Paramacharya pavanagadhalu
Chapters
59. నాలుగో తీగె ఎందుకు? ఒకసారి వీణలో మహావిద్వాంసులొకరు స్వామిని దర్శించారు. 'వీణ తెచ్చినారా'? - స్వామి ప్రశ్న 'తెచ్చాను స్వామి! కాని తెస్తుంటే నాలుగవ తీగె తెగింది. కనుక వీణావాదనం కుదరదు', అన్నాడా విద్వాంసుడు. స్వామి 'ఫరవాలేదు, నేనొక పాట యిస్తా, వీణపై అది వినిపించు' అన్నారు. స్వామి యిచ్చిన పాటను తీసికొని కాసేపు రాగాదులు మననం చేసుకొని, ఆయన దానిని వీణపై, వాయించారు. చిత్రమేమిటంటే, ఆ పాట వాయించటానికి నాలుగో తీగెతో అసలే అవసరం పడదు! ఆ విద్వాంసునికి అదేదో యాదృచ్ఛికంగా జరిగిందనిపించింది. ఇంతలో స్వామి యింకొక పాట యిచ్చారు. ఆపైన యింకోటి, దేనికీ నాలుగో తీగ పని పడదు! సంగీతశిరోమణిననుకుంటున్న తనకు మూడు తీగలపై వాయించ వీలయిన పాటలు వున్నాయని తట్టలేదేమో అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. కాగా, అది స్వామికెలా స్ఫురించింది? ఆయనకంతటి సునిశితమైన సంగీత సాహిత్య పాండిత్యాలున్నాయా? ఈ కథను డన్లప్ కృష్ణన్ చెప్పినట్లు చల్లా విశ్వనాధశాస్త్రి రాశారు. ఉపనిషత్తులు వేదవృక్షం పూసిన పూలు. వ్యాస భగవానులు ఆ పూలను 'బ్రహ్మ సూత్రములు' అనే పేరిట సూత్ర బద్దం చేశారు. ఆ పుష్పమాలకు ఆదిశంకరాచార్యులు తమ భాష్య సౌరభాన్ని జోడించి మన కందించారు. ఆ మాల వాడిపోకుండా మనం (మనసులలో) ఎల్లప్పుడూ అలంకరించుకోవాలి. -పరమాచార్య