7. కంచిస్వామి - వినోబా భావే
కామకోటి పీఠాధిపతి, ఆచార్య వినోబాభావేల మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ.
శ్రీ వినోబాభావే గాంధి అనుయాయులలో ప్రధమ శ్రేణిలోని వారు. భూదానోద్యమ నాయకులు. అయినా, కేవల రాజకీయనాయకుడే కాడు. బహుశ్రుతుడు. బహుభాషాకోవిదుడు.
కాషాయం కట్టలేదు. కౌపీనం పెట్టలేదేగాని, ఆజన్మ బ్రహ్మచారి. సర్వసంగ పరిత్యాగి. కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్త్వజ్ఞుడు.
* * *
1956 జూన్నెల 7వ తేదీన మూడురోజుల ఉపవాసానంతరం శ్రీవినోబాభావే దక్షిణ దేశంలో తన పర్యటన ప్రారంభించారు. కంచికి నాలుగున్నర మైళ్లదూరంలో కలకత్తూర్ అనే పల్లెటూరుకు బయలుదేరుతూ ''ఇప్పుడు ఎన్నిగంటలు?'' అని తన సహచరులను అడిగారు వినోబా. ''ఏడున్నర అయింద''ని వారు సమాధానం చెప్పారు.
''చూశారా! ఇంచుమించు ఇదేవేళ ఇప్పటికి నలభై ఏళ్ల కిందట, మొట్ట మొదటిసారి బాపుజీని (మహాత్మగాంధి) నేను సందర్శించాను'' అన్నారు. శ్రీ భావే.
నాలుగు దశాబ్దాల అనంతరం అదే జూన్ నెల 7వ తేదీన, ఆనాటి సమావేశం శ్రీ వినోబా స్ఫురణకు వచ్చింది.
అంతకంటే విశేషమేమంటే, 40 ఏళ్లక్రితం వినోబాజీ మహాత్మాగాంధిని ప్రథమంగా సందర్శించగా, సరిగ్గా అదేరోజు - జూన్ 7 తేదీన - మరొక మహా పురుషుని, కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని సందర్శించబోవడం!
* * *
మహనీయు లిరువురూ ఒక చిన్న పూరిపాకలో సమావేశ##మైనారు. ఇద్దరి సంభాషణా కొన్ని నిమిషాల్లో ముగిసింది. సంభాషణ సంస్కృతంలో జరిగింది.
'నారాయణ, నారాయణ' అంటూ, నారాయణ స్మరణతో స్వామి, వినోబాకు స్వాగతం పలికారు. తమ ప్రక్కనే కూచోబెట్టుకున్నారు. వారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న చేశారు.
స్వామి: ఇక్కడికి రావడంలో మీకేమీ శ్రమ కలగలేదు కదా? మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చెయ్యవచ్చు.
వినోబా: మీ దర్శనానికే నే నిక్కడికి వచ్చాను. మీ ఆశీస్సు కోరుతున్నాను.
స్వామి: నారాయణ, నారాయణ!
''పరుల సేవవల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తీ తన ప్రవృత్తినిబట్టి, తన మనోభావాల ననుసరించి సమాజానికి సేవచేస్తాడు. అది ఆక్షేపణీయం కాదు. అయితే, లోకులకు తాను ఏ ఉపకారం చేసినా, అది కేవలం తన చిత్తశుద్ధికేననీ, ఆత్మోద్ధరణకేననీ అతడు భావించాలి. అదే తన లక్ష్యం కావాలి.
ఇతరులవల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్లు లోకంలో ఎందరో ఉన్నారు. వారంతా తమ జీవితాలను యధోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
మాటవరసకు, ఆడవుల్లో మృగాలూ, పక్షులూ అసంఖ్యాకంగా జీవిస్తున్నవి. వాటన్నిటికి ఎవరు సహాయం అందిస్తున్నారు? వాటి జీవిత సరళిని క్రమబద్ధం చెయ్యడానికి ఒక సంఘం ఉన్నదా? ఒక ప్రభుత్వం ఉన్నదా? అయినా, ఆ ప్రాణులన్నీ మానవులకంటె సుఖంగానే బతుకుతున్నవి.
సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు. సంఘంలో ఉండే ప్రతివ్యక్తీ తన విధాయక ధర్మ మేదో తెలుసుకుని, స్వధర్మాన్ని నిర్వర్తించి నట్లయితే, అదే పరమేశ్వరుడికి నిజమైన సేవ.''
శ్రీ వినోబా: నేనుకూడా అదే అభిప్రాయంతో ఉన్నాను.
స్వామి: నారాయణ, నారాయణ! నా కెంతో సంతోషం.
మరి రెండు ఉపమానాలు:
శ్రీస్వామి శ్రీవినోబాకు ఈ క్రింది రెండు ఉపమానాలుకూడా వినిపించారు:
''చెట్టును పోషించాలంటే చెట్టుకుదుట్లో నీరు పోస్తే చాలు. చెట్టు తాలూకు వేళ్లు ఆ నీరు తాగి, కొమ్మలకూ రెమ్మలకూ, ఆకులకూ మొగ్గలకూ అన్నింటికీ ఆహారం అందజేస్తాయి. ప్రత్యేకం ఒక్కొక్క ఆకుకూ, ఒక్కొక్క మొగ్గకూ ఆహారం అందించ నక్కరలేదు.
నోటితో మనిషి భుజిస్తాడు. అయినా, అతని చెవి, ముక్కు, కళ్లు, కాళ్లు అన్నిటికీ ఆహారం అందినట్టే! ఈ సృష్టి సమస్తం శ్రీ మన్నారాయణుని అవయవాలు మాత్రమే!
జీవు లంతా పరమాత్మ ప్రతిబింబాలు. పరమాత్మను అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్టే. లోకసేవ చెయ్యడానికి భగవత్సేవ సులువైన మార్గం.
'సర్వేజనాః సుఖినోభవంతు' అని దేవుణ్ణి ప్రార్థిస్తాము'' అన్నారు స్వామి.
''స్వామి నాకు భగవంతునితో సమానుడు; కాదు, భగవంతుడే'' అంటూ ఆచార్య వినోబా స్వామివద్ద సెలవు పుచ్చుకున్నారు.
భక్తిద్వారా ముక్తి
శాస్త్రచోదితకర్మలను మనం విధిగా చేయవలసి ఉంది. ఇది అవసరమా, అనవసరమా అన్న ప్రశ్నలకు తావులేదు. ఇలా కర్మానుష్ఠానం చేసిన తర్వాత క్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి, చిత్తశుద్ధి ఏర్పడి, మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధాన పటిష్ఠ మవుతున్నది. ఇదే భక్తి. ఇది రెండవ స్థితి. భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి. అది చరమస్థితి.
అందుచేత భక్తిని వదలి ముక్తి కోసం ప్రత్యేకం పాకులాడవలసిన పనిలేదు. మనలోని భ##క్తే తుదకు ముక్తిని అందిస్తుంది. భక్తి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తే చాలు. అందుకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ, 'భక్తిభిక్షను పెట్టవే' అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భక్తి మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే.