది సర్పములు, శత్రువులు, చోర సమూహములు, దావాగ్ని ఉండునో, సాగరమధ్యమునందు ఆయా ఉపద్రవములు కలిగినపుడు, నీవు స్మరింపబడి మమ్ములను, ఈ లోకములను రక్షించుచున్నావు. ఓ తల్లీ ! నీకు నమస్కారము.

హే భగవతి ! నీవు విశ్వేశ్వరివి. కావుననే, ఈ విశ్వమును నీవు సర్వవ్యాపినివై రక్షించుచున్నావు. హే జనని ! నీవు విశ్వాత్మికవు, అనగా సమస్త జగదాత్మికవు. జగత్స్వరూపిణివి. కావుననే, నీవు ఈ విశ్వమును ధరించి ఉన్నావు. హే మాతః ! సృష్టి, స్థితి, సంహారకర్తలు, విశ్వేశ్వరులు అయిన బ్రహ్మాదులకు అభివాదనీయవై వారిచే స్తుతింపబడుచుందువు. కావున, నీవు 'విశ్వేశవంద్యా' అను నామముచేత సంకీర్తింపబడుదువు. హే దేవి ! నీయందు భక్తివినమ్రులైన వారు విశ్వమునకు ఆశ్రయ విభూతులై, అనగా ఆధారభూతులై, విశ్వధారణము చేయుచున్నారు. కావున, హే భగవతి ! నీవు మాయందు ప్రసన్నచిత్తవై మమ్ము రక్షింప ప్రార్థించుచున్నాము.

శ్లో || దేవి ప్రసీద పరిపాలయ నో7రిభీతే

ర్నిత్యం యథా 7సురవధా దధునైవ సద్యః

పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు

ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్‌ ||

శ్లో || ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి .

త్రైలోక్యవాసినా మీడ్యే లోకానాం వదరా భవ ||

తాత్పర్యము

హే భగవతి ! నీవు మాయందు ప్రసన్నురాలవు కమ్ము. మమ్ములను శత్రువుల భయమునుండి రక్షించుము. నీవు ఇపుడే శుంభ, నిశుంభాది దైత్యులను వధించి, వారినుండి మమ్ములను రక్షించితివి. ఆ రీతిగానే, భవిష్యత్తులో గూడా కలుగునట్టి శత్రు భయమునుండి దేవతలమైన మమ్ము శాశ్వతముగా పరిపాలించుము. హే దేవి ! నిత్యము సర్వలోకపాపములను వెంటనే ప్రశమింపజేయుము. హే జగజ్జనని ! నీవు అధర్మ పరిణామముచేత ఉత్పన్న మగు మహోపద్రవములను వెంటనే ప్రశమింపజేయుము అని త్వదేకశరణులము, దేవతలము అయిన మేము నిన్ను ప్రార్థించుచున్నాము.

హే విశ్వార్తిహారిణి ! నీవు విశ్వముయొక్క సమస్త పీడను హరించుదువు గాన, 'విశ్వార్తిహారిణీ' శబ్దముచేత సంకీర్తింపబడుచుందువు. భక్తివినమ్రులమైన మాపట్ల, ప్రసన్నవు కమ్ము. త్రైలోక్యవాసులకు స్తవనీయపగు ఓ దేవీ! నీవు సమస్తలోకము లకు వరప్రదవు కమ్ము.

శ్లో || వరదా7హం సురగణా వరం యం మనసేచ్ఛథ |

తం వృణీధ్వం ప్రయచ్ఛామి జగతా ముపకారకమ్‌ ||

శ్లో || సర్వ బాధా ప్రశమనం త్రైలోక్యస్యాభిలేశ్వరి |

ఏవమేవ త్వ యా కార్య మస్మద్వైరివినాశనమ్‌ ||

తాత్పర్యము

శ్రీ చండికాదేవి ఆదేవతలచేత ఈ విధముగా స్తుతింపబడినదై ప్రసన్నురాలై ఆ దేవతలతో ఇట్లనెను - ఓ దేవతాలోరా ! నేను మీపట్ల . వరదను- ప్రసన్నురాలను అయితిని. మీరు మనస్సులో అభిలషించుచున్న, లోకోపకారము అయిన వరమును కోరుకొనుడు, నేను మీకు ఆ వరము నొసగుదును.

అంత, దేవతలు పరమేశ్వరిని ఇట్లు అభ్యర్థించిరి - హె దేవి ! హే అఖిలేశ్వరి ! హే త్రైలోక్యస్వామిని ! భగవతివైన నీ చేత త్రిలోకముల సర్వదుఃఖోపశనము జరిగినది. అటులనే, వైరి వినాశము గూడా జరిగినది. ఈ విధముగానే రాబోవు కాలమునందు గూడా సమస్త లోకముల సర్వదుఃఖోపశమనమును, వైరిబాధా వినాశమును చేయుదువు గాక ! అని సవినయముగా ప్రార్థించుచున్నాము. ఓ జననీ ! ప్రసన్నురాలవై మమ్ము సర్వదా రక్షించుదువు గాక ! అని దేవతలు సవినయముగా మనవిచేసిరి.

ఈ స్తోత్రమువలన తెలియున దేమనగా, "పరమేశ్వరి సర్వ జనార్తిహారిణి. ఆమోయే నిఖిల బ్రహ్మాండ జనని . నిఖిల చరాచర విశ్వమునకు ఈశ్వరి. ఆమెయే, పృథ్వీరూపముతో సర్వప్రాణులకు ఆధారభూత. జలరూపముతో గూడా సమస్త విశ్వమునకు ఆప్యాయనము (సంతృప్తి) కలిగించునట్టిది. ఆమె అనంత వీర్యపతియైన వైష్ణవీశక్తి. ఆమె విశ్వబీజభూత అయిన మాయా శక్తి. సమస్త విశ్వము ఆమె చేతనే మోహితమై ఉన్నది. ఆమెయే ప్రసన్నయై ముక్తి హేతువగుచున్నది. విశ్వమునందలి సమస్త విద్యలు పరమేశ్వరి అంశ##లే. సకలస్త్రీలు ఆమె అంశ##లే. అద్వితీయ అయిన ఆ దేవిచేతనే సమస్త విశ్వము నిండియున్నది. ఇట్టి స్తోత్రసాధనమైన పరా, అపరా వాక్కు గూడా ఆ పరాశక్తి స్వరూపమే. స్పష్టముగా ఉచ్చరింపబడు వాక్కు 'వైఖరి', స్మృతి గోచరమైన వాక్కు 'మధ్యమ', అర్థద్యోతకమైన వాక్కు, 'పశ్యన్తి' బ్రహ్మయే 'పరా ' వాక్కు.

శ్లో || వైఖరీశబ్దనిష్పత్తి ర్మధ్యమా స్మృతిగోచరా |

ద్యోతితార్థశ్చ పశ్యన్తీ సూక్ష్మా బ్రహ్మైవ కేవలమ్‌ ||

తాత్పర్యము

స్థాన, కరణ, ప్రయత్నశూన్యము, వర్ణవిభాగశూన్యము, స్వయం ప్రకాశము అయిన జ్యోతి 'పరా'వాక్కు . సూక్ష్మబీజము నుండి ఉత్పన్నమైన అంకురము వలె కించిద్‌ వికసిత శక్తియే 'పశ్యన్తీ' వాక్కు. అన్తఃసంకల్పరూపమైన వాక్కు 'మధ్యమా'వాక్కు. వ్యక్త వర్ణాదిరూపమైన వాక్కు 'వైఖరీ' వాక్కు. ఆ దేవియే స్వర్గప్రదాత్రి, ముక్తి దాయిని. బుద్ధిరూపముతో ఆ పరదేవతయే, పురుషార్థ ప్రదయై వెలుగొందుచున్నది. కాలరూపముతో ఆ మహామాయయే విరాజిల్లుచుండును. సర్వమంగలదాయిని, సర్వార్థ సాధిక, శరణాగతవత్సల, సృష్ట్యధికారిణి, సనాతని, గుణశ్రయ, గుణమయి, శరణాగతదీనార్త పరాయణ, ఆ ర్తిహర, బ్రహ్మాణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండ, లక్ష్మి, లజ్జ, విద్య, శ్రద్ధ. పుష్టి, స్వధ, మహారాత్రి, మహావిద్య, మేధా, ధ్రువా, సరస్వతీ, వరా, భూతి, బాభ్రవీ, రాజసీ, తామసీ నియంత్రి ఆ చండికాదేవియే. ఆ దేవియే, సర్వస్వరూపయై విరాజిల్లుచున్నది. ఆమెయే, సర్వశక్తిరూపిణి. ఆ మహామాయ సర్వానర్థనివారిణి, సర్వాభిష్టదాయిని, సర్వస్తవనీయ. ఆ దేవి ఆశ్రయము పొందినవారికి ఆపదలేవియు ఉండవు. ఆ భగవతిని ఆశ్రయించినవారు ఇతరులకు ఆశ్రయణీయులగుదురు. ఆ దేవి విశ్వేశ్వరి, నిశ్వపాలిని, విశ్వరూప, విశ్వవంద్య. ఆ పరాశక్తికి ప్రణామ మొనర్చినవారు సమస్త విశ్వమునకు ఆశ్రయణీయులగుదురు."

ఇట్టి స్వరూపము గల దేవి, ప్రసన్ను రాలై వరము కోరుకొనుడని పలికెను. అపుడు దేవతలు 'అఖిలేశ్వరి! నీవు సర్వదాత్రైలోక్యము యొక్క సమస్త బాధలను ప్రశమింపజేయుము, అపుడపుడు ఈ రీతిగానే అసురసంహారము చేయుము" అని వరమును అర్థించిరి. అపుడు దేవి ఇట్ల నెను - "ఈ శుంభ, నిశుంభాది దైత్యులు మరల ఇఱుపది ఎనిమిదవ కల్పము (చతుర్యుగీ) నందు ఉద్భవించెదరు. అపుడుగూడా, నందగోపగృహములో యశోదాగర్భమున ఆవిర్భవించి, వింధ్యవాసినీరూపముతోనే నేను వారిని సంహరించెదను. ఆ రూపముతోనే 'వైప్రచిత్త' దానవులను సంహరించి, ఆదానవులను భక్షించెదను. దంతములు రక్తశోణితములగుట వలన, 'రక్తదన్తికా' నామముతో ప్రసిద్ధి నొందెదను. మఱల నూఱు సంవత్సరముల అనావృష్టి (కాటకము) కలిగినపుడు 'శతాక్షీ' రూపముతో ఆవిర్భవించి మునులను అనుగ్రహించెదను. నా దేహమునుండి ఉద్భూతము, ప్రాణధారకములు అయిన శాకములతో లోకరక్షణము చేసెదను. దీనివలన, నేను 'శాంకభరీ' నామముతో బరగుదును. ఆ అవతారమునందే దుర్గమ దైత్యసంహారము చేయుటవలన, నేను 'దుర్గా' నామముచే సంకీర్తితను అగుదును. భీమరూపమును ధరించి, హమాచలమునందలి రాక్షసులను భక్షించెదను. తత్కారణముగా, నేను 'భీమా' అను నామముతో విఖ్యాతురాల నయ్యెదను. భ్రమరరూపధారిణినై, అరుణాసురుని సంహరించుట వలన, 'భ్రామరీ' నామముతో విశ్రుత నయ్యెదను."

ఈ విధముగా, దానవులవలన బాధ కలిగిన ప్రతి సమయమున, నేను అవతరించి, ధర్మమునకు, దేవతలకు శత్రువులైన వారిని నాశమొందించెదను.ఈ స్తోత్రములతో నన్ను స్తుతించిన, శ్రద్ధాభక్తులతో నన్ను పూజించిన వ్యక్తుల ఆపదలను దూరమొనర్చి, సర్వాభీష్టముల నొసగెదను.

శ్రీ చణ్డీ పరదేవతా ప్రీయతామ్‌ |

శ్రీః

శ్రీ లలితా ప ఞ్చ రత్నమ్‌

1. ప్రాతఃస్మ రామి లలితా వదనారవిందం

బింబాధరం పృథుల మౌక్తికశోభినాసమ్‌ |

ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌ |

2. ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రత్నాజ్గులీయ లపదఙ్గులిపల్లవాభ్యామ్‌ |

మాణిక్య హేమ వలయాఙ్గద శోభమానాం

పుండ్రేక్షు చాప కుసుమేషు సృణీరధానామ్‌ ||

3. ప్రాతర్నమామి లలితాచరణారవిందం

భ##క్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్‌ |

పద్మాసనాది సురనాయక పూజనీయం

పద్మాజ్కుశ ధ్వజ సుదర్శనం లాంఛనాఢ్యమ్‌ ||

4. ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యన్త వేద్యవిభవాం కరుణానవద్యామ్‌ |

విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం

విద్వేశ్వరీం నిగమ వాజ్మనసాతిదూరామ్‌ ||

5. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్యరీతి కమలేతి మహేశ్వరీతి |

శ్రీశాంభవీతి జగతాంజననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||

26]

యఃశ్లోకపఞ్చ క మిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |

తసై#్మ దదాతి లలితా ఝుటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్య మనంతకీర్తిమ్‌ ||

శ్రీః

శ్రీ లలితాత్రి శతీ స్తోత్ర రత్నమ్‌

శ్లో || సకుంకుమవిలేపనా మళిక చుమ్బి కస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్‌ |

అశేషజనమోహినీ మరుణమాల్యభూషామ్బరాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరే దంబికామ్‌ ||

అగస్త్య ఉవాచ :-

1. హయగ్రీవ దయాసింధో భగవన్‌ భక్తవత్సల |

త్వత్త శ్ర్శుత మశేషేణ శ్రోతవ్యం యద్యదస్తి తత్‌ ||

2. రహస్యం నామసాహస్ర మపి తత్సంశ్రుతం మయా |

ఇతః పరం చ మే నాస్తి శ్రోతవ్యమితి నిశ్చయః ||

3. తథా7పి మమ చిత్తస్య పర్యాప్తి ర్నైవ జాయతే |

కార్త్స్నార్థః ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో ||

4. కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంశో7పి వా పునః |

అస్తి చేన్మ మతం బ్రూహి బ్రూహీత్యుక్త్వా ప్రణమ్యతమ్‌ ||

సూత ఉవాచ :-

5. సమాలలంబే తత్పాదయుగళం కలశోధ్భవం |

హయాననో భీతభీతః కిమిదం కిమిదం త్వితి ||

6. ముఞ్చ ముఞ్చేతి తం చోక్త్వా చిన్తా క్రాన్తో బభూవ సః |

చిరం విచార్య నిశ్చిన్వ న్వక్తవ్యం న మయేత్యసౌ ||

7. తూష్ణీం స్థితః స్మర న్నాజ్ఞాం లలితాం బాకృతాం పురా |

తం ప్రణమ్యైవ స ముని స్తత్పాదా వత్యజన్‌ స్థితః ||

8. వర్షత్రయావధి తథా గురుశిష్యా తథా స్థితౌ |

తచ్ఛృణ్వన్తశ్చ పశ్యన్తస్సర్వలోకా స్సువిస్మితాః ||

9. తత్ర శ్రీ లలితాదేవీ కామేశ్వరసమన్వితా |

ప్రాదుర్భూతా రహస్యేవం హయగ్రీవ మవోచత ||

శ్రీదేవ్యువాచ :-

10. అశ్వాననావయోః ప్రీతి శ్శాస్త్రవిశ్వాసినేత్వయా |

రాజ్యం దేయం శిరో దేయం నదేయా షోడశాక్షరీ ||

11. స్వమాతృజారవ ద్గోప్యా విద్యై షే త్యాగమా జగుః |

తతో7తిగోపనీయా మే సర్వపూర్తికరీ స్తుతిః ||

12. మయా కామేశ్వరేణాపి కృతా సా గోపితా భృశమ్‌ |

మదాజ్ఞయా వచో దేవ్య శ్చ క్రు ర్నా మసహస్రకమ్‌ ||

13. ఆవాఖ్యాం కథితం ముఖ్యం సర్వపూర్తికరం స్తవమ్‌ |

సర్వ క్రియాణాం వైకల్యపూర్తి ర్యజ్జపతో భ##వేత్‌ ||

14. సర్వపూర్తికరం తస్మా దిదం నామ కృతం మయా |

తద్బ్రూహి త్వ మగస్త్యాయ పాత్రభూతో న సంశయః ||

15. పత్న్యస్య లోపాముద్రాఖ్యా మా ముపాస్తే7తి భక్తితః |

అయం చ నితరాం భక్త స్తస్మా దస్య వదస్వ తత్‌ ||

16. అముఞ్చమాన స్త్వత్పాదౌ వర్షత్రయ మసౌ స్థితః |

ఏతత్‌ జ్ఞాతు మతో భక్త్యా హీదమేవ నిదర్శనమ్‌ ||

17. చిత్తపర్యాప్తి రేతస్య నాన్యథా సంభవిష్యతి |

సర్వపూర్తికరం తస్మా దనుజ్ఞాతో మయా వద ||

సూత ఉవాచ :-

18. ఇత్యుక్త్వా7న్తర్దధా వమ్బా కామేశ్వరసమన్వితా |

అథోత్థాప్య హయగ్రీవేః పాణిభ్యాం కుంభసంభవమ్‌ ||

19. సంస్థాప్య నికటే వాచ మువాచ భృశవిస్మితః |

హయగ్రీవ ఉవాచ :-

కృతార్థో7సి కృతార్థో7 సి కృతార్థో7సి ఘటోద్భవ ||

20. త్వత్సమో లలితాభక్తో నాస్తి నాస్తి జగత్త్రయే |

యేనాగస్త్య స్వయం దేవీ తవ వక్తవ్య మన్వశాత్‌ ||

21. సచ్ఛిష్యేణ త్వ యా చాహం చ దృష్టవానస్మితాం శివామ్‌ |

యతన్తే యద్దర్శనాయ బ్రహ్మవిష్ణ్వీ శపూర్వకాః ||

22. అతః పరం తే వక్ష్యామి సర్వ పూర్తికరం స్తవమ్‌ |

యస్య స్మరణమాత్రేణ పర్యాప్తి స్తే భ##వేద్ధృది ||

23. రహస్యనామసాహస్రా దతిగుహ్యతమం మునే |

ఆవశ్యకం తతో హ్యేత ల్లలితాం సముపాసతామ్‌ ||

24. తదహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్‌ |

శ్రీమత్ప ఞ్చ దశాక్షర్యాః కాదివర్ణ క్రమా న్మునే ||

25. పృథగ్వింశతినామాని కథితాని ఘటోద్భవ |

ఆహత్య నామ్నాం త్రిశతీ సర్వసంపూర్తికారిణీ ||

26. రహస్యాతిరహసై#్యషా గోపనీయా ప్రయత్నతః |

తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా ||

27. కేవలం నామబుద్ది స్తే న కార్యా తేషు కుంభజ |

మంత్రాత్మకత్వ మేతేషాం నామ్నాం నామాత్మతా7పి చ ||

28. తస్మా దేకాగ్రమనసా శ్రోతన్యం భవతా మునే |

సూత ఉవాచ :-

ఇత్యుక్త్వా తు హయగ్రీవః ప్రోచే నామశతత్రయమ్‌ ||

అస్య శ్రీ లలితా త్రిశతీస్తోత్ర మహామంత్రస్య భగవాన్‌ హయగ్రీవ ఋషిః, అనుష్టుప్‌ ఛందః, శ్రీ లలితామహేశ్వరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః , క్లీం తిలకమ్‌ , మమ చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థే జపే వినియోగః |

'' మిత్యాదిభి రంగన్యాసకరన్యాసాః కార్యాః ||

ధ్యానమ్‌.

అతిమధురచాపహస్తా మపరిమితామోదబాణసౌభాగ్యామ్‌ |

అరుణా మతిశయకరుణా మఖినవకుశసుందరీం వందే ||

హయగ్రీవ ఉవాచ :-

1. కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ |

కల్యాణశైలనిలయా కమనీయా కళావతీ ||

2. కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృత సాగరా |

కదంబకాననావాసా కదంబకుసుమప్రియా ||

3. కందర్పవిద్యా కందర్బజనకాపాంగవీక్షణా |

కర్పూరవీటీ సౌరభ్యకల్లోలిత కుకుప్తటా ||

4. కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా |

కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫల ప్రదా ||

5. ఏకరూపా చైకాక్ష ర్యేకానేకాక్షరాకృతిః |

ఏతత్త దిత్య నిర్దేశ్యా చైకానందచిదాకృతిః ||

6. ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తి మదర్చితా |

ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితా ధృతా ||

7. ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ |

ఏకభోగా చైకరసా చైకైశ్వర్య ప్రదాయినీ ||

8. ఏకాతప త్రసా మ్రాజ్య ప్రదా చైకాన్తపూజితా |

ఏధమాన ప్రభా చైజదనేజజ్జగదీశ్వరీ ||

9. ఏకవీరాదిసంసేవ్యా చైక ప్రాభవశాలినీ |

ఈకారరూపిణీశిత్రీ చేప్సి తార్థ ప్రదాయినీ ||

10 ఈదృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వ విధాయినీ |

ఈశానాది బ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్దిదా ||

11. ఈక్షిత్రీక్షణసృష్టాండకోటి రీశ్వరవల్లభా |

ఈడితా చేశ్వరార్థాంగశరీరేశాధి దేవతా ||

12. ఈశ్వర ప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ |

ఈశ్వరోత్సజ్గనిలయా చేతోబాధావినాశినీ ||

13. ఈహావిరహితా చేశశక్తి రీషత్మ్సితాననా |

లకారరూపా లలితా లక్ష్మీ వాణీనిషేవితా ||

14. లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా |

లలన్తికా లసత్ఫాలా లలాటనయనార్చితా ||

15. లక్షణోజ్జ్వలదివ్యాజ్గీ లక్ష్యకోట్యణ్డనాయికా |

లక్ష్యార్ధా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః ||

16. లలామరాజదళికా లంబముక్తాలతాఞ్చితా|

లంబోదరప్రసూ ర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా ||

17. హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా |

హ్రీంకారబీజా హ్రీంకారమన్త్రా హ్రీంకారరక్షణా ||

18. హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతిః హ్రీంవిభూషణా |

హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా ||

19. హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా |

హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ ||

20. హకారరూపా హలధృత్పూజితా హరిణక్షతా |

హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రసేవితా ||

21. హయరూఢాసేవితాంఘ్రి ర్హ యమేధసమర్చితా |

హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా ||

22. హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యాశ్వాద్యమరార్చితా |

హరికేశనఖీ హాదివిద్యా హాలామదాలసా ||

23. హత్యాదిపాపశమనీ హరిదశ్వాది సేవితా |

హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తి ప్రియాజ్గనా ||

24. సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా |

సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ ||

25. సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ |

సర్వాత్మికా సర్వసౌఖ్యధాత్రీ సర్వవిమోహినీ ||

26. సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా |

సర్వారుణా సర్వమాతా సర్వాభరణ భూషితా ||

27. కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా |

కామసంజీవినీ కల్యా కఠినస్తనమండలా ||

28. కరభోరూ కళానాథముఖీ కచజితాంబుదా |

కటాక్షస్యందికరుణా కపాలి ప్రాణనాయికా ||

29. కారుణ్యవిగ్రహా కాన్తా కా న్తిధూత జపావళిః |

కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా ||

30. కల్పవల్లీ సమభుజా కస్తూరీతిలకోజ్జ్వలా |

హకారార్థా హంసగతి ర్హాటకాభరణోజ్జ్వలా ||

31. హారహారీకుచాభోగా హాకినీ హల్యవర్జితా |

హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా ||

32. హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా |

హల్లీ హాలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ ||

33. హానోపాదననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ |

హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా ||

34. హయ్యంగవీనహృదయా హరికోపారుణాంశుకా |

లకారార్థా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ ||

35. లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా |

లాంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా ||

36. లాక్షారససవర్ణాభా లక్ష్మణా గ్రజపూజితా |

లభ్యేతరా లబ్ధశక్తిసులభా లాంగలాయుధా ||

37. లగ్న చామరహస్త శ్రీశారదాపరివీజితా |

లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ ||

38. లబ్ధమానా లబ్ధరసా బల్ధసంపత్సమున్నతి ః |

హ్రీంకారిణీ హ్రీంకారాది ర్హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః ||

27]

