Paramacharya pavanagadhalu
Chapters
57. కాలునొప్పి మాయం చల్లా శివరామశర్మగారు గూడూరు పాలిటెక్నిక్లో జాయిన్కావటానికి వెళ్తున్నారు. ఆ రోజుల్లో స్వాములవారు నగరిలో మకాం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు, స్వామి దర్శనానికి శర్మగారు. శర్మగారి తల్లి విపరీతమైన మోకాలునొప్పితో బాధపడుతోంది. నడవలేకుండా వుంది. స్వామి అది గమనించనట్లే శర్మగారితల్లినీ, తండ్రినీ దగ్గరలో వున్న బుగ్గ దగ్గరికి వెళ్లి స్నానం చేసి రమ్మన్నారు. శర్మ అక్కడే వుండిపోయారు. ఇంతలో స్వామి ఎందుకో తన మోకాలు రాసుకుంటున్నారు. శర్మను చూసి, 'పాపం! అమ్మ కాలునొప్పితో ఎంతో బాధపడుతోంది కదూ!' -- అన్నారు. ఇంతలో శర్మగారి అమ్మా, నాన్న స్నానం ముగించుకొని బుగ్గనుంచి తిరిగిరావటం కనుపించింది. లోగడ వలె శర్మ గారి అమ్మ కుంటటం లేదు. ఆవిడ కాలునొప్పి పోయింది! హిందూమతం అనేది పరాయివారు మన మతానికి కట్ట బెట్టిన పేరు. మనమతం పేరు హిందూమతం అన్నది నిజమైతే మన పూర్వీకులందరికీ ఆ సంగతి తెలిసి వుండాలి కదా! ప్రాచీనుల సంగతి అటుంచి కొన్ని తరాల క్రిందటి వారిక్కూడా ఆ పేరు తెలియదు. వాస్తవంలో మన మతానికి ఒక పేరు గాని, ఒక గుర్తు గాని లేదు. ఎందుకంటే అత్యంత ప్రాచీన కాలం నుండి మానవ జాతికంతటికీ ఆధ్యాత్మిక చింతనను ప్రసాదిస్తూ, విశ్వవ్యాప్తంగా వున్నది మన మతమొక్కటే. -పరమాచార్య