Nadichedevudu   Chapters  

 

33. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు!

ఎంతటి స్వల్ప విషయంలో నైనా తమ కర్తవ్య నిర్వహణలో స్త్రీలూ, పురుషులూ అప్రమత్తులుగా ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి.

ఉదాహరణ:

తమ పర్యటనలో ఒక గ్రామంలో పూజ పూర్తిచేసి భక్తులకు తీర్థమిస్తున్నారు స్వామి. ఒక ఇల్లాలు తన కుమార్తెను, అయిదేండ్ల పిల్లను వెంటబెట్టుకుని తీర్థం పుచ్చుకోడానికి వచ్చింది.

స్త్రీ లందరూ ఒక ప్రక్కగా, పురుషు లొక ప్రక్కగా నిలబడి, తీర్థం పుచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందడిలో ఆ పిల్ల మెళ్లో ఉన్న బంగారం గొలుసు కాస్తా, ఏ 'పుణ్యాత్మురాలో' తస్కరించి దాచేసింది.

గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఏడవసాగింది. అమ్మలక్కలంతా 'అయ్యో, గొలుసు పోయిందా!' అంటూ పిల్లనూ, తల్లినీ ఓదారుస్తున్నారు.

తక్కిన స్త్రీ లందరితోపాటు ఆ పిల్ల తల్లి కూడా తీర్థం పుచ్చుకునేందుకు 'క్యూ'లో నిలబడింది. స్వామిని సమీపించింది. తక్కిన వారందరికీ తీర్థమిచ్చి, ఆమెను మాత్రం 'క్యూ'లో నుంచి తప్పుకుని, ప్రక్కగా నిలబడ మన్నారు స్వామి.

స్వామి ఎందుకు అలా అన్నారో ఎవ్వరూ ఊహించలేకపోయారు.

ఇంతలో ఒక ముసిలావిడ తీర్థంకోసం స్వామి దగ్గరకువచ్చి చెయ్యిచాపింది.

ఆమెను ఉద్దేశించి స్వామి, ''ఇచ్చేసెయ్యి'' అన్నారు.

''నాదగ్గ రేముంది ఇవ్వడానికి?'' అన్న దా ముసలమ్మ.

''ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూటకట్టుకుంటావు?'' అన్నారు స్వామి.

ఆ మాటలు విని కొందరు ఆడవారు ఆ వృద్ధురాలి చీరె విదిలించ మన్నారు. పరిశీలించగా చీరె మడతల్లో దాచిన బంగారం గొలుసు బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద పెట్టారు.

గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు. ఇలా అన్నారు:

''అదిగో నీ గొలుసు, తీసుకో. ఇకనుంచి మాత్రం, చెయ్యవద్దన్న పని చెయ్యకు'' అన్నారు స్వామి.

''ఇక మీదట ఎప్పుడూ అట్లా చెయ్యను స్వామీ'' అంటూ చెంపలు వేసుకొని ఆ గృహిణి, పమిట కొంగుతో కన్నులు తుడుచుకుంది.

ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు?

ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి టైము తప్పకుండా వెళ్లాలి. తనకు అన్నం వడ్డించి తరవాత పూజకు వెళ్లమని భార్యతో చెప్పాడు.

కాని, పూజకు ముందుగా పోవాలని తొందరపడి, ఆదరాబాదరాగా అన్నం వండి, అక్కడ పడేసి, పిల్లను తీసుకుని గబాగబా బయలుదేరి వచ్చిందా ఇల్లాలు.

''తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా, నీ ధర్మాన్ని నీవు వదలి పెట్టకు, నీ భక్తి కంటె అది అధికమైంది.'' అని ఆమెకు బోధపడింది.

* * *

Nadichedevudu   Chapters