30. ''ఆచార్యుల వారిలో అల్లాను చూస్తున్నాను''
1926లో ఆచార్యస్వామి కారంబక్కుడి నుంచి పుదుక్కోటకు వెళ్లేప్పుడు అనేకమంది ప్రజలు గుంపులుగా వచ్చి వారిని దర్శించారు. వారిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు.ఆ మహమ్మదీయులలో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామి వా రెక్కిన పల్లకిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ విధంగా దాదాపు మూడు మైళ్లు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంట నడిచాడు. స్వామి అప్పుడు పల్లకి ఆపి, ఆ మహమ్మదీయుని తన సమక్షానికి పిలిపించి, అతని యోగక్షేమాలను విచారించారు.
ఆ ముస్లింభక్తుడు తన స్వవిషయాలను స్వామికి నివేదించి, స్వామి సలహా నర్థించాడు. స్వామిని స్తుతిస్తూ తాను వ్రాసిన పద్యాలను ఫలపుష్పాదులతో స్వామికి సమర్పించాడు.
స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను వ్రాసిన పద్యాలను చదివి, వాటి అర్థం వివరించాడు.
అక్కడినుండి స్వామివద్ద సెలవు పుచ్చుకుని వెళుతూ ఆ ముసల్మాన్ భక్తు డన్నమాట లివి:
''ఆచార్యులవారి రూపంలో నా కళ్లకు 'అల్లా' కనిపించాడు. భవబంధాలను తెంచుకొని, ముక్తి కోరే వారికి శ్రీవారిదర్శనం చాలు!''
* * *
మంత్రశక్తి
మనం మంత్రజపం చేస్తున్నాం. అది శబ్దతరంగాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి.
మనం ఉపదేశం పొందిన మంత్రాన్ని అవిరామంగా జపంచేస్తూ ఉంటే ఆ పరాశక్తి అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ మంత్రదేవత మనలను ఆవహించి, కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా మనలను వదలిపెట్టదు. ఆ ధ్యానంలోనే మనం ఉండిపోగలం.