20. డాక్టర్లను 'చిత్తు' చేసిన స్వామి దివ్యశక్తి
విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రతించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్ర చికిత్స అవసరమన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ గోపినాధ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్ర చికిత్సలో చాలా నిపుణుడనీ, ఆయనచేత ఆపరేషన్ చేయించ వలసిందని కూడా సలహా యిచ్చారు.
మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్లి అక్కడ డాక్టరులతో సంప్రతించాను. వారు కూడా ఆపరేషన్ అవసరమే నన్నారు. అదైనా, ఆరునెలలు దాటకుండా, ఆగడువులోపల చేయించవలసిందని సలహా చెప్పారు.
నాకు ఆప్తమిత్రులైన ఒక రిద్దరు వైద్యులు 'ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదనీ, ఇతరవిధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే, దానిని అనుసరించడం మంచిద'ని సూచించారు.
సందిగ్థంలో పడ్డాను.
ఇన్నిచోట్ల, ఇంతమంది డాక్టరులు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత, వారి సలహా త్రోసివేయడం సాధ్యమా? శ్రేయస్కరమా? అయితే, గత్యంతరం?
భగవంతుడి మీద భారం వేసి, రాయవెల్లూరు వెళ్లాము. డాక్టరు గోపీనాధ్ను సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్షచేసి, ఆపరేషన్ అవసరమే ననీ, మార్గాంతరం లేదనీ తేల్చి చెప్పారు.
కొద్దిరోజులలో డాక్టర్ గోపీనాధ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదలి పెట్టి, ఢిల్లీ వెళ్లుతున్నాడు. వెంటనే కాకపోతే, ఆరునెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా యిచ్చాడు.
తుదకు, ఆపరేషన్ వాయిదా వెయ్యకుండా రాయవెల్లూరులోనే, గోపీనాధ్ చేతనే ఆపరేషన్ చేయించుకోడానికి నిశ్చయం చేసుకున్నాము. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము.
అయితే, ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్లి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని దర్శించి, వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను.
వెంటనే కారులో నేనూ, నాకుమారుడు రాయవెలూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయంకాల మైంది.
స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్లే సరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మారాక స్వామికి ఎరిగించాను. ద్వారం తెరిచి లోపలికి వెళ్లబోతున్నవారల్లా ఆగి, మావైపు తిరిగి ''ఏమిటి విశేషం?'' అన్నారు.
నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందనీ, శస్త్ర చికిత్సకై రాయవెల్లూరు ఆస్పత్రికి వచ్చామనీ, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామనీ విన్నవించాను.
స్వామి: ఏమిటి జబ్బు?
నేను: ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి. ''బ్రాంకియక్టాసిస్'' అంటారు. ఊపిరితిత్తులలో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే.
నకనకలాడే లాంతరు వెలుతురులో, ఆదూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి.
''జబ్బు ప్రమాదకరమైనదే అయినా, భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు. మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకుని, ఇంటికి వెళ్లండి'' అన్నారు.
బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడుగించాడు!
ఇద్దరం స్వామికి సాగిలబడి, సెలవు పుచ్చుకుని, మఠంలో ప్రసాదం స్వీకరించి, రాయవెల్లూరు వెళ్లి గోపీనాధ్తో, ఆపరేషన్ వాయిదావేస్తున్నామని చెప్పి, మద్రాసుమీదుగా విజయవాడ చేరాము.
ఇది జరిగి నేటికి 26 ఏండ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడుగా పేరుగడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్ఠిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్లా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు.