Paramacharya pavanagadhalu
Chapters
56. బ్రాహ్మమా, క్షాత్రమా? శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు స్వాములవారి దర్శనం చేసుకొని తనపేరు, గోత్రం, ఋషులు, శాఖ మొదలయిన వాటితో ప్రవర చెప్పుకున్నారు. తరువాత నమస్కారం చేశారు. స్వామి అది విని, 'మీరేమో బ్రాహ్మణులా? మీ ఇంటిపేరులోనూ, ఋషులపేర్లలోనూ క్షత్రియులా' అని ఛలోక్తి విసిరారు. శేషయ్యగారి యింటిపేరు నీలం'రాజు ' ఋషులు 'హరిత, అంబరీష, యవనాస్య' ఈ మూడూ రాజుల పేర్లే, మరి! తనతో మాట్లాడటానికి వచ్చినవారు తనపై గౌరవం కొద్దీ, భక్తి కొద్దీ బిగుసుకుపోకుండా, తన ఎదుట వాళ్లు ఉత్సాహంగా, ప్రశాంతంగా (రిలాక్స్డ్గా) వుండేట్లు చేసేవారు మధ్య మధ్య ఛలోక్తులు విసురుతూ, స్వామి. వాదం అంటే ఈ రోజులలో వివాదం అనో, తగాదా అనో అనుకొనే వారున్నారు. కాని అది సరి కాదు. తెలియని దానిని తెలుసుకొనటానికి లేదా తత్వాన్ని గ్రహించటానికి చేయబడే సంవాదం లేక సమాలోచనకు వాదం అని పేరు. తనకు తెలిసినదే నిజం. ఇతరులంటున్నది యదార్థం కాదు అన్న నిశ్చయజ్ఞానంతో చేయబడేది జల్పం. ఈ రెండూ కాక మూడవది వితండం. తనకే అభిప్రాయం లేకపోయినా, ఎదుటి వాడు చెప్పేది అంతా తప్పు అనటం వితండ వాదం. -పరమాచార్య