39. హ్రీంకారకుండాగ్ని శిఖా హ్రీంకారశశిచంద్రికా |

హ్రీంకారభాస్కరరుచి ర్హ్రీంకారామ్భోదచంచలా ||

40. హ్రీంకారకన్దాంకురితా హ్రీంకారైకపరాయణా |

హ్రీంకారదీర్ఘికా హంసీ హ్రీంకారోద్యానకేకినీ ||

41. హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ |

హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా ||

42. హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంబుజభృంగికా |

హ్రీంకారసుమనోషూధ్వీ హ్రీంకారతరుమంజరీ ||

43. సకారాఖ్యా సమరసా సకలోత్తమసంస్తుతా |

సర్వవేదన్తతాత్పర్యభూమి స్సదసదాశ్రయా ||

44. సకలా సచ్చిదానన్దా సాధ్వీ సద్గతిదాయినీ |

సనకాదిమునిధ్వేయా సదాశివకుటుంబినీ ||

45. సకలాధిష్ఠానరూపా సత్త్వ రూపా సమాకృతిః |

సర్వప్రపఞ్చనిర్మాత్రీ సమానాధికవర్జితా ||

46. సర్వోత్తుజ్గా సజ్గహీనా సద్గుణా సకలేష్టదా |

కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా ||

47. కామేశ్వర ప్రాణనాడీ కామేశోత్సఙ్గవాసినీ |

కామేశ్వరాలిజ్గితాజ్గీ కామేశ్వర సుఖప్రదా ||

48. కామేశ్వర ప్రణయినీ కామేశ్వరవిలాసినీ |

కామేశ్వరతపస్సిద్ధిః కామేశ్వరమనఃప్రియా ||

49. కామేశ్వర ప్రాణనాథా కామేశ్వరవిమోహినీ |

కామేశ్వర బ్రహ్మ విద్యా కామేశ్వరగృహేశ్వరీ ||

50. కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ |

కామేశ్వరీ కామకోటినిలయా క్షాంక్షితార్థదా ||

51. లకారిణీ లబ్ధరూపా లబ్ధధీ ర్లబ్ధవాంఛితా |

లబ్దపాపమనోదూరా లబ్దాహజ్కారదుర్గమా ||

52. లబ్ధశక్తి ర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః |

లబ్ధబుద్ధిర్లబ్ధలీలా లబ్ధ¸°వనశాలినీ ||

53. లబ్ధాతిశయసర్వాఙ్గసౌన్దర్యా లబ్ధవిభ్రమా |

లబ్ధరాగా లబ్థగతి ర్లబ్ధనా నాగమస్థితిః ||

54. లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూజితా |

హ్రీజ్కారమూర్తి ర్హ్రీజ్కారసౌధశృంగకపోతికా ||

55. హ్రీజ్కారదుగ్ధాబ్ధీసుధా హ్రీజ్కారకమలేన్దిరా |

హ్రీజ్కౌరమణిదీపార్చ ర్హ్రీజ్కారతరుశారికా ||

56. హ్రీజ్కారపేటికామణి ర్హ్రీంకారాదర్శబింబికా |

హ్రీజ్కారకోశానిలతా హ్రీంకారాస్థాననర్తకీ ||

57. హ్రీజ్కారశుక్తి కాముక్తామణి ర్హ్రీంకారబోధితా |

హ్రీంకారమయసౌవర్ణ స్తమ్భవి ద్రుమపుత్రికా ||

58. హ్రీంకారవేదోపనిష ద్ధ్రీంకారాధ్వరదక్షిణా |

హ్రీంకారనన్దనారామనవకల్ప కపల్లరీ ||

59. హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా |

హ్రీంకారమన్త్రసర్వస్వం హ్రీంకారపరసౌఖ్యదా ||

హయగ్రీవః :-

60. ఇదీతం తే మయా77ఖ్యాతం దివ్యనామ్నాం శతత్రయం|

రహస్యాతిరహస్యత్వా ద్గోపనీయం మహామునే ||

61. శివవర్ణాని నామాని శ్రీదేవికథితాని వై |

శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని హి ||

62. ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కథితాని వై |

తదన్యైర్గ్రథితం స్తోత్ర మేతస్య సదృశం కిము ||

63. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీ ప్రీతిదాయకం |

లోకత్రయే7పి కల్యాణం సమ్బవే న్నాత్ర సంశయః ||

సూతః -

64. ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య |

ప్రగళితకషో7భూ చ్చిత్తపర్యాప్తిమేత్య ||

నిజగురు మథ నత్వా కుంభజన్మా తదుక్తేః |

పున రధికరహరస్యం జ్ఞాతు మేవం జగాద ||

అగస్త్య :-

65. అశ్వానన మహాభాగ రహస్య మపి మే వద |

శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి ||

66. ఉభయో రపి వర్ణాని కాని మే వద దేశిక |

శ్రీ హయగ్రీవః :-

