Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

25. మాహామహిమాన్వితులైన కామకోటి పీఠాచార్యులు

ఆదిశంకర భగవత్పాదుల వారు తమ చివరి అయిదేళ్ళ కాలం కైలాసయాత్ర సంప్రాప్తమైన యోగలింగాన్ని అర్పించుకొంటూ కాంచీపురంలో ఆవాసం చేశారు. తుంగభద్రా తీరము నుండి విద్యార్ధియై వచ్చిన బ్రహ్మచారికి సన్యాసదీక్ష ననుగ్రహించి సర్వజ్ఞేంద్రులనే దీక్షానామముతో వారిని తమ తదనంతరపు పీఠాధిపతులుగా నియమించారు. శివరహస్యములో పరమశివుడు త్రికాలములందు యోగనామకమైన స్పటికలింగమును పూజించమని ఆదేశించినట్లున్నది కదా! శంకరులాదిగా మహాత్ములైన కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు యోగేశ్వరార్చన అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు.

శంకరులు సర్వజ్ఞేంద్రులను శ్రీసురేశ్వరుల సంరక్షణలో ఉంచినారు. సర్వజ్ఞేంద్రులు సంక్షేపశారీరకమ్‌, సర్వజ్ఞవిలాసమనే ఉద్గ్రంధములను రచించారు. వీరు సురేశ్వరుల వారి వద్ద బాష్యగ్రంధాలు చదువుకొన్నారు. వీరి ప్రశిష్యులు జ్ఞానానందులు సురేశ్వరుల నైష్కర్య సిద్ధికి చంద్రికాభాష్యాన్ని వ్రాశారు. తొమ్మిదవ పీఠాధిపతులైన కృపాశంకరులు మహాప్రతిభాశాలురు. వీరు కామాక్షీ దేవాలయంలోని శ్రీచక్రాన్ని, అఖిలాండేశ్వరీ కర్ణాభరణాలను పునఃప్రతిష్టించారు. ఇరువదవ పీఠాధిపతులయిన శ్రీమూక శంకరులు కామాక్షీ కటాక్షం చేత తమ మూకత్వాన్ని పోగొట్టుకోవడమే కాక కామాక్షీదేవిపై అత్యంత మధురమైన మూకపంచశతిని రచించారు.

37వ పీఠాధిపతులయిన విద్యాఘనుల శిష్యులు అభినవశంకరులు మరల శంకరులంతటి లబ్దప్రతిష్టులు. వీరు కాశ్మీర వాకృతిభట్టును వాదములో పరాస్తులను గావించారు. కాశ్మీరులో సర్వజ్ఞ పీఠాధిరోహణము చేశారు. శంకర విజయములలో వీరిని గురించి ఆదిశంకరులని పొరబడటం జరిగింది. 47వ ఆచార్యులయిన చంద్రచూడేంద్ర సరస్వతీ స్వామివారు ఆసేతు హిమాచలం పర్యటించారు. కాశ్మీర మహాప్రతిభాశాలురు. విద్యారణ్యులు, భారతీకృష్ణతీర్ధులు, సాయణులు, శంకరానందులు వీరి శిష్యులు. శంకరానందులు వీరి తదనంతర కామకోటి పీఠాధిపతులు. వీరు భగవద్గీతకు, నాలుగు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు వ్రాశారు. 54వ ఆచార్యులు వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతీస్వామివారు ఆదిశంకరుల చరిత్ర వ్రాశారు. 57వ ఆచార్యులు పరమశివేంద్ర సరస్వతీ స్వామివారు దహర విద్యాప్రకాశిక అనే గ్రంథాన్ని, శివగీతలపై భాష్యాన్ని వ్రాశారు. 58వ పీఠాధిపతులు ఆత్మబోధేంద్రులు. వీరికే విశ్వథీకేంద్రులనే పేరున్నది. వీరు చాలా కాలం కాశీక్షేత్ర నివాసం చేశారు.

59వ ఆచార్యులు భగవన్నామ బోధేంద్రులు. వీరు భగవన్నామ మహిమను బహుళ ప్రచారం చేశారు. నామామృత రసాయనము, నామామృత రసోదయమనే రెండు గ్రంధాలను వ్రాశారు. వీరిది జీవ సమాధి. ఈనాటికీ గోవిందపురములో వీరి అధిష్టానం వద్ద రామనాయం మంద మందముగా వినిపిస్తూ ఉంటుంది.

62వ ఆచార్యుల కాలంలో ఆర్కాటు యుద్దాల కారణంగా శ్రీమఠము కంచి నుండి కుంభకోణమునకు మార్చబడింది. 62, 63, 64వ ఆచార్యులు కుంభకోణంలోనే సిద్ధి పొందారు. అట్టి మహాన్నత జ్ఞాన పరంపరలో శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 68వ శంకరాచార్యులవారు.

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page