Sri Bhagavatha kamudi
Chapters
నామకరణము వసుదేవుడు తన పిల్లలిద్దరికినీ నామకరణము చేయవలసినదిగా కోరి తమపురోహితుడైన గర్గాచార్యుని నంద వ్రజమునకు పంపెను. నందుడు ఆయనకు స్వాగతమిచ్చి అతిథిపూజ గావించి, తన ఇంటనున్న బాలురకు నామకరణము చేయ ప్రార్థించెను. అంత గర్గుడు తాను యాదవ పురోహితుడు కనుక, తాను బహిరంగముగ నామకరణము చేసిన, దేవకీ వసుదేవులకు అష్టమగర్భ సంజాతుడు తనను చంపునని ఆకాశవాణి చెప్పిననాటి నుండి కంసుడు దేశమంతయూ గాలించుచున్నాడనియూ మీయింట్లోనున్న ఈ పిల్లలే తనను చంపువారని కంసుడు అనుమానించి కౄరచర్యలకు దిగునని చెప్పి, నందుని ప్రార్థననుసరించి ఆ బాలురకు రహస్యముగ గోశాలలో నామకరణ సంస్కారము గావించెను. రోహిణీ సుతునకు బలరాముడనియు, యశోదాతమయునకు కృష్ణుడనియు నామకరణములుచేసి, వీరిద్దరివలన మీరందరూ అన్నికష్టములనూ దాటుదురని వారికిచెప్పి, నందునితో "" నీ కుమారుడు సర్వగుణములలోనూ సాక్షాత్ నారాయణడే "" యని చెప్పివెడలి పోయెను.