ఇతి పృష్టః కుమ్భజేన హయగ్రీవో7వదత్పునః ||

67. తవ గోప్యం కిమస్తీహ సాక్షా దమ్భాకటాక్షతః |

ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజః ||

68. ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా సిద్దిదా భ##వేత్‌ |

కత్రయం హద్వయం చైవ శైవో భాగః ప్రకీర్తితః ||

69. శక్త్యక్షరాణి శేషాణి హ్రీజ్కార ఉభయాత్మకః |

ఏవం విభాగ మజ్ఞాత్వా శ్రీ విదాయజపశీలినః ||

70. న తేషాం సిద్ధిదా విద్యా కల్ప కోటిశ##తైరపి |

చతుర్భి శ్శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పఞ్చభిః||

71. నవ చక్రైస్తు సంసిద్ధిం శ్రీచక్రం శివయో ర్వపుః |

త్రికోణ మష్టకోణం చ దశకోణద్వయం తథా ||

72. చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ వై |

బిన్దు శ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకమ్‌ ||

73. చతురశ్రం చ చత్వారి శివచక్రా ణ్యను క్రమాత్‌ |

త్రికోణ బైన్దవం శ్లిష్ట మష్టారే7ష్ణదళాంబుజమ్‌ ||

74. దశారయె ష్షోడశారం భూపురం భువనాశ్రకే |

శైవానామపి శక్తానాం చక్రాణాం చ పరస్పరమ్‌ ||

75. అవినాభాపసంబంధం యో జానాతి స చక్రవిత్‌ |

త్రికోణరూపిణీ శక్తి ర్మిన్దురూప శ్శివ స్స్మతః ||

76. అవినాభావసమ్బన్ధ స్తస్మా ద్బిన్దు త్రికోణయోః |

ఏవం విభాగ మజ్ఞాత్వా శ్రీచక్రం య స్సమర్చయేత్‌ ||

77. న తత్ఫల మవాప్నోతి లలితామ్బా న తుష్యతి |

యే చ జానన్తి లోకే7స్మిన్‌ శ్రీవిద్యాం చక్రవేదినః ||

78. సామాన్యవేదిక స్తే వై విశేషజ్ఞో7తిదుర్లభః |

స్వయం విద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్‌ ||

79. తసై#్మ దేయం తతో గ్రాహ్యం శ్రీవిద్యాచక్రవేదినా |

అధం తమః ప్రవిశన్తి యే హ్యవిద్యా ముపాసతే ||

80. ఇతి శ్రుతి రపాహైతానవిద్యో పానకాన్‌ పునః |

విద్యా7నుపాసకానేవ నింద త్యారుణికీ శ్రుతిః |

81. అశ్రుతాస శ్ర్శుతాసశ్చ యజ్వానో యే7ప్యయజ్వనః |

స్వర్యన్తో నాపేక్షన్త ఇన్ద్ర మగ్నిం చ యే విదుః ||

82. సికతా ఇవ సంయన్తి రశ్విభి స్సముదీరితాః |

అస్మాల్లోకా దముష్మా చ్చే త్యపాషారుణికీ శ్రుతిః ||

83. యః ప్రాప్తః పృశ్నిభావం వా యది

వా శఙ్కర స్స్వయమ్‌ ||

తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పఞ్చ దశాక్షరీ ||

84. ఇతి తంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే |

మోక్షైకహేతువిద్యా తు శ్రీ విద్యైవ న సంశయః ||

85. న శిల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్దః వ్రయుజ్యతే |

మోక్షైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః ||

86. తస్మా ద్విద్యావిదే దద్యాత్‌ ఖ్యాపయే త్తద్గుణా స్సుధీః |

స్వయం విద్యావిశేషజ్ఞో విద్యామహాత్మ్యవేద్యపి ||

87. విద్యావిదం నార్చయే చ్చే త్కోవాతం పూజయే జ్జనః |

ప్రసఙ్గా దేతదుక్తం తే ప్రకృతం శృణు కంభజ ||

88. యః కీర్తయే త్సకృద్భక్త్యా దివ్యం

నామ్నాం శతత్రయమ్‌ |

తస్య పుణ్యఫలం వక్ష్యే విస్తరేణ ఘటోద్భవ ||

89. రహస్యనామసాహ స్రపాఠే యత్ఫల మీరితమ్‌ |

తత్కోటికోటిగుణిత మేకనామజపా ద్భవేత్‌ ||

90. కామేశ్వరాభ్యాం తదిదం కృతం నామశతత్రయమ్‌ |

నాన్యేన తులయే దేత త్త్సోత్రేణాన్యకృతేన తు ||

91. శ్రియః పరంపరా యస్య భావినీ తూత్తరోత్తరం |

తేనైవ లభ్యతే నామ్నాం త్రిశతీ సర్వకామదా ||

92. అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే |

యా స్వయం శివయో ర్వక్త్రపద్మభ్యాం పరినిఃసృతా ||

93. నిత్యా షోడశికారూపా న్విప్రానాదౌ తు భోజయేత్‌ |

అభ్యక్తాన్‌ గంధతైలేన స్నాతా7నుష్ణేన వారిణా ||

94. అభ్యర్చ్య వస్త్రగంధాద్యైః కామేశ్వరాదినామభిః |

అపూపై శ్శర్కరాజ్యైశ్చ ఫలైః పుషై#్పఃసుగంధిభిః ||

95. విద్యావిదో విశేషేణ భోజయే త్షోడశద్విజాన్‌ |

ఏవం నిత్యం బలిం కుర్యా దాదౌ బ్రాహ్మణభోజనే ||

96. పశ్చాత్త్రిశత్యా నామ్నాం తు బ్రాహ్మణాన్‌

క్రమశో7ర్చయేత్‌ ||

త్రైలాభ్యంగాదికం దద్యాద్విభ##వే సతి భక్తితః ||

97. శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్‌ |

దివసే దివసే విప్రా భోజ్యా వింశతిసంఖ్యయా ||

98. దశభిః పంచభి ర్వా7పి త్రిభి రేకేన వా దినైః |

త్రింశత్షణ్ణిం శతం విప్రాన్‌ భోజయే త్త్రిశతం క్రమాత్‌ ||

99. ఏవం యం కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః |

తసై#్యవం సఫలం జన్మ ముక్తి స్తస్య కరే స్థితా ||

100. రహస్యనామసాహసై#్ర రర్చనే7ప్యేవ మేవ హి |

ఆదౌ నిత్యబలిం కుర్యా త్పశ్చా ద్బ్రాహ్మణభోజనమ్‌ ||

101. రహస్య నామసాహ స్రమహిమా యో మయోదితః |

స శీకరాణు రత్రైకనామ్నో మహిమవారిధేః ||

102. వాగ్దేవీ రచితే నామసాహస్రే యద్య దీరితం |

తత్తత్ఫల మావాప్నోతి నామ్నో7ప్యేకస్య కీర్తనాత్‌ ||

103. ఏతదన్యై ర్జపైఃస్తోత్రైరర్చనై ర్యత్ఫలం భ##వేత్‌ |

తత్ఫలం కోటిగుణితం భ##వే న్నామశతత్రయాత్‌ ||

104. రహస్యనామసాహస్రకోట్యావృత్త్యాస్తు యత్ఫలం |

తద్భవే త్కోటిగుణితం నామత్రిశతకీర్తనాత్‌ ||

105. వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమా యది |

సాక్షాత్కామేశ కామేశీకృతే7స్మిన్‌ గృహ్యతా మితి ||

106. సకృత్సంకీర్తనా దేవ నామ్నా మస్మిన్‌ శతత్రయే ||

భ##వే చ్చిత్తస్య పర్యాప్తి ర్నూన మన్యానపేక్షిణీ ||

107. న జ్ఞాతవ్య మిత స్త్వన్య జ్జగత్సర్వం చ కుంభజ |

యద్య త్సాధ్యతమం కార్యం తత్తదర్థ మిదం జపేత్‌ ||

108. తత్తత్సిద్ధి మవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్‌ |

యే యే ప్రసఙ్గాస్తంత్రేషు తైసై#్తర్యత్సాధ్యతే ధ్రువమ్‌ ||

109. తత్సర్యం సిద్ధ్యతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్‌ |

ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్‌ ||

110. విద్యాప్రదం కీర్తికరం సుకవిత్వ ప్రదాయకం |

సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్‌ ||

111. సర్వాభీష్టప్రదం చైవ దేవీనామశతత్రయమ్‌ |

ఏతజ్జపపరో భూయా న్నాన్యదిచ్ఛేత్కదాచన ||

112. ఏత త్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా |

భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్పూరయేతే ధ్రువమ్‌ ||

113. తస్మా త్కుంభోద్భవమునే కీర్తయ త్వ మిదం సదా |

అపరం కించిదపి తే బోద్ధవ్యం నావశిష్యతే ||

114. ఇతి తే కథితం స్తోత్రం లలితాప్రీతిదాయకమ్‌ |

నావిద్యావేదినే బ్రూయా న్నాభక్తాయ కదాచన ||

115. న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్‌ |

యో బ్రూయా త్త్రిశతీం నామ్నాం తస్యానర్థో

మహాన్‌ భ##వేత్‌ ||

116. ఇత్యాజ్ఞా శాఙ్కరీ ప్రోక్తా తస్మాద్గోప్య మిదం త్వయా |

లలితా ప్రేరితేనైవ మయోక్తం స్తోత్ర ముత్తమమ్‌ ||

117. రహస్యనామసాహస్రా దతిగోప్య మిదం మునే |

ఏవ ముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్‌ ||

118. స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీమ్‌ |

ఆనందలహరీమగ్నమానస స్సమవర్తత ||

ఇతి బ్రహ్మాండపురాణ, ఉత్తరఖండే, హయగ్రీవాగస్త్య సంవాదే, లలితోపాఖ్యానే, స్తోత్రఖండే, లలితామ్బాత్రిశతీ స్తోత్రరత్నం

సంపూర్ణమ్‌ |

28]

Bharatiya Samskruthi-I    Chapters